ప్రచారం ఊరికే రాదు..ఇవన్నీ ఫాలో కావాల్సిందే!

 

య‌ద్య‌దాచ‌ర‌తి శ్రేష్ఠః త‌త్త‌దేవేత‌రో జ‌నః
స య‌త్ప్ర‌మాణం కురుతే లోక‌స్త‌ద‌నువ‌ర్త‌తే

 

భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకం అర్ధ‌మేమిటంటే.. ‘ఉత్త‌ములైన వారు దేనిని ఆచ‌రిస్తారో, దానినే ఇత‌రులు కూడా ఆచ‌రిస్తారు. అలానే ఉత్త‌ములు దేనిని అయితే ప్ర‌మాణముగా అంగీక‌రిస్తారో లోక‌మంతా కూడా దానినే అనుస‌రిస్తుంది’. భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకాన్ని స‌రిగ్గా అర్ధం చేసుకుంటే మ‌న‌ వ్యాపారాభివృద్ధికి అతికిన‌ట్టు స‌రిపోతుంది .వ్యాపారంలో ఒక బ్రాండ్ ను క్రియేట్ చేయడం అన్నది ఆషామాషీ విష‌యం కాదు. చెమ‌టోడ్చి సృష్టించిన బ్రాండ్ విలువ‌ను నిల‌బెట్టుకోవ‌డం, దాన్ని పెంచుకోవ‌డం కాస్త శ్ర‌మ‌తో కూడిన ప‌నే. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లోని ఈ శ్లోకాన్ని అనుస‌రించి త‌మ‌ను తాము ఉత్త‌ములుగా తీర్చిదిద్దుకున్న‌వాళ్ల‌ను మిగిలిన వాళ్లు త‌ప్పుకుండా అనుస‌రిస్తారు. మీ బ్రాండ్ ను మీరు ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి మార్గం ఇంకేముంది? మీకు స‌మాజంలో మంచి పేరు, ప్ర‌తిష్ఠ ఉంటే అంద‌రూ మిమ్మ‌ల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు ప్ర‌వ‌ర్త‌న‌లో, న‌డ‌వ‌డిక‌లో ఉన్న‌తంగా ఉన్న‌ప్పుడు మీ బ్రాండ్ ను ప్ర‌చారం చేసేందుకు వేరే ఎవ‌రూ అవ‌సరం లేదు. మీ బ్రాండ్ కు మీరే అంబాసిడ‌ర్.

 

 

బ్రాండ్ కు ప్ర‌చారం అంటే విశ్వ‌స‌నీయ‌త‌కు ప్ర‌చారం!

 

తాజాగా కొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌చారం చేసి న‌టీన‌టుల‌పై కొంద‌రు కోర్టుల్లో కేసులు వేసారు. ఎందుకంటే వారిపై న‌మ్మ‌కంతో వారు చెప్పిన మాట‌ల‌ను న‌మ్మి స‌ద‌రు కొనుగోలు జ‌రిపామ‌ని అయితే ఆ కొనుగోలు వ‌ల‌న తాము న‌ష్ట‌పోయామ‌ని కాబట్టి ప్ర‌చారం చేసినవారే త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న‌ది వారి వాద‌న‌. బాగా త‌ర‌చి చూస్తూ వారి వాద‌న‌లో నిజం కూడా క‌నిపిస్తుంది. ఎందుకంటే స‌మాజంలో ఉన్న‌త స్థానంలో ఉన్న గౌర‌వ‌ప్ర‌ద‌మైన వ్య‌క్తులు ప్ర‌చారం చేయ‌డం వ‌ల‌న చాలా మంది స‌ద‌రు కంపెనీ ఎలాంటిదో, ఏమిటో తెలుసుకోకుండా వారిని న‌మ్మి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మంచి పేరు ప్ర‌తిష్ఠ‌లు ఉన్న సెల‌బ్రెటీలు ప్ర‌చారం చేస్తే ఆ బ్రాండ్ కు మ‌రింత విలువ పెరుగుతుందన్న‌ది కంపెనీల వ్యాపార వ్యూహం. అది ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేస్తూనే ఉంది. సినిమా స్టార్ల‌తో , స్పోర్ట్స్ స్టార్ల‌తో ప్ర‌చారం చేయిస్తూ కంపెనీలు త‌మ బ్రాండ్ విలువ‌ను పెంచుకుంటున్నాయి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఇది మోస‌పూరిత చ‌ర్య కింద‌కు వ‌స్తోంది. ఎందుకంటే తాము ఉప‌యోగించ‌ని వ‌స్తువుల‌కు చాలా మంది స్టార్లు ప్ర‌చారం చేస్తున్నారు. అంద‌రికీ స‌ద‌రు వ‌స్తువును కొన‌మ‌నో, వాడ‌మ‌నో చెపుతున్నారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. అందుకే ఇప్పుడు ఎవ‌రి బ్రాండ్ కు వారు ప్ర‌చారం చేసుకునే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింది. ఇది వ్యాపార రంగంలో కొత్త విప్ల‌వమే కాదు భ‌గ‌వ‌ద్గీత‌లో ఉన్న వ్యాపార మెళుకువ‌ల‌కు కొత్త రూపం.

 

 

మీరుండగా మీ బ్రాండ్ కు వేరే ప్రచారకర్త ఎందుకు?

 

ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన యాడ్స్ లో లలితా జ్యూయలర్స్ యాడ్ ఒకటి. డబ్బులెవరికీ ఊరికే రావు అంటూ వచ్చే ఆ సంస్థ అధినేత కిరణ్ తన బ్రాండ్ ను బాగా ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తన తోటి వ్యాపారస్తుల్లా ఆయన పెద్ద పెద్ద సినీ స్టార్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోలేదు. తన బ్రాండ్ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. భగవద్గీతలో, మేనేజ్‌మెంట్ పాఠ్యాంశాల్లో చెప్పిన విధంగా ఒక వ్యాపార సంస్థకు వ్యాపారవేత్త కంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఎవరూ ఉండరు. ఎందుకంటే బ్రాండ్ అనేది విశ్వసనీయతకు ప్రతిరూపం. పారితోషకం తీసుకుని వచ్చే బయటి వ్యక్తులు అటువంటి విశ్వసనీయతను కల్పించలేరు. స్వల్పకాలానికి కంపెనీకి లాభం చేకూరినా అది ధీర్ఘకాలం కొనసాగాలన్నా వినియోగదారుల్లో పూర్తి విశ్వాసాన్ని చూరగొనాలన్నా ఎవరి బ్రాండ్ ను వారే ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పటికే విదేశాల్లో బాగా పాపులర్ ఈ మేనేజ్‌‌మెంట్ సూత్రం ఇప్పుడు ఇండియాలో కూడా మెల్లగా అడుగుపెట్టింది. మీరు ప్రారంభించింది ఎంత చిన్న సంస్థ అయినా సరే మీ బ్రాండ్ ను మీరే ప్రమోట్ చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా విలువలతో, విశ్వసనీయతతో కూడిన నమ్మకాన్ని సంపాదించుకుంటే మీ బ్రాండ్ కూడా ఉన్నతంగా ఎదుగుతుంది.

 

 

మీలోని మంచి లక్షణాలే మీ బ్రాండ్!

 

కొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు అర్ధమవుతాయి. ఉదాహరణకు సినీ రంగంలో ప్రస్తుతం సూపర్ స్టార్లుగా ఉన్న రజనీకాంత్, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎందుకు అంత క్రేజ్ సంపాదించుకున్నారు? వాళ్లు మిగతా వాళ్లలా అద్భుతంగా నటించలేరు, డ్యాన్స్ లు చేయలేరు అయినా సరే ఇవన్నీ అవలీలగా చేసే మిగతా నటీనటుల కంటే ప్రేక్షకులు అభిమానాన్ని పొందారు. ఎందుకు? తెర వెనుక వారి వ్యక్తిత్వం..వాళ్ల సింప్లిసిటీ..విశ్వసనీయత అనే లక్షణాలు వాళ్లకు క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. సూపర్ స్టార్లను చేసాయి. ఔత్సాహికులు తమ బ్రాండ్ ప్రమోషన్ లో కూడా ఇదే సూత్రాన్ని అమలు చేయాలి. ముందు వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదిగి అందరి దగ్గర విశ్వసనీయతను సంపాదించుకుంటే మిగిలిన వాళ్లు మిమ్మల్ని అనుసరించేందుకు మీరు చెప్పింది వినేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు చెప్పిన మాటకు విలువ ఉంటుంది. అప్పుడు మీరే మీ బ్రాండ్ కు వెలకట్టలేని అద్భుతమైన ఆస్తి అవుతారు. ఇక మీ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి డబ్బులు తీసుకుని నటించే అంబాసిడర్లు అస్సలు అవసరం లేదు.

 

 

సమూహం ముందు నడవడం నేర్చుకోండి!

 

మనం ముందు చెప్పుకుంటున్నట్టు సరిగ్గా అర్ధం చేసుకోవాలే కానీ భగవద్గీతలో ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది వ్యక్తిగత ఎదుగుదల కావచ్చు..వ్యాపారపరమైన ఎదుగుదల కావచ్చు. పరిష్కారాన్ని వెతుక్కునే సామర్ధ్యం ఉండాలి అంతే. ముందు మనం ఉత్తములుగా మారితే మనల్ని నమ్మేందుకు అంతా రెడీగా ఉంటారు. అదే బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవడంలో మూల సూత్రం. భగవద్గీత మనకు చెపుతోంది కూడా అదే. అందుకు మనిషిగా ఎదిగేందుకు ముందుగా ప్రయత్నాలు చేయండి. అది చేయగలిగితే దాన్ని అనుసరించి మిగతా అన్నీ మనల్ని వెన్నంటి వస్తాయి. అది కీర్తి కావచ్చు. డబ్బు కావచ్చు. మరేదైనా కావచ్చు. అయితే అవన్నీ రావడానికి ముందు మీ దగ్గర విశ్వసనీయత అనే ముఖ్య లక్షణం ఉండాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

ఎంతవారు గానీ.. వాలు చూపు సోకగానే కైపులో తేలుతున్నారు?

