ఆ కీలక ‘మలుపు’ మీ జీవితాన్ని మార్చేస్తుంది!!

 

ఒక మ‌నిషి త‌న‌ వ్యక్తిగ‌త జీవితంలో కానీ అటు వృత్తి వ్యాపారాల్లో ఉన్న‌తంగా రాణించాలంటే క‌ష్టించే ల‌క్ష‌ణం ఉండాలి. క‌ష్టం, నేర్చుకోవాల‌న్న త‌ప‌న‌, నేర్చుకున్న దాన్ని ఆచ‌రించే నేర్పు మాత్ర‌మే విజ‌యవంత‌మైన మ‌నుష్యుల‌ను త‌యారు చేస్తాయి. కానీ కేవ‌లం క‌ష్ట‌ప‌డితే స‌రిపోదు.. దాన్ని ఎంత‌వ‌ర‌కూ కొన‌సాగించాలి అన్న అతి ముఖ్య‌మైన విష‌యం కూడా తెలిసి ఉండాలి. చాలా మంది క‌ష్ట‌ప‌డ‌తారు కానీ అస‌లైన ఫ‌లితం వ‌చ్చే కీల‌క స‌మ‌యంలో విర‌మించుకుంటారు. దీని వ‌ల‌న విజ‌యానికి దూర‌మ‌వుతారు. మ‌నం నీటిని 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కూ మ‌రిగిస్తే కానీ అది ఆవిర‌య్యే స్థితికి రాదు. అంటే మార్పు అనేది 100 డిగ్రీల వ‌ద్ద సంభ‌వించింది. 100 డిగ్రీల వ‌ద్దే నీరు ఆవిర‌య్యే స్థితికి చేరుకుంది కాబ‌ట్టి మిగిలిన 99 డిగ్రీల పాటు ఖ‌ర్చు చేసిన శ్ర‌మ అంతా వృధా అని కాదు. అంత‌వ‌ర‌కూ ఆ కృషిని ఒకే విధమైన‌ తీవ్ర‌త‌తో కొన‌సాగించ‌బ‌ట్టే 100 డిగ్రీల స్థాయికి చేరుకుని అనుకున్న ఫ‌లితం వ‌చ్చింది. అలాగే వ్యాపారంలో కానీ కెరీర్ లో కానీ అనుకున్న ఫ‌లితం రావాలంటే క‌ష్ట‌ప‌డ‌టాన్ని కొన‌సాగించాలి. కొద్ది రోజులు ప్ర‌య‌త్నం చేసి మ‌న వ‌ల్ల కావ‌డం లేదు, మంచి ఫ‌లితాలు, లాభాలు రావ‌డం లేద‌నుకుని ప్ర‌య‌త్నాన్ని నిలిపేస్తే కీల‌క‌మైన మార్పును చూసే స‌ద‌వకాశాన్ని కాల‌ద‌న్నుకున్న‌ట్టవుతుంది.

 

 

 

ఒక కీల‌క ఆవిష్కర‌ణ‌ను కొన‌సాగించ‌డ‌మే అభివృద్ధి!

 

మానవ ప‌రిణామ క్ర‌మాన్ని తీసుకుంటే అప్ప‌టివ‌ర‌కూ లేని ఒక ఆవిష్క‌ర‌ణను చేసి దాన్ని అదే తీవ్ర‌త‌తో కొన‌సాగించుకుంటూ వెళ్ల‌డం. ఈ అంశ‌మే సృష్టిలో మాన‌వున్ని తెలివైన జీవిగా నిల‌బెట్టింది. రాతి యుగం నుంచి ఇప్ప‌టి ఆధునిక యుగం వ‌ర‌కూ మ‌నం ఇంత‌టి అభివృద్ధి సాధించామంటే దానికి కార‌ణం ఈ ల‌క్ష‌ణ‌మే. గ్రాహంబెల్ టెలిఫోన్ క‌నిపెట్టాడ‌ని ఆ ఆవిష్క‌ర‌ణ అక్క‌డితో ఆగిపోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే ఆవిష్క‌ర‌ణ‌కు మార్పులు చేస్తూ అదే తీవ్ర‌త‌తో సెల్ ఫోన్, పేజ‌ర్, స్మార్ట్ ఫోన్ ఇలా మ‌నిషి స‌మాచార ఆవిష్క‌ర‌ణలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒక కొత్త విష‌యాన్ని పునాదిగా చేసుకుని దానిపై కొంగొత్త మార్పును నిర్మించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇన్ని స‌దుపాయాల‌తో స్మార్ట్ ఫోన్ ఉంద‌ని, గ్రాహంబెల్ టెలిఫోన్ ను త‌క్కువ చేయ‌డానికి వీలులేదు. స్మార్ట్ ఫోన్ ఆవిష్క‌ర‌ణకు మూలం టెలిఫోన్. క‌ష్టం అనే ముడి స‌రుకును ఉప‌యోగించి కీల‌క ద‌శ‌కు చేరుకునేందుకు నిరంత‌రం కృషి చేయ‌డమే అభివృద్ధి అంటే.

 

 

 

మార్పు సంభ‌వించే వ‌ర‌కూ నువ్వు బ‌రిలో ఉన్నావా?

 

అంద‌రికీ వ‌ర్తించే ఒక సాధార‌ణ ఉదాహ‌ర‌ణ‌ను తీసుకుంటే ..మ‌నలో చాలా మంది జిమ్ కు వెళుతూ ఉంటాం. కానీ కొంద‌రే జిమ్ కు వెళ్లే అల‌వాటును కొన‌సాగిస్తారు. అందులో కూడా కొంద‌రికే అనుకున్న‌ ఫ‌లితాలు వ‌స్తాయి. ఎందుకు? ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఫిట్ నెస్ ల‌క్ష్యాన్ని కొన‌సాగించ‌డం ఒక ఎత్తైతే, కీల‌క‌మైన, మార్పు సంభ‌వించే స‌మ‌యంలో క‌ష్టాన్ని ఓర్చుకోవ‌డం మ‌రో ఎత్తు. మ‌నం ఏదైనా ఒక శారీర‌క వ్యాయామం చేస్తున్న‌ప్పుడు చివ‌రి 30 సెక‌న్ల‌లో ఓర్చుకోలేని క‌ష్టం, శ్ర‌మ ఉంటాయి. దాన్ని త‌ట్టుకుని ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డ‌మే విజ‌యం. అలా త‌ట్టుకున్న వాళ్లే మంచి ఆరోగ్యాన్ని , శ‌రీరాకృతిని సొంతం చేసుకుంటారు. మొద‌టి రెండు నిమిషాలు బాగా వ్యాయామం చేసి మార్పు సంభ‌వించే చివ‌రి 30 సెక‌న్ల‌లో క‌ష్టాన్ని త‌ట్టుకోలేక దాన్ని మ‌ధ్య‌లో వ‌దిలిపెట్టే వాళ్లే ఎక్కువ‌. అందుకే ఫిట్ నెస్ విజేత‌లు చాలా త‌క్కువ మంది ఉంటారు. ఈ ఉదాహ‌ర‌ణ‌ను మ‌నం జీవితంలో అన్ని విష‌యాల‌కు అన్వ‌యించుకోవ‌చ్చు. వృత్తి , వ్యాపారం, వ్య‌క్తిగ‌త ఎదుగుద‌ల ఇలా దేనికైనా అన్వ‌యించుకోవ‌చ్చు. ఒక విష‌యం కోసం, ఒక ప‌ని కోసం, ఒక ల‌క్ష్యం కోసం ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌డు మొద‌టి నుంచి ఒకే తీవ్ర‌త‌తో ప‌నిచేస్తూ మార్పు సంభ‌వించే కీల‌క‌మైన స‌మ‌యంలోనూ దాన్ని ప‌ట్టువిడ‌వ‌కుండా కొన‌సాగించ‌గ‌ల‌గాలి. అప్పుడే విజేత‌గా మారేందుకు వీలుంటుంది.

 

 

కీల‌క‌మైన మార్పుకు ఒక్కసారిగా చేరుకోవాలంటే సాధ్యం కాదు!

