ఈ చదువులు మాకొద్దు!!

పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతీది వ్యాపారమే.. అది విద్య కావొచ్చు.. వైద్యం కావొచ్చు..మరొకటి కావచ్చు..ప్రజలకు అవసరమైన ప్రతీదాంట్లోనూ వ్యాపారం చేసి లాభాలు దండుకోవడమే కార్పోరేట్ వ్యవస్థ అంతిమ లక్ష్యం. విద్య, వైద్యం అనేవి ప్రతీ ఒక్కరికీ చాలా ముఖ్యమైన అవసరాలు. సామాజిక, వ్యక్తిగత, ఆర్థిక, మానవ సంబంధమైన అంశాలు ఇమిడి ఉంటాయి కాబట్టి విద్య, వైద్యం కోసం ప్రజలు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. సరిగ్గా ఈ బలహీనతను ఆసరా చేసుకునే కార్పోరేట్ విద్యాలయాలు, ఆస్పత్రులు మనదేశంలో లక్షలాది కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ విద్యా సంస్థలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ మన విద్యా వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. దేశ భవిష్యత్ నిర్మాతలైన విద్యార్ధుల ఉసురు తీస్తున్నాయి. కేవలం మార్కుల ప్రాతిపదికన విద్యను కార్పోరేటీకరణ చేసి పిల్లలను చదివే యంత్రాల్లా మారుస్తున్నాయి. దీంతో ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధులు కొందరైతే, ఇళ్లు వదిలి పారిపోతున్నవారు మరికొందరు. ఆడుతూ పాడుతూ చదవాల్సిన చదువును చదవలేక కన్న తల్లిదండ్రులను, అద్భుతమైన భవిష్యత్‌ను, కలలు కన్న లక్ష్యాన్ని వదిలి విద్యార్ధులు ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు? మన విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో అసలు ఏం జరుగుతోంది?

 

మిథ్యా వ్యవస్థగా మారిన మన విద్యా వ్యవస్థ!

 

ఒక పిల్లవానికి ఐదేళ్లు వయస్సు వస్తే కానీ అతనికి ఒక విషయం నేర్చుకునే, తెలుసుకునే పరిణితి రాదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒక పిల్లవానికి మూడేళ్లు రాగానే స్కూల్ లో చేర్పిస్తున్నారు. మూడేళ్ల వయస్సు నుంచే ఆ పిల్లవానికి ఉదయం నుంచి సాయింత్రం వరకూ స్కూల్, హోమ్ వర్క్, పుస్తకాల బరువు, ఒత్తిడి. ఇటువంటి వాతావరణంలో అతను మానసికంగా పరిణితి సాధించిన విద్యార్ధిగా తయారు కాగలడా? ఐదేళ్లు వచ్చే వరకూ పిల్లలు ఉల్లాసంగా ఆటలు ఆడుకుంటూ ప్రకృతి నుంచి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి, విభిన్న పరిస్థితుల నుంచి ఎన్నో విషయాలను గ్రహిస్తారు. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లి చదువు నేర్చుకుంటారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది. మూడేళ్లకే వేలకు వేలు ఫీజులు కట్టి స్కూల్ లో జాయిన్ చేసి ఆ పిల్లవాడు చెపుతున్న ఏబీసీడీలు విని ఇటు పేరెంట్స్ మురిసిపోతుంటే… అటు ఇదంతా మా ఘనతే అంటూ కార్పోరేట్ స్కూల్స్ వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ విద్యార్ధి మానసిక ఆరోగ్యంపై కానీ భరిస్తున్న ఒత్తిడిపై కానీ ఆలోచించే పరిస్థితులు కరవవుతున్నాయి. ఇక విద్యార్ధిలో మానసిక వికాసం ఎలా కలుగుతుంది?

మార్కులు రాకపోతే బతుకు దండగా?

 

టీవీలో ప్రతీ రోజూ వచ్చే ఒక ఫ్లోర్ క్లీనర్ యాడ్ లో ఏం చెప్తారు… ఈ క్లీనర్ వాడకపోతే మీరు అపరిశుభ్రతతో జబ్బులు పాలవుతారని. తన క్లీనర్ ను అమ్ముకోవడానికి ప్రజల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు. ప్రజల్లో ఉన్న ఆ భయం నుంచి తన వ్యాపారాన్ని పెంచుకోవడమే ఆ కార్పోరేట్ కంపెనీ లక్ష్యం. ఇప్పుడు కార్పోరేట్ విద్యా సంస్థలు కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. మీ పిల్లవానికి ఇన్ని మార్కులు రాకపోతే వేస్ట్..ఇంజినీరింగ్, మెడిసిన్ లు మాత్రమే చదువులు. మిగతా కోర్సులు ఏం చదివినా ఉన్నత స్థానానికి వెళ్లలేరు. వందకు వంద మార్కులు వస్తేనే నీ బతుక్కి ఒక అర్ధం ఉంది. అంటూ స్టూడెంట్స్ ను ఒత్తిడిలోకి నెడతారు. ఆ మార్కులు కోసం ఇరుకు గదుల్లో ఉదయం ఐదు నుంచి రాత్రి 9 , 10 గంటల వరకూ స్పెషల్ క్లాస్ లు, స్పెషల్ టెస్ట్ లు అంటూ వాళ్లను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తారు. ఆ ఒత్తిడికి తట్టుకుని నిలబడే వారు కొందరైతే మానసికంగా బలహీనంగా ఉన్న పిల్లలు ఆ యాతనను భరించలేక ప్రాణాలైనా తీసుకుంటున్నారు. లేదంటే ఎవరికీ అందనంత దూరంగా పారిపోతున్నారు. ఈ దురవస్థకి ప్రభుత్వాలు కూడా ఒక కారణంగా మారుతున్నాయి. తన బాధ్యతను కార్పోరేట్ సంస్థలకు బదలాయించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం మార్కుల కోసం, వ్యాపారం కోసం వాళ్లు చేస్తున్న బరితెగింపు వ్యవహారాన్ని చూసీ చూడనట్టు నటిస్తోంది. గడిచిన కొన్ని రోజుల్లో పదుల సంఖ్యలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వాళ్లు పెడుతున్న మార్కుల ఒత్తిడికి భరించలేక నరకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యక్ష చర్యలు శూన్యం.

‘చైనా’ సంస్థలను బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందా?

 

మన దేశ మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ఇటీవలి కాలంలో ఒక ప్రచారం ఊపందుకుంది. మన ఆర్థిక వ్యవస్థకు, ఆరోగ్యానికి చేటుగా మారిన చైనా వస్తువులను బహిష్కరించడంలో తప్పులేదు. అదే విధంగా విద్యార్ధుల ఉసురు తీస్తూ లాభాలు తప్ప ప్రాణాలు పట్టని చైనా సంస్థలను కూడా బహిష్కరించాలి. చైనా సంస్థలంటే (చై)తన్య (నా)రాయణ విద్యా సంస్థలు. ఈ రెండు కార్పోరేట్ సంస్థలే కాదు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్ధులను ఒత్తిడికి గురి చేస్తూ వారిని మానసిక దుర్భలురుగా మారుస్తున్న అన్ని సంస్థలను నిషేధించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే మన భావి భారత పౌరులు విద్యార్ధి దశలోనే ప్రాణాలు తీసుకోవడమో లేక కేవలం మార్కుల కోసమే బతికి చివరికి మానసిక రోగులుగా మారడమో జరుగుతుంది. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలు అనుసరిస్తున్న విధానాలు చూస్తే మన ప్రాచీన విద్యావిధానం సిగ్గుతో చచ్చిపోతుంది. బాగా చదివే విద్యార్ధులు అంతా ఒక సెక్షన్, యావరేజ్, బిలో యావరేజ్ అంటూ ముందుగానే విద్యార్ధుల మధ్య గోడలు కట్టి వాళ్లను మానసికంగా ఒత్తిడిలోకి నెడతారు. ఒక తెలివైన విద్యార్ధి పక్కన ఉన్నప్పుడే కదా ఒక సాధారణ విద్యార్ధి ఏమైనా నేర్చుకోగలుగుతాడు? ఇటీవలి కాలంలో ఓ కార్పోరేట్ కాలేజీ యజమాని కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతే సానుభూతి బదులు విమర్శలు వచ్చాయి. ఎందుకు? సమాజంలో కార్పోరేట్ కాలేజీల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. మార్కులు బాగా వస్తేనే మీ పిల్లవాడు ఉన్నత స్థానానికి చేరుతాడా? ఇంజీనిరింగ్, డాక్టర్ కోర్సులు చదవకపోతే అతనికి భవిష్యత్ లేదా? మీ ఆశలు,కలలు నెరవేర్చుకోవడానికి మీ పిల్లలు కలలకు పాతరేసి ఎదురు డబ్బులిచ్చి వారిని నరకంలోకి తోసేయకండి.

