Month: October 2017
పీజీ నీట్ 2018 లో కీలక మార్పులు!
2018 – 19 విద్యా సంవత్సరానికి గాను పీజీ వైద్య విద్య లో ప్రవేశాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ, తేదీలకు సంబంధించి జాతీయ పరీక్షల మండలి ( ఎన్ బీఈ) ప్రకటన విడుదల చేసింది. పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 7 న జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ( నీట్) ను నిర్వహించనున్నారు. తగిన అర్హతలు ఉన్న వైద్య విద్యార్ధులు పీజీ నీట్ 2018 కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష కూడా ఆన్ లైన్ లోనే ఉంటుంది.
పీజీ నీట్ 2018 ను ఒకే రోజు ఒకే విడతగా నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధులందరికీ ఒకే విధమైన క్వశ్చన్ పేపర్ వస్తుంది. గతంలో కొందరికి సులువుగా, మరికొందరికి కఠినంగా ప్రశ్నలు వచ్చాయన్న విమర్శల నేపథ్యంలో ఈ మార్పులు చేసారు. అయితే ఈ సారి తొలిసారిగి నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సరైన సమాధానికి 4 మార్కులు వస్తాయి. అలాగే తప్పు సమాధానానికి మైనస్ 1 మార్కు వస్తుంది. సమాధానం రాయకపోతే ఎటువంటి మార్కులు ఉండవు. పరీక్షలో మొత్తంగా 300 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయాన్ని 3గంటల 30 నిమిషాలుగా నిర్ణయించారు.
ఆ సమస్య గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు పెను శాపం!
ప్రజలకు కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల విధి. అయితే ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి పారిపోవడంతో ఇప్పుడు కీలకమైన విద్య, వైద్యం లోకి కార్పోరేట్ శక్తులు ప్రవేశించి వాటిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా విద్య అనేది ఇప్పుడు లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఈ దుర్మార్గపు మార్పుకు ప్రభుత్వాలు కూడా పరోక్షంగా సాయం చేయడంతో కార్పోరేట్ విద్యా సంస్థలు భారీ ఫీజులను వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి వారిని విద్యకు దూరం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పేదవారికి సర్కారీ స్కూళ్లే దిక్కు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. దీంతో పేద పిల్లలు చిన్నతనంలోనే చదువుకు అటు తర్వాత అందమైన భవిష్యత్ కు దూరమవుతున్నారు.
చేతులు కడుక్కునేందుకు నీళ్లు లేవు!
పాఠశాలల్లో పిల్లలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వం యొక్క కనీసమైన బాధ్యత. అయితే చాలా పాఠశాలల్లో తాగునీరు సంగతి దేవుడెరుగు..కనీసం చేతులు కడుక్కునేందుకు కూడా నీళ్లు లేవు. దీంతో పిల్లలు అపరిశుభ్రమైన చేతులతోనే మధ్యహ్న భోజనాన్ని చేస్తూ చాలా సందర్భాల్లో తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. పాఠ్యపుస్తకాల వెనుకవైపు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ విధంగా చేతులు కడుక్కునేందుకు తగిన సదుపాయాలు కల్పించకపోవడం నిజంగా దుర్మార్గం. భోజనం చేసే ముందుకు సబ్బుతో చేతులు కడుక్కునేందుకు అవకాశం లేక గ్రామీణ ప్రాంత విద్యార్ధులు జ్వరాలు, డయేరియా బారిన పడుతున్నారు.
బాత్ రూమ్ లు లేక బడి మానేస్తున్న ఆడపిల్లలు!
చాలా సర్కారీ స్కూళ్లలో పిల్లలు మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. మగపిల్లలు ఆరు బయటకు వెళ్లి వస్తున్నారు. కానీ ఆడపిల్లలు పరిస్థితి దయనీయంగా ఉంది. మరుగుదొడ్లు అలా అని ఆరు బయటకు వెళ్లలేక అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. దీంతో చాలా మంది ఆడపిల్లలు అర్ధంతరంగా బడి మానేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు లేదు. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 52 శాతం పాఠశాలల్లో పిల్లలు చేతులు కడుక్కునేందుకు, బాత్ రూమ్ కు వెళ్లేందుకు కూడా సదుపాయాలు లేవని తాజా సర్వేలో తేలింది. బాత్ రూమ్ లు ఉన్న పాఠశాలల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లో 500 మంది 600 మంది పిల్లలకు కేవలం ఒక్క బాత్ రూమ్ కట్టి అధికార్లు చేతులు దులుపుకున్నారు. దీంతో మూత్రశాలకు వెళ్లేందుకు పిల్లలు ఊపిరి బిగబట్టి తమ వంతు ఎప్పుడు వస్తుందా అని లైన్ లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది.