 

చాలా మంది యువకులు, ఔత్సాహికులు ఇప్పుడు వ్యాపారంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే ఓపిక, కష్టాన్ని ఎంత వరకూ కొనసాగించాలన్న కీలకమైన దశలో వాళ్లు విఫలమవుతున్నారు. వ్యాపారంలో రాణించాలంటే కష్టపడటం ఒక్కటే సరిపోదు. దాన్ని ఎంతకాలం కొనసాగించాలి? ఏ స్థితిలో ఫలితాలు రాబట్టుకుంటాయ్ అన్నదానిపై వాస్తవ సదృశ్యమైన అవగాహన ఉండాలి. వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే మొదటి ఎటువంటి లాభం రాలేదు అనుకుందాం. ఇటువంటి సందర్భంలో చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే పని చేసా కానీ ఫలితం రాలేదు అనుకుంటారు. అలాగే నేను సమయం వృధా చేసాను. నేను సరిగా వ్యాపారం చేయలేదు..ఇలాంటి ఆలోచనలతో మధన పడుతూ ఉంటారు. అది చాలా తప్పు ఆలోచన. నువ్వు ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వెంటనే అనుకున్న ఫలితాలు రావు. కష్టాన్ని కొనసాగించినప్పుడు ఒక స్థాయి దగ్గర ఫలితాలు రావడం మొదలుపెడతాయి. అంతకు ముందు చేసిన కష్టం వల్లనే అది సాధ్యమైంది. అంత వరకూ ఓపిగ్గా, ఒక వ్యూహంతో ఉండటమే విజయం. ప్రకృతి కూడా మనకు వేచి ఉండి సాధించాలన్న సూత్రాన్ని నిర్దేశించింది. మనిషి తన భాగస్వామితో భావోద్రేకం చెంది శృంగారం చేయాలన్నా..అందులోని ఆనందాన్ని అనుభవించాలన్నా..చివరి స్థాయి వరకూ వేచి ఉండాల్సిందే. వేచి చూస్తున్నావా? కష్టపడుతున్నావా? అన్న విషయాలే చివరకు నీ విజయాన్ని నిర్దేశిస్తాయి.

 

 

గెలుపుకు, ఓటమికి మధ్య తేడా కొన్ని సెకన్లు మాత్రమే!

 

మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కోసం తెలుసు. పరుగు పందెంలో ఎన్నో ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్న ఉసేన్ 100 మీటర్ల పరుగులో తన ప్రత్యర్ధుల కంటే కేవలం ఒకట్రెండు సెకన్ల ముందుంటాడు. కేవలం ఒకటి రెండు సెకన్లు మాత్రమే విజేతలను నిర్ణయిస్తాయి. చివరి స్థాయిలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారన్నదే ఇక్కడ కీలకం. పరీక్షలు, వ్యాపారం ఏదైనా బాగా కష్టపడి ఒక కీలకమైన మలుపు వరకు వేచి చూసినప్పుడే ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు వచ్చే ముందు తలెత్తే సమస్యలు ఎదుర్కొని ధైర్యంగా ఎవరు వేచి చూస్తారో వారే విజేత. మార్పు అనేది సహజం. అది సంభవించేందుకు కొంత సమయం పడుతుంది. విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చివరి నిమిషం వరకూ వేచి చూసి, ఓపిక వహించాలి. పన్నెండేళ్ల పాటు తెలంగాణా ఉద్యమాన్ని కెసీఆర్ మధ్యలో ఎన్నో కష్టాలు వచ్చినా పార్టీని అలా కొనసాగించాడు. చివరికి ఫలితం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఇంకెందుకులే అని నిరాశ చెందితే అత్యున్నత స్థాయికి ఎప్పటికీ చేరుకోలేం. కష్టపడు..ఓర్చుకో..కీలకమైన మలుపు దగ్గర మరింతగా శ్రమించు..విజయం నీ మీ వెంటే ఉంటుంది.

 

 

( ఈ ఆర్టికల్ మీకు స్పాన్సర్ చేసిన వారు) 

 

 

బాగా కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏంటో తెలుసా?

 

 

ఇప్పుడు మ‌న దేశంలో మాద‌క ద్ర‌వ్యాలు అతిపెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లుగా మార‌డంతో ఉత్సాహంతో ఉర‌క‌లెత్తాల్సిన యువ‌త, జ‌వ‌స‌త్వాలు ఉడిగి య‌వ్వ‌నంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వ‌మైపోతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా కుటుంబాల‌కు కుటుంబాలే నాశ‌న‌మై ఆ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు ఎన్ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చినా మ‌న దేశంలో ఇప్ప‌టికీ మాద‌క ద్ర‌వ్యాలు సులువుగానే దొరుకుతున్నాయి. ఒకవైపు దేశానికి వెన్నుముక లాంటి యువ‌త మాద‌క‌ద్ర‌వ్యాల సేవ‌నంతో ప‌త‌న‌మ‌వుతుంటే మ‌రోవైపు పాల‌కులు మాత్రం ఇంకా నిషేధం అన్న ద‌గ్గ‌రే నిలిచిపోయారు. అయితే మాదక ద్ర‌వ్యాలపై ఎప్ప‌టి నుంచో నిషేధం ఉన్న‌ప్ప‌టికీ అవి యువ‌త‌కు ఎలా అందుబాటులోకి వ‌స్తున్నాయి? అస‌లు అన్నింటికంటే ముఖ్యంగా కేవ‌లం మాద‌క ద్ర‌వ్యాల‌ను నిషేధిస్తే ఈ పెను స‌మ‌స్య ప‌రిష్కార‌మైపోతుందా? అన్న ప్ర‌శ్న‌లు అతిపెద్ద చ‌ర్చ‌నీయాంశాలు. ఈ నేపథ్యంలో మాద‌క ద్ర‌వ్యాలు, యువ శ‌క్తిపై “కెరీర్ టైమ్స్” ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

నిషేధం అన్న ప‌ద‌మే అతిపెద్ద మాద‌క‌ద్ర‌వ్యం!!

 

మ‌నిషి ఆలోచ‌నా విధానం, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌, వికాసం అన్న‌వి అత్యంత సంక్లిష్ఠ‌మైన విష‌యాలు. మానసిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఫలానా ప‌నిచేయొద్దు..ఫ‌లానా వ‌స్తువును తినొద్దు…ఫ‌లానాది తాకొద్దు, చూడొద్దు..అంటూ నియంత్ర‌ణ‌లు విధిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ప‌ని చేయాల‌ని..వ‌ద్దు అన్న‌దాన్నే తినాల‌ని..తాకొద్దు అన్నదాన్నే తాకాల‌ని..చూడొద్దు అన్న దాన్నే చూడాల‌ని మ‌నిషి మ‌న‌స్సు ఉబ‌లాట‌ప‌డుతుంది. ముఖ్యంగా నియంత్ర‌ణ విధించిన ఆ ప‌నులపై అర‌కొర స‌మాచారం, త‌ప్పుడు స‌మాచారం వాటిపై మ‌రింత ఆక‌ర్ష‌ణ పెరిగేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలాగైనా తినాల‌ని, వాటిని సాధించి అందులోని మ‌జాను ఆస్వాదించాల‌ని మ‌న‌స్సు ఉవ్విళ్లూరుతుంది. మాద‌క ద్ర‌వ్యాల విష‌యంలో ఇప్పుడు స‌రిగ్గా ఇలానే జ‌రుగుతోంది. వాటికి నిషేధం అన్న ముసుగు వేయడంతో ఆ ముసుగు వెన‌కాల అద్బుత‌మైన ఆనందం దాగి ఉంద‌ని యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించే అరాచ‌క శ‌క్తులు ఎక్కువైపోయాయి. దీంతో యువ‌త డ్ర‌గ్స్ ఏదో అద్భుతం దాగి ఉంద‌న్న ఆక‌ర్ష‌ణ‌తో జీవితాల‌ను స‌ర్వ నాశ‌నం చేసుకుంటున్నారు.

 

 

మ‌న రోజువారీ జీవితంలోనూ మాద‌క ద్ర‌వ్యాలు ఉన్నాయి!

 

మ‌న రోజూవారీ జీవితంలో మాద‌క ద్ర‌వ్యాలు ఉండ‌ట‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును మీరు చ‌దివింది నిజ‌మే. అస‌లు మాద‌క ద్ర‌వ్యం అంటే ఏమిటి? ఒక ప్ర‌త్యేక‌మైన రసాయ‌నాన్ని శ‌రీరంలోకి ఎక్కించుకుని అది అందించే మ‌త్తులోకి జారిపోవ‌డ‌మే క‌దా? మాద‌క ద్రవ్యాలు అంటే కొకైన్, హెరాయిన్, గంజాయి వంటివే కాదు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో వాడే కొన్ని ర‌కాల మందులు కూడా మాద‌క ద్ర‌వ్యాలు కింద‌కే వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు షుగ‌ర్ పెషెంట్ల‌కు వాడే కొన్ని ర‌కాల ముందులను డ్ర‌గ్స్ గానే ప‌రిగ‌ణించాలి. అంటే ఆరోగ్యానికి చేటు చేస్తాయ‌ని కాదు. మ‌నిషి ఆ ముందులు వేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డి స‌హ‌జ సిద్ధంగా శారీర‌క వ్యాయామం చేసి మంచి స‌మ‌తుల ఆహారం తీసుకుని జీవ‌నశైలిని మార్చుకుని షుగ‌ర్ ను అదుపులోకి తెచ్చుకుందాం అన్న ఆలోచ‌న మ‌ర్చిపోతున్నాడు. కేవ‌లం ఆ డ్ర‌గ్స్ ను శ‌రీరంలో వేసుకుని వాటికి అల‌వాటు ప‌డి అందులోనే జోగుతున్నాడు. అలాగే ప్ర‌స్తుతం మ‌నిషి జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోష‌ల్ మీడియా వంటి వాటిని కూడా మాద‌క ద్ర‌వ్యాలు గానే ప‌రిగ‌ణించాలి. అవి లేకుంటే ఒక్క‌క్ష‌ణం కూడా మ‌నుగ‌డ సాగించలేని మ‌న బ‌ల‌హీత‌నను డ్ర‌గ్స్ సేవ‌నంతో స‌మాన‌మైన వ్య‌స‌నంగానే చూడాల్సి ఉంటుంది.