 

తాజాగా మన తెలుగు దినపత్రికల్లో ‘డాక్టర్లపై వలపు వల’ అన్న ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. సోసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న డాక్టర్లను కొందరు ఆడవాళ్లు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ వార్త కళ్లకు కట్టింది. 40 సంవత్సరాల లోపు ఉన్న డాక్టర్ల ను తమ మాటలతో బుట్టలో వేసిన కొందరు మోసగత్తెలు సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ వాటిని వీడియోలు తీసి వారి నుంచి డబ్బులు గుంజినట్టు వెల్లడైంది. అయితే దీన్ని ఒక వార్తగా కాకుండా మరో కోణంలో చూస్తూ సమాజంలో జరుగుతున్న మార్పులు, మన విద్యా విధానంలోని లోపాలతో దిగజారుతున్న విలువలను కళ్లకు కడుతోంది. మనిషి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు నైతికత, విలువలు అనేవే లేకుండా ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చిన్న చిన్న ప్రలోభాలను, బలహీనతలను జయించలేక బొక్కబోర్లా పడుతున్నారు. సాధిస్తున్న విజయాలను, బ్యాంక్ బ్యాలెన్స్ లను చూసుకుంటున్నారు కానీ తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు తిలోదాలు ఇచ్చి తమకు తాము ఏ విధంగా ద్రోహం చేసుకుంటున్నామో ఎవరూ పట్టించుకోవడం లేదు. యుద్ధప్రాతిపదికన మన విద్యా విధానంలో మార్పులు చేసి పిల్లలకు విలువలు, శీల నిర్మాణం కనుక నేర్పించకపోతే రానున్న రోజుల్లో గొప్పగా చెప్పుకుంటున్న మన సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

 

 

నమ్మకాన్ని నట్టేట ముంచుతున్నారు!

 

మన ఆలోచనను అవతలి వ్యక్తికి వివరించి ఆ విషయాన్ని అంగీకరింపజేసి వాళ్ల మద్ధతు తీసుకోవడాన్ని వ్యాపారం అంటారు కానీ నేడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేయడం, దాని కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడం అన్నది ఇప్పుడు సాధారణ విష‍యంగా మారిపోయింది. అయితే ఇక్కడ మోసం చేసేవాళ్లదే కాదు మోసపోయే వాళ్లది కూడా కాస్త తప్పు కనిపిస్తోంది. విలువలను గాలికొదిలి మోసం చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు అవతలి వాళ్ల బలహీనతలపై కొట్టడానికి ఉన్న అవకాశాలను వెతుకుతారు. ముఖ్యంగా మనుష్యుల బలహీనతల్లో కీర్తి, కాంత, కనకం అనేది ప్రముఖంగా ఉన్నాయి. కీర్తి సంపాదించేందుకు ఎటువంటి అడ్డదారులు తొక్కేందుకైనా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇక చాలా మంది పురుషులకు ఆడవాళ్ల బలహీనత అనేది సర్వసాధారంగా మారిపోయింది. ధర్మబద్ధంగా ఉండాల్సిన స్త్రీ పురుష సంబంధాలను బలహీనతల కోసం అవహేళనలా మారుస్తున్నారు. ఇక డబ్బు సంపాదనలో కూడా న్యాయాన్ని, విలువలను అస్సలు పాటించడం లేదు. ఎలా అయినా డబ్బు సంపాదించాలన్న యావ తప్పితే అది ఏ విధంగా సంపాదిస్తున్నాం? ఎలా సంపాదిస్తున్నాం ? అన్నదాన్నిపూర్తిగా మర్చిపోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రమైన విష‍యం ఏంటంటే..ఈ మూడు బలహీనతలు ఒకదాని పక్కన ఒక్కటి ఎప్పుడూ నిలవలేవు. పర స్త్రీ వ్యామోహం ఉన్న వారికి వెంటనే కీర్తి దూరమవుతుంది. అలాగే కీర్తి వ్యామోహం ఉన్నవారికి డబ్బు దూరమవుతుంది. అయినా సరే ఈ విషయాన్ని గుర్తించలేక చాలా మంది ఈ బలహీనతల జయించలేక వాటి వెంట పరుగుతీస్తున్నారు.

 

 

ప్రాచీన కాలం నుంచి నేటి వరకూ మనకు ఎన్నో ఉదాహరణలున్నాయి!

 

మన పురాణాల్లో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు అతని తపస్సును భంగం చేసేందుకు ఇంద్రుడు దేవకన్యలను పంపడం మనం చదివే ఉంటాం. అలాగే ఎవరైనా శ్రద్ధతో ఒక పనిచేస్తున్నప్పుడు దాన్ని చెడగొట్టేందుకు, భగ్నం చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంతటి శ్రద్ధ ఉన్నవాడు అయినా, నైపుణ‌్యం ఉన్నవాడు అయినా బలహీనతలను జయించకుంటే మిగిలేది పతనమే. విశ్వామిత్రుడు దేవకన్యల అందానికి లొంగిపోయి మొత్తం తపశ్శక్తిని పొగొట్టుకున్న కథ మనకు తెలిసిందే కదా? అలాగే ఇప్పుడు కూడా అదే రకమైన ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్‌.డీ.తివారీ రాసలీలలు, తాజాగా గుజరాత్ లో పటేళ్ల ఉద్యమనేత హార్టిక్ పటేల్ రాసలీలల వీడియో, పలువురు స్వామీజీలు, రాజకీయ నాయకులు వీడియోలకు కొదువే లేదు. ఇవన్నీ మనకు ఏం చెపుతున్నాయి. మనిషి యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకునే బాపతు వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయికి వెళ్లినా చిన్న చిన్న బలహీనతలను జయించలేని వాళ్లు అధికమైపోయారు. మరోవైపు మోసం చేయడానికి చట్టం కల్పించిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నవారు, విలువలు లేకుండా మోసం చేసి బతకాలనుకునే వాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.

 

 

బీటలు వారిన పునాదులపై అంతస్తులు కడుతున్నారు!

 

ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత అందమైన అమ్మాయి తన గదికి వస్తే కచ్చితంగా ప్రోసీడ్ అవుతా అని బాహాటంగా చెప్పాడు. సమాజానికి నీతులు ఉద్భోదించే సదరు రచయిత అలాంటి కామెంట్లు చేయడం ఎటువంటి మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఈ ఆధునిక కాలంలో మనిషిలో విలువలు, నైతికత అనేవి మచ్చుకు కూడా కనిపించడం లేదు. గొప్పవాళ్లు కూడా తాము చిన్న చిన్న బలహీనతలకు అతీతులం కాదని రుజువు చేసుకుంటున్నారు. ఎన్ని నీతులు చెప్పే వ్యక్తులైనా బలహీనతలకు లొంగే సందర్భం వచ్చినప్పుడు స్థిరంగా స్థితప్రజ్ణతతో వ్యవహరించలేకుండా ఉన్నారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు లేకపోవడం, గొప్పవాళ్లు అనుకున్న వాళ్లు కూడా బలహీనతలకు అతీతులు కాకపోవడంతో పిల్లలు కూడా అదే రకమైన దారిలోకి మళ్లుతున్నారు. అనైతికత అనేది బీటలు వారిన పునాది మీద ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా అది వృధానే ఎందుకంటే చివరికి అది కుప్పకూలిపోవడం తథ్యం. అలాగే మనిషి కూడా విలువలు, నైతికత లేకుండా ఎదగాలని ప్రయత్నించినా, ఒక వేళ స్వల్పకాలానికి ఎదిగినా చివరికి పతనం కాక తప్పదు.

 

 

విద్యా విధానంలో విలువలు చేర్చాలి!

 

ఒకప్పుడు మన విద్యావిధానంలో విలువలతో పాటు చదువు నేర్చించేవారు . కానీ ఇప్పుడు మన ఆధునిక విద్యా విధానంలో విలువలను పూర్తిగా తొలిగించి కేవలం చదువు మాత్రమే చెపుతున్నారు. అందుకే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా విలువలు, నైతికత అనే ముఖ్య లక్షణాలు లేక సాటి మనిషిని మోసం చేయడం, బలహీనతలను వదులుకోలేక పతనం కావడం వంటివి జరుగుతున్నాయి. ఇవి మన ఆధునిక తరాన్ని అలాగే మన దేశ సంస్కృతిని, వారసత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఈ పరిణామాన్ని వీలైనంత తొందరగా తొలిగించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఎమ్‌సీఐ) వైద్య విద్యలో విలువలు అనే సబ్జెక్ట్ ను ప్రవేశపెట్టింది. ఇదే స్ఫూర్తితో మిగిలిన పాఠ్యాంశాల్లో కూడా విలువలు అనే సబ్జెక్ట్ చేర్చాలి. మనిషిగా ఎలా ఎదగాలి.? నైతికతతో ఎలా జీవించాలి? నిజమైన ఎదుగుదల అంటే ఏమిటి? వంటి విషయాలను భోధించాలి. అప్పుడే విలువలతో కూడా ఆరోగ్యవంతమైన తరం తయారవుతుంది. అది జరగనంత వరకూ ఇలాంటి మోసాలు, ప్రలోభాలు కొనసాగుతూనే ఉంటాయి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్..ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా??

 

వినడానికి చాలా సులభంగా అనిపించినా ఇంటర్వ్యూలో మాత్రం ఈ ప్రశ్న అభ్యర్ధలకు వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న అభ్యర్ధుల భవిష్యత్ ను డిసైడ్ చేస్తుంది. ఒక అభ్యర్థికి ఉద్యోగం వస్తుందా ? రాదా? అన్నది సరిగ్గా ఇక్కడే తేలిపోతుంది. అటువైపు రిక్రూటర్లు కూడా ఈ ప్రశ్న ద్వారానే తమకు కావాల్సిన అభ్యర్దులను ఎంపిక చేసుకుంటారు? ఉద్యోగాన్ని సాధించడంలో ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. చాలా మంది ఈ దశను దాటడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అకడమిక్ లో మంచి మార్కులు తెచ్చుకున్న వారు కూడా ఇంటర్వ్యూ దశ వచ్చేటప్పటికీ తడబడుతూ ఉంటారు. ఎందుకంటే రిక్రూటర్లు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు? ఏం సమాధానం చెప్తే వాళ్లు సంతృప్తి పడతారు అన్న విషయాలు తెలియడం అన్నది ఇంటర్వ్యూకు వెళ్లేవారికి అతిపెద్ద సవాలు. అయితే ధైర్యం, చిన్న అవగాహన, ఎక్స్‌పర్ట్స్ చెప్పే సూచనలు పాటిస్తే ఇంటర్వ్యూ గండాన్ని దాటి ఉద్యోగాన్ని పట్టడం అంత కష్టమేమీకాదు.

