ఈ భూమిపై అత్యంత విలువైన వస్తువేంటో తెలుసా?

ప్రతీ వస్తువుకు, ఒక అంశానికి, ఒక పరిణామానికి ఇలా అన్నింటింకి విలువ ఉంటుంది. ఆయా కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఆ విలువ మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏంటన్నదానిపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. కొందరు బంగారం విలువైనది అంటే మరికొందరు భూమి అన్నింటికంటే విలువైనది అని చెపుతూ ఉంటారు. కొందరు వారి వారి అనుభవాలు, పరిస్థితులు ఆధారంగా విలువైన వస్తువులు జాబితాకు నిర్వచనం చెప్పుకుంటారు. అయితే ఇదే విషయంపై ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి. అసలు ఈ భూమిపై అన్నింటికంటే విలువైన వస్తువు మనిషి మాత్రమేనని ఆ సర్వే తేల్చింది. డబ్బులు, వస్తువులు, ఇళ్లు ఇవన్నీ విలువను కోల్పోయే వని కానీ మనిషి మాత్రం కాలంతో పాటు తన విలువను పెంచుకుంటాడని వెల్లడించింది. మానవ వనరులు అనేవి ఎప్పటికీ తరగని అంతులేని ఆస్తి అన్నది స్పష్టమైంది.

 

 

మనుష్యులే అత్యంత విలువైన వారు!

 

మనిషి చాలా విలువైన వాడని వెల్లడించిన సర్వే విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ విషయాలను వెల్లడించింది. ఈ భూమిలో ప్రతీ వస్తువు కాలగమనంలో తన విలువను కోల్పోతూ ఉంటుంది. అది బంగారం కావచ్చు. ఏదైనా ఇతర వస్తువు కావచ్చు. ఉదాహరణకు మనం ఎంత విలువైన కారును లేదా ఇళ్లును కొనుగోలు చేసినా కొన్ని రోజులు పోయాక వాటి విలువ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దీన్నే ఆర్థిక పరిభాషలో విలువ తరుగుదల అని అంటూ ఉంటారు. కాలంతో పాటు మనం విలువైనవి అనుకున్నవి అన్నీ తమ విలువను పోగొట్టుకుంటున్నప్పుడు మరి కాలంతో పాటు విలువ పెరిగే సాధనం ఏమన్నా ఉందా? అంటే అది మనిషి మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి తన చిన్నతనంలో నైపుణ్యాలలేమితో తక్కువ విలువను కలిగి ఉంటాడు. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ తన నైపుణ్యాలను పెంచుకుంటూ తన విలువను కూడా పెంచుకుంటాడు. ఇది ఒక్క మనిషికే సాధ్యం. అందుకే ఈ భూమిపై విలువైనదేంటి అన్న సర్వేలో మనుష్యులకే అగ్రస్థానం దక్కింది.

 

 

మానవ వనరుల నిర్వహణ పరిశ్రమగా ఎదగాలి!

 

అయితే ఇంతటి కీలకమైన మనిషిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో సరైన ముందడుగు పడటం లేదు. మానవ వనరులు సద్వినియోగం విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష‌యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మానవ వనరుల ఆధారంగా నిర్వహించే సర్వీసెస్ కు రుణాలు ఇచ్చేందుకు వాటిని ఒక పరిశ్రమగా గుర్తించేందుకు బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావు. అదే ఒక వస్తువు కొని పరిశ్రమ పెడతామంటే చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తారు. వస్తూత్పత్తి కి రుణాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఉద్దేశ్యం కాదు కానీ కాలంతో పాటు విలువను కోల్పోయే వస్తువుకు రుణాలు ఇస్తున్నప్పుడు కాలంతో పాటు విలువను పెంచుకునే వాటికి రుణాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. మానవ వనరుల నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన విషయం. వాటికి రుణాలు ఇచ్చి ప్రొత్సాహిస్తే విలువైన దానికి మరింత విలువ సమకూరి మెరుపును సంతరించుకుంటుంది.

 

 

మానవ సంబంధాలే మనిషి ఎదుగుదలలో కీలకం!

 

అయితే ఈ మానవ వనరుల నిర్వహణలో కూడా కొన్ని పద్ధతులను సరైన రీతిలో అవలంభించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఒక పర్సనాలిటీ డవలప్‌మెంట్ క్లాస్ లో ఏం నేర్పిస్తారు? భావవ్యక్తీకరణ, అవతలి వ్యక్తులతో ఆకట్టుకునేలా మాట్లాడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం వంటివి నేర్పిస్తారు. ఇవన్నీ వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయాలే కానీ ఒక మనిషితో సంబంధాలను ఎలా నెలకొల్పుకొవాలి? వాళ్లతో ఒక మంచి రిలేషన్ ను ఎలా కొనసాగించాలి? అన్న విషయాలను నేర్పించడం లేదు. ఒక మనిషితో మరో మనిషి ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నప్పుడే మాత్రమే మానవ వనరులు నిర్వహణలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మనిషి తన ఆలోచనా శక్తి, సంబంధాలపై గౌరవాన్ని పెంచుకున్నప్పుడు సమాజానాకి మేలు జరుగుతుంది. లేదంటే ఎన్ని వ్యక్తిత్య వికాస తరగతులు చెప్పినా అవి కొరగాకుండా పోవడం ఖాయం.

 

 

విలువైన వస్తువును భద్రంగా కాపాడుకుందాం!

 

ఒక విలువైన వస్తువును మనం ఎంత భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువైన మనిషిని ఇంకెంత బాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా కాలంతో పాటు తన విలువను పెంచుకునే మనిషికి మరింత విలువను ఆపాదించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మానవ వనరులు నిర్వహణ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పి ఆ రంగంలో ఉన్న సంస్థలను చేయూతనిచ్చి వాటిని ఒక పరిశ్రమగా గుర్తిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. వాటిని సర్వీసెస్ గా కాకుండా ఒక విలువైన వస్తువును అందించే సంస్థలుగా గుర్తించి రుణాలు మంజూరు చేస్తే వాటికి మరింత మంది నిపుణులను అందించేందుకు వీలు కలుగుతుంది. సరైన మానవ వనరుల నిర్వహణ, శిక్షణ ఉంటే చాలు ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకంటే విలువైనవి ఎప్పుడూ తమ విలువను గుర్తించమని అర్ధించవు. మనమే వాటి ప్రాధాన్యతను గుర్తించి ఆ విలువను మన అభివృద్ధికి వాడుకోవాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

శ‌వాల‌కూ హ‌క్కులుంటాయా?

 

‘బ‌తికున్న నాడు బువ్వ పెట్ట‌ని వాడు చ‌చ్చిపోయాక చ‌క్కెర పొంగ‌ళితో ముష్టాన్న భోజనం పెట్టాడ‌న్న‌ది’ సామెత‌. ఎందుకంటే మ‌న స‌మాజంలో పూర్వ కాలం నుంచి చ‌నిపోయిన వాళ్ల‌కు ఇచ్చే గౌర‌వం చాలా గొప్ప‌గా ఉంటుంది. చనిపోయిన వ్య‌క్తుల అంతిమ యాత్ర‌లో వాళ్ల‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను, ఆహార ప‌దార్ధాల‌ను ఇత‌ర విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌తనిస్తారు. దాదాపుగా చ‌నిపోయిన మ‌నిషి ఒక దైవ స‌మానంగా భావిస్తారు. మ‌న భారతీయ సంస్కృతిలో ఇది ఓ భాగం. అయితే మారుతున్న సామాజిక, ఆర్థిక ప‌రిణామాలు చ‌నిపోయిన మ‌నిషిపై, శవంపై మ‌న దృక్కోణాన్ని మార్చేస్తున్నాయి. భార‌తీయ‌, ఈజిప్ట్ వంటి పురాత‌న సంస్కృతుల్లో శ‌వానికి ఇచ్చే గౌర‌వాన్ని మర్చిపోయిన నేటి త‌రం శ‌వాన్ని త్వ‌ర‌లో పాడైపోయే ఒక మాంసం ముద్ద‌లా మాత్ర‌మే చూస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగాల్లో శ‌వాల ప‌ట్ల తీవ్ర‌మైన నిర్ల‌క్ష్యం రాజ్య‌మేలుతోంది. ముఖ్యంగా శ‌వాగారాల్లోని శ‌వాలను ఎలుక‌లు, పందికొక్కులు పీక్కుతింటున్నా అడిగే నాథుడు కూడా లేడు. శ‌వాల‌పై కొన‌సాగుతున్న ఈ నిర్ల‌క్ష్యంపై ప్ర‌తీ రోజూ వార్త‌లు వ‌స్తున్నా స్పందించేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అస‌లు శ‌వాల‌కూ హ‌క్కులు ఉంటాయా? ఆత్మీయులు లేని అనాధ శ‌వాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న నిర్లక్ష్య వైఖ‌రిని ప్ర‌శ్నించొచ్చా?

 

 

చ‌చ్చిన శ‌వాలంటే అంత చిన్న చూపా?