హాజరు శాతం పెంచాలంటే ఏం చేయాలి?
ఒకప్పుడు తమ పిల్లలను బడికి పంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తల్లిదండ్రులు నిరాకరించేవారు.ఇప్పుడు అటువంటి పరిస్థితి చాలా వరకు తొలిగిపోయింది. అయినా సరే గ్రామీణ ప్రాంతాల్లో హాజరు శాతం పెరగడం లేదు. ఎందుకు? పిల్లలకు కనీస సౌకర్యాలు, వసతులు కల్పించకపోవడం అనారోగ్యం బారిన పడి , బడి మధ్యలో మానేస్తున్నారు. ఇక స్కూళ్లలో బాత్ రూమ్ లు లేక ఆడపిల్లలు స్కూళ్లకు రావడం మానుకుంటున్నారు. హాజరు శాతం పెంచుతాం. మంచి ఫలితాలు సాధిస్తాం అని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు ఈ విషయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. చేతులు కడుక్కునేందు సబ్బు, నీరు లేక పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని సర్వేలో తేలడం ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. ఇంత కంటే దుర్మార్గమైన విషయం ఏమైనా ఉంటుందా? ప్రభుత్వాలు ఆర్భాటపు ప్రచారాలు, ఓట్ల కార్యక్రమాలు పక్కన పెట్టి స్కూళ్లలో కనీస సదుపాయాలు పెంచేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. పిల్లల డ్రాపవుట్లను తగ్గించి భావి భారత పౌరులకు నాణ్యమైన విద్యను అందించాలి. అది ప్రభుత్వాల కనీస బాధ్యత..ప్రజల ముఖ్యమైన హక్కు.
ఇంటర్వ్యూలో ఏది ముఖ్యమో తెలుసా? ఈ వీడియో చూడండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 623 అసిస్టెంట్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 623 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో ఈ భర్తీ ప్రక్రియను చేపట్టనుంది.
విద్యార్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏదైతే రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారో ఆ స్థానిక బాషలో అభ్యర్ధులకు మంచి పట్టు ఉండాలి.
వయోపరిమితి : 20 నుంచి 28 ఏళ్లు
ప్రారంభ వేతనం : నెలకు రూ.14,650/-
ఎంపిక ప్రక్రియ : అభ్యర్ధులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం : అభ్యర్ధులు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. https://www.rbi.org.in వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది : 10 నవంబర్ 2017
ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్ష : 27, 28 నవంబర్ 2017
ఆన్ లైన్ మెయిన్స్ పరీక్ష : 20 డిసెంబర్ 2017
http://blog.tutorspride.com/2017/10/24/congratulations-once-again-to-dr-c-narendra-reddy-garu/
బెస్ట్ పర్సన్ Vs రైట్ పర్సన్!!
ఏదైనా ఒక వ్యవస్థ కానీయండి..సంస్థ కానీయండి..అది అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే సమర్ధులైన వ్యక్తులు కావాల్సిందే. లేకుంటే ఆ సంస్థ మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఒక వ్యవస్థను నిర్మించాలంటే నిర్మించాలంటే దాన్ని విజయవంతంగా నడిపించాలంటే ముందుగా సమర్ధులను ఎంపిక చేసుకోవడమే చాలా కీలకమైన విషయం. అయితే సరిగ్గా ఇక్కడే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. అదేంటంటే రైట్ పర్సన్ ను ఎంపిక చేసుకోవాలా? లేక బెస్ట్ పర్సన్ ను ఎంపిక చేసుకోవాలా? మానవ వనరులు ఎంపికలో ఇది చాలా కీలకమైన విషయం. ఈ విషయంలో తీసుకునే నిర్ణయం ఆధారంగానే సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సమర్ధుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘కెరీర్ టై్మ్స్’ ప్రత్యేక కథనం.
సక్సెస్ కు సర్కిల్ కు సంబంధం ఉంది!
ఒక ప్రముఖ రచయిత చెప్పినట్టు నువ్వు ఇప్పటికీ సక్సెస్ సాధించలేకపోతున్నావు అంటే ఒక్కసారి నీ చుట్టూ ఉన్న సర్కిల్ ను ఒక్కసారి సరిచూసుకోవాల్సిందే. మన చుట్టూ ఉన్న సర్కిల్ మాత్రమే మన సక్సెస్ ను డిసైడ్ చేస్తుంది. విజయం మిమ్మల్ని వరించడం లేదు అంటే కచ్చితంగా సర్కిల్ ను మార్చాల్సిందే. సర్కిల్ అంటే వేరే ఏమీ కాదు. నీ చుట్టూ రైట్ పీపుల్ ఉండేలా చూసుకోవడమే. సర్కిల్ అంటే స్నేహితులు, సన్నిహితులే కాదు మీ కింద పనిచేసే ఉద్యోగులు కూడా రైట్ పర్సన్ అయి ఉండాలి. రైట్ పర్సన్ నీ పక్కన ఉన్నప్పుడు ఆలస్యమైనా నీకు విజయం వచ్చి తీరుతుంది. నిరంతరం నీ ఉన్నతిని కోరుకుని అవసరమైనప్పుడు నిన్ను హెచ్చరించే రైట్ పర్సన్ వలన వ్యక్తికి వ్యవస్థకు మేలు జరుగుతుంది.
బెస్ట్ పర్సన్స్ కు రైట్ పర్సన్స్ తేడా ఏంటి?
మనం ముందుగా చెప్పుకున్నట్టు మానవ వనరులు ఎంపికలో ఇది ఎప్పటికీ చాలా క్లిష్టమైన ప్రశ్నే. బెస్ట్ పర్సన్ అంటే పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగి ఉండి ఏ పనిని ఎప్పుడు చేయాలో కచ్చితంగా తెలిసిన వాడే బెస్ట్ పర్సన్. అయితే బెస్ట్ పర్సన్ కదా మన ఛాయిస్ కావాల్సింది? ఇక రైట్ పర్సన్ అవసరం ఏముంది? అన్న ప్రశ్న ఉదయించవచ్చు. కానీ దీర్ఘకాలానికి రైట్ పర్సన్ మాత్రమే సంస్థకు ప్రయోజనం చేకూర్చగలుగుతాడు. ఎందుకంటే బెస్ట్ పర్సన్ ఎప్పుడూ ఒక సంస్థలో, ఒకే పనిని విశ్వాసంగా చేసేందుకు సిద్థంగా ఉండడు. వివరంగా చెప్పాలంటే బెస్ట్ పర్సన్స్ కు స్థిరత్వం ఉండదు. అది వాళ్లకు అనివార్యత కూడా కావచ్చు. అదే రైట్ పర్సన్స్ కు అంత నైపుణ్యం ఉండకపోవచ్చు. కానీ నమ్మి పనిని అప్పగిస్తే కష్టపడి దాన్ని సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తాడు.
రైట్ పర్సన్ ను గుర్తించడమే విజయం!
బెస్ట్ పర్సన్ ఎవరికైనా హైరింగ్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. కానీ రైట్ పర్సన్ హైరింగ్ ద్వారా దొరికేందుకు వీలు లేదు. రైట్ పర్సన్ అనేవాడు వ్యక్తిగత సంబంధాల ద్వారా మాత్రమే మనకు అందుబాటులోకి వస్తాడు. సరైన రైట్ పర్సన్ ను గుర్తించి అతన్ని సరైన ప్లేస్ లో డిప్యూట్ చేయగలిగితే సంస్థకు తిరుగుండదు. స్వాతంత్రోద్యమ కాలంలోనూ గాంధీజీ ఇదే రకమైన విధానాన్ని అవలంభించి స్వాత్రంత్రాన్ని సాధించగలిగాడు. కీలకమైన స్థానాల్లో రైట్ పర్సన్స్ కు నియమించి వారి కింద బెస్ట్ పర్సన్ ను నియమించడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇదే సూత్రాన్ని వ్యాపారంలో కూడా అవలంభిస్తే అవే విజయవంతమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది.
స్థిరంగా ఉన్నదానికి బలమెక్కువ!
రైట్ పర్సన్ ఎంపిక చేసుకోవడం అనేది ఒక్క వ్యాపార సంస్థలకే కాదు, వ్యవస్థలకు, కుటుంటాలకు కూడా అది చాలా కీలకమైన విషయం. ఒక రైట్ పర్సన్ ఉన్నప్పుడు ఆ కుటుంబం, ఆ వ్యవస్థ సక్రమంగా సాగిపోతాయి. ఎందుకంటే అక్కడ స్థిరత్వం ఉంటుంది. ఏదైనా స్థిరంగా ఉన్నదానికి ఉన్న విలువ పరుగులు తీసే దానికి ఎప్పటికీ ఉండదు. మానవ వనరులు ఎంపికకు ఈ సూత్రాన్ని అన్వయించుకుని రైట్ పర్సన్ ను ఎంపిక చేసుకోగలిగితే అది సంస్థ విజయానికి దోహదపడుతుంది.