 

 

మీ గురించి మీరు చెప్పుకోవడం అంత సులువేమీ కాదు!

 

ఇంటర్వ్యూ గది లోకి వెళ్లగానే రిక్రూటర్ ముందుగా నీ గురించి చెప్పు అనగానే చాలా మంది అభ్యర్ధులకు చెమటలు పడతాయి. అసలు రిక్రూటర్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియదు. ఏం చెపితే ఏం అవుతుందో. ఎలా చెపితే వాళ్లకు నచ్చుతుందో? ఇలాంటి సందేహాలు ఒక్కసారిగా వారిని గందరగోళంలో పడేస్తాయి. అందుకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న చాలా మందికి భయాన్ని కలుగుజేస్తుంది. అయితే కొద్దిగా సాధన చేస్తే ఈ ప్రశ్నకు చాలా సులువుగా జవాబు చెప్పవచ్చని హెచ్‌ఆర్ ఎక్స్‌పర్ట్స్ చెపుతున్నారు. అసలు నిజానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మనల్ని గూర్చి మనం చెప్పుకునేందుకు వచ్చే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్న వాళ్లకు ఉద్యోగం గ్యారంటీ.

 

 

రెజ్యుమెలో అంతా ఉంది కదా? మళ్లీ ఎందుకు చెప్పడం?

 

ఇంటర్వ్యూలో చాలా మంది అభ్యర్ధులకు కలిగే మొదటి సందేహం ఇదే. రెజ్యుమెలో మొత్తం సమాచారం ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు అడగడం అనుకోవడం అనవసర సందేహం. అసలు నిజానికి అక్కడే ఉంది అసలైన కిటుకు. కాస్త నిదానంగా ఆలోచిస్తే విషయం అర్ధమవుతుంది. రెజ్యుమెలో ఉన్న విషయం తెలుసుకుని సంతృప్తి చెంది మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలిచారు. అయినా మిమ్మల్ని అడుగుతున్నారు అంటే అర్ధమేమిటంటే..రెజ్యుమెలో లేనిది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండని వాళ్ల ఉద్దేశం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నకు చెప్పే సమాధానంలో రెజ్యుమెలోని లేని విషయాలు చెపితే చాలా మంచిది. మన నేపథ్యం, కష్టపడే తత్వం, నేర్చుకునే ఆసక్తి ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. అయితే ఆ సమాధానంలో మీ నైపుణ్యం, అనుభవం కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది తెలియజేయాలి.

 

 

రెజ్యుమెలో ఉన్నవాటినే తిప్పి చెపితే ఉద్యోగం రానట్టే!

 

ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నలో చాలా మంది అభ్యర్ధులు ఒకటే తప్పు చేస్తారు. అదేంటంటే రెజ్యుమెలో ఉన్న విషయాలనే మళ్లీ మళ్లీ చెపుతారు. ఇది రిక్రూటర్లకు ఎంత మాత్రం నచ్చదు. ఎందుకంటే మీరు వాళ్ల సమయాన్ని వృధా చేస్తున్నట్టు వాళ్లు భావిస్తారు. ప్రత్యేకంగా అడిగితే తప్ప మీ హాబీలు, వ్యక్తిగత అభిరుచులు, ప్రాధాన్యాల గురించి చెప్పకూడదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మీతో మాటలు కలపడానికి రిక్రూటర్ కు వీలు కల్పించే ప్రశ్న. తమ కంపెనీకి సరిపోయే అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న ఒత్తిడి రిక్రూటర్ పై కూడా ఉంటుంది. కాబట్టి మీరు సరైన ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే ఉద్యోగం మీకే రావచ్చు. మీ గురించి మీరు చెప్పుకుంటున్నప్పుడు సమాధానాన్ని ఒకటి రెండు నిమిషాల్లోనే ముగించేందుకు ప్రిపేర్ కండి.

 

 

సమాధానాలు ఇలా ఉండాలి!

 

కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగానికి మీరు ఏ విధంగా సరిపోతారో రిక్రూటర్ సరైన పద్ధతిలో వివరించండి. సదరు జాబ్ కు సరిపోయే అర్హతలు, ఒకవేళ ఎక్కువ అర్హతలు ఉన్నప్పటికీ ఆ ఉద్యోగానికి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో వివరించండి. ఆ రంగంలో మీ అనుభవం. సాంకేతిక నైపుణ్యాలు, అదే విధంగా మీరు ఆ ఉద్యోగాన్ని చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో కూడా రిక్రూటర్ కు స్పష్టంగా తెలియజేయగలగాలి. మీ బలాలను ప్రభావవంతంగా చెప్పడమే కాదు. ఇంటర్వ్యూకు వచ్చిన మిగిలిన అభ్యర్ధుల కంటే వాళ్ల కంటే మీరు మెరుగు అన్నట్టు ఓ రెండు, మూడు అంశాలనైనా కొత్తగా ప్రజంట్ చేయగలగాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం బాగున్నప్పటికీ సవాలుతో కూడుకున్న కొత్త జాబ్ ను ఆస్వాదించాలనుకుంటున్నట్టు చెప్పండి. ఇంకో ముఖ్య విష‍యం ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఒక సంభాషణ రూపంలో జరగాలి. కానీ మీపాటికి మీరు మాట్లాడుకుంటూ , ఒక్కరే కంఠతా పెట్టినట్టు చెప్పుకుంటూ పోతే మీకు ఉద్యోగం రాదు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

 

 

 

 

పిల్లలను చదువుకు దూరం చేసే ఏ సిద్ధాంతమైనా పనికిమాలినదే!

 

ఒకప్పుడు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం అనేది అంతర్లీనంగా ఉండేది. కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమైనప్పటికీ చాలా మంది విద్యార్ధులు దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. అయితే విప్లవ సాహిత్యంతో తీవ్రంగా ప్రభావితమైన వారు, తాము నమ్మిన సిద్ధాంతమే పూర్తిగా సరైనది అనుకునేవాళ్లు, అన్యాయం జరిగిన వాళ్లు, ఒక వాదాన్ని పూర్తి స్థాయిలో అథ్యయనం చేయని వాళ్లు తీవ్రవాదులుగా మారేవారు. అయితే ఆ తర్వాత రాను రానూ బాగా చదువుకున్న వాళ్లు ఉన్నత విద్యా వంతులు కూడా సమాజంలో జరుగుతున్న దోపీడికి తీవ్రవాదులుగా మారి హింస ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దీని వలన మన దేశంలో మావోయిస్టు తీవ్రవాదులు బాగా పెరిగిపోయారు. వారి సిద్ధాంతాలను, భావజాలాలను విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ రాజ్యానికి, రాజ్య వ్యతిరేక శక్తులకు జరుగుతున్న పోరాటంలో అమాయకులు, చిన్నపిల్లలు బలైపోవడం అన్నది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనులు విమర్శలపాలవుతున్నాయి. చదువు లేకుండా ఒక మనిషి అభివృద్ధి సాధించడం అన్నది అసాధ్యం. ఆదివాసీల పిల్లలకు చదువు అందుకుండా స్కూళ్లను పేల్చేయడం వంటి చర్యల ద్వారా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు తామే తూట్లు పొడుచుకుంటున్నారు.

 

 

విద్య‌కు వ్య‌థ‌గా మారిన తీవ్ర‌వాదం!

 

తీవ్ర‌వాదంతో బాగా న‌ష్ట‌పోయిన దేశాల జాబితాలో మ‌న దేశం కూడా ఉంది. కశ్మీర్ తీవ్ర‌వాదులు మొదులుకుని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు, బోడో తీవ్ర‌వాదులు, మావోయిస్టులు ఇలా తీవ్రవాద సంస్థ‌ల జాబితా చాలానే ఉంది. ప్ర‌స్తుతం అందులో కొన్ని సంస్థ‌లు క‌నుమ‌రుగైనా ఇప్ప‌టికీ టెర్రరిజం బాధిత దేశాల్లో ఇండియా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదం మూలంగా ప్ర‌జ‌ల సామాజిక, భౌగోళిక‌, ఆర్థిక స్థితిగ‌తులు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా మంది పిల్ల‌లు విద్య‌కు దూర‌మై చివ‌ర‌కు తీవ్ర‌వాదులుగా మారుతున్న వైనం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డం వ‌ల‌న పిల్ల‌లు చెట్లు కింద చ‌దువుకునే దుస్థితి దాపురించింది. తీవ్ర‌వాదుల దాడుల భ‌యంతో కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా మూత‌బ‌డ్డాయి. దీంతో విద్యార్ధులు చ‌దువుకునే అవ‌కాశాన్ని కోల్పోతున్నారు. ఒక‌వైపు పేద‌రికం మ‌రోవైపు చ‌దువుకునే వెసులుబాటు లేక‌పోవ‌డంతో చాలా మంది టీనేజ్ పిల్ల‌లు నేర‌గాళ్లుగా మారి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తూ చివ‌రికి తీవ్రవాదంపై మొగ్గు చూపుతున్నారు.

 

 

పూర్తిగా ప‌డ‌కేసిన విద్య!