 

ఇటీవ‌లి కాలంలో ఏ ప‌త్రిక తిర‌గేసినా నేరాలు, హ‌త్య‌లు, రోడ్డు ప్ర‌మాదాల‌కు సంబంధించిన వార్త‌లే అధికంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌మాదాల్లో అనాధ‌లుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు, అయిన వాళ్లు లేక అనారోగ్యంతో క‌న్ను మూసిన వాళ్లు మ‌న దేశంలో ప్ర‌తీ రోజూ వంద‌ల సంఖ్య‌లో ఉంటారు. అనాధ శవాలుగా ప్ర‌భుత్వ మార్చురీల్లోకి వ‌చ్చి చేరే శ‌వాలు ఎక్కువ‌గానే ఉంటాయి. మ‌నం ముందు చెప్పుకున్న‌ట్టు బ‌తికున్న‌ప్పుడు విష‌యం తెలియ‌దు కానీ చ‌నిపోయాక ఒక మ‌నిషికి ఇవ్వాల్సిన క‌నీస‌మైన గౌర‌వం ఇవ్వాలి కానీ మ‌న ప్ర‌భుత్వ యంగ్రాంగం మాత్రం గౌర‌వం సంగ‌తి త‌ర్వాత శ‌వాల‌ను అత్యంత దారుణంగా అవ‌మానిస్తోంది. ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లోని శ‌వాగారాల్లో స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఎలుక‌లు, పందికొక్కులు శ‌వాల‌ను పీక్కుతింటున్న‌ట్టు ప్ర‌తీరోజూ పత్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అయినా అడిగే వారు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ యంత్రాంగం తమ వైఖ‌రిని మార్చుకోవడం లేదు. తాజాగా ఉస్మానియా ఆసుప‌త్రిలో ఒక గృహిణి శవం చెవులు, ముక్కును పందికొక్కులు తినేడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే గ‌తంలో గుంటూరు జ‌న‌ర‌ల్ ఆసుపత్రి ఐసీయూలో ఒక చిన్నారిని కూడా ఇలాగే పందికొక్కులు చేతులు, కాలివేళ్లు కొరికిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలుసు.

 

 

మానవ హ‌క్కులు మ‌నుష్యుల‌కేనా? శ‌వాల‌కు ఉండ‌వా?

 

బ‌తికున్న మ‌నిషికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఎన్నో చ‌ట్టాలున్నాయి. పైగా వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌కు భంగం క‌లిగినప్పుడు వ్య‌క్తి స్వేచ్ఛ‌కు విఘాతం క‌లిగి న‌ప్పుడు అత‌ని హ‌క్కుల‌ను కాపాడేందుకు మానవ హ‌క్కులు సంఘాలున్నాయి. మ‌నిషి హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు అత‌ని వ్యక్తిగ‌త భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ లేన‌ప్పుడు మానవ హ‌క్కులు క‌మీష‌న్ ముందుండి పోరాడుతుంది. గ‌తంలో నెల్స‌న్ మండేలా, మ‌హాత్మా గాంధీ, మ‌లాలా వంటి వారు మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి ఖ్యాతి గ‌డించారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది. బ‌తికున్న మ‌నుష్యుల‌కు హ‌క్కులు కావాలి కాబ‌ట్టి పోరాటం చేసి సాధించుకుంటున్నారు. మ‌రి చ‌నిపోయిన శ‌వాల సంగ‌తేంటి? ఇండియా లాంటి దేశంలో శ‌వాల‌ను దైవంతో స‌మానంగా చూసుకుంటారు. క‌దా? మ‌రి వాటి హ‌క్కుల‌ను కాపాడేందుకు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా? ఈ ప్ర‌శ్న‌కు లేదు అనే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. అత్యంత హేయ‌మైన ప‌రిస్థితుల్లో ఒక శ‌వాన్ని రోజుల త‌ర‌బ‌డి ఒక ఐస్ రూమ్ లో ఉంచుతున్నారు. ఒక వేళ ఆధారాల కోసం ఉంచాల్సిన వ‌చ్చిన‌ప్పుడు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుని వాటిని జాగ్ర‌త్త‌గా గౌరవంతో భ‌ద్ర‌ప‌రిస్తే మ‌న సంస్కృతికి, చనిపోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంది. ఒక వేళ శవం యొక్క సంబంధీకుల‌కు హ‌క్కులు క‌ల్పిస్తున్నా వాటిని కాపాడేందుకు స‌రైన సంస్థ‌, వ్య‌వ‌స్థ కూడా లేవు.

 

 

శ‌వం దేశానికి చెందుతుంది!

 

అస‌లు ఒక మ‌నిషి చ‌నిపోయాక అతని శ‌వం దేశానికి చెందుతుంది. ఆత్మీయులు, ర‌క్త సంబంధీకులు లేని అనాధ శ‌వాల బాధ్య‌త‌ను పూర్తిగా ప్ర‌భుత్వ‌మే తీసుకోవాలి. మ‌న పురాత‌న సంస్కృతిని అనుస‌రించి వాటికి త‌గిన గౌరవం ఇవ్వాలి. వాటికి స‌రైన ప‌ద్ధ‌తిలో శ‌వ సంస్కారాన్ని నిర్వ‌హించాలి. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం యొక్క బాధ్య‌త‌లు అని ప్ర‌ముఖ ఫోరెన్సిక్ వైద్యుడు డాక్ట‌ర్ విద్యాసాగ‌ర్ చెప్పుతున్నారు. అయితే ప్ర‌భుత్వం త‌మ బాధ్య‌త‌లను స‌రైన విధంగా నిర్వ‌హించ‌డం అన్న‌దే ఇప్పుడు శ‌వాల హ‌క్కుల ఉల్లంఘ‌న‌గా పిల‌వ‌బ‌డుతోంది. లేదంటే ప్రాణం లేని శ‌వాలకు హ‌క్కులెందుకు? వ‌ంద‌ల సంఖ్య‌లో శ‌వాలు వ‌స్తున్న‌ప్పుడు డాక్ట‌ర్ల‌కు వీటిని నిర్వ‌హ‌ణ చేయ‌డం అనేది క‌ష్ట సాధ్యంగానే ఉంటుంది. అయితే చిత్త‌శుద్దితో ప్ర‌య‌త్నిస్తే ఇది అసాధ్యం ఏమీ కాదు. మ‌రోవైపు అనాధ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కొన్ని స్వ‌చ్ఛంధ సంస్థ‌లు పనిచేస్తున్నాయి. కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నా అనాధ‌ శ‌వాల‌కు స‌రైన విధంగా అంత్యక్రియ‌లు చేయ‌డంలో అటువంటి సంస్థ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాయి.

 

 

చనిపోయిన వాళ్ల‌ను క‌చ్చితంగా గౌర‌వించాల్సిందే!

 

మ‌న దేశంలో మ‌న సంస్కృతిలో శ‌వంతో మ‌న‌కు ఒక ఎమోష‌న‌ల్ అటాచ్ మెంట్ ఉంటుంది. అంటే దాన‌ర్ధం అనాధ శ‌వ‌మైనంత మాత్రాన ఒక శ‌వాన్ని మార్చురీలో అధ్యాన్నమైన స్థితిలో జంతువులకు ఆహారంగా వేయ‌డం అన్న‌ది చాలా దుర్మార్గ‌మైన విష‌యం. శ‌వాన్ని గౌర‌వంగా సాగ‌నంప‌డం అనేది మ‌న సంస్కృతిని కాపాడుకోవ‌డ‌మే. శ‌వాల‌కు ప్ర‌త్యేక‌మైన హ‌క్కులు ఉండేలా..వాటిని గౌర‌వించేందుకు ప్ర‌త్యేక‌మైన చ‌ట్టం తీసుకొస్తే మ‌న సంస్కృతితో ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో అనాధ ఆత్మ‌ల‌కు శాంతి క‌లుగుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

పిల్ల‌లు చెప్పింది పెద్ద‌లు వినాలి!!

 

పిల్ల‌ల‌కు తల్లిదండ్రులే ఆది గురువులు. స్కూల్ కు వెళ్ల‌కుముందు వెళ్లిన త‌ర్వాత కూడా పిల్ల‌లు చాలా విష‌యాల‌ను త‌ల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఆత్మ‌విశ్వాసం, ఆస‌క్తి, మ‌ర్యాద‌, శ్ర‌ద్ధ ఇలా ఏ విష‌య‌మైనా పిల్ల‌లు పేరెంట్స్ నే ఆద‌ర్శంగా తీసుకుంటారు. పిల్ల‌ల‌కు ఆద‌ర్శంగా ఉండ‌టం అనేదే పేరెంటింగ్ లో అతిముఖ్య‌మైన స‌వాలు. ఈ స‌వాలును స్వీక‌రించి నిజాయితీతో, గౌర‌వంతో, ఆద‌ర్శ‌ప్రాయ‌మైన జీవన విధానాన్ని ఎవ‌రు ఆచ‌రిస్తారో వాళ్ల పిల్ల‌లు మాత్ర‌మే ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో పెరుగుతున్న‌ట్టు. ముఖ్యంగా కొత్త‌గా బ‌య‌టి ప్ర‌పంచంలోకి వెళ్లిన‌ప్పుడు పిల్ల‌ల చిన్ని బుర్ర‌లో ఎన్నో సందేహాలు, ప్ర‌శ్న‌లు పుడ‌తాయి. వాటిని జాగ్ర‌త్త‌గా త‌మ చిన్ని బుర్ర‌లో దాచుకుని వాటికి స‌మాధానాలు చెప్ప‌మ‌ని త‌ల్లిదండ్రుల‌ను అడుగుతారు. కానీ కెరీర్ కే అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న ఈ త‌రం త‌ల్లిదండ్రులకు పిల్ల‌ల సందేహాల‌ను తీర్చేందుకు స‌మ‌య‌మూ, ఓపిక రెండూ ఉండ‌టం లేదు. ఈ ప‌రిణామం పిల్ల‌ల మానసిక ఎదుగుద‌ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

 

 

పేరెంటింగ్ లో మొద‌టి మెట్టు ఓపిక‌ను పెంచుకోవ‌డ‌మే!