 

మార్కుల ‘విష’ వలయాన్ని చేధించండి!

 

గతంలో పాఠశాలలను ఉదయం ఏడున్నర ప్రారంభించేవారు. మధ్యహ్నం 12 గంటలకు విరామం ఇచ్చేవారు. మధ్యహ్నం 3 వరకు పాఠాలు చెప్పి పిల్లలను ఆడుకునేందుకు క్రీడా మైదానాల్లోకి విడిచిపెట్టేవారు. వారు సాయింత్రం వరకూ వారికి నచ్చిన ఆటలు ఆడుకుంటూ మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. మానసిక ఉల్లాసం వలన మంచి ఆహారం తీసుకుని క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది సరిగ్గా వినేందుకు అవకాశం కలిగేది. ఇప్పుడు క్రీడా మైదానం అన్న ఊసే లేదు. అపార్ట్‌మెంట్లలో ఇరుకు గదుల్లో బాల్యాన్ని బంధించి వారి విద్యార్ధులను మానసిక వికలాంగులుగా మార్చుతున్నారు. విద్యార్ధికి నెల రోజులకు ఒక్కసారి మాత్రమే పరీక్షలు పెట్టాలి. హోమ్ వర్క్ సబ్జెక్ట్ లో 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రతీ స్కూల్ లోనూ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ తప్పకుండా ఉండాలి. అవేమీ ఇప్పుడు అమలు కావడం లేదు. విద్యార్ధికి ఆడుకోవడానికి, మానసిక ఉల్లాసానికి తగిన సమయం ఇస్తే ఆత్మహత్యలు తక్షణం ఆగిపోతాయి. అలాగే టీచర్, విద్యార్ధి మధ్య వ్యాపారి, వినియోగదారుని సంబంధం మాత్రమే ఉంటోంది. అది పోయి విద్యార్ధి తన మనసులో మాటను టీచర్ తో చెప్పుకునే విధానం ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం, మానసికంగా బలవంతులైన విద్యార్ధులు తయారవుతారు. ఇవన్నీ అమలు చేయనంత వరకూ కార్పోరేట్ సంస్థలు లాభార్జన దాహం ఆగదు..విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగవు..తల్లిదండ్రుల కడుపుకోత ఆగదు.

 

(ఇన్నాళ్లూ మా ఆర్టికల్స్  Careertimesonline.blogspot.com లో వచ్చేవి. మీకు మా ఆర్టికల్స్ ను మరింత ఆకర్షణీయంగా అందించేందుకు మేము ఇప్పుడు www.careertimesonline.com వెబ్‌సైట్‌ను ప్రారంభించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకపై కూడా మీ  ఆదరణతో అదే ఉత్సాహంతో ఆర్టికల్స్ ను లేటేస్ట్ అప్‌డేట్స్ ను పోస్ట్ చేస్తాం)

 

ఈ ఆర్టికల్ ను స్పాన్సర్ చేసినవారు

 

ఈ ‘కెరీర్’ తో కంపెనీకి, మీడియాకు మధ్య వారధి మీరే కావచ్చు!!

     

 టెక్నాల‌జీ యుగంలో వ్యాపారం బాగా అభివృద్ధి సాధించాలంటే మంచి నాణ్య‌మైన ఉత్ప‌త్తిని త‌యారు చేస్తే స‌రిపోదు.  ఉత్ప‌త్తికి విస్తృత‌మైన ప్రచారం క‌ల్పించిన‌ప్పుడే అది మార్కెట్లో మ‌న‌గ‌లుగుతుంది. పబ్లిసిటీ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన విష‌యంగా మారింది. ఉత్ప‌త్తిని త‌మ ఉద్దేశాన్ని వినియోగ‌దారుల్లోకి ఎంత బ‌లంగా తీసుకెళ్లార‌న్న‌దానిపైనే కంపెనీ విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీ అయినా  స‌రే ముందుగా ప్ర‌చారానికే అధికంగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కంపెనీకి అడ్వ‌ర్ట‌యిజింగ్ ఏజెన్సీకి మ‌ధ్య వార‌ధిలా ప‌నిచేసే ఒక వ్య‌వ‌స్థ అవ‌స‌రమైంది. ఆ అవ‌స‌రం లోనుంచి పుట్టిందే మీడియా ప్లాన‌ర్. కంపెనీ ఏం ఆశిస్తుందో ఏజెన్సీకి  స్ప‌ష్టంగా చెప్పి వారి నుంచి స‌రైన ప్ర‌చారాన్ని కల్పిండ‌టంతో పాటు ఫ‌లానా ఉత్ప‌త్తికి సంబంధించిన వినియోగ‌దారులు ఎక్క‌డ ఉన్నారు? ఏం చేస్తే వాళ్లు ఆ ఉత్ప‌త్తిని కొనుగోలు చేస్తారు? అన్నవ్యూహాల‌ను మీడియా ప్లాన‌ర్లు సిద్ధం చేస్తారు. వ‌స్తూత్ప‌త్తి రంగం దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలో హాట్ కెరీర్ గా మారిన మీడియా ప్లాన‌ర్ పై ‘కెరీర్ టైమ్స్’ స్పెష‌ల్ ఫోక‌స్.

టార్గెట్ క‌స్ట‌మ‌ర్ల‌ను గుర్తించ‌డ‌మే విజ‌య ర‌హ‌స్యం! 

ఇప్పుడు ఎంత కంపెనీకైనా త‌మ ఉత్ప‌త్తులు అమ్ముడుపోవాల‌న్నా, లాభాలు సాధించాల‌న్నా ప్ర‌చార‌మే దిక్కు. అయితే త‌మ టార్గెట్ క‌స్ట‌మ‌ర్లు ఎక్క‌డ ఉన్నారు?  వారి అవ‌స‌రాలేంటి అన్న ప్రాతిప‌దిక‌న ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్ర‌చారం చేసే మాధ్య‌మాల‌ను స‌రైన విధంగా వాడుకుంటూ ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలోనే విజ‌యం దాగుంది. త‌మ ప‌రిశోధ‌న ద్వారా ఆ విజ‌యాన్నిఎలా ఒడిసిప‌ట్టుకోవాలో తెలియ‌జేసేది మీడియా ప్లాన‌ర్లు. అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీకి వెన్నుముక‌గా ప‌నిచేస్తూ కంపెనీ ఆశించిన ఫ‌లితాలు సాధిస్తే మీడియా ప్లానర్ కెరీర్ కు తిరుగులేదు. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు మీడియా ప్లాన‌ర్లను ప్ర‌త్యేకంగా నియ‌మించుకుంటున్నాయి. కంపెనీ యొక్క మీడియా విష‌యాల‌ను చ‌క్క‌బెట్ట‌డంతో పాటు ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతంగా చేప‌ట్టేందుకు వీరి అవ‌సరం చాలా ఉంది. క‌ష్ట‌ప‌డే త‌త్వం, ఏ విష‌య‌మైనా నేర్చుకునేందుకు సిద్ధ‌ప‌డే గుణం ఉండాలే కానీ మీడియా ప్లాన‌ర్ గా కెరీర్ లో మంచి ఉన్న‌తిని సాధించ‌వ‌చ్చు.


ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది!