 

బీహార్ లోని మావోయిస్ట్ ప్ర‌భావిత జిల్లాల్లో ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంది. తీవ్రవాదులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డంతో పాటు టీచ‌ర్ల‌ను కూడా భ‌య‌పెట్ట‌డంతో చాలా మంది ఉపాధ్యాయులు సుధీర్ఘ సెల‌వులు పెట్టి విధుల‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. దీంతో పిల్ల‌లు స్కూల్ మొఖం చూడ‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొన్ని స్కూళ్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ మొత్తం అన్ని త‌రగతుల‌ను ఒకే రూమ్ లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఏం వింటున్నామో తెలియ‌క విద్యార్ధులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. 500 మందికి పైగా విద్యార్ధులు ఉన్న స్కూళ్లు కూడా ఇప్పుడు కేవ‌లం 100 మంది విద్యార్ధుల‌కే ప‌రిమిత‌మైపోయాయి. మ‌రోవైపు మావోయిస్టుల‌కు భ‌య‌పడి చాలా మంది టీచ‌ర్లు కూడా విధుల‌కు రావ‌డం మానుకున్నారు. దీంతో స‌రైన నిర్వ‌హ‌ణ లేక బీహార్, ఝార్ఖండ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా స్కూళ్లు మూత‌పడ్డాయి. మిగిలిన స్కూళ్లు కూడా ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు వ‌చ్చిన విద్యార్ధులు రాక భవంతులు లేక చెట్ల కింద కాలం వెళ్ల‌దీస్తున్నాయి.

 

 

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

 

ప్ర‌స్తుతం బీహార్, ఝార్ఖండ్, ఒడిషాల‌లో మావోయిస్టుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో పోలీసులు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా కాస్త విజ‌య‌వంత‌మ‌య్యారు. దీంతో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేసిన ఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. అయినా ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన ప్రాంతాల్లో మాత్రం ప‌రిస్థితి అలానే ఉంది. పేల్చేసిన స్కూల్ భ‌వ‌నాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. మావోయిస్టులతో ప్రాణ భ‌యం ఉంద‌ని చాలా మంది స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో చాలా స్కూళ్లు తాత్కాలిక శిబిరాల్లోనూ, చెట్ల కింద న‌డుస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక చ‌దువులు కాస్త వ‌ర్షాకాలం చ‌దువులుగా మారిపోయాయి. ఎండ కాసినా , వ‌ర్షం ప‌డినా స్కూళ్లను పూర్తిగా మూసివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో పిల్ల‌లు పూర్తి స్థాయిలో చ‌ద‌వ‌లేక చ‌దువుకోక ప్రాథ‌మిక స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీంతో దేశంలోనే ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ స్వాతంత్ర పూర్వం నాటి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పోలీసు రక్షణలో చాలా వరకూ స్కూళ్లు నడుస్తున్నాయి. అయితే పోలీసులే నిజమైన విలన్లని మావోయిస్టులు చెపుతున్నారు. అణిచివేత ద్వారా స్కూళ్లను తెరిపించినా పెద్దగా ఉపయోగం లేదన్నది వారి వాదన. అయితే రాజ్యం, సమసమాజ స్థాపన వంటి సిద్ధాంతాల వలన మధ్యలో పిల్లలు చదువులేకుండా నష్టపోతున్నారన్న ప్రశ్నకు మావోయిస్టుల దగ్గర సమాధానం లేదు.

 

 

ఆధిపత్య ధోరణులతో పిల్లలు నలిగిపోతున్నారు!

 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం అన్ని రకాల సంబంధాలకు దూరంగా ఉన్న మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి కమ్యూనికేషన్ లేని గ్రామాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు మావోయిస్టుల చెప్పిన మాటలకు, సాహిత్యానికి ప్రభావితమవుతున్నారు. అయితే హింసా మార్గం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపించినా అవి మనుగడ సాగించలేవని గతంలోనే తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంటుంది.తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, మారుమూల గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. అవి నత్తనడకన సాగడంతో ప్రజలు మావోయిస్టులే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. మరోవైపు తీవ్రవాదులకు, పోలీసులకు జరుగుతున్న పోరాటంలో చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు స్కూళ్లను పేల్చివేయడంతో వాళ్లు విద్యకు దూరమవుతున్నారు. తర్వాత క్రమంగా తీవ్రవాదులుగా మారుతున్నారు. ఈ పరిణామం అస్సలు సహేతుకం కాదు. అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే చర్యలు మాని వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

తెలుగు మ‌హాస‌భ‌లతో తెలుగుకు ప‌ట్టిన తెగులు వ‌దిలిపోద్దా??

 

తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక తొలిసారిగా హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వీటిని నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ స‌మాయుత్త‌మైంది. ఈ నెల 15 నుంచి 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 50 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్ర‌పంచం న‌లుమూలల నుంచి తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో తెలుగు భాష‌కు ఒరిగేదేంటి అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. యునెస్కో విడుద‌ల చేసే మృత భాష‌ల జాబితాలోకి త్వ‌ర‌లో తెలుగు కూడా చేర‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డం తెలుగు భాషాభిమానుల గుండెల్ని పిండేసింది. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ గా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ప్ప‌టికీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అద్భ‌త‌మైన భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష ఇప్పుడు మ‌న విద్యా విధానంతో, ఇత‌ర భాష‌ల‌పై మోజుతో ప్ర‌మాదంలో ప‌డింది. ప‌క్క రాష్ట్రాల వారు త‌మ భాషను అభివృద్ధి చేసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మ‌న మాత్రం ప‌ర‌భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం.

 

పిల్ల‌ల‌కు తెలుగును దూరం చేస్తుంది మ‌న‌మే!

 

తెలుగు భాష‌కు ద్రోహం చేస్తున్న వాళ్ల‌లో మొద‌టి దోషులు క‌చ్చితంగా త‌ల్లిదండ్రులే. ప‌ర భాషపై విప‌రీత‌మైన వ్యామోహాన్ని పెంచుకుని త‌మ పిల్ల‌ల‌ను తెలుగు భాష‌కు దూరం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఎంద‌రో. తెలుగు మీడియంలో చ‌దివితే ఉద్యోగం రాదు తెలుగు చదివితే చిన్న స్థాయిలో ఉండిపోతారు అన్న అపోహ‌ల‌ను, అవాస్త‌వాల‌ను ప్రచారం చేయ‌డంలో కొన్ని ప్ర‌యివేట్ విద్యా సంస్థ‌లు విజ‌యం సాధించాయి. వారి మాయ‌లో ప‌డి చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను తెలుగులో చ‌దివించ‌డం మానుకున్నారు. స‌మాజంలో వ‌చ్చిన ఈ స్ప‌ష్ట‌మైన, దుర‌దృష్ట‌క‌ర‌మైన మార్పుకు ఈ త‌రం ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఘోర‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఒక వైపు స్కూల్లో తెలుగు మాట్లాడితేనే కొట్టే టీచ‌ర్లు, మ‌రోవైపు ఇంట్లో కూడా పిల్ల‌ల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడ‌మ‌ని ఒత్తిడి చేస్తూ న‌యా మాయానందంలో త‌మ‌ను తాము మోసం చేసుకుంటున్న త‌ల్లిదండ్రులు. వెర‌సి తెలుగు భాష ఇప్పుడు అంప‌శయ్య పైకి చేరుకుంది.

 

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావా?

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావ‌ని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేమ‌ని చాలా మందిలో ఉన్న భావ‌న‌. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వ‌కుంటే పిల్ల‌లు ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని చాలా మంది త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజ‌మే..ప్ర‌స్తుత కార్పోరేట్ జ‌మానాలో ఉద్యోగాన్ని సాధించాలన్నా దాన్ని కాపాడుకుంటూ మ‌రింత‌గా ఎద‌గాలన్నా ఇంగ్లీష్ లో నైపుణ్యం అవ‌స‌ర‌మే. ఇందులో సందేహం లేదు. అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషైన తెలుగుపై నిర్ల‌క్ష్యం ఎందుక‌న్న‌ది ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక పీరియ‌డ్, ఒక స‌బ్జెక్ట్ గా తెలుగును చ‌దివినంత మాత్రాన పిల్ల‌లు ప‌నికిరాని వారిగా మారిపోతారా? ఇప్పుడు తెలుగు భాషాభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ గా చేయ‌డంలో మీన‌మేషాలు లెక్కించింది. ఇప్పుడు తెలంగాణీ సీఎం కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. మ‌రి ఆయ‌న ఆదేశాలు ఎంత వ‌ర‌కూ అమ‌లవుతాయో క్షీణ ద‌శ‌లో ఉన్న తెలుగుకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుతం పుస్త‌కాలు చ‌దివే అలవాటున్న పిల్ల‌ల చేతుల్లో ఇంగ్లీష్ పుస్త‌కాలు త‌ప్పించి తెలుగు పుస్త‌కాలు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. పిల్ల‌ల్లో పుస్త‌క ప‌ఠ‌నంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బాల సాహిత్యంలో మ‌రిన్ని పుస్త‌కాలు రావాల్సి ఉంది. అలాగే త‌ల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌చ్చేలా వారికి శిక్ష‌ణ‌నివ్వాలి.

 

 

తెలుగును బ‌తికించ‌డం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది!