 

 

ఒక జంట పిల్ల‌ల్ని క‌న‌డానికి సిద్ధ‌మ‌వ‌డం అంటే త‌మ‌ను తాము పూర్తిగా మార్చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌ట‌మే. ఎందుకంటే ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల్ని పెంచ‌డం అనేది ఆషామాషీ విష‌యం కాదు. శారీర‌కంగా, మాన‌సికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధ‌మైతేనే ఈ పెద్ద‌ బాధ్య‌తను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించేందుకు వీలు క‌లుగుతుంది. ముఖ్యంగా వైఖ‌రి ప‌రంగా భావోద్వేగాల‌ను అదుపు చేసుకుని ఓపిక‌ను పెంచుకోవ‌డ‌మే పిల్ల‌ల పెంప‌కంలో మొద‌టి మెట్టు. ఎందుకంటే శైశ‌వ ద‌శ నుంచి కౌమారం వ‌ర‌కూ పిల్ల‌లు ప్ర‌తీ క్ష‌ణం తల్లిదండ్రుల ఓపిక‌కు ప‌రీక్ష పెడుతూనే ఉంటారు. ముఖ్యంగా అప్పుడే స్కూల్ కు వెళ్తున్న పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఓపిక‌ను ప‌రీక్షిస్తారు. తాము చూసిన తాము నేర్చుకున్న విష‌యాల‌ను ఇంటికి రాగానే త‌ల్లిదండ్రుల‌కు గుక్క తిప్పుకోకుండా చెపుతారు. ఎన్నో ప్ర‌శ్న‌లు అడుగుతారు. అలాగే తాము నేర్చుకున్న విష‌యాన్ని త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర ప్రద‌ర్శించ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. అయితే వాళ్ల ఉత్సాహాన్ని చాలా మంది పేరెంట్స్ నీరుగారుస్తారు. వాళ్ల చెప్పే విష‌యాల‌ను వినేందుకు ఓపిక లేక వాళ్ల‌పై చిరాకు ప‌డ‌తారు.

 

 

పిల్ల‌ల మాట‌ల ప్ర‌వాహానికి అడ్డుక‌ట్ట వేయ‌కండి!

 

పిల్లలు ఉత్సాహంగా చెపుతున్న విష‌యాలకు, క‌బుర్ల‌కు, ప్ర‌శ్న‌ల‌కు అస్స‌లు అడ్డుక‌ట్ట వేయ‌కండి. వాళ్లు చెప్పింది శ్ర‌ద్ధగా , ఆస‌క్తిగా వినండి. ఆ వినడంలో ఒక‌ర‌క‌మైన ఉత్సాహాన్ని చూపించండి. తాము చెపుతున్న విషయం త‌ల్లి లేదా తండ్రి ఆస‌క్తిగా విన‌డం అన్న‌ది పిల్ల‌లకు ఆనందాన్ని క‌లిగిస్తుంది. పిల్ల‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు విసుగు క‌న‌బ‌ర్చ‌కుండా ప్రేమ‌తో స‌మాధానాలు చెప్పాలి. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌నే ప‌దే ప‌దే అడుగుతున్నా స‌రే. చిరాకును ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. పిల్ల‌లు మిమ్మ‌ల్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు అంటే బ‌య‌ట ప్ర‌పంచంలో వాళ్లు చాలా విష‌యాల‌ను చూసి అవి ఏంటి అనే జిజ్ఞాస‌ను పెంచుకుంటున్నార‌ని అర్ధం. అన్నీ తెలుసుకోవాల‌న్న వాళ్ల జిజ్ఞాస‌ను ఆదిలోనే చిదిమేయ‌కండి. ఎంత బిజీగా ఉన్నా స‌రే వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం చెప్పాలి. వాళ్లు చెప్పే విష‌యాల ద్వారా స్కూల్ బ‌స్ లోనూ, స్కూల్ లోనూ, ట్యూష‌న్ లోనూ ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఏదైనా అస‌హ‌జంగా అనిపిస్తే వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

 

మీరు విన‌కుంటే ఇక చెప్ప‌డం మానేస్తారు!

 

త‌మ స్కూల్ లో బ‌య‌ట జ‌రిగిన విష‌యాల‌ను, చూసిన సంఘ‌ట‌న‌ల‌ను పిల్ల‌లు చెపుతున్న‌ప్పుడు శ్ర‌ద్ధ‌గా విన‌డం ఒక్క‌టే కాదు వాళ్లు వాస్త‌వానికి ఏం చెప్పాల‌నుకుంటున్నారో అర్ధం చేసుకోవాలి. నాలుగైదు సంద‌ర్భాల్లో మీరు స‌రైన ప్ర‌తిస్పంద‌న లేకుండా వాళ్లు చెప్పిన విష‌యాన్ని విన‌డం లేద‌ని తెలిస్తే పిల్ల‌లు ఇక మీతో ఏ విష‌యం చెప్ప‌డం మానేస్తారు. అది దీర్ఘ‌కాలంలో మీకు మీ పిల్ల‌ల మ‌ధ్య దూరాన్ని పెంచుతుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మీ పిల్ల‌ల‌కు ఒక మంచి స్నేహితునిలా వాళ్లు చెప్పింది వింటూ స‌రైన స‌మాధానం , స‌ల‌హా ఇచ్చే స‌న్నిహితుని పాత్ర పోషించాలి. అలా మీకు ఫ్రెండ్స్ లా ఉంటేనే పిల్ల‌లు మీతో ఏదైనా విష‌యం చెపుతారు. మీరు వారు చిన్న ప్ర‌శ్న‌ల‌కు , స‌రైన స‌మ‌యానికి వాళ్ల‌కు కావాల్సి వ‌చ్చే స‌ల‌హాల‌ను ఇచ్చేందుకు మీరు అందుబాటులో లేకుంటే వాళ్లు కొత్త స్నేహితుల‌ను వెతుక్కుంటారు. వాళ్ల ప్ర‌శ్న‌లు, వాళ్ల బాధ‌ల‌ను చెప్పుకునేందుకు వేరే వాళ్ల‌ను వెతుక్కుంటారు. ఆ స్నేహితులు చెడ్డ వాళ్లు అయితే మీ పిల్ల‌లు కూడా చెడు దారిలోకి వెళ్లిపోతారు.

 

 

శిక్ష‌ణ‌తో రాటుదేలేలా చేయండి!

 

పిల్ల‌ల‌కు వారి వ‌య‌స్సుకు త‌గిన‌ట్టుగా ఏదైనా ఒక విష‌యంపై శిక్ష‌ణ ఇవ్వండి. అది క‌రాటే, కుంగ్ ఫూ, మ్యూజిక్, చిత్ర‌లేఖ‌నం ఏదైనా కావ‌చ్చు. ఇలా ఓ కొత్త విష‌యం, కొత్త ఆట‌, కొత్త నైపుణ్యం నేర్చుకోవ‌డం వ‌ల‌న పిల్ల‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.వాళ్ల‌కు సంబంధించిన చిన్న ప‌నులు వారే సొంతంగా చేసుకునేలా వాళ్ల ప‌నిపై వాళ్లే నిర్ణ‌యాలు తీసుకునేలా వాళ్ల‌ను ప్రొత్సాహించాలి. దీనివల‌న చిన్న‌తనం నుంచే త‌మ ప‌నులు తాము చేసుకోవ‌డం చిన్న ప‌నుల‌కు త‌ల్లిదండ్రుల మీద ఆధార‌క‌ప‌డ‌పోవ‌డం వాళ్ల‌కు అల‌వాట‌వుతాయి. అదే విధంగా వ‌య‌స్సుకు త‌గిన‌ట్టు వాళ్ల‌కు కొత్త పుస్త‌కాలు చ‌దివే అలవాటును కూడా నేర్పించాలి. విజ్ఞానం పెర‌గ‌డం అనేది వాళ్ల‌కు ఆత్మ‌విశ్వ‌సాన్నే కాదు ఒక విష‌యాన్ని విభిన్న కోణాల్లో చూసే శ‌క్తి వ‌స్తుంది. పిల్ల‌ల‌తో ఎప్పుడూ స్నేహితుల్లా ఉంటూ వారు అడిగే ప్ర‌శ్న‌లు విసుగు లేకుండా స‌మాధానం చెప్పిన‌ప్పుడే పెంప‌కంలో కీల‌క‌మైన ద‌శ‌లో విజ‌య‌వంత‌మైన‌ట్టు.

 

(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)

 

ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్..దేన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుసా??