 

 

నిషేధంతో మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డి సాధ్యం కాదు!

 

నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్ర‌వ్యాల స‌మ‌స్య అంతం కాదు. ఎందుకంటే వాటిని దొంగ దారిలో యువ‌త‌కు చేర‌వేసే ఆరాచ‌క శ‌క్తులు లెక్క‌కు మించి ఉన్నాయి. నిషేధం అనేది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేయవ‌ల‌సిన ప‌ని నిషేధంతో పాటు స‌మ‌స్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం. పాఠ‌శాల స్థాయి నుంచే పిల్ల‌ల‌కు ధ్యానం, యోగా, కుటుంబ విలువ‌లు, శారీర‌క, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. ధ్యానం చేయడం ద్వారా ల‌భించే అలౌలిక ఆనందం ముందు డ్ర‌గ్స్ అందించే మ‌త్తు బ‌లాదూర్. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో పిల్ల‌ల‌ను సుక్షితులుగా త‌యారు చేయాలి. ఇటు త‌ల్లిదండ్రులు కూడా డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా కాకుండా త‌మ పిల్ల‌ల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించి వారి పెంప‌కంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారి అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న పై త‌గు నిఘా ఉంచి అదే స‌మ‌యంలో వారికి ధ్యానం, మ‌న‌స్సుని నియంత్రించే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెపుతూ ఉండాలి. తాత్కాలిక ఆనందాలు, సుఖాలు త‌ర్వాత జీవితాన్ని ఎంత‌గా ప్ర‌భావితం చేస్తాయో, ఎటువంటి ప‌త‌నావ‌స్థ‌కి చేరుస్తాయో వారికి స‌రైన ప‌ద్ధ‌తిలో వివ‌రించాలి. ముఖ్యంగా విలువ‌ల‌తో కూడిన పెంప‌కాన్ని అందించాలి.

 

 

న‌మ్మ‌కంలోని మజాతో జీవితానికి కొత్త చిగురులు!

 

ఒక రోగి తీవ్ర‌మైన శారీర‌క రుగ్మ‌త‌తో డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అత‌న్ని క్షుణ్ణంగా ప‌రీక్షించిన డాక్ట‌ర్ ఇంకో మూడు నెల‌లు మించి మీరు బ‌త‌కడం సాధ్యం కాద‌ని రోగికి స్ప‌ష్టం చేసారు. దీంతో ఆ రోగి మాన‌సికంగా మ‌రింత‌గా దిగ‌జారిపోయాడు. అత‌ను ఎంత‌గా దిగ‌జారిపోయాడంటే క‌నీసం డాక్ట‌ర్ చెప్పిన మూడు నెల‌లైనా బ‌తుకుతాడా? అన్న సందేహం అంద‌రికీ క‌లిగింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆ రోగిని ప‌రామ‌ర్శించేందుకు అత‌ని స్నేహితుడు హాస్పిట‌ల్ కు వెళ్లాడు. వృత్తిరీత్యా సైకాల‌జిస్ట్ అయిన రోగి స్నేహితుడు అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించాడు. అత‌నికి శారీర‌క స‌మ‌స్య కంటే మానసిక స‌మ‌స్య అధికంగా ఉన్న‌ట్టు గుర్తించాడు. త‌న స్నేహితుడ్ని హాస్ప‌ట‌ల్ నుంచి ప్ర‌కృతికి ప్ర‌శాంత‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక ఇంట్లోకి మార్పించాడు. అత‌ని మంచం ప‌క్క‌నే కిటికీ ఉండేట‌ట్టు చూసి అక్క‌డ ఒక మొక్క‌ను నాటాడు. అప్పుడు ఆ రోగితో ఇలా చెప్పాడు. “ఇప్పుడు ఇక్క‌డ ఒక మొక్క‌ను నాటాను. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే నువ్వు కూడా నీ జ‌బ్బు నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టే. ఒకవేళ మొక్క చ‌నిపోతే నువ్వు కూడా తొంద‌ర‌గా చ‌నిపోతావ్” అని చెప్పాడు. ఆ రోగి ప్ర‌తిరోజూ ఉద‌యం లేవ‌గానే ఆ మొక్క వంక ఆశ‌గా చూసేవాడు. ఆ మొక్క మెల్ల‌గా ఆకులు, పూలు కాస్తూ ఏపుగా పెరుగుతోంది. రోగిలో ఆనందం పెరిగింది. త‌న మొక్క ఎంత బాగా పెరుగుతుంది అన్న ఆనందంలో అత‌ను త‌న జ‌బ్బు సంగ‌తే మ‌ర్చిపోయాడు. ఆరోగ్యంగా పెరిగిన ఆ మొక్క‌లానే అత‌ను కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. వాస్త‌వానికి మొద‌ట నాటిన మొక్క తొలిరోజే చ‌చ్చిపోయింది. కానీ రోగికి తెలియ‌కుండా అతని ఒక కొత్త మొక్క‌ను నాటి దానికి త‌గిన నీరు, ఎరువులు వేసి అది బాగా ఎదిగేలా చూసుకున్నాడు. మొక్క బాగా పెరుగుతుంద‌న్న సంతోషంలో రోగి కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. ఈ క‌థ‌లో నీతి ఏంటి మ‌నలోని న‌మ్మ‌కం, ఆనంద‌మే మ‌న స్థితిని నిర్ణ‌యిస్తాయి. అయితే ఆ ఆనందాన్నిఏ విధంగా సంపాదించుకుంటామ‌న్న‌దే ముఖ్యం. మాద‌క ద్ర‌వ్యాలు తీసుకుని, తాత్కాలిక ఆనందాల కోసం వెంప‌ర్లాడితే ఆనందం, ఆరోగ్యం రెండూ దూర‌మ‌వుతాయి.

 

 

మాద‌క ద్ర‌వ్యాల కంటే కిక్ నిచ్చే సాధ‌నాలున్నాయి!!

 

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌ద్య‌పానం కిక్ నిస్తున్నాయి కాబ‌ట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్ కోస‌మే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. కొంద‌రు వాదిస్తారు. కానీ వాస్త‌వానికి వాటి కంటే కిక్ నిచ్చే విష‌యాలు ఎన్నో ఉన్నాయి. ఒక గంట‌సేపు క‌ద‌ల‌కుండా ఒకచోట కూర్చుని , ఒక విష‌యంపై శ్ర‌ద్ధ పెట్టి త‌దేకంగా ధ్యానం చేస్తే వ‌చ్చే కిక్ ఎన్ని మాద‌క ద్ర‌వ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి ప‌ని చేసిన‌ప్పుడు, సాటి మ‌నిషికి ఉపకారం చేసిన‌ప్పుడు, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌వాళ్ల‌కు క‌డుపునిండా అన్నం పెట్టిన‌ప్పుడు వ‌చ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విష‌యాల‌ను ప్ర‌తీ విద్యార్ధికి అటు త‌ల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్న‌త‌నం నుంచి చెప్ప‌గ‌ల‌గాలి. ఇక ప్ర‌భుత్వాలు కూడా మాద‌క ద్ర‌వ్యాల వంటి పెను స‌మ‌స్య‌ల‌కు నిషేధం అన్న ప‌రిష్కారం మార్గం ద‌గ్గ‌ర ద‌గ్గ‌రే ఆగిపోకుండా స‌మ‌స్య మూలాల‌ను అర్ధం చేసుకుని , విలువలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో విద్యార్ధులకు మ‌రింత శిక్ష‌ణ ఇచ్చేందుకు విద్యా విధానంలో త‌గిన మార్పులు చేయాలి. అప్పుడు డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి ఎటువంటి నిషేధం అవ‌స‌రం లేకుండానే మ‌న దేశాన్ని వీడిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

పిల్లలను చదువుకు దూరం చేసే ఏ సిద్ధాంతమైనా పనికిమాలినదే!