 

తెలుగుకు ప్రాచీన భాష హోదా ద‌క్కింద‌న్న ఆనందం ఎక్కువకాలం నిల‌వ‌కుండానే ఇటీవ‌ల యునెస్కో విడుద‌ల చేసిన ఒక నివేదిక ఆందోళ‌న రేపింది. తెలుగు భాష‌పై ఇదే ర‌క‌మైన వైఖ‌రి కొన‌సాగుతూ ఉంటే మ‌రికొద్ది సంవత్సరాల్లో తెలుగు కూడా మృత భాషల జాబితాలో చేరిపోవ‌చ్చ‌న్న‌ది ఆ నివేదిక సారాంశం. తియ్య‌నైన తెలుగు భాష క‌నుమ‌రుగు కావ‌చ్చ‌న్న ఆలోచ‌నే భ‌రింప‌రానిదిగా ఉంది. దేశ భాష‌లందు తెలుగు భాష లెస్స అన్న శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌న తెలుగు భాష‌ను బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అది ముందుగా త‌ల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. చిన్న‌త‌నం నుంచి పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో జాయిన్ చేసినా ఇంటి ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలుగులో మాట్లాడ‌టం నేర్పించాలి. అలాగే కొంచెం స‌మ‌యం తీసుకుని వాళ్ల‌కు తెలుగు భాష‌ను క్షుణ్ణంగా నేర్పించాలి. వాళ్ల‌కు తెలుగులో ఉన్న మంచి బాల సాహిత్యాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేయాలి. స్కూళ్ల‌లో ఎలా అయితే తెలుగు మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధిస్తారోఇంట్లో కూడా అలానే ఇంగ్లీష్ మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధించి కుటుంబం మొత్తం తెలుగులోనే మాట్లాడుకోవాలి. క‌ఠిన ప‌దాల‌కు , సామెత‌ల‌కు పిల్ల‌ల‌కు అర్ధాల‌ను వివ‌రించి చెప్పాలి. ఏ ప‌దాన్ని ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో వాడాలి అన్న‌దానిపై పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియజేయాలి. కుంగిపోతున్న తెలుగును బ‌తికించ‌డం కేవ‌లం త‌ల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. వారు త‌ల్చుకుంటే మ‌న భాష‌ను బ‌తికించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మేమీ కాదు.

 

 

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్య‌మే!

 

తెలంగాణా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల స్ఫూర్తితో మ‌నం తెలుగును బ‌తికించుకునేందుకు, దాన్ని త‌ర్వాత త‌రాల‌కు అందించేందుకు కృషి చేయాలి. తెలంగాణాలోని అన్ని పాఠ‌శాలలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌న్నెండో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగును త‌ప్ప‌నిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. అయితే ఇది స‌రిగ్గా అమ‌లు జ‌రిగేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. తెలుగు భాష‌ను మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించి వ‌దిలేయ‌డం కాకుండా వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు భాష గొప్ప‌త‌నంపై త‌ల్లిదండ్రుల‌ను చైత‌న్యం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో చ‌దివిన విద్యార్ధుల‌కు కూడా ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చేస్తే చాలా మంది తెలుగులో చ‌దివేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే మ‌న ప‌క్క‌రాష్ట్రాల త‌రాహాలోనే భాష‌పై ప్రేమ‌ను పెంచుకుని దాని అభివృద్ధికి అనుక్ష‌ణం ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేసిన‌ప్పుడు తియ్య‌నైన మ‌న‌ తెలుగు భాష త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుని త‌ళుకులీనుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పక చదవండి!!

 

ప్రస్తుతం స్టార్టప్ ల ట్రెండ్ నడుస్తోంది. 9 టూ 5 ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగిగానే జీవితాన్ని ముగించేందుకు నవ యువతరం సిద్ధంగా లేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కాస్త కొత్తగా లైఫ్ ను డిజైన్ చేసుకునేందుకు చాలా మంది యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక స్టార్టప్ ను ప్రారంభించడం అంత సులువైన విష‍యం కాదు. ప్రతీనెలా స్థిరంగా వచ్చే జీతాన్ని వదులుకుని ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటూ మానసిక సంఘర్షణను భరిస్తూ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడానికి ధైర్యం కావాలి. ఒక వందమందికి స్టార్టప్ ఆలోచన ఉంటే కష్టాలను భరించేందుకు రెడీ అయి బరిలోకి దిగే వారు కేవలం అయిదు మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లను కుటుంబం, ఆర్థిక అవసరాలు, సమాజం అన్నీ వెనక్కి లాగేస్తాయి. మంచి ఉద్యోగాన్ని వదిలి ఎంట్రెప్రెన్యూర్ గా మారాలనుకుంటున్న వారు కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దామా.

 

లైఫ్ అంటేనే రిస్క్ ..

 

మానవ జీవితం అంటేనే రిస్క్. మనం ఈ భూమి మీదకు రావడమే ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్న టాస్క్. రిస్క్ చేయకుంటే లైఫ్ లో ముందుకు వెళ్లడం అసలు సాధ్యం కాదు. రిస్క్ చేసే దమ్ము లేని వారికి పెద్ద కలలనే కనే హక్కు లేదు. మీ లక్ష్యాలను, మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోండి. మీ జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో ఎప్పుడూ పెట్టకండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ వర్తమానమే మీ భవిష్యత్ ను నిర్ణయించింది. ఇప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్ లో అలా భయపడుతూనే జీవితాన్ని ముగిస్తారు. కాబట్టి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోండి.

 

 

అనవసర బాధ్యతలను వదిలించుకోవడమే మొదటి మెట్టు!

 

ఒక స్టార్టప్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మీపై ఉన్న బాధ్యతలను క్రమంగా తొలిగించుకోండి. కార్ కొనుక్కోవడం, ఇళ్లు కొనుక్కోవడం, క్రెడిట్ కార్డు లు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటి బాధ్యతలను నెత్తిన పెట్టుకోకండి. అవి మిమ్మల్ని గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటాయి. మీ స్టార్టప్ విజయవంతమై ఇవన్నీ మీ చెంతకే వచ్చి చేరుతాయి. వ్యాపారంలో మీకు ఉపయోగపడే వాటినే తీసుకోండి. కానీ అవసరం లేని వస్తువులకు ఈఎంఐలు కట్టేందుకు మీ జీవితాన్ని తాకట్టు పెట్టుకోకండి.

 

జీవన నైపుణ్యాలు నేర్చుకోండి!

 

ఉద్యోగాన్ని వదిలేయడం అనేది జీవితాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే స్టార్టప్ కోసం ఉద్యోగాన్ని వదిలేసే ముందుగా ఆరు నెలలకు సరిగా డబ్బును దాచిపెట్టుకోండి. అలాగే స్టార్టప్ ను కొనసాగిస్తూనే వేరే ఆదాయ వనరుల కోసం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే రోజువారీ ఖర్చులకు తగిన ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దీ మొత్తాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలియడమే స్కిల్ ఆఫ్ సర్వైవల్. ఒక వేళ మీకు డబ్బులు సరిపోకపోతే పార్ట్‌టైమ్ గా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు ఉంటే చేయాలి.

 

 

ఏదైనా సాధించేందుకు ఇదే సరైన సమయం!

 

ఒక పనిని ప్రారంభించే ముందు మనలో చాలా మందికి లక్షల సంఖ్యలో సందేహాలు వస్తాయి. ఇది అసలు వర్కవుట్ అవుతుందా? ఒక వేళ విఫలం అయిపోతే.? నేను చేస్తున్న పని సరైనదేనా? ఇవన్నీ అందరికీ వచ్చే సందేహాలే. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా ఆలోచించడం కూడా సబబే. కానీ అతిగా ఆలోచిస్తూ మనకు మనం సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ నిర్ణయం తీసుకోలేం. మనం ఒక మంచి ఎప్పుడు అనుకుంటే అప్పుడే సరైన సమయం. ప్రాథమిక ఆలోచన చేసాక నిర్ణయం తీసుకున్నాక ఇక ధైర్యంగా బరిలోకి దిగాలి. నెగెటివ్ థింకింగ్ అస్సలు పనికిరాదు. చేయాలనుకున్నది నిబద్ధతతో. పట్టుదలతో, శ్రద్ధగా చేయాలి. ఫలితం తప్పుకుండా వస్తుంది.

 

మీ బలాలే కాదు మీ బలహీనతలూ తెలిసుండాలి!

 

స్టార్టప్ మొదలు పెట్టే ముందు ప్రతీ ఒక్కరూ ఈ విషయంపై బాగా ఆలోచన చేయాలి. అసలు నేనేంటి? నేను జీవితంలో ఎక్కడ ఉన్నాను? నా బలాలు ఏంటి? నా బలహీనతలు ఏంటి? ఒక రోజులో ఏ విషయంలో నేను బాగా పనిచేయగలుగుతున్నాను? ఏ విష‍యంలో ఇబ్బంది పడుతున్నాను? ఫలానా పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అన్న ప్రశ్నలను తనను తానే వేసుకుని విశ్లేషించుకోవాలి. బలహీనతలను అధిగమించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. వాటిని వదిలేయాలి. ఏ క్షణంలో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపే ఇంధనం.

 

 

కుటుంబాన్ని ప్రేమించండి

 

స్టార్టప్ ప్రారంభించేటప్పుడు ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇది కుటుంబాల్లో కలతలకు కారణమవుతుంది. ఇటువంటి సమయాల్లో నిబ్బరంగా ఉండాలి. మానసికంగా కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. మీపై మీ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ నిర్ణయం కుటుంబ సభ్యలకు నచ్చకపోయినా వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నం లోని చిత్తశుద్ధి అర్ధమైతే వారే తగిన ప్రోత్సాహం ఇస్తారు. కుటుంబంతో ఎప్పుడూ గ్యాప్ ను సృష్టించుకోకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ‌్యం.

 

ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకోవడం మానుకోండి!!

 

స్టార్టప్ ప్రారంభించాలనుకునే ముఖ‌్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇతరులను ఇంప్రెస్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. అది మీపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది. అలా కాకుండా మీ పని గురించి , మీ సంస్థ గురించి చెప్పుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. అవతలి వారిని ఇంప్రెస్ చేయాలనుకోవడం మనలోని క్రియేటివీటీని చంపేస్తుంది. స్నేహితులు, పేరెంట్స్ ఎవరైనా కానీయండి ఎవర్నీ ఇంప్రెస్ చేయకండి. మీ కోసం, మీ పని కోసం వారికి వివరించండి చాలు. చేసే పనిని భయం లేకుండా , గుండె ధైర్యంతో చేయండి చాలు సరిపోతుంది.

 

 

ధైర్యంతో పాటు వినయమూ ముఖ్యమే!

 

మీరు ప్రారంభించిన సంస్థపై మీరు చేస్తున్న పనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. మీ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఎవరినైనా కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎవరి ముందూ ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీరు చేస్తున్న పనితో మీరు త్వరలోనే విజయవంతమైన వ్యాపారవేత్త కాబోతున్నారు. ఆ నమ్మకాన్ని మీ కళ్లలో కనిపించేలా చూసుకోండి. ధైర్యంగా ఉంటూనే అదే సమయంలో ఎదుటి వాళ్లతో వినయపూర్వకంగా మసులుకోండి. మీలో కనిపించే వినయం, ధైర్యం అన్న విషయాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆల్ ది బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

 

యునెస్కో రిపోర్ట్…మన విద్య దుస్థితి మరోసారి వెల్లడైంది!!