 

ప్రస్తుతం విద్యార్ధులు ఫేస్‌బుక్ పై అధిక సయమం వెచ్చిస్తున్నారు. ఫోటోలు షేర్ చేయడానికి, ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, ఇష్టమైన విషయాలను షేర్ చేయడానికి ఫేస్‌బుక్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం రోజులో మన దేశంలో విద్యార్ధులు దాదాపు 5 నుంచి 6 గంటలు ఫేస్‌బుక్ లోనే గడుపుతున్నారని తేలింది. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన ఆ విలువైన సమయాన్ని ఫేస్‌బుక్ చూస్తూ వృధా చేయడం ఆందోళన రేపుతోంది. ఏ మాధ్యమాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఎంత సమయం కేటాయించాలన్న దానిపై సరైన అవగాహన లేకపోవడం ఇప్పుడు సమస్యకు మూలకారణంగా కనిపిస్తోంది. ఫేస్‌బుక్ లో తమ ప్రొఫైల్ కు సంబంధించి ఒక పేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి పరిమితం కావాల్సింది పోయి చాటింగ్ లకు వీడియోలు చూస్తూ విద్యార్ధులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏయే నైపుణ్యాలను పెంచుకోవాలో అన్న దానిపై సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

 

 

నైపుణ్యాలు అనే మాటనే మర్చిపోతున్నారు!

 

తాజాగా వీబాక్స్ ఇండియా అనే సంస్థ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2018 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల విద్యాసంస్థలు, ఏఐసీటీసీ వంటి వివిధ విద్యా సంబంధిత సంస్థల సహకారంతో ఈ నివేదిక విడుదలైంది. అయితే ఉద్యోగానికి నైపుణ్యాలే కీలకమైన ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది విద్యార్ధులకు సరైన నైపుణ్యాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు నెట్‌వర్కింగ్ ను పెంచుకునేందుకు విద్యార్ధులు సిద్ధంగా లేరు. మరోవైపు రెజ్యుమె తో పాటు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉండడం కూడా ముఖ‌్యమే. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉంటున్నారు కానీ అది పోసుకోలు కబుర్లు చెప్పుకునేందుకు యూట్యూబ్ సినిమాలు, వీడియోలు చూసేందుకు మాత్రమే విద్యార్ధులు ప్రాధాన్యతనిస్తున్నారు. జాబ్ మార్కెట్ ఆన్‌లైన్ మోడ్ లోకి మారిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ఉపయోగం. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకోవడం విఫలమవుతున్నట్టు తెలుస్తోంది.

 

 

నైపుణ్యాల సాధనలో ఇవే కీలకం!

 

ఒక విద్యార్ధికి థియరీ నాలెడ్జ్ అనేది ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ పట్టు కూడా అంతే ముఖ‌్యం. కానీ చాలా మంది విద్యార్ధులు ఇదే కరవవుతోంది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేస్తే విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్ధులు మాత్రం ఇంటర్న్‌షిప్ అంటే చాలా ముఖం తిప్పుకుంటున్నారు. ఇక ఇంటర్న్‌షిప్ ను ఎంచుకుంటున్న కొద్ది మంది కూడా దాన్ని ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇక నెట్‌వర్కింగ్ లో చాలా మంది విద్యార్ధులు వెనుకబడి ఉన్నారు. అసలు నెట్‌వర్క్ లేకుండా కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం అసంభవం. ఈ విషయాన్ని విద్యార్ధులు అసలు గుర్తించడం లేదు. వివిధ సందర్భాల్లో , వేదికల్లో ఏర్పడిన పరిచయాలను సుధీర్ఘ కాలం పాటు కొనసాగించాలి. ఉద్యోగ సాధనలో నెట్‌వర్కింగే కీలకం. అయితే పరిచయాలను కొనసాగించడంలో 85 శాతం మంది విఫలమవుతున్నట్టు సర్వేలు చెపుతున్నారు. ఇక రెజ్యుమెను సరైన రీతిలో తయారు చేసుకోవడం కూడా చాలా మంది విద్యార్దులుకు తెలియడం లేదు. అసలు రెజ్యుమె తయారీలో కీవర్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రకటనకు అనుగుణంగా రెజ్యుమెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హలతో పాటు నాయకత్వ ప్రతిభను ప్రతిబింబించే ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ను కూడా అందులో ప్రస్తావించాలి.

 

 

దేన్ని ఎంతవరకు ఎలా వాడాలో తెలియాలి!

 

మన దేశంలో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బాగా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ డిజిటల్ విప్లవాన్ని అందుకుని విద్యార్ధులు ఉద్యోగ సాధనలో దూసుకుపోవాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉంటున్నారు. కానీ ఆన్‌లైన్ ను ఉద్యోగాన్ని సాధించేందుకు కాకుండా వీడియోలు చూసేందుకు సోషల్ మీడియాలో టైం పాస్ కబుర్లు చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్నారు.మన విద్యార్ధుల్లో 92 శాతం మంది ఫేస్‌బుక్ , 62 శాతం మంది యూట్యూబ్ లలో అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జాబ్ ను తెచ్చిపెట్టే ప్రొఫెషనల్ ఆన్‌లైన్ సోర్స్ లింక్డ్ ఇన్ ను కేవలం 26 శాతం మంది మాత్రమే చూస్తున్నారు. అందులో సరైన ప్రోఫైల్ ను పెట్టేందుకు కూడా చాలా మంది విద్యార్ధులకు తీరిక ఉండటం లేదు. అసలు దేనికి ప్రాధాన్యతనివ్వాలి? దేన్ని ఎంత సమయం చూడాలి? దేన్ని ఏ విధంగా వాడుకోవాలి? అన్న దానిపై అధిక శాతం మంది విద్యార్ధులకు అసలు అవగాహనే కొరవడుతోంది.

 

 

వేదికలను వాడుకోవడం తెలియాల్సిందే!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. ఇంటర్వ్యూలు, అభ్యర్ధుల ఎంపిక అనేది గతంలో జరిగిన విధంగా లేదు. ఇప్పుడు కంపెనీలు ఆన్‌లైన్ ప్రొఫెల్స్ ద్వారా తమకు కావాల్సిన అభ్యర్ధులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. అందుకే విద్యార్ధులు అర్హతలు, నైపుణ్యాలు ఆన్‌లైన్ రిక్రూటర్స్ కు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రిక్రూటర్స్ అభ్యర్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ , సోషల్ మీడియాలో వాళ్ల గుర్తింపును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫేస్‌బుక్ పేజ్ లో ఇతర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ యాక్టివ్ గా ఉండాలి. అలా అని వాటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా లింక్‌ఇన్ వంటి మాధ్యమాల్లో ప్రోఫైల్ ను అప్‌డేట్ గా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ ను సమర్ధవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అభ్యర్ధులు ప్రస్తుత మార్కెట్లో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు సమర్పించినవారు)

 

 

‘లిఫ్ట్’ కావాలా నాయ‌నా??

 

జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గాల‌ని గొప్ప ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే చాలా త‌క్కువ మంది మాత్ర‌మే గొప్ప‌వాళ్లుగా ఎదుగుతారు. మిగిలిన వాళ్లంతా అనుకోవ‌డం ద‌గ్గ‌రే ఆగిపోతారు? పైగా తాము ఎందుకు ఎద‌గ‌లేక‌పోయారో కార‌ణాలు చెపుతూ, సాకులు వెతుకుతూ త‌మ‌ను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వ్య‌క్తులు చెప్పే కార‌ణాల లిస్ట్ లో మొద‌ట‌ ఉండేది త‌మ‌కు ఎవ‌రూ లిఫ్ట్ ఇవ్వ‌లేద‌ని, ఆలా లిఫ్ట్ ఇచ్చి ఉంటే ఎక్క‌డో ఉండి ఉండేవార‌మ‌న్న‌ది. అయితే ఇటువంటి వ్య‌క్తుల‌కు అర్ధం కాని విష‌య‌మేమిటంటే అస‌లు ఎవ‌రైనా ఎందుకు లిఫ్ట్ ఇస్తారు? పోనీ లిఫ్ట్ ఇచ్చినా అర్హ‌త చూసి మాత్ర‌మే ఆ స‌హాయం చేస్తారు. ఈ ప్ర‌పంచంలో అర్హ‌త లేని వారికి, క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌లేని వారికి ఎవ‌రూ లిప్ట్ ఇవ్వ‌రు. వెహిక‌ల్ పై లిఫ్ట్ ఇచ్చేందుకే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే ఈ ప్ర‌పంచంలో జీవితంలో మీకు ఎవ‌రో లిఫ్ట్ ఇస్తార‌ని, వాళ్లు మీ జీవితాన్ని మార్చుతార‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం మాత్రమే. సొంతంగా త‌మ‌ను తాము ఉన్న‌తంగా తీర్చిదిద్దుకుని క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికి మాత్ర‌మే విజ‌యాన్ని అందుకునే అర్హ‌త ఉంది.

 

 

అస‌లు మీకెందుకు అంద‌రూ స‌హాయం చేయాలి?