గ‌తంలో ప్ర‌చారం అంటే కేవ‌లం హోర్డింగ్ లు, న్యూస్ పేప‌ర్లు, టీవీలు, రేడియోలు మాత్ర‌మే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఈ నాలుగు మాధ్య‌మాల‌తో పాటు ఇప్పుడు సోష‌ల్ మీడియా కూడా విస్త‌రించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక కంపెనీలు ఫోన్ లోనే త‌మ ఉత్త‌త్తుల‌ను ప్ర‌చారం చేసుకోవాల్సి వ‌స్తోంది. ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, లింక్డ్ ఇన్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్య‌మాలతో పాటు వెబ్ మీడియా కూడా ప్ర‌చారానికి అనువైన వేదిక‌గా ఉంది. ఈ ట్రెండ్ ను గుర్తిస్తూ ప్ర‌చారాన్ని కొత్త పుంత‌లు తొక్కించ‌గ‌లిగితే మీడియా ప్లానర్ల‌కు తిరుగుండ‌దు. ముఖ్యంగా సృజ‌నాత్మ‌క‌త అనేది మీడియా ప్లాన‌ర్ల‌కు చాలా ముఖ్య‌మైన విష‌యం. ఎందుకంటే త‌మ కొత్త త‌ర‌హా ఆలోచ‌నల ద్వారా వినియోగ‌దారుల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌గాలి. అలాగే కంపెనీ చేప‌ట్టే కొత్త ప‌నులు, కార్య‌క్ర‌మాలను ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాకు చేర‌వేస్తూ కంపెనీని ప్ర‌మోట్ చేయాలి. అదే స‌మ‌యంలో విభిన్న మాధ్యమాల ద్వారా కంపెనీ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల‌గాలి.  ఒత్తిడిని త‌ట్టుకోగ‌లిగే నేర్పు సాధించి, మీడియా సంస్థ‌ల‌తో మంచి సంబంధాల‌ను క‌లిగి ఉన్న‌ప్పుడు మీడియా ప్లాన‌ర్ కెరీర్ వెలిగిపోతుంది.

మీడియా ప్లాన‌ర్ గా మారాలంటే..? 

స‌మ‌కాలీన విష‌యాల‌పై ప‌ట్టు, ప్ర‌తీ రోజూ నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉన్న‌వాళ్లు మీడియా ప్లాన‌ర్ గా రాణించవ‌చ్చు. ముఖ్యంగా ఎంబీయే అడ్మినిస్ట్రేష‌న్, పీజీలో మాస్ క‌మ్యూనికేష‌న్ చేసిన వాళ్లు మీడియా ప్లాన‌ర్ కెరీర్ ను ఎంచుకోవ‌చ్చు. మీడియా రంగంలో కొన్ని రోజులు ప‌నిచేసిన అనుభ‌వం ఉంటే అది కెరీర్ కు ప్ల‌స్ అవుతుంది. అలాగే అడ్వ‌ర్టైజింగ్, మీడియా  ప్లానింగ్ స్పెష‌లైజేష‌న్లు చేసిన వాళ్లు కూడా ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కాస్త ఇబ్బంది అనిపించినా ఓపిక‌తో కాస్త నిల‌దొక్కుకుంటే ఉన్న‌త స్థానానికి చేరుకోవ‌చ్చు. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిస్తే మీడియా ప్లాన‌ర్ గా ప‌దేళ్ల అనుభ‌వం ఉన్న‌వాళ్లు ఏడాదికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ప్యాకేజీని అందుకుంటున్నారు. ప్రారంభంలో కొన్ని కంపెనీలు మీడియా ప్లాన‌ర్ల‌కు ఏడాది 2 ల‌క్ష‌ల ప్యాకేజీ ఇస్తున్నా అనుభ‌వం పెరిగితే ప్యాకేజీని కూడా బాగానే పెంచుతాయి.

కాస్త శ్ర‌మ ప‌డితే భ‌విష్య‌త్ బంగార‌మే! 

మీడియా ప్లానర్ల‌కు కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. విభిన్న వ్య‌క్తుల‌తో సంబంధాల‌ను నెరుపుతూ కంపెనీని, ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాలి. ముఖ్యంగా ప్ర‌జంట్ వినియోగ‌దాలు ఏం కోరుకుంటున్నారో, ఏ మాధ్య‌మం ద్వారా వారిని చేర‌గ‌లుగుతామో ప‌సిగ‌ట్టి దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు మార్చుకుంటూ ఉండాలి. ఏజెన్సీల‌తో త‌న‌కు కావాల్సింది స్ప‌ష్టంగా చెప్పి కంపెనీ ఉద్దేశాన్ని, ఉత్ప‌త్తిని ప్ర‌భావ‌వంతంగా వినియోగ‌దారుని చెంత‌కు తీసుకెళ్లగ‌ల‌గాలి. ఇటువంటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వాళ్లు మీడియా ప్లాన‌ర్ కెరీర్ ను ఎంచుకోవ‌చ్చు. రానున్న రోజుల్లో ఈ రంగం మ‌రింత‌గా విస్త‌రిస్తుంది కాబ‌ట్టి కెరీర్ కు ఢోకా అన్న మాటే లేదు.

 

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోస్టులు

ఉద్యోగం  :  సాఫ్ట్ వేర్ ఇంజినీర్
సంస్థ      :  హ్యాష్ ఫౌండ్రీ
ఉద్యోగం చేయాల్సిన చోటు : మైసూరు
అర్హ‌త      : ఏదైనా డిగ్రీ
అనుభ‌వం :  1-2 సంవత్స‌రాలు
అప్లై చేయు విధానం :  ఆన్ లైన్

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

http://www.hashfoundry.com/jobs/software-engineer/

9 టు 5 రోటీన్ జాబ్ మీకు నచ్చదా? అయితే ఈ కెరీర్స్ పై లుక్కేయండి!

దయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5  జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.

 

ఫ్రీలాన్స్ వెబ్‌ డిజైనర్ 

ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ పనీ వెబ్ సైట్ ద్వారానో లేక మొబైల్ యాప్ ద్వారానో జరుగుతుంది. సమాచార ప్రదర్శనకు, తమ సంస్థ ప్రధాన ఉద్దేశం చెప్పడానికి ప్రతీ కంపెనీకి ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉండాల్సిందే. దీనికి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రతీ సంస్థకు ఇప్పుడు సొంత వెబ్‌ సైట్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ కంపెనీలు వెబ్‌సైట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జరుపుతున్నాయి. అయితే కంపెనీకి వెబ్‌సైట్ తప్పనిసరి కానీ కేవలం వెబ్‌డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోలేవు. అందుకే దాదాపు అన్ని సంస్థలు వెబ్‌డిజైనింగ్ ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. కాబట్టి పనివేళలతో సంబంధం లేకుండా నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. కానీ కంపెనీ నిర్దేశించిన గడువు లోగా వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వెబ్‌ డిజైనర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే చాలు నెలకు రెండు మూడు ప్రాజెక్ట్ లు చేసి 25 నుంచి 30 వేల వరకూ సంపాదించే వీలుంది. బాగా పనిచేస్తారని పేరు సంపాదిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది.

 

సోషల్ మీడియా కన్సల్టెంట్ 

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.  యువత అంతా తమ అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎక్కువ సమయంలో అందులోనే గడుపుతున్నారు. దీంతో కంపెనీలు తమ ప్రచార వ్యూహాలను మార్చుకున్నాయి. సోషల్ మీడియాను తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. తమ కంపెనీని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే పనిని సోషల్ మీడియా కన్సల్టెంట్స్ కు అప్పగిస్తున్నాయి.  సోషల్ మీడియా కన్సల్టెంట్స్ తాము తీసుకున్న పనిని తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసినందుకు వీరికి నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ అందుతున్నాయి. ఇంగ్లీష్ పై కాస్త పట్టు ఉండి, చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా సోషల్ మీడియా కన్సల్టెంట్ అయిపోవచ్చు.