ప్రతీ విద్యార్ధి ఈ 4 జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!
మార్కులు, ర్యాంకుల ప్రాతిపదికన నడుస్తున్న ప్రస్తుత మన విద్యా వ్యవస్థ విద్యార్ధులపై మానసిక ఒత్తిడిని పెంచుతోంది. పాఠశాల, కళాశాలల్లో రోజంతా భరిస్తున్న ఒత్తిడికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు కూడా నిరంతరం చదువుకోసమే చర్చించడంతో విద్యార్ధికి ఉల్లాసమే కరవవుతోంది. దీంతో మానసిక ఉద్వేగాలను, ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలో తెలియక చాలామంది విద్యార్ధులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా అసూయ, ద్వేషం, ఆత్మవిశ్వాస లోపించడం వంటి మానసిక అవరోధాలను విద్యార్ధులు అదుపు చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం తీసుకుని ఈ తాత్కాలిక అడ్డంకులను అధిగమిస్తే విద్యార్దులు విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. బాగా చదివితేనే అందరూ స్నేహం చేస్తారు! మార్కులు తక్కువ వస్తే ఎవరూ పట్టించుకోరు! ఇలాంటి భయాలు విద్యార్ధిలో మానసిక ఒత్తిడిని పెరిగేలా చేస్తాయి. అలా కాకుండా సంతోషంగా ఉండటమే ముఖ్యం. నేను కష్టపడి చదివితే అన్నీ నా దగ్గరకే వస్తాయన్న రీతిలో ఆలోచిస్తే ఒత్తిడిని అధిగమించవచ్చు. మంచి ప్రేరణతో, స్ఫూర్తిదాయక విద్యార్ధిగా కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యార్ధులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆత్మవిశ్వాసం..కొండంత బలం!
పునాది పటిష్టంగా లేకుంటే భవనం ఎలా కుప్పకూలుతుందో ఆత్మవిశ్వాసం లేకుంటే మనిషి కూడా అలా కుప్పకూలాల్సిందే. ఆత్మవిశ్వాసం విద్యార్ధులకు మరింత ముఖ్యం. నేను అది చేయగలను, నాకు ఆ సామర్ధ్యం ఉంది. అని బలంగా నమ్మితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అదే విధంగా విద్యార్ధి ఒత్తిడికి గురి కాకుండా సంతోషం ఉండటంలో కూడా ఆత్మవిశ్వాసానిదే కీలక పాత్ర. తరగతిలో సహ విద్యార్ధులతో పాటు బయటవారిని కూడా స్నేహితులుగా మలుచుకోవాలి. ఎందుకంటే సామాజిక సంబంధాలు బలంగా ఉన్నప్పుడు ఆనందం ఎన్నడూ దూరం కాదు. అయితే స్నేహాలు ఎప్పుడూ విద్యార్ధి చదువుకు భంగం కలిగించకూడదు. విద్యార్ధిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నప్పుడు తన బలాలు, బలహీనతలపై అతనికి ఒక స్పష్టత ఉంటుంది. ఒక విషయంపై తనపై ఎవరైనా విమర్శలు చేసినా, ప్రతికూల వ్యాఖ్యానాలు చేసినా ఆత్మవిశ్వాసం ఉన్న విద్యార్ధి దానిని పెద్దగా పట్టించుకోడు. ఇలా ఉండటం వలన మానసిక ఒత్తిడి, నిరాశ విద్యార్ధి దరి చేరకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి లేనప్పుడు విద్యార్ధి తరగతి గదిలో ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలుగుతాడు.
సవాళ్లకు బెదరకండి!