 

ఒకప్పుడు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం అనేది అంతర్లీనంగా ఉండేది. కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమైనప్పటికీ చాలా మంది విద్యార్ధులు దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. అయితే విప్లవ సాహిత్యంతో తీవ్రంగా ప్రభావితమైన వారు, తాము నమ్మిన సిద్ధాంతమే పూర్తిగా సరైనది అనుకునేవాళ్లు, అన్యాయం జరిగిన వాళ్లు, ఒక వాదాన్ని పూర్తి స్థాయిలో అథ్యయనం చేయని వాళ్లు తీవ్రవాదులుగా మారేవారు. అయితే ఆ తర్వాత రాను రానూ బాగా చదువుకున్న వాళ్లు ఉన్నత విద్యా వంతులు కూడా సమాజంలో జరుగుతున్న దోపీడికి తీవ్రవాదులుగా మారి హింస ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దీని వలన మన దేశంలో మావోయిస్టు తీవ్రవాదులు బాగా పెరిగిపోయారు. వారి సిద్ధాంతాలను, భావజాలాలను విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ రాజ్యానికి, రాజ్య వ్యతిరేక శక్తులకు జరుగుతున్న పోరాటంలో అమాయకులు, చిన్నపిల్లలు బలైపోవడం అన్నది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనులు విమర్శలపాలవుతున్నాయి. చదువు లేకుండా ఒక మనిషి అభివృద్ధి సాధించడం అన్నది అసాధ్యం. ఆదివాసీల పిల్లలకు చదువు అందుకుండా స్కూళ్లను పేల్చేయడం వంటి చర్యల ద్వారా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు తామే తూట్లు పొడుచుకుంటున్నారు.

 

 

విద్య‌కు వ్య‌థ‌గా మారిన తీవ్ర‌వాదం!

 

తీవ్ర‌వాదంతో బాగా న‌ష్ట‌పోయిన దేశాల జాబితాలో మ‌న దేశం కూడా ఉంది. కశ్మీర్ తీవ్ర‌వాదులు మొదులుకుని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు, బోడో తీవ్ర‌వాదులు, మావోయిస్టులు ఇలా తీవ్రవాద సంస్థ‌ల జాబితా చాలానే ఉంది. ప్ర‌స్తుతం అందులో కొన్ని సంస్థ‌లు క‌నుమ‌రుగైనా ఇప్ప‌టికీ టెర్రరిజం బాధిత దేశాల్లో ఇండియా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదం మూలంగా ప్ర‌జ‌ల సామాజిక, భౌగోళిక‌, ఆర్థిక స్థితిగ‌తులు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా మంది పిల్ల‌లు విద్య‌కు దూర‌మై చివ‌ర‌కు తీవ్ర‌వాదులుగా మారుతున్న వైనం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డం వ‌ల‌న పిల్ల‌లు చెట్లు కింద చ‌దువుకునే దుస్థితి దాపురించింది. తీవ్ర‌వాదుల దాడుల భ‌యంతో కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా మూత‌బ‌డ్డాయి. దీంతో విద్యార్ధులు చ‌దువుకునే అవ‌కాశాన్ని కోల్పోతున్నారు. ఒక‌వైపు పేద‌రికం మ‌రోవైపు చ‌దువుకునే వెసులుబాటు లేక‌పోవ‌డంతో చాలా మంది టీనేజ్ పిల్ల‌లు నేర‌గాళ్లుగా మారి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తూ చివ‌రికి తీవ్రవాదంపై మొగ్గు చూపుతున్నారు.

 

 

పూర్తిగా ప‌డ‌కేసిన విద్య!

 

బీహార్ లోని మావోయిస్ట్ ప్ర‌భావిత జిల్లాల్లో ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంది. తీవ్రవాదులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డంతో పాటు టీచ‌ర్ల‌ను కూడా భ‌య‌పెట్ట‌డంతో చాలా మంది ఉపాధ్యాయులు సుధీర్ఘ సెల‌వులు పెట్టి విధుల‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. దీంతో పిల్ల‌లు స్కూల్ మొఖం చూడ‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొన్ని స్కూళ్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ మొత్తం అన్ని త‌రగతుల‌ను ఒకే రూమ్ లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఏం వింటున్నామో తెలియ‌క విద్యార్ధులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. 500 మందికి పైగా విద్యార్ధులు ఉన్న స్కూళ్లు కూడా ఇప్పుడు కేవ‌లం 100 మంది విద్యార్ధుల‌కే ప‌రిమిత‌మైపోయాయి. మ‌రోవైపు మావోయిస్టుల‌కు భ‌య‌పడి చాలా మంది టీచ‌ర్లు కూడా విధుల‌కు రావ‌డం మానుకున్నారు. దీంతో స‌రైన నిర్వ‌హ‌ణ లేక బీహార్, ఝార్ఖండ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా స్కూళ్లు మూత‌పడ్డాయి. మిగిలిన స్కూళ్లు కూడా ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు వ‌చ్చిన విద్యార్ధులు రాక భవంతులు లేక చెట్ల కింద కాలం వెళ్ల‌దీస్తున్నాయి.

 

 

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

 

ప్ర‌స్తుతం బీహార్, ఝార్ఖండ్, ఒడిషాల‌లో మావోయిస్టుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో పోలీసులు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా కాస్త విజ‌య‌వంత‌మ‌య్యారు. దీంతో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేసిన ఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. అయినా ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన ప్రాంతాల్లో మాత్రం ప‌రిస్థితి అలానే ఉంది. పేల్చేసిన స్కూల్ భ‌వ‌నాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. మావోయిస్టులతో ప్రాణ భ‌యం ఉంద‌ని చాలా మంది స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో చాలా స్కూళ్లు తాత్కాలిక శిబిరాల్లోనూ, చెట్ల కింద న‌డుస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక చ‌దువులు కాస్త వ‌ర్షాకాలం చ‌దువులుగా మారిపోయాయి. ఎండ కాసినా , వ‌ర్షం ప‌డినా స్కూళ్లను పూర్తిగా మూసివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో పిల్ల‌లు పూర్తి స్థాయిలో చ‌ద‌వ‌లేక చ‌దువుకోక ప్రాథ‌మిక స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీంతో దేశంలోనే ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ స్వాతంత్ర పూర్వం నాటి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పోలీసు రక్షణలో చాలా వరకూ స్కూళ్లు నడుస్తున్నాయి. అయితే పోలీసులే నిజమైన విలన్లని మావోయిస్టులు చెపుతున్నారు. అణిచివేత ద్వారా స్కూళ్లను తెరిపించినా పెద్దగా ఉపయోగం లేదన్నది వారి వాదన. అయితే రాజ్యం, సమసమాజ స్థాపన వంటి సిద్ధాంతాల వలన మధ్యలో పిల్లలు చదువులేకుండా నష్టపోతున్నారన్న ప్రశ్నకు మావోయిస్టుల దగ్గర సమాధానం లేదు.

 

 

ఆధిపత్య ధోరణులతో పిల్లలు నలిగిపోతున్నారు!

 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం అన్ని రకాల సంబంధాలకు దూరంగా ఉన్న మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి కమ్యూనికేషన్ లేని గ్రామాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు మావోయిస్టుల చెప్పిన మాటలకు, సాహిత్యానికి ప్రభావితమవుతున్నారు. అయితే హింసా మార్గం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపించినా అవి మనుగడ సాగించలేవని గతంలోనే తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంటుంది.తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, మారుమూల గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. అవి నత్తనడకన సాగడంతో ప్రజలు మావోయిస్టులే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. మరోవైపు తీవ్రవాదులకు, పోలీసులకు జరుగుతున్న పోరాటంలో చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు స్కూళ్లను పేల్చివేయడంతో వాళ్లు విద్యకు దూరమవుతున్నారు. తర్వాత క్రమంగా తీవ్రవాదులుగా మారుతున్నారు. ఈ పరిణామం అస్సలు సహేతుకం కాదు. అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే చర్యలు మాని వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

ఇ’లా’ చేస్తే జాబ్ మార్కెట్లో మీరే కింగ్!!