పర్సనల్ ట్రైనర్ 

ప్రస్తుతం నైపుణ్యం లేని వ్యక్తికి జాబ్ మార్కెట్ లో విలువ లేదు. అడకమిక్ అర్హతలు ఎన్ని ఉన్నా కమ్యూనికేషన్, లీడర్ షిఫ్ వంటి లక్షణాలు లేకపోతే కంపెనీలు జాబ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఉద్యోగికి, ఉద్యోగార్ధికి భావవ్యక్తీకరణ, నాయకత్వం లక్షణాలను పెంపోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ రెండు విషయాలను నేర్పించే పర్సనల్ ట్రైనర్స్ కు ఆదరణ పెరిగింది. ఉద్యోగికి వెసులుబాటు ఉన్న సమయంలో వీరు అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాల్లో అతన్ని ట్రైనప్ చేస్తారు. ముఖ‌్యంగా ఉదయం సాయింత్రం వేళ్లలో మాత్రమే వీరికి పని ఉంటుంది. మంచి భోధనా నైపుణ్యం ఉంటే పర్సనల్ ట్రైనర్స్ నెలకు 25 నుంచి 30 వేలు సంపాదించవచ్చు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా మారిపోయింది. భూమికి ఉన్న విలువను గుర్తించి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఎక్కడ , ఎలా, ఎంత అన్న విషయాలపై అవగాహన ఉండదు. ఇటువంటి గైడ్ చేసి వారికి అనుకూలమైన స్థలాన్ని, వారి పెట్టుబడి మెత్తం ఆధారంగా చూపించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఏర్పడింది. ఈ కెరీర్ లో చేయవలసింది చాలా చిన్న పని. ఇన్వెస్టర్ తో భూమి యజమానితో మాట్లాడి ఇద్దరికి సంధానకర్తగా వ్యవహరించి అనుకున్న సమయానికి భూమికి చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి వివాదాలు లేని భూమిని ఇన్వెస్టర్లకు చూపిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వెలిగిపోవచ్చు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కెరీర్ కు ఢోకా ఉండకపోవచ్చు.

ట్యాక్స్ కన్సల్టెంట్ 

 

ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది.

 

నిన్ను నువ్వు తెలుసుకోవ‌డ‌మే విజ‌యం!

ఎప్పుడూ నెమ్మ‌దిగా, సైలెంట్ గా ఉండే ఒక వ్య‌క్తి అక‌స్మాత్తుగా కోపంతో ఊగిపోవ‌డాన్ని మీరు చాలా సంద‌ర్భాల్లో చూసి ఉంటారు. అంత సావ‌ధానంగా మ‌సులుకునే వ్య‌క్తి ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌గానే మ‌నం సాధారణంగా ఒక మాట అంటుంటాం. ‘వీడి లోని అస‌లు మ‌నిషి నిద్ర లేచాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్నది నిజంగా వీడినేనా?’  అవ‌త‌లి వాళ్ల కోపం మితిమీరిపోయిన‌ప్పుడు ఇదీ వీడి అస‌లైన స్వ‌భావం అంటూ విమ‌ర్శలు కూడా గుప్పిస్తాం. మ‌నం చూస్తున్న దృష్టి కోణం నుంచి మ‌నం ప్ర‌తీ ఒక్క‌రిపై ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు సంబంధించి, మ‌న ప్ర‌వ‌ర్త‌నకు సంబందించి ఒక స్వీయ గుర్తింపును కూడా ఏర్ప‌రుచుకుంటాం. మెల్ల‌గా అన్ని విష‌యాల్లో మ‌న‌మే చాలా గొప్ప‌వాళ్లం. మ‌నం చేసిన‌వ‌న్నీ ఒప్పులే. మ‌నం త‌ప్పు చేయ‌డానికి చాలా ఫ‌లానా విష‌యం కార‌ణం అంటూ మ‌న‌ల్ని మ‌నం స‌మ‌ర్ధించుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో ఇత‌రులు త‌ప్పుల‌ను, లోపాల‌ను ఎత్తిచూపుతూ వాళ్ల‌ను త‌క్కువ చేయ‌డానికి, నింద‌లు మోప‌డానికి అల‌వాటు ప‌డ‌తాం. ఎంత‌సేపు ఇత‌రుల‌ను నిందించ‌డంలో మునిగిపోయి మ‌న‌లోని లోపాల‌ను, పొర‌పాట్ల‌ను గుర్తించ‌డం పూర్తిగా మానుకుంటాం. స‌రిగ్గా ఇక్క‌డే వ్య‌క్తిత్వ నిర్మాణం, వికాసం దెబ్బ‌తింటాయి. మ‌నిషి సంబంధాల ప‌రంగా, విలువ‌ల ప‌రంగా ప‌త‌నం కావ‌డం మొద‌ల‌వుతుంది.

అంద‌రూ మీలా ఎందుకు ఉంటారు?

 

ఈ ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు.  పుట్టి పెరిగిన సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, విలువ‌లు, నేప‌థ్యం ఆధారంగా ఒక మ‌నిషి వ్య‌క్తిత్వం నిర్మించ‌బ‌డుతుంది.  ఒక మనిషి ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌క్తిత్వం మ‌రో మ‌నిషిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోలి ఉండ‌దు. ఒకే ఇంట్లో పెరిగిన‌ప్ప‌టికీ వారి వారి అనుభ‌వాలు, ఆలోచ‌న‌లు బ‌ట్టి కుటుంబ సభ్యులే విభిన్నమైన ఆలోచ‌నల‌ను, వ్యక్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఆలోచ‌న‌ల్లో సారూప్య‌తులు ఉంటాయి కానీ అచ్చుగుద్దిన‌ట్టు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు ఉండ‌టం అసాధ్యం అనే చెప్పాలి. కాబ‌ట్టి అంద‌రూ మీలా ఆలోచించాలి..మీలా ఉండాలి..అన్న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ‌దిలేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక ప్ర‌త్యేకమైన వ్య‌క్తిత్వం ఉందో అలానే మిగిలిన వారికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని గుర్తించండి. ఎంత‌సేపూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నించ‌డం  అన్న‌ది మీ స‌మ‌యాన్ని వృధా చేస్తుంది త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌రికి ఒక‌రు గౌర‌వంఇచ్చుకుని అపార్ధాలకు, అహాల‌కు తావులేకుండా స‌ర్దుకుపోవ‌డం అన్న‌ది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణం చేయ‌గ‌ల‌రు. అది స్నేహితులైనా, భార్యాభ‌ర్త‌లైనా, కుటుంబ స‌భ్యులైనా.

 

‘నేను’ అనే దాన్ని మీ మ‌న‌స్సులోంచి తీసేయండి! 

 

మీరు గొప్ప ఉపాధ్యాయుల‌ను, నాయ‌కుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఎప్పుడు ‘నేను’ అనే మాట‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌రు. ‘నేను’ అనే మాట మీలో అహంభావాన్ని క‌లిగిస్తుంది. అహంభావం మ‌నిషిని నైతికంగా దెబ్బ‌తీసి ప‌త‌నం దిశ‌గా న‌డిపిస్తుంది. ‘నేను’ అన్న‌దాన్ని మ‌న ఆలోచ‌న‌ల్లోంచి పూర్తిగా తొలిగించ‌డం కాస్త‌ క‌ష్ట‌మైన ప‌నే. అయినా ప్ర‌య‌త్నం చేయాలి. చ‌దువుకునే చోట‌, ప‌నిచేసే చోట, ప‌నిచేయించే చోట ఎక్క‌డైనా కానీయండి ‘నేను’ అనే మాట‌ను వాడ‌టంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. నిజంగా మీరు ఒక్క‌రే బాగా క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ మ‌నం క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పండి. నేను అనే మాట అపార్ధాల‌కు, అపోహ‌ల‌కు దారి తీస్తుంది. సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌న్నా, వ్యక్తుల‌కు గౌర‌వించాల‌న్నా ‘నేను’ అన్న ప‌దాన్ని మీ డిక్ష‌న‌రీ నుంచి పూర్తిగా తొలిగించి ఆ స్థానంలో ‘మేము’ అన్న ప‌దాన్ని చేర్చండి.

మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దుకోండి! 