 

మ‌న‌లో చాలా మందికి స‌హాయం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ట‌క్కున ఉన్న‌త స్థానంలో ఉన్న‌బంధువులో, స‌న్నిహితులో గుర్తుకువ‌స్తారు. వాళ్ల స‌హాయం తీసుకుని ఆ ప‌నిని పూర్తి చేయాల‌నో, లేక ఏదైనా ప్ర‌యోజ‌నం పొందాల‌నో ఆశిస్తూ ఉంటాం. అప్ప‌టి వ‌ర‌కూ వారితో స‌న్నిహిత సంబంధాలు నెర‌ప‌క‌పోయినా స‌రే వాళ్ల ద్వారా స‌హాయం పొందాల‌నుకోవ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న ఆలోచ‌న‌న ఎవ‌రికీ రాదు. ఉన్న‌త స్థానంలో వ్య‌క్తుల ద్వారా ప్ర‌యోజ‌నం పొందాలనుకోవ‌డం త‌ప్పు కాదు. అయితే ఇక్క‌డ రెండు కీల‌క‌మైన విష‌యాలు దీనిని నిర్ణ‌యిస్తాయి. అందులో ఒక‌టి మీరు సహాయం పొందాల‌నుకుంటున్న వ్య‌క్తుల‌తో మీరు స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్నారా? లేక అవ‌సరం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే వాళ్లు గుర్తుకు వ‌స్తారా? ఇక రెండోది అస‌లు మీకు అర్హ‌త లేకుండా అవ‌త‌లి వ్య‌క్తులు మీకెందుకు స‌హాయం చేయాలి? మీకు స‌రైన స‌మ‌ర్ధ‌త లేకుండా వాళ్లు మీకు స‌హాయం చేస్తే వాళ్ల విశ్వ‌స‌నీయ‌త‌, న‌మ్మ‌కం దెబ్బ‌తింటాయి క‌దా? స‌రైన అర్హ‌త‌లు లేకుండా మీకు ఎంత‌టి స‌న్నిహితులైనా స‌హాయం చేయ‌లేరు. అది ఎప్ప‌టికీ సాధ్యం కూడా కాదు.

 

 

నిందించుకోవాల్సింది మిమ్మ‌ల్ని మీరే!

 

ఇక త‌మ‌కు స‌హాయం కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆప్తులు అనుకున్న వాళ్లు స‌హాయం చేయ‌లేద‌ని చాలా మంది నిందులు వేస్తుంటారు. త‌మ చుట్టాలు, ఆప్తులు అయ్యిండి త‌మ‌కు అవ‌స‌రం అయిన‌ప్పుడు ఎందుకూ కొర‌గాకుండా పోయార‌ని ఆవేద‌న చెందుతూ ఉంటారు. అంతేకానీ త‌మ‌లో ఉన్న లోపం ఏమిటో గుర్తించేందుకు సిద్ధంగా ఉండ‌రు. అస‌లు వాస్త‌వానికి లిఫ్ట్ వేరు రిఫ‌రెన్స్ వేరు. మీ ద‌గ్గ‌ర పెద్ద‌గా విష‌య ప‌రిజ్ఞానం గానీ అర్హ‌తులు కానీ లేకున్న‌ప్ప‌టికీ చాలా మంది మ‌న‌కు రిఫ‌రెన్స్ ఇస్తారు. ఎందుకంటే రిఫ‌రెన్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ మీరు మ‌రో వేదిక వ‌ద్ద మీ అర్హ‌త‌ల‌ను, స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే లిఫ్ట్ ఇచ్చే విష‌యంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక వ్య‌క్తి మీకు లిఫ్ట్ ఇచ్చి మీ పురోగ‌తికి స‌హాయం చేయాలంటే మీరు అత‌ని ద‌గ్గ‌ర మీ సామ‌ర్ధ్యాల‌ను ఎంత‌గా నిరూపించుకోవాలి? ఎంత న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవాలి? అర్హ‌త లేదు అనుకుంటే సొంత వారికైనా ఎవ‌రూ లిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండ‌రు. ముందు మిమ్మ‌ల్ని మీరే నిరూపించుకుని త‌ర్వాత ఏదైనా చిన్న విష‌యానికి లిఫ్ట్ ను ఆశిస్తే దాని వ‌ల‌న ఫ‌లితం ఉంటుంది. అస‌లు లిఫ్ట్ నే ఆశ్ర‌యించ‌కుండా మీకు మీరుగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటే మ‌రీ మంచిది.

 

 

మ‌నం ఎక్కాల్సిన లిఫ్ట్ కూడా మ‌న‌కు ఎన్నో పాఠాలు నేర్పుతుంది!

 

అపార్ట్ మెంట్ లో మ‌నం లిఫ్ట్ ఎక్కాల్సి వ‌చ్చిన‌ప్పుడు స‌రిగ్గా గ‌మ‌నిస్తే మ‌నకు ఎన్నో విష‌యాలు అర్ధ‌మ‌వుతాయి. మ‌నం వ‌చ్చేస‌రికి దాదాపు 90 శాతం సంద‌ర్భాల్లో లిఫ్ట్ మ‌న‌కు అందుబాటులో ఉండ‌దు. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే మ‌నం వెళ్లేస‌రికి లిఫ్ట్ రెడీగా ఉంటుంది. మ‌నం కొద్ది సేపు నిరీక్షించి ఓపిక‌తో ఉన్నాకే లిఫ్ట్ ఎక్కేందుకు వీలు క‌లుగుతుంది. లిఫ్ట్ అప్ప‌టికే ఉన్న వ్య‌క్తులు మ‌న కోసం మ‌న వెళ్లాల్సిన ఫ్లోర్ కోసం బ‌ట‌న్ నొక్కిపెట్ట‌రు. మ‌నమే మ‌న వెళ్లాల్సిన గ‌మ్య‌స్థానాన్ని నిర్ణ‌యించుకుని బ‌ట‌న్ ను నొక్కాలి. ఎందుకంటే ఎక్క‌డ దిగాల‌న్న‌దానిపై మ‌న‌కు మాత్ర‌మే స్ప‌ష్టత ఉంటుంది. ఈ విష‌యం వేరే వ్య‌క్తుల‌కు తెలియ‌దు క‌దా? అటువంటి స‌మ‌యంలో వాళ్లు మీకెందుకు స‌హాయం చేస్తారు. స‌హాయం చేయాల‌ని ఉన్నా మీ గ‌మ్యాన్ని నిర్దేశించుకోలేని మీ అస‌మ‌ర్ధ‌త‌ను గ‌మ‌నించి ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటారు. కాబ‌ట్టి ముందు క‌ష్ట‌ప‌డి చేస్తూ కావాల్సిన అర్హ‌త‌ల‌ను సంపాదించుకోండి. అప్పుడు లిఫ్ట్ దొరికినా దొర‌క‌కున్నా మీరు అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లుగుతారు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నావారు)

 

 

 

ఇంటర్వ్యూ సరే..’గ్రూప్ డిస్కషన్’ కోసం మీకెంత తెలుసు?

 

ఇటీవలి కాలంలో ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ముఖ్యమైన విష‍యంగా మారింది. బిజినెస్ స్కూల్స్ ప్రవేశాలతో పాటు ప్రస్తుతం చాలా పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో గ్రూప్ డిస్కషన్ ను ఆధారంగా చేసుకునే ప్రవేశాలు కల్పిస్తున్నారు. కేవలం అడకమిక్ , ఇతర విషయాలు చదివి రాత పరీక్షలో విజయం సాధిస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు. రాత పరీక్షకు పర్సనల్ ఇంటర్వ్యూకు మధ్య ఉండే గ్రూప్ డిస్కషన్ లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. లేకుంటే ఉద్యోగం రావడం కష్టమవుతుంది. అలాగే దేశంలో ప్రముఖ మేనేజ్‌మెంట్ కాలేజీల్లో క్యాట్ ర్యాంక్ వచ్చినా గ్రూప్ డిస్కషన్ లో చూపించే ప్రతిభ ఆధారంగానే సీటు దొరుకుతుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ లో రాణించేందుకు విద్యార్ధులు తగినంత కసరత్తు చేయాల్సిందే.

 

 

అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు?

 

ప్రస్తుతం మార్కెట్లో ఏం జరుగుతుందో, ఏయే విషయాలు ప్రాముఖ్యత వహిస్తున్నాయో విద్యార్ధులకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. తెలియడం ఒక్కటే కాదు సదరు విష‍యంపై అభిప్రాయాలు వ్యక్తం చేసే అవగాహనా స్థాయి పెంచుకోవాలి. ఇందులో అభ్యర్ధులకు ఎంత వరకూ విష‍యంపై అవగాహన ఉందో తెలుసుకునేందుకు కంపెనీలు, విద్యా సంస్థలు గ్రూప్ డిస్కషన్స్ ను నిర్వహిస్తున్నాయి. సమకాలీన విషయాలపై అవగాహన ఒక్కటే కాదు అభ్యర్ధికి ఉన్న కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్జానం, సమయస్ఫూర్తి తదితర లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది ఒక్క ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ అభ్యర్ధులకు మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ కార్పోరేట్ సంస్థలు గ్రూప్ డిస్కషన్స్ కు పెద్ద పీట వేస్తున్నాయి.

 

 

గ్రూప్ డిస్కషన్ లో ఏం ఉంటాయి?

 

అసలు గ్రూప్ డిస్కషన్ లో ఫలానా విషయం ఉంటుందని చెప్పేందుకు వీలు లేదు. అప్పటి ట్రెండ్ కు పరిస్థితులను అనుసరించి గ్రూప్ డిస్కషన్ లో ఏ టాపిక్ ను అయినా ఇవ్వొచ్చు. బిజినెస్ స్కూల్స్ లో ప్రవేశాలకు అయితే ప్రధానంగా మేనేజ్‌మెంట్ కాన్సెప్ట్, బిజినెస్ కాన్సెప్ట్స్ , ఆర్థిక విషయాలు ఇతర విషయాలను అడగొచ్చు. అలా అని మిగతా ఇతర విషయాలను అడగరని కాదు. ఏదైనా అడగొచ్చు . అప్పటికప్పుడు మైండ్ విషయాన్ని ఫ్రేమ్ చేసుకుని సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా మిగిలిన వ్యక్తులతో చర్చ చేయాల్సి ఉంటుంది. ఇక కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగ ఇంటర్వ్యూల్లో రాజకీయాలతో పాటు, సామాజిక సమస్యలు, విద్యా రంగం, సినిమాలు, క్రీడలు, టెక్నాలజీ ఇలా ఏదైనా టాపిక్ రావచ్చు. విభిన్న విషయాలపై అవగాహనను, విషయంపై మీదైన ఆలోచనా విధానాన్ని పెంపోదించుకున్నప్పుడు సాధికారికంగా గ్రూప్ లో డిస్కషన్ ను చేయొచ్చు.