 

ప్ర‌పంచంలో వేగ‌వంతమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. ప్ర‌పంచంలో 35 ఏళ్ల లోపు యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న న‌వ యువ దేశం..అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో అగ్ర‌దేశాల‌కు పోటీ.. ఇండియా గూర్చి చెప్పేట‌ప్పుడు విన‌సొంపుగా ఉన్న ఈ స్టేట్ మెంట్లు నాణెనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు మాత్రం ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో మ‌న దేశం వెనక‌బాటుత‌నం మ‌రోసారి సుస్ప‌ష్ట‌మైంది. తాజాగా యునెస్కో విడుద‌ల చేసిన ఓ నివేదిక, ప్ర‌పంచం మొత్తం మీద‌ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల్లో 35 శాతం మంది ఇండియాలోనే ఉన్నార‌ని వెల్ల‌డించింది. ఇండియా మొత్తం జ‌నాభాలో 26 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిరక్ష్య‌రాస్యులేన‌ని వెల్లడించింది. ప్ర‌పంచం వేగంగా దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఇప్ప‌టికీ సంపూర్ణ అక్ష‌రాస్యత‌ను సాధించ‌డంలో విఫలం కావ‌డం అంటే అభివృద్ధికి దూర‌మ‌వుతున్న‌ట్టే. అయినా మొద్దు నిద్ర పోతున్న పాల‌కులు విద్యా రంగంపై శీత‌క‌న్ను వేస్తూనే ఉన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి సాధించ‌కుండా దేశాభివృద్ధి సాధ్యం కాద‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌ర్చిపోయి నేల విడిచి సాము చేస్తున్న ప్ర‌భుత్వం వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ఎప్పుడు అవ‌గ‌తం చేసుకుంటుందోన‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌. మ‌రోవైపు తెలంగాణాలో కూడా ఇప్ప‌టికీ 34 శాతం మంది ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాద‌ని యునెస్కో నివేదిక చెపుతోంది.

 

 

అస‌లు యునెస్కో నివేదిక‌లో ఏముంది?

 

తాజాగా యునెస్కో వారి గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ మాన‌ట‌రింగ్ నివేదిక విడుద‌లైంది. ఆ నివేదిక‌లో వెల్ల‌డైన విష‌యాలు ఇండియా విద్యా రంగ దుస్థితిని మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇండియాలో దాదాపు 26 కోట్ల మంది చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిర‌క్ష‌రాస్యులేన‌ని ఆ రిపోర్ట్ లో తేలింది. గ‌తంతో పోల్చుకుంటే అక్ష‌రాస్యుల సంఖ్య కాస్త పెరిగిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ నిర‌క్ష్య‌రాస్యులు సంఖ్య భారీగా ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. దేశంలోని మొత్తం జ‌నాభాలో 73 శాతం మంది మాత్ర‌మే అక్ష‌రాస్యుల‌ని యునెస్కో నివేదిక వెల్ల‌డించింది. ఇక తెలంగాణా విష‌యానికొస్తే ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. తెలంగాణా మొత్తం జ‌నాభాలో అక్ష‌రాస్యుల సంఖ్య 65 శాతం మాత్ర‌మేన‌ని తేలింది. అంటే దాదాపు 35 శాతం మంది తెలంగాణా ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం కూడా రాదు. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డం, పేద‌రికం కార‌ణంగా చాలా మంది పిల్ల‌లు ప్రాథ‌మిక స్థాయిలోనే చ‌దువుకు ఫుల్ స్టాప్ పెడుతున్నార‌ని యునెస్కో నివేదిక‌లో వెల్ల‌డైంది. మ‌రోవైపు అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌పంచంలో చాలా దేశాలు త‌మ జీడీపీ లో అధిక శాతం నిధులను విద్యా రంగానికి కేటాయిస్తున్నాయి. కానీ మ‌న దేశంలో మొత్తం జీడీపీలో విద్యారంగానికి కేటాయిస్తున్న మొత్తం 3.8 శాతం మాత్ర‌మే. ప్ర‌పంచంలో స‌గ‌టున ప్ర‌తీ దేశం త‌మ జీడీపీ 5 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలి. క‌నీసం ఆ బెంచ్ మార్క్ స‌గ‌టును కూడా ఇండియా అందుకోలేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం.

 

 

తెలంగాణాలో ప‌రిస్థితి ద‌య‌నీయం!

 

యునెస్కో రిపోర్ట్ లో తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి వెల్ల‌డైన గ‌ణాంకాలు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ చాలా మంది విద్య‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణా మొత్తం జ‌నాభాలో దాదాపు 25 శాతం మంది నిర‌క్ష్య‌రాస్యులుగానే ఉంట‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముందు నుంచీ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల‌కు తోడు కొత్త‌గా బ‌డిలో చేరుతున్న మ‌ధ్య‌లోనే మానేయ‌డం నిర‌క్ష్య‌రాస్యుల‌ను పెంచుతోంది. ఇండియాలో దాదాపు కోటీ ఇరవై లక్షల మంది పిల్లలు అసలు స్కూల్ కే రావడం లేదని లెక్కలు చెపుతున్నాయి. ఈ సంఖ్య తెలంగాణాలో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపవుట్లను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సుముఖంగా లేరు. దీంతో వాళ్లను ఒప్పించి పిల్లలను బడికి తీసుకురావడం అనేది అధికార్లకు సవాలుగా మారింది. అలాగే చదువురాని నడి వయస్కులకు ఇప్పుడు చదవడం,రాయడం నేర్పించడం కూడా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను అందుకోవాలంటే ప్రతీ ఒక్కరు చదవడం,రాయడం పై కనీస అవగాహన తెచ్చుకోవాలి. మరి ఇంత మంది నిరక్ష్యరాస్యులు ఉన్న నేపథ్యంలో ఆ లక్ష్యాలను ఎలా చేరుకుంటారన్నది పెద్ద ప్రశ్న.

 

ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత!

 

చైనా లాంటి దేశాల‌తో ఆర్థిక వృద్ధిలో పోటీప‌డ‌తామ‌ని చెపుతున్న ఇండియా , కీల‌కమైన విద్యా రంగంపై మాత్రం శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో యువ‌కులు ఉన్నా వారికి సరైన నైపుణ్యాలు లేక అభివృద్ధి వెనుక‌బడుతున్నా మ‌న విధానక‌ర్త‌లు మాత్రం క‌ళ్లు తెర‌వ‌డం లేదు. ఒక‌వైపు చ‌దువుకున్న వాళ్లు ప‌నిచేసేందుకు అన‌ర్హులుగా తేలుతుంటే మ‌రోవైపు అస‌లు ఆ కొద్ది పాటి అక్ష‌రజ్ఞానం కూడా లేని వాళ్లు కోట్ల‌లో తేలుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు రేసులో ఉన్న వర్ధమాన దేశాలతో పోటీ ఎలా సాధ్యం? ఒక వైపు నిరక్షరాస్యత, మరోవైపు నైపుణ్యాల లేమి ఈ రెండు జాడ్యాలను వదిలించుకోకుంటే పోటీ పడటం మాట అటుంచి కనీసం రేసులో కూడా నిలవలేని పరిస్థితి వస్తుందని ప్రభుత్వాలు గ్రహించలేకపోవడం విడ్డూరంగా ఉంది. పైకి మాత్రం ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, పనిచేసే యువకులు మా దగ్గరే ఉన్నారు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఆత్మవంచన తప్పించి మరేమీ కాదు. సమస్యకు మూలాలు గుర్తించి పరిష్కారాన్ని వెతకడం మాని సాధించిన కొద్దిపాటి ప్రగతినే గొప్పగా చెప్పుకుంటే ఇండియా ఎప్పటికీ అగ్రదేశం కానేరదు.

 

 

తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి దిగజారుతుంది!

 

125 కోట్ల జనాభాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు ఇంకా చదవడం రాయడం రాదు అంటే మన దేశం ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యుద్ధప్రాతిపదికన నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రయత్నం చేయకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి సాధ్యం కాదు. రానున్న 20 ఏళ్లలో చైనా ను దాటి అగ్రరాజ్యంగా ఎగుదుతామని గప్పాలు కొడుతున్న నేతలు ముందుగా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోయి ప్రజలకు విద్యను అందించకుండా, విద్యార్ధులకు నైపుణ్యాలను అందించకుండా మీనమేషాలు లెక్కిస్తే ఎప్పటికే ఇండియా వర్ధమాన దేశంగానే మిగిలిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

ఈ అమ్మాయి కథ చదవండి…కచ్చితంగా స్ఫూర్తి పొందుతారు!!

 

మన‌కు స్ఫూర్తినిచ్చేవారు గొప్ప గొప్ప వ్య‌క్తులే కాన‌క్క‌ర్లేదు. ఒక్కోసారి మ‌న‌లో ఒక‌రిగా ఉంటూ, మ‌న స్థాయి కంటే త‌క్కువ స్థాయిలో ఉన్న‌వాళ్లు కూడా మ‌న‌కు స్ఫూర్తిప్ర‌ధాత‌లుగా నిలుస్తారు. వాళ్ల శ్ర‌మ‌, దార్శినిక‌త, దేన్నైనా సాధించాల‌న్న ప‌ట్టుద‌ల మ‌న‌కు ఆద‌ర్శ‌నీయంగా మారుతుంది. బీటెక్ చివ‌రి సంవత్స‌రం చ‌దువుతున్నమ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్ధిని ఒక స్టార్ట‌ప్ ను నెల‌కొల్పి మ‌రో 10 మందికి ఉపాధిని క‌ల్పిస్తుందంటే ఆశ్చ‌ర్యంతో పాటు ఆస‌క్తి కూడా క‌ల‌గ‌క‌మాన‌దు. ఉన్న‌పాటి కొద్ది పాటి వ‌నరుల‌తోనే రికార్డు స్థాయిలో కేవ‌లం 40 రోజుల్లోనే 101 వెబ్ సైట్ల‌కు రూప‌క‌ల్ప‌న చేసి ఎందరికో రోల్ మోడ‌ల్ గా నిలిచిన ఆ అమ్మాయే గుంటూరు జిల్లాకు చెందిన ర‌జిత‌. కాలేజీ యాజ‌మాన్యం ప్రొత్సాహంతో వెబ్ సైట్ డిజైనింగ్ పై ఆస‌క్తిని పెంచుకుని, స్టార్ట‌ప్ ను ప్రారంభించడ‌మే కాదు రానున్న రోజుల్లో దాన్ని పెద్ద సంస్థ‌గా నిల‌బెడ‌తాన‌ని ఆత్మ‌విశ్వాసంతో చెపుతున్న రజిత, విద్యార్ధుల‌కే కాదు ఏదైనా సాధించాల‌నుకునే ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం. స్ఫూర్తిగా నిలిచేవారు ఉన్న‌త‌స్థాయిలో ఉన్న వాళ్లే కాన‌క్క‌ర్లేద‌న‌డానికి ఒక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ ఆల్ టెక్ ట్రెండ్. డాట్ కామ్ సీఈఓ రజిత‌.

 

స్టార్ట‌ప్ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది?

 

బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ లో ఉండ‌గా కాలేజీ యాజ‌మాన్యం ప్రొత్సాహంతో ర‌జిత స్టార్ట‌ప్ ను ప్రాంభించింది. ర‌జిత చ‌దువుతున్న కాలేజీలో స్టార్ట‌ప్ విభాగం ఏర్పాటు కావ‌డం ఆమె ఎంట్రెప్రెన్యూర్ షిఫ్ కు బీజం వేసింది. వెబ్ డిజైనింగ్ పై ఆస‌క్తి ఉండ‌టంతో కంపెనీల‌కు, సంస్థ‌ల‌కు వెబ్ సైట్ ల‌ను డిజైన్ చేసే ఇచ్చే సంస్థ‌ను ప్రారంభించింది. ఆల్ టెక్ ట్రెండ్ డాట్ కామ్ పేరుతో ప్రారంభ‌మైన ఈ స్టార్ట‌ప్ కు క‌నీస పెట్టుబ‌డి కూడా లేక‌పోవ‌డం విశేషం. వెబ్ సైట్ డిజైనింగ్ పై అవ‌గాహ‌న సంపాదించుకుంటే స‌రిపోద‌ని డొమైన్, హోస్టింగ్ ను కొనుగోలు చేయాలంటే డబ్బు ఖ‌ర్చ‌వుతుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధిని కావ‌డంతో కొంచెం మొత్తం కూడా పెట్టుబ‌డిగా పెట్ట‌డం ర‌జిత‌కు సాధ్యం కాదు. దీంతో డొమైన్, హోస్టింగ్ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో రజిత‌కు మొద‌ట్లో అర్ధం కాలేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో వెబ్ 2.0 అనే సంస్థ రజిత‌కు అండ‌గా నిల‌బ‌డింది. డొమైన్ తో పాటు హోస్టింగ్, ప్రాసెసింగ్ ను ఉచితంగా అంద‌జేసింది. దీంతో ర‌జిత‌కు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ల‌భించింది.

 

 

స్టార్ట‌ప్ స‌రే..ఆర్డ‌ర్ల సంగ‌తేంటి?

 

స్టార్ట‌ప్ ఆలోచ‌న స‌రే మ‌రి ఆర్డ‌ర్లు , రాబ‌డి సంగ‌తేంటి? ఈ ప్ర‌శ్న మొద‌ట్లో ర‌జిత‌ను కూడా తీవ్రంగా వేధించింది. ఒక‌వైపు చ‌దువును కొన‌సాగించాలి మ‌రోవైపు స్టార్ట‌ప్ ను న‌డిపిస్తూ అదే స‌మ‌యంలో ఆదాయాన్ని కూడా పొందాలి? అయితే ప‌ట్టుద‌ల‌తో ఈ సవాలును అధిగ‌మించింది ర‌జిత. వెబ్ 2.0 స‌హ‌కారం అందించ‌డంతో ఖ‌ర్చు త‌గ్గిపోవ‌డంతో ఖ‌ర్చుల‌ను అధిగ‌మించి రెవెన్యూ సాధించాల‌న్న ఒత్తిడి లేక‌పోవడం ర‌జిత‌కు క‌లిసొచ్చింది. దీంతో లాభ న‌ష్టాల‌ను బేరీజు వేసుకోకుండా పూర్తి స్థాయిలో చేసే పనిపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న హుకేష్ ఐటీ సోల్యూషన్స్ అనే సంస్థకు వెబ్‌ సైట్ డిజైన్లు చేసే అవకాశం ఆల్‌ టెక్ ట్రెండ్ డాట్‌కామ్ కు లభించింది. అలాగే వీఎల్ సర్వీసెస్ అనే సంస్థకు కూడా వెబ్‌ డిజైనింగ్ చేసారు. రానున్న రోజుల్లో వెబ్‌ డిజైనింగ్ తో పాటు అప్లియేటేడ్ మార్కెటింగ్, మొబైల్ యాప్స్ డిజైనింగ్ పై కూడా దృష్టి పెడతామని చెపుతోంది ఆల్ టెక్ ట్రెండ్ డాట్‌కామ్ సీఈఓ రజిత.

 

 

వెబ్‌సైట్ల రూపకల్పనలో సామాజిక కోణం!

 

సాంకేతిక విప్లవం అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికీ టెక్నాలజీ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఆల్‌టెక్ ట్రెండ్ డాట్‌కామ్ పనిచేస్తోందని చెపుతోంది రజిత. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంత వాసులు కూడా టెక్నాలజీని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటువంటి పరిస్థితుల్లో పెద్దగా చదువుకోని వారికి కూడా సులువుగా అర్ధమయ్యేలా వెబ్‌సైట్లను, మొబైల్ యాప్స్ ను డిజైన్ చేయడమే తన లక్ష్యం అని చెపుతోంది రజిత. ఎక్కువగా సర్వీసెస్ రంగాలని ఉపయోగపడే వెబ్‌సైట్లను డిజైన్ చేసిన రజిత , వాటితో పాటు బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్యుకేషన్ వంటి సైట్లను ను కూడా డిజైన్ చేసింది. వీటిలో చాలా సైట్లకు గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి ప్రకటన రూపంలో కొంచెం ఆర్థిక సహాయం లభిస్తోంది.

 

 

ఎందరికో స్ఫూర్తి రజిత స్టార్టప్ స్టోరీ!

 

కేవలం 40 రోజుల్లోనే 101 వెబ్‌సైట్లను డిజైన్ చేసి రికార్డును నెలకొల్పిన రజిత, రానున్న రోజుల్లో మరింత చురుగ్గా పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రజిత నెలకొల్పిన ఆల్‌టెక్ ట్రెండ్ డాట్‌కామ్ లో రజితతో పాటు మరో 12 మంది పనిచేస్తున్నారు. ప్రాజెక్ట్ ల ఆధారంగా వాళ్లకు జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నెలకు 50 వేల రూపాయల వరకూ ఆదాయం వస్తోంది. సంస్థను మరింత విస్తరించి మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను చేజిక్కించుకునేందుకు రజిత ప్రస్తుతం బ్యాంక్ రుణం కోసం ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన చదువు ఇంకా పూర్తికాని ఒకమ్మాయి స్టార్టప్ ను ప్రారంభించి విజయవంతంగా నడిపించడం ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చే విషయం. ఆత్మవిశ్వాసం, శ్రమించే గుణం ఉంటే ఎవరైనా ఏదైనా చేయవచ్చని నిరూపించింది రజిత. మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు గొప్ప వాళ్లే కానక్కర్లేదని, మన మధ్యే ఉన్న సామాన్యులు కూడా స్ఫూర్తినిస్తారని చాటి చెప్పింది. ఆల్‌ ది బెస్ట్ రజిత.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

రాణీ ప‌ద్మావ‌తి..చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు మౌన సాక్షి!!

 

ఎప్పుడూ విజేత‌లే చ‌రిత్ర‌ను రాస్తార‌న్న‌ది ఒక‌ నిష్ఠుర‌ స‌త్యం. ఏ దేశ చ‌రిత్ర‌ను తీసుకున్నా, ఏ చారిత్రక‌ మ‌లుపును తీసుకున్నా అప్ప‌టి విజేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే చారిత్ర‌క ర‌చ‌న జ‌రిగేది. ఇందులో రెండో మాట‌కు తావులేదు. అయితే అబ‌ద్ధాలు, అభూత క‌ల్ప‌న‌లు చరిత్ర‌గా చెలామ‌ణీ అయిపోవ‌డం వాటినే నిజమ‌ని త‌ర్వాతి త‌రాలు న‌మ్మేయ‌డం అన్న‌ది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతూ వ‌స్తోంది. రాజుల పోయినా రాజ్యాలు అంత‌రించినా స్వాత్వంత్రం పూర్వం వ‌ర‌కూ మ‌న దేశంలో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ అనేది జ‌రుగుతూనే వ‌స్తోంది. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా వారు చరిత్ర‌ను మార్చుకుంటూ వ‌చ్చార‌న్న‌ది కొట్టిపారేయ‌లేని నిజం. క్రీస్తు పూర్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న దేశ చరిత్ర‌లో ఏది నిజ‌మో, ఏది క‌ల్ప‌నో తెలుసుకోలేని దుస్థితికి కార‌ణ‌మెవ‌రు? వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా తిమ్మిని బ‌మ్మిని చేసిన ఈ దుస్సాంప్ర‌దాయానికి ఒడిక‌ట్టిందెవరు? అలెగ్జాండ‌ర్ మొదలుకుని , అక్బ‌ర్, రాణీ ప‌ద్మావ‌తి, అల్లాద్దీన్ ఖిల్జీ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ వర‌కూ అందుబాటులో ఉన్న చ‌రిత్ర‌పై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు.

 

 

 

చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణకు పాల్ప‌డిందెవ‌రు?

 

ప్ర‌పంచాన్ని జ‌యించి విశ్వ‌విజేత‌గా అవ‌త‌రించాల‌ని దండయాత్ర ప్రారంభించిన అలెగ్జాండ‌ర్ కంటే ముందు నుంచి కూడా చరిత్ర వ‌క్రీక‌ర‌ణ జ‌రుగుతూ వ‌స్తోంది. ప్ర‌పంచ చ‌రిత్ర‌ను కాస్త ప‌క్క‌న పెడితే అలెగ్జాండ‌ర్ జ‌యించిన యుద్ధాలు, గెలిచిన రాజుల వివ‌రాల‌పై కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. క్రీస్తూ పూర్వం 326 లో భార‌తదేశంపై దండెత్తిన అలెగ్జాండ‌ర్ పురుషోత్త‌ముని సైన్యాల దెబ్బ‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్నాడ‌ని చెపుతారు. అయితే కొన్ని చరిత్ర పుస్తకాల్లో మాత్రం పురుషోత్త‌ముడు అలెగ్జాండ‌ర్ చేతిలో ఓడిపోయి చ‌నిపోయిన‌ట్టు ఉంది. ఇక గుప్త సామ్రాజ్యం క్రీస్తు శ‌కం 4 వ శ‌తాబ్దంలో అంత‌రించిన‌ట్టు , గుప్త సామ్రాజ్యంలో చివ‌రి చంద్ర‌గుప్త 2 అని చ‌రిత్ర పుస్త‌కాల్లో ఉంది. కానీ వాస్త‌వానికి గుప్తుల సామ్రాజ్యం క్రీస్తు 6వ శ‌తాబ్దం వ‌ర‌కూ ఉంది. ఇది చ‌రిత్ర‌లో లేదు. 1191 లో మ‌హ్మ‌ద్ ఘోరీ ఇండియాపై దండయాత్ర చేసి మొఘ‌ల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఢిల్లీ సుల్తానుల‌కు, గుప్తుల మ‌ధ్య కాలంలో అస‌లు ఏం జ‌రిగింది.? ఈ విష‌యం విద్యార్ధుల‌కు ఎప్ప‌టికీ తెలియ‌దు. గుప్తుల సామ్రాజ్యం అంత‌రించ‌డానికి, మొఘ‌ల్ సామ్రాజ్యం అవ‌త‌రించడానికి మ‌ధ్య 800 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఇండియాలో ఏం జ‌రిగింది? అలాగే మొఘ‌లులు ఇండియాను 350 ఏళ్ల పాటు ప‌రిపాలించార‌ని చ‌రిత్ర పుస్త‌కాల్లో ఉంది. వాస్త‌వానికి 17 వ శ‌తాబ్దం నాటికి మొఘ‌లులు సామ్రాజ్యంలో చాలావ‌ర‌కూ మ‌రాఠా రాజులు పాల‌న‌లోకి వెళ్లిపోయాయి. ఆఖ‌రికి ఢిల్లీని కూడా మ‌రాఠా పాల‌కులు ఆక్ర‌మించుకున్నారు.

 

 

మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను పూర్తిగా మార్చేసారు!

 

సుధీర్ఘ‌కాలం పాటు అధికారంలో ఉన్న కొంద‌రు కుహానా లౌకిక‌వాదులు భార‌త దేశ చ‌రిత్ర‌ను మార్చేసార‌న్న‌ది అధిక సంఖ్యాఖులైన హిందువుల్లో ఉన్న ప్ర‌ధాన‌మైన అసంతృప్తి. ముఖ్యంగా మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను పూర్తిగా వ‌క్రీక‌రించార‌న్న‌ది వారి ఆరోప‌ణ‌. మ‌ధ్య యుగాల చ‌రిత్ర‌ను మ‌న దేశంలో నెహ్రూవాద‌, మార్క్సిస్టు, కుహానా లౌకిక‌వాదులు రాసారు. దీనిపై చాలా మందికి అభ్యంత‌రాలు ఉన్నాయి. హిందువుల‌ను సంస్కృతిని ప్ర‌తిబింబించే వేలాది క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్టం చేసి వేలాది మంది దారుణంగా చంపిన జౌరంగ‌జేబును ఈ చరిత్ర కారులు లౌకిక‌వాది అని కీర్తించారు. ఇటువంటి చ‌రిత్ర‌ను కొంద‌రు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యంగా రాజ్ పుత్ లు ఉత్త‌ర‌భార‌తంలోని హిందువులు నెహ్రువాదులు, మార్క్సిస్ట్ లు రాసిన చ‌రిత్ర‌ను త‌ప్పుల త‌డ‌క‌గా అభివ‌ర్ణిస్తున్నారు. సుధీర్ఠ‌కాలం పాటు వాళ్లే అధికారాన్ని అంటిపెట్టుకోవ‌డంతో భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో హిందూ మ‌తంపై దాడి జ‌రిగింద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రుస్తూ బొమ్మ‌లు గీయ‌డం, సినిమాలు తీయ‌డం చేసినా వాళ్ల‌కు ఎటువంటి ఇబ్బంది క‌లుగులేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారింది. అనుకూల పార్టీ అధికారంలో ఉండ‌టంతో ప్ర‌స్తుతం చాలా మంది హిందువులు త‌మపై ఎవ‌రైనా దాడి చేస్తే ఊరుకునేందుకు సిద్ధంగా లేరు.

 

 

‘ప‌ద్మావతి’పై వివాదం ఎందుకు?

 

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్న ప‌ద్మావ‌తి చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద వివాదాస్పదంగా మారింది. చరిత్ర‌ను వ‌క్రీక‌రించి రాజ్ పుత్ ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ప‌ద్మావ‌తి క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని ఒక వ‌ర్గం వాదిస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర భార‌త దేశంలో గ‌ణ‌నీయ సంఖ్య‌లో ఉన్న రాజ్ పుత్ లు త‌మ ఆడ‌ప‌డుచును ఈ సినిమాలో త‌ప్పుగా చూపించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ వివాదం లోతుల్లోకి వెళ్తే 1303 లో అల్లావుద్దీస్ ఖిల్జీ రాజపుత్రుల సామ్రాజ్యం చిత్తోడ్ ఘ‌డ్ పై దండ‌యాత్ర చేసాడు. రాజ‌పుత్రుల‌కు ఖిల్జీకి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో రాజ‌పుత్రులు ఓడిపోయారు. ఈ క్ర‌మంలోనే రాజుపుత్రుల రాణి ప‌ద్మావ‌తి అందాన్ని చూసి ముగ్దుడైన అల్లావుద్దీస్ ఖిల్జీ ఆమెను ఎలాగైనా ద‌క్కించుకోవాల‌నుకున్నాడు. అయితే ఖిల్జీ కి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చిక్క‌కూడ‌ద‌ని భావించి మిగిలిన అంతఃపుర కాంత‌ల‌తో క‌లిసి రాణీ ప‌ద్మావ‌తి అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. అస‌లు వాస్త‌వానికి రాణీ ప‌ద్మావ‌తి అందం గురించి విని ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాల‌నే ఖిల్జీ చిత్తోడ్ ఘ‌డ్ పై దాడి చేసాడ‌న్న వాద‌న కూడా ఉంది. ఇది చ‌రిత్ర‌లో ఉన్న క‌థ‌. అయితే భ‌న్సాలీ సినిమాలో ప‌ద్మావ‌తి క‌థ‌ను పూర్తి మార్చివేసార‌ని, చరిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఆమె ఖిల్జీతో స‌న్నిహితంగా ఉన్న‌ట్టు చూపించార‌ని రాజ‌పుత్ లు ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఈ సినిమాను నిషేధించాల‌ని ఆందోళ‌న‌కు దిగుతున్నారు. అయితే అటువంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని ఉన్న క‌థ‌ను ఉన్న‌ట్టు చూపించామ‌ని చెప్పాల్సిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌చారం కోసమో మ‌రి దేనికోస‌మో తెలియ‌దు కానీ స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తున్నారు. ఒక వ‌ర్గం మ‌నోభావాలు దెబ్బ‌తీసి భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ అంటే స‌రిపోద‌న్న‌ది కొంద‌రి వాద‌న‌.

 

 

‘వ‌క్రీక‌ర‌ణ’ భ‌విష్య‌త్ త‌రాల‌కు పెను శాపం!

 

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డం అంటే ఒక నిజాన్ని స‌మాధి చేసి ఒక అబ‌ద్ధాన్ని బ‌తికించ‌డం. ఇది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఎందుకంటే అబద్ధం ఎప్ప‌టికైనా అబ‌ద్ధ‌మే. దానికి ఎటువంటి విలువా లేదు. భావి త‌రాల‌కు వాస్త‌వాల‌ను ఉన్న‌వి ఉన్న‌ట్టు అందించ‌లేన‌ప్పుడు ఆ దేశం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అభివృద్ధి సాధించ‌లేదు. మ‌రీ వందల ఏళ్ల నాటి విష‌యాల‌నే కాదు. స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం త‌ర్వాత కూడా చాలా విష‌యాలు, వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా స‌మాధి అయిపోయాన‌న్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా దేశ విభ‌జ‌న‌, గాంధీజీ వైఫ‌ల్యాలు, గాంధీ హ‌త్య‌, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం ముందు చోటుచేసుకున్న ప‌రిణామాలు ఇవ‌న్నీ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాలేద‌ని చాలా మందిలో అసంతృప్తి ఉంది. కొంద‌ర్ని హీరోల‌ను చేసేందుకు కొంద‌ర్ని విల‌న్లుగా చిత్రీక‌రించార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికైనా పూర్తి స్థాయిలో ప‌రిశోధ‌న‌లు చేసి విశ్వ‌స‌నీయ‌మైన‌ అస‌లైన చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందిస్తే ఫ‌లితం ఉంటుంది.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)