 

ప్ర‌తీ మ‌నిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సంపూర్ణ‌మైన మ‌నిషి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అయితే త‌న‌లోని లోపాల‌ను గుర్తించ‌డం, వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. ‘నాకు అన్నీ తెలుసు…నేను చేసిన ప‌నికి తిరుగుండ‌దు.’ అని అనుకోవ‌డం పొర‌పాటు. ఆత్మ‌విశ్వాసానికి, అతి విశ్వాసానికి వెంట్రుక‌వాసి తేడా మాత్ర‌మే ఉంటుంది. ఆత్మ‌విశ్వాసం క‌చ్చితంగా ఉండాల్సిందే అయితే అది అతి విశ్వాసంగా మార‌కుండా చూసుకోవాలి. సంబంధాల విష‌యంలోనూ, ప్ర‌వ‌ర్త‌న విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. నిజాయితీగా స‌మీక్ష చేసుకున్న‌ప్పుడు మ‌న‌లోని లోపాలు, చేసిన పొర‌పాట్లు క‌చ్చితంగా మీ దృష్టికి వ‌స్తాయి. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం కాబ‌ట్టి దాన్ని అక్క‌డే వ‌దిలేసి అటువంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకొండి. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ సంబంధాలు, గౌర‌వం ఇచ్చుపుచ్చుకోవ‌డంలో త‌ప్ప‌నిస‌రిగా స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. మీదే త‌ప్పు ఉంద‌ని తేలితే లేదా ఎటువంటి భేజ‌షాల‌కు పోకుండా త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు కూడా వెనుకాడ‌కండి. క్ష‌మాప‌ణ చెప్ప‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకున్న‌ట్టు కాదు మీరు సంబంధాల‌కు అధిక విలువ ఇస్తున్న‌ట్టు.

 

మీ అభిప్రాయాల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు! 

 

మీరు కొంద‌రు వ్య‌క్తుల‌పై లేదా కొన్ని వ్య‌వస్థ‌ల‌పై ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను  క‌లిగి ఉండ‌టం మంచిదే. కానీ అది మీ ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌కుండా చూసుకోండి. ఎందుకంటే అభిప్రాయం క‌లిగి ఉండ‌టం వేరు అదే అభిప్రాయాన్ని మిగిలిన వారు కూడా క‌లిగి ఉండాల‌ని అనుకోవ‌డం వేరు. ప్ర‌తీ వ్యక్తికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటాడ‌ని గుర్తించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. అంద‌ర్నీ గౌర‌వించిన‌ప్పుడే మీకు గౌర‌వం ల‌భిస్తుంది. మీకు ఉన్న ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. మీదైన వ్య‌వ‌స్థ‌లో అది సాధ్య‌మేమో కానీ విభిన్న మ‌న‌స్త‌త్వాల మ‌నుష్య‌లు ఉన్న ప్ర‌పంచంలో అది అస్స‌లు సాధ్యం కాదు. ఎందుకంటే మీ అభిప్రాయాల‌తో ఏకీభ‌వించ‌ని వాళ్లు కూడా ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. కాబ‌ట్టి అంద‌రి అభిప్రాయాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను గౌర‌విస్తూ ముందుకు సాగితేనే విజ‌యం మీ ద‌రికి చేరుతుంది. లేకుంటే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ త‌ప్ప ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు.

 

ఇండియ‌న్ రైల్వేలో ఉద్యోగాలు..ఇప్పుడే అప్లై చేయండి!

కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో స్టాఫ్ న‌ర్స్, ఫార్మ‌సిస్ట్ ల పోస్ట్ ల భ‌ర్తీకి ఇండియ‌న్ రైల్వే అధికారిక ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. పారా మెడిక‌ల్ కేట‌గిరీలో ఈ పోస్టుల భ‌ర్తీని చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఉద్యోగం పేరు
స్టాఫ్ న‌ర్స్
ఫార్మ‌సిస్ట్

పోస్ట్ ల సంఖ్య

10

విద్యార్హ‌త‌లు
స్టాఫ్ న‌ర్స్

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో పాటు మూడేళ్ల కాల వ్య‌వ‌ధి గ‌ల జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ చ‌దివి న‌ర్స్ అండ్ మిడ్ వైఫ్ స‌ర్టిఫికేట్ క‌లిగి ఉండాలి. లేదా ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు క‌లిగిన బీఎస్సీ న‌ర్సింగ్ అయినా పూర్తి చేసి ఉండాలి.

ఫార్మ‌సిస్ట్

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో పాటు ఫార్మ‌సీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ ఫార్మ‌సీ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల కాల వ్య‌వ‌ధి గ‌ల డిప్లొమా ఇన్ ఫార్మ‌సీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

వ‌యోపరిమితి

స్టాఫ్ న‌ర్స్
20 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఫార్మ‌సిస్ట్

20 ఏళ్ల నుంచి 34 ఏళ్లు

ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి?

పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను డివిజ‌న‌ల్ ప‌ర్సన‌ల్ ఆపీసర్, నార్త్ రైల్వే, మొరాదాబాద్ అనే చిరునామాకు పోస్ట్ చేయాలి. ద‌ర‌ఖాస్తులను ఆర్డిన‌రీ పోస్ట్ లోనే పంపాలి. కోరియ‌ర్ చేసినా లేక స్వ‌యంగా ఇచ్చిన ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌బ‌డ‌వు.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ

పూర్తి చేసిన ద‌రఖాస్తులు స్వీక‌రించేందుకు చివ‌రి తేది 2, న‌వంబ‌ర్, 2017 .

బీ కేర్‌ఫుల్..పిల్లలను క‌బ‌ళించే ‘పిశాచాలు’ ఉన్నాయి!

     

దిమ కాలంలో మ‌నిషి జంతు ప్ర‌వృత్తి క‌లిగి ఉండేవాడు. సొంతంగా ఆలోచించ‌డం మొద‌లుపెట్టి సంఘ‌జీవిగా మారి నాగ‌రిక‌త‌లను నిర్మించుకుని ఆధునిక మాన‌వునిగా రూపాంతరం చెందాడు. ఎల్ల‌లు లేని  ఆత్మ‌విశ్వాసంతో అద్భుత ప్ర‌యోగాలు చేస్తూ అంత‌రిక్షానికి కూడా నిచ్చెన‌లు వేస్తున్నాడు. అయితే సృష్టికి ప్ర‌తిసృష్టి చేయ‌గ‌లుగుతున్న‌ మ‌నిషి త‌న‌లోని జంతు ప్ర‌వృత్తిని మాత్రం వ‌ద‌ల్లేక‌పోతున్నాడు. క్రూర మృగాలు సైతం త‌న సొంత జాతిని చంపేందుకు సిద్ధ‌ప‌డ‌వు. అలాంటిది మ‌నుష్యులు మాత్రం అత్యంత అమానుషంగా, క‌ర్క‌శంగా త‌న తోటి వారి ప్రాణాల‌ను తీస్తున్నారు. హ‌త్య‌లు, అత్యాచారాలు చేస్తూ ఈ భూప్ర‌పంచంలో తానే అత్యంత ప్ర‌మాద‌క‌రమైన జంతువున‌ని ప‌దే ప‌దే రుజువు చేస్తున్నాడు. అన్నింటికంటే కంటే ఘోరం ఏంటంటే ఇటీవ‌లి కాలంలో చిన్న పిల్ల‌ల‌పై అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. కొంద‌రు మాన‌సిక ఉన్మాదులు ముక్కుపచ్చలారని చిన్నారుల‌పై శారీర‌క‌, లైంగిక దాడులు చేయ‌డం చూస్తుంటే మ‌నం ఎటువంటి స‌మాజంలో జీవిస్తున్నాం అన్న అనుమానం క‌లుగుక‌మాన‌దు. ఇటువంటి భ‌యాన‌క ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి త‌మ చిన్నారుల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దేశంలో క్రైం రికార్డ్స్ ను ప‌రిశీలిస్తే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. పేరెంట్స్, స‌భ్య స‌మాజం ఎంత ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో అన్న విష‌యాన్ని అనుక్ష‌ణం గుర్తుకు చేస్తున్నాయి.

హ‌రియాణా ఉదంతంతో అయినా క‌ళ్లు తెరుస్తారా? 