ఈ ర్యాంకుల విధానంలో పోటీ అనేది సర్వసాధారణం. ఈ విషయాన్ని విద్యార్ధులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఏదో ర్యాంకులు, మార్కులు తగ్గితే ఫర్వాలేదు కానీ వరుసగా ర్యాంకు తగ్గుతూ వస్తే మాత్రం విద్యార్ధి వెంటనే జాగ్రత్తపడాలి. మిగిలిన వారితో పోటీపడి మంచి ర్యాంకు సాధించేందుకు ప్రయత్నించాలి. ఆ పోటీ ఆత్మవిశ్వాసంతో కూడినదై ఉండాలి అదే సమయంలో ఆత్మన్యూనతను దరికి రానీయకుండా చూసుకొండి. నేను ఫలానా ప్రయత్నంలో విఫలం చెందుతాను!నేను పరీక్షల్లో ఫెయిల్ అవుతాను.. అన్న భయాలను పారద్రోలండి. భయమే అన్ని అనర్ధాలకు మూలం. కష్టపడి మీ సామర్ధ్యం మేరకు ప్రయత్నించండి అంతేకానీ ఫలితం కోసం తీవ్రంగా ఆలోచించి ఆందోళన చెందకండి. ఎందుకంటే ఆందోళన చెందడం మీ సామర్ధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. విద్యార్ధులు తమకు ఎదురైన సవాళ్లను సరికొత్త అవకాశాలుగా మార్చుకునే నేర్పును విద్యార్ధులు సంపాదించుకోవాలి. అప్పుడే విఫలమవుతామెమో అన్న ఆందోళనకు చెక్ పెట్టవచ్చు.
మీ బలాలను ప్రదర్శించండి!
ఎన్ని సబ్జెక్ట్ లు ఉన్నప్పటికీ మీకు ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్ పై మంచి పట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పై శ్రద్ధ పెట్టి దాంట్లో మరింతగా రాణించేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వలన మీరు మిగతా వాళ్ల కంటే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. అన్ని సబ్జెక్ట్ ల్లోనూ మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే బాగా పట్టు ఉన్న సబ్జెక్ట్ ను మెరుగు పెట్టుకోవడం వలన ఆ సబ్జెక్ట్ పై మంచి నైపుణ్యత వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. దీంతో పాటు భవిష్యత్ లో మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునేందుకు, ఒక వృత్తిని ఎంచుకునే క్రమంలో మీకున్న నైపుణ్యత మీకు కెరీర్ కు సహాయపడుతుంది. కాబట్టి మీ బలాన్ని ప్రదర్శించడం ఎంత ముఖ్యమో, ఆ బలాన్ని పెంచుకునేందుకు తగిన కసరత్తు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని విద్యార్ధులు బాగా గుర్తుంచుకోవాలి.
టీచర్ నుంచి దూరం జరగొద్దు
విద్యార్ధిని ఎటువంటి సంక్షోభం నుంచి అయినా బయటపడేయగలిగే శక్తి ఒక్క టీచర్ కే ఉంది. కాబట్టి విద్యార్ధులు ఎప్పుడూ టీచర్ కు దూరంగా జరగొద్దు. సబ్జెక్ట్ కు సంబంధించి టీచర్ తో ఏ విషయాన్నైనా స్వేచ్ఛగా పంచుకోగలిగే చనువు విద్యార్ధికి ఉండాలి. విద్యార్ధులు తమ బలహీనతలను గుర్తించినప్పుడు, సబ్జెక్ట్ అర్ధం కాని సందర్భం ఎదురైనప్పుడు టీచర్ తో ఆ విషయాన్ని తక్షణం చెప్పాలి. అలా చెప్పకుంటే మీకే నష్టం. సబ్జెక్ట్ మీకున్న సందేహాలను టీచర్ కు వివరిస్తేనే అతను మిమ్మల్ని ఆ స్థితి నుంచి బయట పడేయగలుగుతాడు. సందేహాలు తీర్చడమే కాకుండా మీకు మరింత స్పూర్తి నిచ్చేలా తీర్చిదిద్దడంలో టీచర్ ను మించిన ప్రత్యామ్నయం లేదు. కాబట్టి ఎప్పుడూ ఉపాధ్యాయుడికి దూరంగా జరగొద్దు. మనం చెప్పుకున్న ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు విభిన్న విషయాల నుంచి ప్రేరణ పొంది మంచి విద్యార్ధులుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.
సీసీఐఎమ్ రిక్రూట్ మెంట్ – 2017
సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ( సీసీఐఎమ్) జూనియర్ , సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్ట్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
డిపార్ట్ మెంట్ : సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్
పోస్ట్ పేరు : జూనియర్ సీనియర్ టెక్నికల్ అసోసియేట్
జాబ్ చేయాల్సిన ప్రదేశం : న్యూఢిల్లీ
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్ధులకు పోస్ట్ లు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
వెబ్ సైట్ : https://ccimindia.org/