 

ఇప్పుడు ఏదో ఒక మామూలు డిగ్రీ చ‌దివితే జాబ్ మార్కెట్లో కానీ వ్యాపార నిర్వ‌హ‌ణ లో కానీ మ‌నుగ‌డ సాగించే వీలులేదు. ముఖ్యంగా వివాదాలు పెరిగిపోయిన ప్ర‌స్తుత నేప‌థ్యంలో విష‌యంపై సంపూర్ణ అవగాహ‌న తెచ్చుకుంటే కానీ అందులో విజ‌యం సాధించలేం. ఇటువంటి ప‌రిస్థితుల్లో లా కోర్సుల‌కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ప్రతీ విషయానికి లాయర్లను ప్రత్యేకంగా నియమించుకుని వాళ్లకు ఫీజులు ఇవ్వడం అనేది చాలా వ్యయంతో కూడుకున్న పని. దీంతో పలువురు తమ కెరీర్ కు చదువుకు లా డిగ్రీని అదనంగా సమకూర్చుకుంటున్నారు. తాము ఉన్న రంగంలో ఉన్న ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే తామే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు తగిన వీలు దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తమ ప్రధాన డిగ్రీకి అదనంగా లా డిగ్రీని కూడా సమకూర్చుకుంటున్నారు. ముఖ‌్యంగా ఆర్ధిక రంగంలో వచ్చిన సరళీకరణల నేపథ్యంలో బిజినెస్ లా కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక కంపెనీలు అయితే స్పెషలైజేషన్ లా డిగ్రీ ఉన్న అభ్యర్ధులను ఉద్యోగం లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

 

 

‘లా’ విద్యకు డిమాండ్ పెరిగింది !

 

గతంలో ఒక వెలుగు వెలిగిన లా చదువు తర్వాత మసకబారింది. లాయర్ గా కెరీర్ లో కుదురుకోవడానికి సుధీర్ఘ సమయం పట్టడం వంటి ఇబ్బందులో లా కోర్సులు చదివేందుకు విద్యార్ధులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ మళ్లీ ఇప్పుడు లా కు పూర్వ వైభవం వచ్చింది. ముఖ‌్యంగా ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక సరళీకరణలు, ప్రభుత్వ రెగ్యుటేరీ వ్యవస్థల వలన లా గ్రాడ్యుయేట్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిజినెస్ లా చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీరిని భారీ జీతాలిచ్చి ప్రత్యేకంగా నియమించుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మన దేశంలో స్టార్టప్ ల హవా మొదలైన నేపథ్యంలో లా చేసిన వారికి అవకాశాలే అవకాశాలు. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇప్పుడు వ్యాపారం నెట్టుకు రావాలంటే ఎన్నో విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు లా గ్రాడ్యుయేట్లకు వరంలా మారింది.

 

 

పెట్టుబడులు, వ్యాపార లావాదేవీల్లో ‘లా’ యే కీలకం !

 

ఆర్థిక సంస్కరణలు ఉపందుకోవడంతో మన దేశంలో ఇప్పుడు లా కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, అందులో ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలన్నా లా యే కీలకం. దీంతో పాటు లా తో సంబంధం ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, పవర్ , సివిల్ ఏవియేషన్, షిప్పింగ్ , మీడియా, రియల్ ఎప్టేట్, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ సమర్ధులైన లాయర్ల అవసరం ఉంది. అందుకే కీలక స్థానాల్లో లా చదివిన ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. లా తెలియడం అనేది వ్యాపార నిర్వహణలో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అర్హతగా మారిపోయింది. ఒక వివాదంలో టాటా గ్రూప్ కంపెనీపై ఒక చిన్న స్టార్టప్ న్యాయ వివాదంలో విజయం సాధించడం దేశంలో పెద్ద సంచలనంగా మారింది. టాటాల దగ్గర పెద్ద లాయర్ ఉన్నా ఆ చిన్న స్టార్టప్ నిర్వాహకుడు కార్పోరేట్ లా లో నిష్ణాతుడు కావడం టాటా గ్రూప్ కేసు ఓడిపోయి నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.

 

 

పెంచుకుంటే పెరుగుతుంది’లా’..!

ఇప్పుడు ప్రధాన డిగ్రీకి అదనంగా లా చదవడం అనేది క్రమంగా ట్రెండ్ గా మారుతోంది. బీటెక్ తర్వాత లా అలాగే ఎంబీయే ప్లస్ లా, బీ ఆర్క్ ప్లస్ అనే ట్రెండ్ నడుస్తోంది. ప్రధాన ప్లాట్‌ఫామ్ కు అదనంగా లా పై అవగాహన ఉండటం అనేది ప్రధాన అర్హతగా మారుతుతోంది. ఈ విషయాన్ని కంపెనీలు కూడా గుర్తిస్తున్నాయి. మరోవైపు సొంతంగా కంపెనీ పెడదామని ఆలోచన ఉన్న వారు తమ వివాదాలను తాము పరిష్కరించుకునేందుకు అదే సమయంలో ఏ లోసుగులు లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు లా అర్హతను పెంచుకుంటున్నారు. ఇక పలు కార్పోరేట్ సంస్థల్లో అయితే లా అభ్యర్ధులకు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఫండ్ రైజింగ్ , షేర్లు, జాయింట్ వెంచర్లు, మెర్జర్లు వంటి వ్యాపార విషయాల్లో న్యాయ నిపుణులు సలహాలు కీలకం కావడంతో లా చదివిన వారికి ఎన్నో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

 

 

 

 

 

 

‘ఎక్స్‌ట్రా’ లు చేస్తున్నారా? అయితే మీకు జాబ్ వచ్చినట్టే..!!

 

ప్రస్తుతం హెచ్ఆర్ నిపుణులు చెప్పే మాట ఒకటే. జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. కంపెనీల ఆలోచనా తీరులో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ను ఉద్యోగంలోకి తీసుకోవడంలో కంపెనీలు గతంలోలా వ్యవహరించడం లేదు. విభిన్న విషయాలను, అంశాలను బేరీజు వేసుకుని దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రజంట్ ఇంటర్వ్యూలలో కేవలం అకడమిక్ రికార్డును మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మార్కులు కాస్త తక్కువ ఉన్నా అభ్యర్ధిలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కావాల్సింది ఆల్‌రౌండర్లు. పనిచేస్తూనే అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ మెసిలే సిసలైన నాయకులు కావాలి. కాబట్టి ఇప్పుడు బాగా మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న ఆలోచనను విద్యార్ధులు తొలిగించుకోవాలి. చదువుతో పాటు ఆటల్లో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లలో చురుగ్గా ఉండాలి.

 

 

కంపెనీలు ఎందుకు ఈ ఎక్స్‌ట్రా లను కోరుకుంటున్నాయి?

 

మన దేశంలో చదువు అంటే కేవలం మార్కులే కానీ విదేశాల్లో అయితే చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వాస్తవానికి అవే విద్యార్ధి దశలో చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక విద్యార్ధిలోని నిజమైన నాయకుడ్ని, సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఆవిష్కరించేవి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ మాత్రమే. అందుకే కంపెనీలు ఈ లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సంస్థలో విధులు నిర్వర్తించే క్రమంలో ఏమైనా సమస్యలు ఎదురైతే అభ్యర్ధులు చాలా వేగంగా స్పందిస్తారని కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే రెజ్యుమెలో కాలేజీలో ఈవెంట్లు నిర్వహణ, ఇతర అదనపు అర్హతలు వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. కంపెనీల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై శ్రద్ధ పెట్టాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నో..!

 

ప్రస్తుతం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై కళాశాలల్లో కాస్త అవగాహన పెరిగింది. ఇప్పుడు కావాల్సిందల్లా విద్యార్ధులు తగిన చొరవ తీసుకోవడమే. కళాశాలల్లో ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం, అదే విధంగా కల్చరల్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా ఇన్‌స్టిట్యూట్ లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను నడిపించే ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకోవడం వంటి వాటి వలన టీమ్ ను ఎలా నడపాలో, గడువు లోగా పనులు ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్ లో కల్చరల్ సొసైటీ కాన్సెప్ట్ నడుస్తోంది. అకడమిక్స్ లో విద్యార్ధులు పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలైన సీఐఐ, నాస్కామ్, ఫిక్కీ, అసోచామ్ లలో స్టూడెంట్ మెంబర్‌షిప్ తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా సంస్థలు నిర్వహించే సెమినార్లలో పాల్గొనడం ద్వారా నిపుణులను, ఉన్నత వ్యక్తులను కలుసుకుని వారి నుంచి సలహాలు పొందడంతో పాటు స్పూర్తిని కూడా పొందే వీలుంటుంది. అలాగే వాలంటీర్ సర్వీస్ లు కూడా చేస్తే సమాజంలో ఏం జరుగుతోంది. ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్న దానిపై అవగాహన పెరుగుతుంది. వీటన్నింటిని రెజ్యుమెలో పొందుపర్చుకుంటే అవే ఇప్పుడు ప్రధాన అర్హతలుగా మారుతున్నాయి.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఎన్నో లాభాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై చాలా మంది తల్లిదండ్రులకు కూడా సదభిప్రాయం లేదు. వీటి వలన పిల్లల చదువు పాడవుతుందని చాలా మంది పేరెంట్స్ భావిస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం పూర్తి తప్పు. వీటిల్లో పార్టిసిపేట్ చేయడం వలన విభిన్న వ్యక్తులతో కలివిడిగా మాట్లాడటం అలవడి బెరుకు అన్నది పోతుంది. అలాగే నలుగురితో మాట్లాడటం వలన సమస్యను పరిష్కరించే విధానం, మనుష్యులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓవరాల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి దిట్టలుగా నిలబడగలుగుతారు. అదే విధంగా ఒక కార్యక్రమంలో ఎంతో మందిని సమన్వయం చేయాల్సి రావడంతో మంచి లీడర్‌షిప్ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెద్ద పెద్ద సెమినార్స్ లో షెడ్యూల్స్ ను ఖరారు చేయడం, ప్రతినిధులకు తెలియజేయడం వంటి వాటి వలన సమన్వయ సామర్ధ్యం పెరుగుతుంది. ఇవన్నీ రెజ్యుమెలో ఉంటే కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకోకుండా ఉండలేవు.

 

 

విద్యార్ధులకు ఎన్నో ఉపయోగాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వలన విద్యార్ధులకు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాలేజీలో వీటిల్లో చురుగా పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే నేర్పు, భవిష్యత్ పై సానుకూల దృక్ఫధం, సమాజం పట్ల అవగాహన పెరుగుతాయి. ఇక రెజ్యుమెలో ఈ వివరాలను పొందుపర్చడం వలన రిక్రూటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉన్న అభ్యర్ధుల్లో నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, టీమ్ మేనేజ్‌మెంట్, నిరంతరం నేర్చుకునే లక్షణాలు ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు. అందుకే మార్కులు ఎక్కువ వచ్చిన అభ్యర్ధుల కంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా చేస్తున్న అభ్యర్ధులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి విద్యార్ధులు తమ భవిష్యత్ ప్రణాళికలను తగిన విధంగా మార్చుకోవాలి. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. అప్పుడే మీ డ్రీమ్ జాబ్ మీ తలుపు తడుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

ముఖ పుస్త‌క ఉల్లాసమే…మాన‌వ‌ సంబంధాల‌కు ఖ‌ల్లాస్..!

 

మ‌నిషి జీవితంలో మాన‌వ సంబంధాల‌దే ముఖ్య‌మైన స్థానం. స‌మాజంలో ప‌రిపూర్ణమైన‌ మ‌నిషిగా ఎద‌గాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన మాన‌వ సంబంధాల‌ను కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబంతోనే కాదు త‌న తోటి వారందరితో గౌర‌వం, అప్యాయ‌త‌తో కూడిన వైఖ‌రిని క‌లిగి ఉండాలి. మాన‌వ సంబంధాలు ఎంత ముఖ్య‌మో, ప్ర‌తీ మ‌నిషికి సాటి మ‌నిషి ఎంత ప్ర‌ముఖ‌మైన వాడో మ‌న భారతీయ ధార్మిక గ్రంధాల్లో చాలా చ‌క్క‌గా పొందుప‌ర్చారు. అయితే పెరుగుతున్న సాంకేతిక‌త‌, సంపాద‌న కోసం తీస్తున్న ప‌రుగు మ‌నిషిని అనుబంధాల‌కు, ఆప్యాయ‌త‌ల‌కు దూరం చేస్తున్నాయి. చివరికి మ‌నిషిని మ‌నిషిని క‌లిపేందుకు ఉద్దేశించిన సాంకేతిక‌త‌ను కూడా మ‌నం త‌ప్పుడు దారిలోనూ వాడుకుంటూ మ‌న అజ్ఞానాన్ని చాటుకుంటున్నాం. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తున్న ఫేస్ బుక్ ను కూడా స‌రైన ప‌ద్ధ‌తిలో వాడుకోవ‌డం చేత‌కాక సాటి మ‌నిషితో ఆర్యోగ‌క‌ర సంబంధాల‌ను తెగ్గొట్టుకుంటున్నాం. మ‌న ఆత్మీయులు, స‌న్నిహితుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో ఒక లైక్ కొట్టో లేక ఒక కామెంట్ ప‌డేసో ఫోన్ దులిపేసుకుంటున్నాం. ఇటువంటి విధానంతో మానవ సంబంధాలు ఏ విధంగా మెరుగుప‌డ‌తాయి? మ‌నిషి ప‌రిపూర్ణ మాన‌వుడిగా ఎలా ఎదుగుతాడు?

 

మంచి వేదిక‌ను స‌రిగ్గా ఎందుకు ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం?

 

గ‌తంలో మ‌న ఇంటికి వ‌చ్చిన బంధువుల‌కు, ఆత్మీయులకు మ‌నం స్నేహ పూర్వ‌క ఆతిధ్యాన్ని అందించేవాళ్లం. వాళ్ల క్షేమ స‌మాచారాన్ని క‌నుక్కున్నాక‌, మ‌న ఇంటిలో జ‌రిగిన వేడుక‌ల ఫోటోల‌ను లేదా మ‌నం సాధించిన అవార్డుల‌నో లేక సాధించిన ఘ‌న‌త‌ల‌ను వాళ్ల‌కు చెప్పేవాళ్లం. వాళ్ల‌తో ప్ర‌త్య‌క్షంగా మ‌న అనుభూతుల‌ను పంచుకోవ‌డం వ‌ల‌న సంబంధాల్లో గాఢ‌త ఎక్కువ‌గా ఉండేది. ఈ ఆధునిక యుగంలో అన్నీ మారిపోయాయి. ఉపాధి కోసం చాలా మంది ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వ‌చ్చారు. మ‌నుష్యుల మ‌ధ్య దూరం పెరిగింది. అందుకే ఇటువంటి విష‌యాల‌ను పంచుకునేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ ఫేస్ బుక్ వంటి సామాజిక వేదిక‌లు వ‌చ్చాయి. ఒక వ్య‌క్తికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్నీ అత‌ను ఫేస్ బుక్ లో త‌న సన్నిహితుల‌తో స్నేహితుల‌తో షేర్ చేసుకునే స‌దుపాయం వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఫేస్ బుక్ లో త‌న స్నేహితుని ఫోటోను చూసి చాలా మంది లైక్ కొట్టి ఊరుకుంటున్నారు కానీ అత‌న్ని ప్ర‌త్య‌క్షంగా క‌లిసి విష్ చేయ‌డ‌మో లేక ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ స‌మాచారం క‌నుక్కోవ‌డ‌మో వంటి ప‌నులు చేయ‌డం లేదు. కేవ‌లం ఒక్క లైక్ ప‌డేస్తే అత‌న్ని అత‌నితో మీకున్న సంబందాన్ని మీరు ఏ విధంగా గౌర‌విస్తున్న‌ట్టు? ఇటువంటి లైక్ , కామెంట్స్ బంధాలు ఎన్ని రోజులు నిల‌బ‌డ‌తాయి?

 

 

ప్ర‌త్య‌క్షంగా మాట్లాడ‌ట‌మే సంబంధాల‌ను నిలుపుతుంది!

 

ఫేస్ బుక్ లో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ వంద‌లాది మంది మిత్రులు ఉంటున్నారు. అందులో అధిక శాతం ముంది ముక్కూ మొఖం తెలియ‌ని వారే. ఒక వ్య‌క్తి త‌న ఫేస్ బుక్ లో త‌న జీవితంలో జ‌రిగిన ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ను పోస్ట్ చేసిన‌ప్పుడు అందులో చాలా మంది లైక్, లు కామెంట్ల‌తో స్పందిస్తారు. వాస్త‌వంగా చెప్పాలంటే అందులో చాలా వ‌ర‌కూ కృత్రిమ‌త‌తో కూడుకున్న పైపై అభినంద‌న‌లు మాత్ర‌మే ఉంటాయి. స‌ద‌రు వ్య‌క్తికి ప్రాణ మిత్రుడైన వ్య‌క్తి కూడా ఆ విధంగానే ఒక కామెంట్ ప‌డేసి ఊరుకుంటే ఆ ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య బంధం ఎలా ధృడ‌ప‌డుతుంది? త‌న స్నేహితుడిని ప్రత్య‌క్షంగా క‌ల‌వ‌డ‌మో లేక ఫోన్ చేసి మాట్లాడ‌మో చేసిన‌ప్పుడే ఆ ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తున్న‌వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఫేస్ బుక్ సాక్షిగా ఒక లైక్ ప‌డేసి ఊరుకుంటున్నారు. దీని వ‌ల‌న క‌ల‌కాలం కొన‌సాగాల్సిన సంబంధాలు మ‌ధ్య‌లోనే తెగిపోతున్నాయి.

 

ఫేస్ బుక్ లో టీచ‌ర్లు పెరిగిపోయారు!

 

ఇటీవ‌లి కాలంలో ఫేస్ బుక్ లో ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో ఒక మంచి ప‌ని చేయాల‌ని, మంచి విష‌యం చెప్పాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే కొంద‌రు టీచ‌ర్ల అవ‌తారమెత్తి మంచి విష‌యాల‌ను చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం మాయ‌లో ప‌డి అస‌లు విష‌యాన్ని గాలికి వ‌దిలేస్తున్నారు. ప్ర‌స్తుతం సొసైటీలో చాలా మంది ఏదైనా ఒక ఘ‌ట‌న జ‌ర‌గ్గానే ముందు దాన్ని చిత్రీక‌రించి త‌న పేజ్ లో పోస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ దాని కంటే ముందు ఆ ఘ‌ట‌న‌కు సాటి మ‌నిషి తాను నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌ల‌ను మ‌ర్చిపోతున్నారు. ఒక మ‌నిషికి ప్ర‌మాదం జ‌రిగి గాయాల‌తో బాధ‌ప‌డుతుంటే అత‌నికి సాయం చేయ‌కుండా ఆ యాక్సిడెంట్ ను చిత్రీక‌రించ‌డానికే మ‌నుష్యులు ముందుండ‌టం మ‌నం ఎంత దిగ‌జారిపోయామో అన్న విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే సెల‌బ్రిటీల‌తో ఫోటోలు దిగ‌డం , వాటిని పోస్ట్ చేసి అత‌ను నాకు బాగా కావాల్సిన వాడు అని చెప్పుకోవ‌డం వంటి మానసిక రుగ్మ‌త‌ల‌కు గుర‌వుతున్నారు. మ‌రికొంత త‌ను పెట్టిన ఫోటోకు లైక్ రాకుంటే మాన‌సికంగా చిరాకు ప‌డిపోతున్నారు. అస‌లు విష‌యాన్ని గాలికొదిలి ప్ర‌చారం కోసం ఎగ‌బ‌డుతూ తోటి వారితో సంబంధాల‌ను మ‌న‌కు మ‌న‌మే చెడ‌గొట్టుకుంటున్నాం.

 

 

సాంకేతిక‌త‌ను వాడుకోవాలి కానీ దానికి బ‌లికాకూడ‌దు!

 

సాంకేతిక‌త అంటే ఎక్క‌డినుంచో ఊడిప‌డ‌లేదు. మ‌న అవ‌స‌రాల కోసం మ‌నం సృష్టించుకున్న ఒక వేదిక‌. అయితే దాన్ని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకోక‌పోవ‌డం అన‌ర్ధాల‌కు దారితీస్తోంది. ఫేస్ బుక్ కావ‌చ్చు మ‌రే ఇత‌ర డిజిట‌ల్ మీడియా కావ‌చ్చు స‌రైన రీతిలో వాడుకోవ‌డం చేత‌కాక‌పోతే అది మ‌న‌కు స‌మాధి క‌డుతుంది. ఇప్పుడు స‌రిగ్గా అదే జ‌రుగుతోంది. లోతుగా ఆలోచించ‌డం చేత‌కాక మ‌న‌ సౌక‌ర్యం కోసం రూపొందించుకున్న ట‌క్నాల‌జీనే మ‌న‌కు శత్రువుగా చేసుకుంటున్నాం. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో విప‌రిణామాలు సంభవించే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం రాజ్య‌మేలుతున్న డిజిటల్ మీడియా అయినా ఆ త‌ర్వాత రాబోతున్న స్పేస్ టెక్నాల‌జీ అయినా ఏదైనా మ‌న సౌక‌ర్యం కోసం మాత్ర‌మే. మ‌న‌తో ఎప్పుడూ శాశ్వ‌తంగా ఉండేవి మ‌నుష్యుల మ‌ధ్య ప్రేమ‌లు, ఆప్యాయ‌తలు. వాటిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేక‌పోతే మ‌నం సృష్టించుకున్న సాంకేతిక‌త‌కు మ‌న‌మే బ‌లి అవుతాం.

( ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసినవారు)

 

బేతాళ క‌థ‌ల‌కు సీక్వెల్ గా మారిన విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు!

చంద‌మామ క‌థ‌ల పుస్త‌కం చ‌దివిన వారంద‌రికీ బేతాళ క‌థ‌లు సుప‌రిచిత‌మే. ఆ క‌థ‌ల్లో చెట్టుపై నుంచి శ‌వాన్ని దించి భుజంపై వేసుకుని మౌనంగా న‌డక సాగిస్తున్న విక్ర‌మార్కున్ని శ‌వంలోని బేతాళుడు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. విక్ర‌మార్కుని మౌనాన్ని భ‌గ్నం చేసేందుకు ఇలా చెప్పిన క‌థ‌లు బేతాళ క‌థ‌లుగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు కూడా బేతాళ క‌థ‌ల‌ను గుర్తుకుతెస్తున్నాయి. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు స్ప‌ష్టంగా తెలిసినా విక్ర‌మార్కుని మౌనం భంగం కాగానే ఎగిరిపోయే బేతాళునిలా స‌మ‌స్య మాత్రం మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. కార్పోరేట్ విద్యా సంస్థ‌ల మార్కుల దాహానికి విద్యార్ధులు పిట్ల‌ల్లా రాలుతున్నా రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత మ‌ళ్లీ స‌మ‌స్య‌ను శ‌వంలా మూట‌గ‌ట్టి చెట్టెక్కిస్తున్నారు. చివ‌రికి విద్యార్ధుల ఆత్మ‌ల‌కు కూడా శాంతి క‌లిగించ‌కుండా కార్పోరేట్ యాజ‌మాన్యాల‌కు కొమ్ము కాస్తూ విద్యార్ధుల ఆత్మ‌లు చెట్టు కొమ్మ‌ల్లోనే మ‌గ్గిపోయేలా చేస్తున్నారు.

 

ర్యాంకులు తీసుకొచ్చే యంత్రాలు అర్ధంత‌రంగా ఆగిపోతున్నాయి!

 

ఇటీవ‌లి కాలంలో కార్పోరేట్ విద్యా సంస్థ‌ల్లో విద్యార్ధుల‌ ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి త‌ట్టుకోలేక అంద‌మైన భ‌విష్య‌త్ ను, ప్రాణంగా ప్రేమించే త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి పెట్టి బ‌ల‌వ‌ర్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కేవ‌లం డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా న‌డుస్తున్న కార్పోరేట్ విద్యా సంస్థ‌లకు పిల్లల ఆత్మ‌హ‌త్య‌లు ప‌ట్ట‌వు. వారి మాన‌సిక స్థితి ప‌ట్ట‌దు. ఎంత సేపు వాళ్ల‌ను మార్కులు, ర్యాంకులు తీసుకు వ‌చ్చే యంత్రాలుగానే చూస్తారు. మ‌రోవైపు ఘ‌ట‌న జ‌ర‌గ్గానే రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత దాన్ని మ‌ర్చిపోవ‌డం మీడియాకు అల‌వాటుగా మారింది. ఇక ఈ పెను స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారాన్ని చూపించాల్సిన ప్ర‌భుత్వాలే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించడ‌మే ఇప్పుడు దుర‌దృష్ట‌క‌ర అంశం.

 

 

విద్యార్ధుల ఆత్మ‌హత్య‌లకు నివార‌ణ చ‌ర్య‌లు ఎక్క‌డ‌?

 

గ‌తంలో ఏమైనా రెండు మూడు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు తూతూ మంత్రంగా చ‌ర్య‌లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వాలు అవి స‌రిగ్గా అమ‌లవుతున్నాయో లేదో అన్న విష‌యాన్ని కూడా స‌రిగ్గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌డిచిన రెండేళ్లుగా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్యల శాతం పెరిగిపోతున్నా ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న శాశ్వ‌త చ‌ర్య‌లు మాత్రం శూన్యం. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తీ నెలా ఇలా విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా ప్ర‌భుత్వం నుంచి మాత్రం స్పంద‌న రావ‌డం లేదు. గ‌తంలో ఇలాంటి దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అది చేస్తాం..ఇది చేస్తాం..అని ప్ర‌భుత్వ పెద్ద‌లు హ‌డావుడి అయినా చేసే వారు. ఇప్పుడు అటువంటి ప్ర‌తిస్పంద‌న కూడా ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు. విద్యార్ధుల ఆత్మ‌హత్య‌ల‌కు వాళ్లు అల‌వాటు ప‌డిపోయారో లేక జ‌నాలు వీటికి అల‌వాటు ప‌డిపోయి ఉంటారులే అని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 

ఇంత జ‌రుగుతున్నా విద్యా సంస్థ‌ల్లో మానసిక నిపుణుల ఊసేదీ??

 

ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతూ విద్యార్ధులు పిట్ట‌ల్లా రాలిపోతున్నా అటు కార్పోరేట్ కాలేజీలు కానీ ఇటు ప్ర‌భుత్వాలు శాశ్వ‌త చ‌ర్య‌లు తీసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. క‌నీసం నిబంధ‌న‌ల‌ను కూడా అమ‌లు చేసేందుకు అధికారులు మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థ‌ల్లో సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించాల‌న్న నిబంధ‌న అమ‌లు కావ‌డం లేదు. ఆ నిబంధ‌న‌ను పాటించి ఉంటే క‌నీసం స‌గం మంది ప్రాణాలు అయినా ద‌క్కి ఉండేవి. విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌ద్ధ వ‌హిస్తూ వారి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సైకాల‌జిస్ట్ ల‌ స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది. వాళ్ల‌కు కౌన్సిలింగ్ లు నిర్వ‌హించ‌డం వాళ్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది, ఒత్తిడిని త‌గ్గించుకునే మార్డాల అన్వేష‌ణ తదిత‌ర విష‌యాల‌పై చ‌ర్చ జ‌రిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డి ఉండేది. కానీ కార్పోరేట్ కాలేజీలు మాత్రం సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించుకునే విష‌యంలో మాత్రం మీనమేషాలు లెక్క‌పెడుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికైనా కార్పోరేట్ విద్యా సంస్థ‌లు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటే కొన్ని ప్రాణాలు అయినా ద‌క్కుతాయి. త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత బాధ త‌ప్పుతుంది.

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)

 

నిఫ్ట్ 2018 అడ్మిష‌న్ నోటిఫికేష‌న్

నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్ ) 2018 సంవత్స‌రానికి గాను అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు అప్లికేష‌న్స్ ను ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొత్తం 3,010 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేష‌న్ లో ఫ్యాష‌న్ డిజైన్, లెద‌ర్ డిజైన్, యాక్సెస‌రీ డిజైన్, టెక్స్ టైల్ డిజైన్ వంటి ప‌లు గ్రాడ్యుయేష‌న్ కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తోంది.

 

అదే విధంగా మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్ మెంట్, మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ వంటి మాస్ట‌ర్ డిగ్రీల‌ను కూడా నిఫ్ట్ ఆఫ‌ర్ చేస్తోంది. నిఫ్ట్ లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 20 నుంచి ప్రారంభ‌మైంది.

 

ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేది :  29 డిసెంబ‌ర్ 2017
ఫీజు క‌ట్టేందుకు ఆఖ‌రు తేది  :  02 జ‌న‌వ‌రి 2018
అడ్మిట్ కార్డు ఇచ్చే తేది  :   09 జ‌న‌వ‌రి 2018
రాత ప‌రీక్ష   :   21 జ‌న‌వ‌రి 2018

ద‌ర‌ఖాస్తు ఆన్ లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

మ‌రిన్ని వివ‌రాల‌కు http://nift.ac.in/

 

 

మా పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడితే మీకెందుకు నొప్పి??

కృష్ణా జిల్లా నందిగామలో దీక్షా ఇంట‌ర్ కాలేజీ విద్యార్ధుల‌ను ఒక లెక్చ‌ర‌ర్ అమానుషంగా కొట్ట‌డం మ‌న‌ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. నూనూగు మీసాల యువ‌కులను అమాన‌వీయంగా ప‌శువుల‌ను కొట్టిన‌ట్టు క‌ర్ర‌తో కొట్డడం చూప‌రుల‌కు బాధ‌తో పాటు ఆగ్ర‌హాన్ని కూడా తెప్పించింది. దీక్షా కాలేజీలో ఇంట‌ర్ విద్యార్ధుల‌కు గ‌ణితం భోధించే శ్రీనివాస్ ప్ర‌సాద్ అనే లెక్చ‌ర‌ర్, ఈ అమానుషానికి పాల్ప‌డ్డాడు. వాట్స‌ప్ లో వైర‌ల్ అయిన ఈ వీడియో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌లు రేపింది.

 

వేగంగా స్పందించిన స‌ర్కారు!

 

పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడుతున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విసృతంగా వ్యాప్తి చెంద‌డంతో విష‌యం ప్ర‌భుత్వం వ‌ర‌కూ వెళ్లింది. దీంతో వెంట‌నే కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. దీక్షా క‌ళాశాల‌ను త‌దుప‌ది ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కూ మూసేయాల‌ని, పిల్ల‌ల‌పై పైశాచికంగా దాడి చేసిన లెక్చ‌ర‌ర్ శ్రీనివాస్ పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దానికి ప్ర‌భుత్వాలు స్పందించిన విధానం చూస్తే దీక్షా కాలేజీ ఘ‌ట‌న‌లో వ్య‌వ‌స్థ వేగంగా ప‌నిచేసింది.

 

 

స్పంద‌న స‌రే..ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించారా?

 

పిల్ల‌ల‌ను అమానుషంగా కొట్టిన లెక్చ‌ర‌ర్ పై కాలేజీపై ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు బాగానే ఉన్నాయి. మ‌రి ఉన్న ప‌ళంగా కాలేజీకి తాళం వేస్తే విద్యార్ధుల భ‌విష్య‌త్ ఏంటి? ఈ విష‌యంపై మాత్రం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేన‌ట్టుగానే క‌నిపిస్తోంది. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వేగంగా స్పందిచ‌డ‌మే కాదు దానికి ప‌రిష్కార మార్గాలు కూడా చూపించిన‌ప్పుడే నిజ‌మైన స‌మ‌ర్ధ‌త బ‌య‌ట‌ప‌డుతుంది. దీక్షా కాలేజీ విష‌యంలో ఈ విష‌యాన్ని పూర్తిగా విస్మ‌రించిన‌ట్టు ఉన్నారు. విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో కాలేజీ మూసేస్తే ఇప్పుడు వాళ్ల‌కు ఎక్క‌డ అడ్మిష‌న్ దొరుకుతుంది?

 

మీడియా అతిపై పేరెంట్స్ ఫైర్!

 

కార్పోరేట్ కాలేజీల నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను యాడ్స్ రూపంలో సంపాదిస్తున్న మీడియా సంస్థ‌లు కూడా ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీఆర్పీ లు మాత్ర‌మే ల‌క్ష్యంగా విద్యార్ధుల భ‌విష్య‌త్ తో ఆట‌లాడుకుంటున్నాయి. విద్యార్ధుల‌పై అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన లెక్చ‌ర‌ర్, కాలేజీపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉన్న విద్యార్ధుల భ‌విష్య‌త్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విష‌యంపై మాత్రం ఏ మీడియా సంస్థ కూడా క‌థ‌నం ప్ర‌సారం చేయ‌లేదు. వార్త రాయ‌లేదు. అందుకే దీక్షా కాలేజీ అంశంలో మీడియా ప్ర‌తినిధుల‌పైకి విద్యార్ధుల త‌ల్లిదండ్రులు తిర‌గ‌బ‌డ్డారు. వ్య‌వ‌హ‌రాన్ని జ‌ఠిలం చేసి త‌మ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

 

చైనా సంస్థ‌ల‌కూ తాళాలు వేయ‌గ‌ల‌రా?

 

దీక్షా కాలేజీ విష‌యంలో ఆఘ‌మేఘాల మీద స్పందించిన ప్ర‌భుత్వం మిగ‌తా విద్యా సంస్థల విష‌యంలోనే ఇలానే స్పందించ‌గ‌లుగుతుందా? ఎందుకు ఇలా చెప్పాల్సి వ‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర‌శ్రేణి కార్పోరేట్ విద్యా సంస్థ‌లు కూడా ఇలానే పిల్ల‌ల‌ను హింసించిన ఘ‌ట‌న‌లు వెలుగు చూసినా వాటి యాజమాన్యాల‌పై ప్ర‌భుత్వాలు ఎప్పుడు కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. అయినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే కాదు. ఇటువంటి ఇబ్బందిక‌ర సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డ ఎంత ముఖ్య‌మో అలానే విద్యార్ధుల భ‌విష్య‌త్, క్షేమం ఆలోచించ‌డం కూడా అంతే ముఖ్యం. లేకుంటే కొండ నాలుక‌కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా త‌యారవుతుంది వ్య‌వ‌హారం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)