తాజాగా హ‌రియాణాలోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో జ‌రిగిన ఏడేళ్ల చిన్న పిల్ల‌వాడి హ‌త్య మాన‌వతావాదుల గుండెల్ని పిండేసింది. స్కూల్ బాత్రూమ్ లో ఆ చిన్న పిల్ల‌వాడ్ని క‌ర్క‌శంగా గొంతు కోసి హ‌త‌మార్చారు. ఆ స్కూల్ లో ప‌నిచేసే ఓ బ‌స్ కండ‌క్ట‌ర్ లైంగిక దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లోనే ఒక పిల్ల‌వాడికి ర‌క్ష‌ణ లేన‌ప్పుడు బ‌య‌ట స‌మాజంలో ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. త‌ల్లిదండ్రులు పిల్ల‌వాడిని స్కూల్ కు పంపేసాం. మా ప‌ని అయిపోయింది అని నిబ్బరంగా ఉండేందుకు వీలులేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. స‌మాజంలో మానవ మృగాలు పెరిగిపోయిన క్ర‌మంలో అనుక్ష‌ణం ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌తో తమ చిన్నారుల‌ను కాపాడుకోవాలి. అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు స‌రిగ్గా ఉన్నాయ‌ని న‌మ్మ‌కం క‌లిగాకే మీ పిల్ల‌ల‌ను స్కూల్ లో జాయిన్ చేయండి.విదేశాల‌తో పోల్చుకుంటే మ‌న‌దేశంలో పిల్ల‌ల‌కు స‌రైన భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు లేవు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే అన్ని ప్ర‌తికూల‌తలు మ‌న‌దేశంలో ఉన్నాయి. కాబ‌ట్టి త‌మ పిల్ల‌ను భ‌ద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులదే.

చిన్నారుల‌పై పేట్రేగిపోతున్న ఉన్మాదులు! 

ఇండియాలో వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త అనేది చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. అధిక జ‌నాభా క‌లిగిన దేశం కావ‌డం వ‌ల‌న పౌరుల‌కు భద్ర‌త క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల‌కు త‌ల‌కు మించిన ప‌ని. భద్ర‌తా విష‌యంలో ఈ డొల్ల‌త‌నాన్ని ఆస‌రా చేసుకునే మాన‌సిక ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. మానవ‌త్వం మ‌రిచి ఆడవాళ్లు, చిన్నారుల‌పై దాడులు చేస్తున్నారు. 2005 లో చిన్న పిల్ల‌ల‌పై జ‌రిగిన నేరాల సంఖ్య‌ 14,975 ఉంటే 2015 నాటికి ఆ సంఖ్య 94,172 కు చేరుకుంది. అంటే మ‌న దేశంలో జ‌నాభా పెరుగుద‌ల రేటు కంటే చిన్న పిల్ల‌ల‌పై పెరుగుతున్న నేరాల రేటే ఎక్కువ‌.  ధ‌న‌వంతులతో పోలిస్తే మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద కుటుంబాల్లో పిల్ల‌ల‌కు మ‌రింత‌ ముప్పు పొంచి ఉంది. చిన్న పిల్ల‌ల‌పై దాడులు ఎక్కువ‌గా పేద కుటుంబాల్లోనే జ‌రుగుతున్నాయి. పేద కుటుంబాల్లో పిల్ల‌ల‌పై దాడులు చేయ‌డ‌మే కాదు వారిని చ‌దువుకు దూరం చేసి నేర‌గాళ్లుగా త‌యారు చేస్తున్నారు. పిల్ల‌ల‌పై దాడులు జ‌రిగే అవ‌కాశ‌మున్న ప‌రిస్థితుల‌ను, ప్రాంతాల‌ను గుర్తించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప్ర‌భుత్వాలు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చోవ‌డం భావి త‌రాల‌కు శాపంగా మారింది.

పిల్లల‌పై నేరాలు అరిక‌ట్టాలంటే ఏం చేయాలి? 

పిల్ల‌ల‌పై ఈ దారుణ దాడుల‌ను అరికట్టేలా చేయ‌డంలో ప్ర‌భుత్వాలదే ప్ర‌ధాన బాధ్య‌త‌. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేసి, స్కూల్ యాజ‌మాన్యాల‌కు క‌ఠినమైన నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను విధిస్తే ఇటువంటి ఘోరాలు కొంత‌వ‌ర‌కు అయినా త‌గ్గేందుకు వీలుంది. ముఖ్యంగా పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌ను పెంచాలి. అయితే అటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వ యంత్రాంగాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్ లోని పేద‌లు, వ‌ల‌స వ‌చ్చిన వారు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో చిన్నారుల‌పై దాడులు వ‌రుసగా పెరుగుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో ఇటువంటి ఘోరాలు వ‌రుస‌గా జ‌రుగుతూనే ఉన్నాయి.

  • నిర్మాన్యుషంగా ఉండే ప్ర‌దేశాలు, పార్క్ ల‌లో భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేయాలి.
  • నేరాలు జ‌రిగే అవ‌కాశం ఉంటే ప్రాంతాలు, ప్ర‌దేశాల్లో శాత్వ‌తంగా కొంద‌రు పోలీసుల‌ను నియ‌మించాలి.
  • మ‌న దేశంలో ల‌క్ష మంది పౌరుల‌కు కేవ‌లం 130 మంది పోలీసులు మాత్ర‌మే ఉన్నారు. ఇందులో రాజ‌కీయ‌నాయ‌కులు, ఇత‌రుల‌ భ‌ద్ర‌త‌కే ఎక్కువ మంది ఉన్నారు.
  • చిన్నారుల‌పై దాడులు అరిక‌ట్టాలంటే ముందుగా పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేయాలి.
  • నేరాలు జ‌రిగే ఆస్కారం ఉన్న‌ ప్రాంతాల్లో త‌ల్లిదండ్రుల‌కు కౌన్సిలింగ్ నిర్వ‌హించాలి. పిల్ల‌ల‌ను ఎలా జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలో తెలియజేయాలి.
  • టెక్నాల‌జీని ఉప‌యోగించి నేరగాళ్లు తిరిగే ప్రాంతాల‌ను గుర్తించి అక్క‌డ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాలి.

చిన్నారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో త‌ల్లిదండ్రుల‌దే కీల‌క‌పాత్ర‌! 

ప్ర‌భుత్వాలు, పోలీసు వ్య‌వ‌స్థలు ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే త‌మ చిన్నారుల‌ను కాపాడుకోవ‌డంలో పేరెంట్స్ దే ముఖ్య‌పాత్ర. స్కూల్ లో జాయిన్ చేసేసాం మ‌న ప‌ని అయిపోయింది. మా పిల్ల‌లు క్షేమంగా ఉంటార‌ని ఆలోచించ‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అవివేకం అనిపించుకుంటుంది. మీ చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాలు మొద‌లుకుని, స్కూల్ ప‌రిస‌రాల వ‌ర‌కూ పిల్ల‌ల భ‌ద్రంగా ఉన్నార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేసుకోవాల్సిందే.

  • అప‌రిచితులు మీ పిల్ల‌ల‌తో చ‌నువుగా మెలిగేందుకు ప్ర‌య‌త్నిస్తే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి.
  • స్కూల్ లో లేదా బ‌స్, ఆటోల్లో ఎవ‌రైనా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని పిల్ల‌లు చెపితే తేలిగ్గా తీసిపారేయ‌కండి.
  • పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల్లో అధిక శాతం మంది నిందితులు ఆ కుటుంబానికి ప‌రిచ‌య‌స్తులే . కావున పరిచ‌య‌స్తులైనా స‌రే వారి ప‌రిధి దాటి పిల్ల‌ల‌తో చ‌నువుగా ఉండేందుకు అనుమ‌తించ‌కండి.
  • పిల్ల‌ల‌ను ఒంటరిగా దుకాణాల‌కు పంప‌డం, రాత్రిళ్లు వేరే చోట‌కి వెళ్లేందుకు అనుమ‌తించ‌డం అస్స‌లు చేయ‌కండి.
  • అప‌రిచితులు ఏమైనా తినుబండారాలు, బ‌హుమ‌తులు ఇస్తే తిర‌స్క‌రించడాన్ని పిల్ల‌ల‌కు నేర్పించండి.
  • పిల్ల‌ల భ‌ద్ర‌త కోసం వారితో ప్ర‌త్యేకమైన కోడ్ ను కంఠ‌తా చేయించండి. మీరు కాకుండా వారిని తీసుకెళ్లేందుకు వేరే వ్య‌క్తులు వ‌స్తే ఆ కోడ్ చెప్ప‌మ‌ని అడిగేలా పిల్ల‌ల‌కు త‌ర్ఫీదు ఇవ్వండి.
  • ప్ర‌తీ రెండు వారాల‌కు ఒక‌సారి స్కూల్ కు వెళ్లి అక్క‌డ మీ పిల్ల‌ల‌కు ఎటువంటి స‌దుపాయాలు ఉన్నాయో తెలుసుకొండి. అక్క‌డ మీ పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త లేద‌ని అనిపిస్తే వెంట‌నే  ఆ స్కూల్ మార్చేయండి.