 

 

గ్రూప్ డిస్కషన్ లో ముఖ్యమైనవి ఏంటి?

 

మనం ముందు చెప్పుకున్నట్టు గ్రూప్ డిస్కషన్ లో విజయం సాధించాలంటే సమకాలీన విషయాలు, అంశాలపై పట్టు పెంచుకోవాలి. అయితే కరెంట్ టాపిక్స్ పై మేనేజ్‌మెంట్, బిజినెస్ కాన్సెప్ట్స్ , జనరల్ టాపిక్స్ పై పట్టు ఉంటే మాత్రమే సరిపోదు. గ్రూప్ డిస్కషన్ లో ముఖ్యంగా కావాల్సింది కమ్యూనికేషన్ నైపుణ‌్యం. చెప్పాలనుకున్న విష‍యంగా సూటిగా, సరళంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలి. దీంతో పాటు అన్ని సమకాలీన అంశాలపై పట్టు కోసం ప్రతీరోజూ దినపత్రికలు, మ్యాగజైన్లు చదువుతూ ఉండాలి. అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. గ్రూప్ లో మిగిలిన అభ్యర్ధుల అభిప్రాయాలతో విభేదాలున్నా డిస్కషన్ సరిగా జరిగేలా వ్యవహరించడం, సందర్భానుసారంగా మాట్లాడటం, ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తితే హుందాగా దాన్ని పరిష్కరించడం అన్నీ నాయకత్వ లక్షణాల కిందకే వస్తాయి. ముఖ్యంగా ఇతరులు మాట్లాడాకే మాట్లాడటం. ఎదుటి వారి మాటలకు, అభిప్రాయాలను గౌరవించడం వంటి వాటిని జాగ్రత్తగా గమనిస్తారు. అలాగే మంచి భాషా నైపుణ్యాలు, బాడీ లాంగ్వేజ్, నిటారుగా కూర్చోవడం, మంచి డ్రెస్ సెన్స్, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

 

 

గ్రూప్ డిస్కషన్ లో విజయ సూత్రాలివే!

 

గ్రూప్ డిస్కషన్ లో విజయం సాధించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చిరునవ్వుతో ఉండటం నేర్చుకోవాలి. హుందాగా ఉంటూ మీ లీడర్‌షిప్ క్వాలిటీని ప్రదర్శించాలి. ఇచ్చిన టాపిక్ ను మాత్రమే మాట్లాడాలి. అదే సమయంలో ఇతరులు అభిప్రాయాలను శ్రద్ధగా విని అప్పుడు మీ సమాధానం, మీ అభిప్రాయం తడబాటు లేకుండా చెప్పాలి. ఉత్సాహంగా , చొరవ చూపుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. అయితే అదే సమయంలో గట్టిగా మాట్లాడటం, ఆధిపత్యం కోసం ప్రయత్నించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తగదు. ఈ పనులు చేస్తే మీకెంత నాలెడ్జ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నా అవి కొరగాకుండా పోతాయి. కాబట్టి కరెంట్ టాపిక్స్ పై నాలెడ్జ్ ‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం సైకాలజీ స్కిల్స్ పెంచుకుంటే గ్రూప్ డిస్కషన్ లో మీదే విజయం.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

పిల్లల్ని కనాలంటే ముందు గాలిపటం ఎగరేయడం తెలియాలి!!

 

ఈ ప్రపంచంలో తనను తాను తెలుసుకోవడం ఎంత కష్టమే పిల్లల పెంపకం కూడా అంతే కష్టం. ఆత్మ జ్జానాన్ని సంపాదించుకోలేక చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను చిక్కుల్లో పడేసుకుంటున్నారు. అలాగే పిల్లల పెంపకం అనే అర్హత సాధించకుండానే పసివాళ్ల జీవితాలను కూడా చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ‌్యంగా మన దేశంలో పిల్లల పెంపకం అనేది అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న విషయం. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి పిల్లల పెంపకంపై అవగాహన ఉన్న తల్లిదండ్రులే దేశానికి మంచి పౌరులను అందించగలరు. కానీ దురదృష్టవశాత్తూ మన దగ్గర పిల్లల పెంపకాన్ని ఒక అషామాషీ విషయంగా తీసుకుంటున్నారు. ఓ మేధావి చెప్పినట్టు పిల్లలను పెంచడం చేతకాకపోతే వాళ్లను కనడం అన్నది అత్యంత బాధ్యతారాహిత్యమైన విషయం. ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాల్లో పిల్లల పెంపకంపై తగిన శిక్షణ తీసుకుని మానసికంగా సిద్ధమయ్యాకే పిల్లలను కనేందుకు అక్కడ దంపతులు సిద్ధమవుతున్నారు.

 

 

మీకు పిల్లల్ని పెంచడం తెలుసా?

 

పూర్వం ఒక దేశంలో ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించే మేధావి ఉండేవాడు. తన తెలివితేటలతో అందరి మన్ననలు పొందాడు. ఆ మేధావి పరిష్కరించని సమస్య అంటూ ఉండదని ప్రజలు భావించేవారు. అయితే అప్పటికే మధ్య వయస్సులోకి వచ్చిన ఆ మేధావి ఒకతను ఇలా ప్రశ్నించాడు. ‘అయ్యా తమరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? మీకు పిల్లలు కూడా లేరు. ఎందుకు?’ అని అడిగాడు. దానికి ఆ మేధావి ఇలా సమాధానం చెప్పాడు. ‘నాకు పిల్లల్ని పెంచడం అస్సలు చేతకాదు. అది అంత సులువైన విషయమేమీ కాదు. నా పిల్లలు సమాజాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు. నేను సరైన పెంపకం కనుక చేయకుంటే నా పిల్లలు సమాజాన్ని మలినం చేసే వ్యక్తులుగా తయారవుతారు.’ అని చెప్పాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల పెంపకం అనేది మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అత్యంత శ్రద్ధగా చేయాల్సిన పని. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మనం దేశానికి , సమాజానికి బాధ్యత లేని తరాన్ని అందించినట్టే. ఆ తరం అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటు . తల్లిదండ్రుల నిరాదరణకు గురైన సరైన పద్ధతిలో పెరగని ఒక పిల్లవాడు తాను పెద్దవాడు అయ్యాక తన పిల్లలను సరైన మార్గంలో ఎలా పెంచగలడు?

 

 

మీ పిల్లల బాల్యం మీ చేతుల్లో ఉంది!

 

ప్రతీ ఒక్కరు జీవితంలో గడిచిపోయిన తమ బాల్యాన్ని గుర్తు చేసుకుని చింతిస్తూ ఉంటారు. బాల్యంలో తన జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు కోటీశ్వరులైనా, మిలియన్ డాలర్లు వెచ్చించినా సరే మీ బాల్యాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు..కదా ..ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు. కానీ మీ పిల్లల బాల్యం మాత్రం కచ్చితంగా మీ చేతుల్లో ఉంది. వాళ్య బాల్యాన్ని వాళ్ల జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం మనకు ఉంది. వాళ్లకు అప్యాయత, అనురాగం, ప్రేమతో కూడిన స్పర్శ ను అందిస్తూ ఒక మంచి వాతావరణంలో పెంచితే అదే వాళ్లకు మీరు ఇచ్చే అందమైన, అద్భుతమైన బహుమతి అవుతుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు భవిష్యత్ లో మంచి జీవితాన్ని ఇచ్చేందుకు వాళ్లతో సరైన సమయం కూడా గడపకుండా పని పని అంటూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. మీరు పెద్దయ్యాక అతనికి కోట్ల రూపాయలు ఇచ్చినా అతను కోట్ల రూపాయలు సంపాదించినా తన బాల్యాన్ని మాత్రం వెనక్కు తెచ్చుకోలేడు కదా? కాబట్టి డబ్బు సంపాదనతో పాటు మీ పిల్లలతో నాణ్యమైన కొన్ని గంటలు గడిపేందుకు వారిని ప్రేమతో పెంచేందుకు, వారి బాల్యాన్ని సుసంపన్నం చేసే తగిన సమయపట్టిక వేసుకోండి.

 

 

పిల్లల పెంపకం గాలిపటం ఎగరేయడం లాంటిది!

 

మనం గాలిపటం ఎగరవేసేటప్పుడు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తారం. గాలిపటం కు స్వేచ్ఛ వచ్చే వరకూ జాగ్రత్తగా, మెల్లగా పైకి తీసుకెళ్తాం. తర్వాత దానికి మరింత స్వేచ్ఛనిచ్చి ఇంకాస్త పైకి వదులుతాం. ఇంకా నమ్మకం కుదిరాక మరింత పైకి వెళ్లనిస్తాం. కానీ ఇవన్నీ చేస్తున్నా నియంత్రణ పై మాత్రం పట్టు కోల్పోకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి నియంత్రణ కోల్పోతే గాలి పటం మీ చేతినుంచి చేజారినట్టే. స్వేచ్ఛ , నియంత్రణల సమన్వయమే గాలిపటం ఎగరేయడంలో మూల సూత్రం. ఇదే సూత్రం పిల్లల పెంపకానికి వందశాతం వర్తిస్తుంది. పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూనే వాళ్లకు ఏ సమయంలో నియంత్రణ అవసరమో తెలుసుకుని అప్పుడు దాన్ని అమల్లో పెట్టడం తెలియాలి. లేకుంటే మరింత పైకి వెళ్లి నియంత్రణ కోల్పోయిన గాలిపటంలా మీ పిల్లల జీవితం కూడా మీ చేతుల్లోంచి జారిపోతుంది. చెట్టు పెరిగే క్రమంలో చిన్న చిన్న కొమ్మలను తొలిగించిన అది నిటారుగా పెరిగేట్టు ఏ విధంగా చేస్తామో పిల్లల పెంపకంలో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఎగుదలలకు అడ్డంకిగా మారిన విషయాలను ఎప్పటికప్పుడు చాకచక్యంగా తొలిగించాలి. వారు మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

 

 

పిల్లల సామ్రాజ్యానికి పిల్లలే రాజులు!

 

పిల్లల పెంపకంలో మొదటి ఐదేళ్లు చాలా కీలకమైనవి. బడిలో చేరకముందు తల్లిదండ్రుల చెంత తీరుబడిగా నేర్చుకునే విషయాలు అతని జీవితంలో అత్యంత అమూల్యమైనవి. ప్రేమతో , అప్యాయతతో కూడిన స్పర్శతో తల్లిదండ్రులతో గడిపే ఆ క్షణాలు వాళ్లను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులను చేస్తాయి. మనం ముందు చెప్పుకున్నట్టు పిల్లల పెంపకం అంత ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే పిల్లల రాజ్యం ఒక గాజుమేడ. అందులో ఉన్న పిల్లవాడు రాయి విసిరినా, బయట ఉన్న వాళ్లు రాయి విసిరినా కూలేది, పగిలేది పిల్లల రాజ్యమే. నష్టపోయేది పిల్లవాడే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల కలల రాజ్యాన్ని నిర్మించడంలో రాజీ పడొద్దు. వాళ్లకు ప్రేమను, అప్యాయతను అందించండి. విలువలతో ఎలా బతకాలో నేర్పించండి. స్వేఛ్చనిస్తూనే నియంత్రణ చేయండి. తప్పటడుగులు వేస్తున్నప్పుడు సరి చేయండి. తప్పటడుగులు తప్పిదాలుగా మారకుండా జాగ్రత్త పడండి. అంతేకానీ పిల్లలను గాలికొదిలి వాళ్ల భవిష్యత్ కోసం డబ్బులు సంపాదిస్తాం అని చెప్పకండి. అన్ని విధాలుగా పతనమైన వాడికి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? మనం ముందే చెప్పుకున్నాం. పిల్లల పెంపకం చాలా కష్టతరమైన విష‍యం అని. మరి ఆ కష్టతరమైన విషయాన్ని అర్ధం కాకుండే నేర్చుకోండి. అవసరమైతే శిక్షణ తీసుకోండి. అంతే కానీ మీ పిల్లల పెంపకం విష‍యంలో రాజీపడకండి.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

వందేళ్ల చరిత్ర ఉన్న ఓ కాలేజీ..చదివే విద్యార్ధుల సంఖ్య 1..ఎందుకు?

 

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా మొదలయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్న హోర్డింగ్స్ చూస్తూ తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేసిందని చంకలు గుద్దుకుంటున్నాం. మనకు మనమే తెలుగు భాషాభిమానులుగా తెగ ఫీలైపోతున్నాం. ఇక ప్రభుత్వం హంగామా అయితే చెప్పనే అవసరం లేదు. ఈ హడావుడిలో ఓ దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు మరుగున పడిపోయింది. అదేదో మామూలు అషామాషీ వార్త కాదు. నిజమైన భాషాభిమానుల గుండెల్ని పిండేసే వార్త. అన్నింటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్ లో వచ్చింది ప్రపంచ తెలుగు మహా సభల్లో ప్రభుత్వాన్ని కీర్తించడంలో బిజీగా ఉన్న మన తెలుగు పత్రికలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విచారకరమైన వార్త ఏంటంటే.. వందేళ్ల చరిత్ర కలిగిన ఓ ప్రముఖ కళాశాలలో తల్లి భాషను నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన విద్యార్ధుల సంఖ్య కేవలం ఒక్కటంటే ఒక్కటి. ఇతర భాషలో సరైన విధంగా భావవ్యక్తీకరణ చేయాలంటే సొంత భాషపై తల్లి భాషపై పట్టు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని అందరూ విస్మరిస్తున్న వేళ తెలుగును బతికించుకోవాలంటే సమావేశాలు, సభలు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు.

 

 

 

ఒక్కడే విద్యార్ధి, ఒక్కరే టీచర్!

 

1860 లో ప్రారంభించిన విజయనగరం మహారాజా కాలేజీకి మంచి గుర్తింపు ఉంది. మొదట్లో రాజులు ఈ కాలేజీని నిర్వహించినప్పటకీ స్వాతంత్ర వచ్చాక ప్రభుత్వ కళాశాలగా మారింది. ఇక్కడ సంస్కృత కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. దేశంలో గొప్ప గొప్ప సంస్కృత, తెలుగు పండితులు ఇక్కడ విద్యాభ్యాసం చేసారు. ప్రస్తుతం ఈ కాలేజీలో సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలుగా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ మాత్రమే కావాల్సి రావడంతో ఈ కోర్సు వైపు కన్నెత్తి చూసే నాథుడు కూడా లేడు. ప్రస్తుతం విద్యా సంవతర్సంలో ఈ కాలేజీలో సదరు కోర్సులో కేవలం ఒకే ఒక్క విద్యార్ధి చదువుతున్నాడు. దీంతో ఉన్న ఇద్దరు తెలుగు, సంస్కృతం పండితులను వేరే కాలేజీలకు బదిలీ చేసారు. మొత్తం కాలేజీకి ఒక్క స్టూడెంట్, ఒక ప్రిన్సిపల్, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఒక గొప్ప కాలేజీలో కేవలం ఒక విద్యార్ధి మాత్రమే ఉండటం తెలుగు తో పాటు ఇతర భాషలపై మనకున్న నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది.

 

 

తెలుగులో చదివితే పనికిరాని వాళ్లమైపోతామా?

 

మన శరీరంలో ఏదైనా ఒక అవయవం ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది. దాన్ని అంగవైకల్యం అంటాం. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ అలాంటి అంగవైకల్యం తోనే బాధపడుతోంది. కేవలం ఇంగ్లీష్ పైన మాత్రమే దృష్టి సారిస్తూ మాతృభాషను సమాధి చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ అవసరమే. ఇది ఎవరూ కాదనరు. ఇంగ్లీష్ కావాలి అని మన తెలుగును చంపుకుంటామా? ఇంగ్లీష్ అనేది మనకు జీవన భృతిని కల్పించే భాష మాత్రమే. అందులో మన ఆత్మ ఉండదు. మన తల్లి భాషలోనే మన నిజమైన ఆత్మ ఉంటుంది. పైగా తెలుగు భాషను క్షుణ‌్ణంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ భాషపై మరింత పట్టు సంపాదించొచ్చు. ఎందుకంటే మాతృభాషలో మనం భావవ్యక్తీకరణ సరైన విధంగా చేయగలిగితే మరే ఇతర భాషలు నేర్చుకున్నా అది చాలా సులువుగా వంటబడుతుంది. అలా కాకుండా ఏకంగా మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్ భాషనే పట్టుకు వేలాడుతున్న వారిని ఏమనాలి?

 

 

తల్లిదండ్రులే మొదటి దోషులు!

 

మరే ఇతర దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ దేశం వాళ్లు అయినా ముందు వాళ్ల మాతృభాషకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మనం మాత్రం ఏకంగా మన భాషలను చంపేసుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. చైనాలో, జపాన్ లో ఇలా ఎక్కడైనా వాళ్లు వాళ్ల భాషకే పెద్ద పీట వేస్తారు. వాళ్ల భాష నేర్చుకోవడం వలన వాళ్లేమీ వెనుకబాటు తనంలో ఉండిపోలేదే. ప్రపంచంలోనే వేగవంతమైన శక్తులుగా ఎదుగుతున్నారు. మనం మాత్రం బాగా ఇంగ్లీష్ నేర్చుకుని రాత్రిళ్లు కాల్ సెంటర్లలో పనిచేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి? మాతృభాషకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుగా మేల్కోవాలి. తమ పిల్లలకు ఇంగ్లీష్ తో సమానంగా మాతృభాషను కూడా నేర్పించాలి. ఇంట్లో పిల్లలు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రమే ఆనందపడాలి. ఇంటిదగ్గర వాళ్లకు ఎలా మాట్లాడాలో, ఎలా రాయాలో, ఎలా చదవాలో కొద్ది సమయం కేటాయించి వాళ్లకు తెలుగు నేర్పించాలి. అప్పుడే తెలుగు బతుకుతుంది.

 

 

ఆర్భాటాలు మాని చర్యలు చేపట్టాలి!

 

హైదరాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇలా జరగడం చాలా మంచిదే. అయితే అసలు ఉద్దేశాన్ని గాలికొదిలే ప్రచారాలకు , ఆర్భాలకు దూరంగా తెలుగును బతికించేందుకు నిజమైన కార్యాచరణ కావాలి. ఇప్పటికే తెలుగు మహాసభల హోర్టింగ్ ల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న కొన్ని తప్పులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇది రంద్రాన్వేషణ కాదు కానీ తెలుగును బతికించడంలో మన చిత్తశుద్ధిని చాటిచెప్పే విధంగా చర్యలు ఉండాల్సిందే. తెలంగాణాలో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చడం మంచి నిర్ణయం. అలాగే ఏపీ లో కూడా అటువంటి చర్యలు జరగాలి. మరే తెలుగు కాలేజీలోనూ ఒక్కడే విద్యార్ధి ఉండే దుస్థితి రాకుండా ప్రభుత్వాల తక్షణ చర్యలు చేపట్టాలి. తెలుగు చదివే వాళ్లకు నమ్మకం కలిగించాలి. తెలుగులో చదివితే కలిగే ఉపయోగాలను చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల్లో తెలుగు చదివే ఆ ఒక్కడు కూడా మిగలకపోవచ్చు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

టాలెంట్ ను గుర్తించ‌గ‌ల‌గ‌డ‌మే టాప్ స‌క్సెస్!!

 

 

మాన‌వ వ‌న‌రుల ఎంపికలో స‌రైన నిర్ణ‌యాలే ఇప్పుడు కంపెనీల భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తున్నాయి. అందుకే హెచ్ఆర్ విభాగంలో కొత్త త‌ర‌హా విధానాలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. అందుకు అనుగుణంగానే హెచ్ఆర్ విభాగాన్ని బ‌లోపేతం చేసేందుకు కంపెనీలు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల ఎంపిక మొద‌లుకుని, ప‌ని వాతావ‌ర‌ణం, సౌక‌ర్యాలు, ఉత్పాద‌కత‌ మొదలైన విష‌యాల్లో ఎన్న‌డూ లేని కొత్త ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. ఒక‌వైపు ఆటోమేష‌న్, మ‌రోవైపు కృత్రిమ మేధను సొంతం చేసుకుంటూనే అదే స‌మ‌యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకోవడ‌మే కంపెనీ యొక్క అస‌లైన విజ‌యం. అందుకే కొద్దో గొప్పో బ‌ల‌హీన‌త‌లు ఉన్నా ఉద్యోగుల ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టేందుకు అధిక శాతం కంపెనీలు రెడీగా ఉన్నాయి.

 

 

ప్ర‌తిభ కలిగిన ఉద్యోగులే కంపెనీకి బ‌లం!

 

రీసెంట్ గా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ప్ర‌తిభ‌ను ప్రోత్సాహిస్తూ క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకున్న కంపెనీలు తమ పోటీ సంస్థ కంటే 15 శాతం ఎక్కువ ఉత్పాద‌క‌త‌ను సాధించాయ‌ని తేలింది. లాభాల‌ను సాధించాల‌న్నా, విలువ‌ను పెంచుకోవాల‌న్నా టాలెంట్ ను ఒడిసిప‌ట్టుకోవ‌డ‌మే కీల‌క‌మ‌న్న‌ది సీనియ‌ర్ హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ఒక ఉత్ప‌త్తిని ప్ర‌వేశ‌పెట్టినా లేక కొత్త బిజినెస్ మోడ‌ల్ ను లాంచ్ చేసినా అవి ఎక్కువ రోజులు మ‌నుగ‌డ సాగించ‌లేక‌పోతున్నాయి. అందుకే ఆవిష్క‌ర‌ణ‌, అభివృద్ధి అనేది ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌గా మారిపోయింది. కొత్త‌గా ఆలోచించకుంటే కంపెనీలకు మ‌న‌గ‌డ అన్న‌దే లేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగులను నియ‌మించుకోవ‌డం, వారిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవడం కంపెనీల‌కు అనివార్యంగా మారింది. నాణ్య‌త‌ను, ప్ర‌తిభ‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం అన్న విష‌యంలో ఏ కంపెనీ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటుంటే ఆ కంపెనీయే మార్కెట్లో ముందు ఉంటుంది.

ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను ఎలా గుర్తించాలి!

ప్ర‌తీ కంపెనీలో అర్ధ‌వంతంగా ప‌నిచేసే కొందరు ఉద్యోగులు ఉంటారు. వీరు సంస్థ‌పై న‌మ్మ‌కముంచి సంస్థ‌కు త‌మ వ‌ల‌న లాభం చేకూరాల‌న్న దృక్ఫ‌ధంతో ప‌నిచేస్తారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు, కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు వీరెప్పుడూ స‌దా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా త‌మ వృత్తికి గౌర‌వం ఇచ్చుకుంటూనే అదే స‌మ‌యంలో కంపెనీ ఉన్న‌తి కోసం పాటుప‌డతారు. ముఖ్యంగా కంపెనీకి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన ప‌నుల‌ను నేర్చుకునేందుకు, వాటిని విజ‌యవంతంగా అమ‌లు చేసేందుకు పూర్తి సంసిద్ధులుగా ఉంటారు. అయితే ఇటువంటి ఉద్యోగుల‌ను గుర్తించ‌డం అన్న‌ది కంపెనీ ముందున్న అతిపెద్ద స‌వాలు. ఇచ్చిన ప‌నిని నిజాయితీతో చేయ‌డం, కంపెనీ ల‌క్ష్యాల‌ను త‌న ల‌క్ష్యాలుగా భావించ‌డం, వృత్తిగ‌త జీవితాన్ని వ్య‌క్తిగ‌త జీవితాన్ని సమ‌న్వయం చేసుకోవ‌డం, మానిసికంగా చాలా ఆరోగ్యంగా ఉండ‌టం ఇటువటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ఒడిసిప‌ట్టుకునేందుకు వారిని కాపాడుకునేందుకు టాలెంట్ మేనేజ్ మెంట్ నిపుణులు ఏం చేస్తున్నార‌న్న‌దే కీల‌కం.

 

 

ప్ర‌తిభ ఉన్న‌ప్పుడు బ‌ల‌హీన‌త‌ల్ని ప్రేమించ‌డం నేర్చుకోవాలి!

అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కూ ప‌నిచేయించుకుంటార‌ని త‌ర్వాత వాళ్ల‌ను నిర్దాక్ష్యింగా బ‌య‌ట‌కు పంపుతార‌ని కార్పోరేట్ కంపెనీల‌పై ఒక అప‌వాదు ఉంది. అయితే ఇందులో వాస్త‌వం లేకుండా ఈ అప‌వాదు రాలేదు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వేళ్ల మీద లెక్క‌పెట్ట‌గలింగేంత మంది మాత్ర‌మే ఇప్పుడు టాలెంట్ ను క్ర‌మ‌శిక్ష‌ను, మ‌ర్యాద‌ను క‌లిగి ఉన్నారు. అటువంటి వారిని కాపాడుకోలేకోతే సంస్థ‌కు న‌ష్టం. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తిని కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు అతని బ‌ల‌హీన‌త‌ల‌ను కూడా అంగీక‌రించాలి. అత‌ని ప‌ని విధానం, మానసిన ప‌రిణితి, బాధ్య‌త ఇవ‌న్నీ స‌రిచూసుకుని అత‌ని ప్ర‌తిభ‌ను అంచనా వేయాలి. ఈ క్ర‌మంలో ప‌ని విష‌యంలో మంచి ప్ర‌తిభను చూపిస్తూ చిన్న చిన్న లోపాల‌ను క‌లిగి ఉన్నా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కంపెనీ త‌మ‌ను త‌గిన విధంగా గుర్తిస్తోంద‌ని వారు భావించిన‌ప్పుడు వాళ్లు మ‌రింత ఉత్సాహంతో పని చేస్తారు.

 

 

ప్ర‌తిభను కాపాడేందుకు ప్ర‌త్యేక‌మైన నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌!

 

ఇప్పుడు ప్ర‌తీ కంపెనీ ప్ర‌తిభ ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకుంటోంది. ఎందుకంటే టాలెంట్ ను గుర్తిస్తే స‌రిపోదు దానికి జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం అన్న‌ది చాలా క‌ఠిన‌త‌ర‌మైన విష‌యం. పోటీ కంపెనీల ప్ర‌లోభాలు, అంత‌ర్గ‌త రాజ‌కీయాలు వెర‌సి ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను చాలా సార్లు ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. అటువంటి స‌మ‌యంలోనే ప్ర‌తిభ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంది. నిన్ను గుర్తించామ‌ని చెపుతూ అత‌నికి కావాల్సిన ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించి అదే స‌మ‌యంలో భ‌రోసాను క‌ల్పించాలి. అప్పుడు అత‌ను మ‌రింత ఉత్సాహంగా సంస్థ కోసం ప‌నిచేస్తాడు. ఇక ఉన్న వాళ్ల‌ను కాపాడుకుంటూనే కొత్తగా వచ్చిన ఉద్యోగుల్లో స్పూర్తిని నింపి వాళ్ల‌ను ప్ర‌తిభావంతులుగా త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఉద్యోగుల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి దాన్ని స‌రైన విధానంలో వాడుకునే టాలెంట్ ఉన్న వారే అత్యున్న‌త స్థాయికి చేర‌గ‌లుగుతారు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్సర్ చేసిన‌వారు)