 

ఇంటర్వ్యూలో కచ్చితంగా అడిగే ’10 ప్రశ్నలు’ ఏంటో తెలుసా?

పరిమిత మానవ వననరులతో అపరిమిత ప్రయోజనాలను పొందడమే కంపెనీల మెయిన్ టార్గెట్. అందుకే ఒక అభ్యర్ధిని ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు విభిన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్ధికి టెక్నికల్ నైపుణ్యాలతో పాటు తమ పని సంస్కృతికి అలవాటు పడగలడా లేదా తమ సంస్థకు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్న విషయాలను పరిశీలించాకే ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధపడతారు. టెక్నికల్ రౌండ్ లో ఎంత మంచి ప్రతిభ చూపినా హెచ్‌ఆర్ రౌండ్ మాత్రం అభ్యర్ధులకు చాలా కీలకమైనది. ఎందుకంటే టెక్నికల్ రౌండ్ అనేది తాము చదువుకున్న టాపిక్ కు సంబంధించినది కానీ హెచ్ఆర్ రౌండ్ లో మాత్రం అస్సలు ఊహించనటువంటి కఠిన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకంటే విభిన్న ప్రశ్నల ద్వారానే అభ్యర్ధి యొక్క ఆప్టిట్యూడ్ ను ఆటిట్యూడ్ ను హెచ్‌ఆర్ మేనేజర్లు నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ రౌండ్ అభ్యర్ధులకు కఠినమైన సవాలే. అయితే కాస్త సాధన చేసి, ప్రశ్నలకు ముందుగా ప్రిపేర్ అయి వెళితే హెచ్‌ఆర్‌ మేనేజర్లను మెప్పించడం కష్టమైన విషయమేమీ కాదు.

ఇంటర్వ్యూలో హెచ్ఆర్ మేనేజర్లు అడిగే టాప్ 10 ప్రశ్నలు ఇవే..

1. మీ గురించి కాస్త చెప్పండి?

ఈ ప్రశ్న ప్రతీ ఇంటర్వ్యూలో తరుచుగా అడిగే ప్రశ్నే. కానీ అభ్యర్ధులు సమాధానం చెప్పే తీరు రిహార్సల్స్ చేసి కంఠతా పట్టి చెప్పినట్టుగా ఉండకూడదు. చాలా కాన్ఫిడెంట్ గా నిటారుగా కూర్చుని ఈ ఉద్యోగానికి తన అర్హతలు ఎంత బాగా సరిపోతాయో వాళ్లకు చెప్పగలగాలి. అలాగే తనకున్న అనుభవం ఆ ఉద్యోగానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా వివరించాలి. అదే సమయంలో హెచ్‌ఆర్ మేనేజర్లు ఎటువంటి అభ్యర్ధిని కోరుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాలి.

2. మీకున్న బలాలు ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానాన్ని చాలా సానుకూల దృక్ఫదంతో వివరించాలి. చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వృత్తి నైపుణ‌్యం, నాయకత్వ నైపుణ్యాలు, పాజిటివ్ థింకింగ్, కష్టపడే గుణం వీటన్నింటినీ వాళ్లకు సరైన రీతిలో వివరించాలి. మీరు చెప్పే లక్షణాలు మీలో ఖచ్చితంగా ఉన్నాయని వాళ్లకు నమ్మకం కలిగేలా మీ సమధానం ఉండాలి.

3. మీలో ఉన్న లోపాలేంటి?

వాస్తవానికి ఇది చాలా కఠినమైన ప్రశ్న. ఇది అభ్యర్ధులను ఎలిమినేట్ చేసేందుకు ఉద్ధేశించిన ప్రశ్న. అదే విధంగా అభ్యర్ధుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఈ ప్రశ్న అడుగుతారు. వాస్తవానికి మీ బలహీనతలను మీరు స్వయంగా తెలుసుకోలేరు. కాబట్టి ఈ ప్రశ్నకు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి.

4. మీ పాత జాబ్ ను ఎందుకు వదిలేసారు?

మీరు మీ పాత జాబ్ ను విడిచిపెట్టడానికి గల కారణాలను చాలా పాజిటివ్ ఆటిట్యూడ్ తో చెప్పాలి. అవి కూడా చాలా సహేతుకంగా ఉండాలి. మీ పాత సంస్థపై నెగెటివ్ కామెంట్స్ అస్సలు చేయొద్దు. నిజంగా ఆ కంపెనీలో మీకు చేదు అనుభవాలు ఉన్నా అవి ఇక్కడ ప్రస్తావించొద్దు. జాబ్ వదిలేయడానికి సరైన కారణాలు చెప్తే సరిపోతుంది.

5. అసలు ఈ ఉద్యోగంలోకి నిన్నెందుకు తీసుకోవాలి?

ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ మేనేజర్లు ఏం కోరుకుంటున్నారనో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమాధానాలు కూడా వాటికి అనుగుణంగా సమయానుసారంగా ఇవ్వాలి. మీకు అవసరమైన పోజిషన్ కు సరిపోయే నైపుణ్యాలు నా దగ్గర ఉన్నాయని ప్రభావవంతంగా చెప్పాలి.

6. ఐదేళ్ల తర్వాత ఎటువంటి పోజిషన్ లో ఉండాలనుకుంటున్నావు?

సంస్థలో మీరు ఎక్కువ కాలం ఉంటారా? లేదా? అన్నది తెలుసుకోవడానికి హెచ్‌ఆర్ మేనేజర్లు సంధించే ప్రశ్న ఇది. దీనికి సమాధానం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన పనిలేదు. ఏ పొజిషన్ కోరుకుంటున్నారో సహేతుకంగా, వాస్తవంగా చెపితే సరిపోతుంది.

7. నువ్వు టీమ్ ప్లేయర్ వా?

ఈ ప్రశ్న ఎదురుకాగానే మీ టీమ్ ఆటిట్యూడ్ ను వ్యక్త పర్చాలి. టీమ్ ప్లేయర్ నే అని చెప్పాలి. గతంలో టీమ్ కోసం ఏం చేసారో, ఎటువంటి కృషి చేసారో వివరించాలి. దానికి ఏమైనా ఉదాహరణలు ఉంటే వాటిని తెలియజేయాలి.

8. మీ మేనేజ్‌మెంట్ విధానం ఎలా ఉంటుంది?

అందర్నీ కలుపుకుపోయే లక్షణం అని చెప్పండి. లేదా పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఎదగాలి అన్న సమాధానం అయినా చెప్పొచ్చు. సిట్యుయేషన్ తగ్గట్టుగా సమాధానం ఉండాలి. మీ సమాధానం మీరు ఉద్యోగం చేయబోయే కంపెనీ ఆలోచనలకు సరిపోయే విధంగా ఉండాలి.

9. అసలు ఈ సంస్థకు నువ్వు అసెట్ ఎలా కాగలవు?

ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని బలంగా ఆకట్టుకోవాల్సిన సందర్భం ఇది. మీ సమాధానంతో వారి విశ్వాసాన్ని చూరగొనాలి. మిమ్మల్ని తీసుకోవడం వల సంస్థకు కలిగే ప్రయోజనాలు, ఎంత బలంగా చేకూరుతుందో చెప్పుకోవాలి.

10. మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా?

చాలా మంది అభ్యర్ధులు ఇక్కడ కూడా తడబడతారు. ఏడాదికి జీతం ఎన్నిసార్లు పెంచుతారు? వంటి సిల్లీ ప్రశ్నలు వేస్తారు. అలా కాకుండా నేను సెలెక్ట్ అయితే ఎప్పటిలోగా ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది? అన్న ప్రశ్నలు అడగొచ్చు. దీని వలన మీ ఆ ఉద్యోగంలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని రిక్రూటర్లు గుర్తిస్తారు.

లక్ష్యాలు నిర్దేశించుకోండి!

కష్టపడి పని చేస్తే.. విజయం దక్కుతుంది. అనుకున్నవాటిని సాధించవచ్చు. కాని కొందరు కష్టపడి పని చేస్తున్నా.. వృత్తిగతంగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవచ్చు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవచ్చు. ఇందుకు కారణం చేస్తున్న కసరత్తు… ఎంచుకున్న లక్ష్యాలకు తగినట్లు లేకపోవడం. విజయానికి ఆటంకంగా మారే కొన్ని అలవాట్లు ఉండటం. అందువల్ల ముందుగా విజయానికి ఆటంకం కలిగించే అలవాట్లను గుర్తించి వాటికి దూరం కావాలి. వృత్తిపరంగా కొంత అనుభవం వచ్చాక.. ఎక్కువ మంది అన్నీ తమకు తెలుసు.. అన్ని పనులనూ తామే ఒంటరిగా చేసేయవచ్చని భావిస్తుంటారు. ఇలాంటి వైఖరి కెరియర్‌ పరంగా కొన్నిసార్లు చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. అందువల్ల కార్యాలయంలో ప్రతి పనినీ ఒంటరిగానే పూర్తిచేయాలని భావించవద్దు. చేస్తున్న పనికి సంబంధించి ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా సహచరులు, సీనియర్లను సంప్రదించి వారితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మేలు. ఇలాంటి వైఖరితో మీ పని సులభం కావడంతో పాటు ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది.
వృత్తిపరంగా ప్రతి పనినీ వంద శాతం పక్కాగా పూర్తి చేయాలి. చాలా మంది ఈ విషయంలో కాస్త ఉదాసీనత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది పనికి రాదు. ఫలితం ఆశించిన మేర వచ్చేవరకూ కృషి చేస్తూనే ఉండాలి. తగిన సమయం లేక.. ఇక ఆలస్యం చేస్తే నష్టం వస్తుంది అనుకున్నపుడు కాస్త రాజీపడొచ్చు. అంతేకాని పనిని పక్కాగా పూర్తి చేసే విషయంలో ఎప్పుడూ రాజీ వద్దు. ఒకసారి గతంలో వృత్తికి సంబంధించిన ఏయే విషయాల్లో రాజీపడ్డారు.. దీని వల్ల కలిగిన ప్రతికూలతేంటో గుర్తుచేసుకొని వాటిని విశ్లేషించుకోండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా ఇకపై అన్ని పనులనూ పక్కాగా పూర్తి చేసేందుకు సిద్ధంకండి.
కొంత మంది బాగా పని చేస్తారు. కాని వారికి ఏమీ లక్ష్యాలు ఉండవు. దీంతో కొన్ని రోజులు గడిచాక వెనక్కి తిరిగి చూసుకొంటే ఇలాంటి వారికి చెప్పుకోదగిన విజయాలు పెద్దగా ఉండవు. అందువల్ల ప్రతి ఉద్యోగీ తమకు ఏదో ఒక లక్ష్యం ఉండేలా చూసుకోవాలి. తాము చేస్తున్న వృత్తి.. ప్రతిభ.. నైపుణ్యాలు.. ప్రస్తుత పరిస్థితికి తగినట్లు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకొని ఇకపై వాటిని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. ప్రతి నెలా.. సంవత్సరం.. ఇలా కాలపరిమితికి తగినట్లు లక్ష్యాలను పెట్టుకోవాలి.
కొందరు కార్యాలయానికి వెళ్లామా.. చెప్పిన పని చేశామా.. జీతం వచ్చిందా అన్న ధోరణిలో ఉంటారు. ఈ తీరు సరికాదు. ఇలాంటి తీరును కొనసాగిస్తే ఎంత కాలం పని చేసినా పెద్దగా అభివృద్ధి చెందలేరు. అనుభవం తోడవడం తప్ప మరే ఇతర ప్రయోజనమూ ఉండదు. కొన్నాళ్లకు చేస్తున్న పని కూడా విసుగనిపిస్తుంది. అందువల్ల ఎప్పుడూ ఒకే తరహా పని తీరుకు అలవాటుపడవద్దు. మీరు చేస్తున్న పనితీరును మరింత బాగా అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. మరింత బాగా పని చేసి.. మీ సత్తా ఏంటో చాటేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టవద్దు. అవకాశం రాకపోతే మీ నైపుణ్యాలేంటో ఉన్నతాధికారులకు తెలియజేసి మంచి అవకాశాలనూ అందిపుచ్చుకోగలమన్న ధీమాను వ్యక్తం చేయండి. అలా చేయకుండా ఉంటే ఎప్పటికీ సాధారణ ఉద్యోగిగానే మిగిలిపోయే ప్రమాదముంటుంది. అందువల్ల ఎప్పుడూ ఒకే తరహా పనితీరుతో సంతృప్తి చెందవద్దు. బాగా పని చేసేందుకు కృషి చేస్తూ ఉన్నత లక్ష్యాలను అందుకోవాలి.
కొన్నిసార్లు అనుకున్నవి సాధించాలంటే కొద్దిపాటి సాహసం చేయాల్సి ఉంటుంది. దీనికి వెనకాడితే లక్ష్యం సకాలంలో నెరవేరకపోవచ్చు. ఒక్కోసారి సంస్థలో సహచరులు కూడా మీ వృత్తిగత విజయాలను ప్రభావితం చేయవచ్చు. ఎక్కువ మంది మిమ్మల్ని విజయంవైపు ప్రొత్సహిస్తే.. కొందరు ఆటంకాలు సృష్టించేవారూ ఉండవచ్చు. అందువల్ల సంస్థలో సహచరుల విషయంలోనూ కాస్త ఆచితూచి వ్యవహరించాలి. వేర్వేరు మనస్తత్వాలు, విభాగాలు, పనులకు సంబంధించిన వారితో కలిసి పని చేస్తే కొన్ని అదనపు విషయాలను నేర్చుకోవడంతో పాటు వారిచ్చే సలహాలు మీ అభివృద్ధికి పనికి వస్తాయి.
మార్పును ఆహ్వానిస్తూ..
ప్రస్తుతం యువత సామాజిక చైతన్యం కోసం కొంతమేర అయినా కృషి చేసే సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ప్రైస్‌ వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌ అనే సంస్థ భవిష్యత్తులో ఉద్యోగ విధానంపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది యువత వద్ద అభిప్రాయ సేకరణ జరిపింది. 75 శాతం మంది భారత యువత సామాజిక చైతన్యం కోసం కొంతైనా కృషి చేస్తున్న సంస్థల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. మరో 26 శాతం మంది వైవిధ్యం ఉన్న ఉద్యోగాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం.. భవిష్యత్తు ఉద్యోగం తీరు అంశానికి వస్తే.. మరికొన్నేళ్లలో దేశంలోని చిన్న సంస్థలన్నీ సామాజిక అనుసంధాన వేదికలు, అంతర్జాలం వేదికగా కలిసి పని చేసే అవకాశముంది. నైపుణ్యం ఉన్నవారు వ్యక్తిగతంగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా తమ నైపుణ్యాలను అవసరమైన వారి వద్దే పని చేస్తారు. భారత్‌లో సగం మందికిపైగా సుదీర్ఘ కాలం ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు. ఇంతే స్థాయిలో యువత భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు చేయాలనుకోవడం లేదు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది ఉద్యోగులు నచ్చిన రీతిలో పని చేయాలని భావిస్తున్నారు. 81 శాతం మంది మారుతున్న పరిస్థితులకు తగినట్లు నైపుణ్యాలు పెంచుకోవాలని అనుకుటున్నారు. 2022కి దేశ వ్యాప్తంగా కార్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం, గొప్ప నైపుణ్యాలున్న యువతే ఉంటుందని పేర్కొన్నారు. అయితే వీరు సంప్రదాయ పద్ధతుల్లో కార్యాలయంలో పని చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు.