మాయ చేయొద్దు..! దొరికిపోతారు!


ఒక సంస్థ ఉద్యోగం ఇవ్వాలంటే.. మొదట మిమ్మల్ని నిజాయతీపరుడని నమ్మాలి. ఆ నమ్మకం కుదిరినపుడే మీకు అవకాశమిస్తుంది. అలా కాకుండా మీరు మోసం చేస్తారు.. మోసం చేసే అవకాశముంది.. అని భావిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం ఇవ్వదు. అందువల్ల ప్రతి వ్యక్తీ ఉద్యోగం ఇచ్చే సంస్థకు తాను నిజాయతీపరుడని.. ప్రతిభావంతుడని నమ్మకం కలిగించాలి. అభ్యర్థిలో ప్రతిభ, నైపుణ్యాలతో పాటు నిజాయితీని గుర్తించేందుకూ.. పరీక్షల్లో.. ముఖాముఖిల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. అన్ని రకాలుగా ఒక వ్యక్తిపై నమ్మకం కుదిరిన తర్వాత అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారు. చాలా మంది యువత ఈ విషయానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాము ఏం చెప్పినా సంస్థ నమ్ముతుందని భావించి రెజ్యూమెలో కొన్ని అతిశయోక్తులు.. అవాస్తవాలను పేర్కొంటున్నారు. ఇవి ఉద్యోగ అవకాశాలకు ఎసరు తెస్తున్నాయి. ఈ మేరకు కెరీర్‌బిల్డర్ ఇండియా సర్వేలో స్పష్టమైంది.
ఉద్యోగం కోసం పంపే దరఖాస్తులకు జత చేసే రెజ్యూమెల్లో 30 శాతం వాటిలో అబద్ధాలు ఉంటున్నాయట. ఈ మేరకు సర్వేలో పాల్గొన్న మేనేజర్లలో 78 శాతం మంది వెల్లడించారు. తాము ప్రతి మూడింటిలో ఒక రెజ్యూమెలో అవాస్తవాలను గుర్తిస్తున్నామని తెలిపారు. రెజ్యూమెలో పేర్కొన్న అంశం అవాస్తవమని తెలిస్తే.. దాన్ని వెంటనే పక్కన పెట్టేస్తున్నట్లు 58 శాతం మంది చెప్పారు. అంటే రెజ్యూమెలో అవాస్తవాలున్నాయని రిక్రూటర్లు ఏమాత్రం అనుమానించినా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లినట్టే.
ఒకవేళ అభ్యర్థిలో అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యాలు ఉండి.. చాలా చిన్న అంశాల్లో అవాస్తవాలను వెల్లడిస్తే.. అలాంటి వ్యక్తులను తీసుకొనేందుకు సిద్ధమని చాలా కొంత మంది రిక్రూటర్లు మాత్రమే చెబుతున్నారు. 14 శాతం మంది అభ్యర్థిలో ప్రతిభ నచ్చితే.. అంతకన్నా మంచి అభ్యర్థి దొరకనపుడు.. అతను రెజ్యూమెలో పేర్కొనే చిన్నపాటి అబద్ధాలను పెద్దగా పట్టించుకోమని అంటున్నారు. వీరూ వీలైనంత వరకు నిజాయతీపరులైన అభ్యర్థులనే ఎంచుకొనేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ సందర్భంగా కెరియర్ బిల్డర్ మానవ వనరుల నిపుణులు మాట్లాడుతూ.. వృత్తిగత సంబంధాల్లో విశ్వాసం చాలా కీలకం. కాని కొందరు రెజ్యూమె లేదా సీవీల్లో అవాస్తవాలను వెల్లడిస్తూ.. సంస్థల వద్ద నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిజంగా మీరు మీ రెజ్యూమెను గొప్పగా తీర్చిదిద్దాలనుకొంటే మీలో ప్రత్యేకతలను ప్రధానంగా ప్రస్తావించండి. దాదాపు ఏ రెజ్యూమె కూడా సదరు ఉద్యోగానికి సరిగ్గా సరిపోయేలా ఉండదు. సదరు ఉద్యోగానికి తగిన విధంగా.. వక్రీకరణలు, అతిశయోక్తులు, అవాస్తవాలు, దోషాలు లేకుండా ఉంటే చాలు. అని తెలిపారు.
ఎందుకిలా..!: మొదట మన సీవీ/రెజ్యూమె రిక్రూటర్ల దృష్టిలో పడాలి. అప్పుడే ముఖాముఖికి పిలుపు వస్తుంది.. అని ప్రధానంగా భావించడం వల్లే రెజ్యూమెల్లో అవాస్తవాల ప్రస్తావనకు ప్రధానకారణమంటున్నారు రిక్రూటర్లు. రెజ్యూమెలను పరిశీలించే మానవ వనరుల నిపుణులు.. ఆయా రెజ్యూమెలో పేర్కొన్న అంశాలు ఏమేరకు వాస్తవమో పక్కాగా గుర్తించగలరు. ఏఅంశంపై అయినా వారికి అనుమానమొస్తే.. జాబ్ పోర్టళ్లలో లేదా సామాజిక అనుసంధాన వేదికల్లో మీ ప్రొఫైల్‌ని పరిశీలించి ధ్రువీకరించుకొనే ధోరణి ఇప్పుడు పెరిగింది. దీంతో ఒకచోట అవాస్తవం వెల్లడిస్తే.. మరోచోట అయినా దొరికపోయే అవకాశముంది.
ఒకవేళ రెజ్యూమె పరిశీలనలో అవాస్తవాలను పసిగట్టలేకపోతే.. ముఖాముఖి పరీక్షలో తప్పకుండా దొరికిపోయే అవకాశముంది. ఎందుకంటే రెజ్యూమెలో అబద్ధాలు చెబితే.. అందులో వెల్లడించిన అంశాల ఆధారంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పలేకుంటే వారికి మీపై అనుమానం వస్తుంది. ఒక ప్రశ్నకు ఎలాగో ఒకలాగా సమాధాన మిచ్చినా మరో ప్రశ్నలో అయినా దొరికపోతారు. దీనివల్ల మీకు ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు సుముఖత చూపరు.
వాస్తవాన్ని గొప్పగా చెప్పడం వేరు.. వక్రీకరించడం వేరు. ఈ రెండింటి మధ్యా తేడా ఉంటుంది. దాన్ని గుర్తెరిగి రెజ్యూమెను రూపొందించాలి. అంతేకాని లేనిపోని గొప్పలకు పోయి అవకాశాలను చేజార్చుకోవద్దు. ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపరచుకుని.. నిజాయతీగా ఉద్యోగాన్ని సాధించేందుకు కృషి చేస్తే తప్పక లభిస్తుంది.
ఇవీ ఆ అబద్ధాలు..
ఒక్కో అభ్యర్థి తన రెజ్యూమెను ఒక్కో విధంగా రాస్తారు. కాని అవాస్తవాల విషయానికి వచ్చే సరికి ఎక్కువ మంది ఒకే విషయంలో చేస్తుంటారు. సర్వేలో పాల్గొన్న మేనేజర్లు వెల్లడించిన వివరాల మేరకు.. రెజ్యూమెల్లో ఎక్కువగా కనిపించే అవాస్తవాలు ఇవీ..
నైపుణ్యాలు: 61 శాతం అవాస్తవాలు నైపుణ్యాల అంశానికి సంబందించే ఉంటున్నాయి. లేని నైపుణ్యాలను అభ్యర్థులు రెజ్యూమెలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
పని చేసిన సంస్థలు: తాము గతంలో పని చేసిన సంస్థలకు సంబంధించిన అబద్ధాలు 50 శాతం దాకా ఉన్నాయి.
* నిర్వర్తించిన బాధ్యతలకు సంబంధించి కూడా ఎక్కువగానే అబద్ధాలు చెబుతున్నారు. 49 శాతం మేర రెజ్యూమెల్లో ఈ అంశానికి సంబంధించిన అవాస్తవాలుంటున్నాయి.
* ఇక పని చేసిన తేదీలు.. ఉద్యోగ వివరాల్లోనూ వరుసగా 47 శాతం, 46 శాతం మేర అబద్ధాలుంటున్నాయి.
* అవార్డులు, గుర్తింపునకు సంబంధించి 35 శాతం, విద్యార్హతలకు సంబంధించి 30 శాతం మంది అవాస్తవాలు పేర్కొంటున్నారు

కొత్త కొలువుల కోసం కొత్తకొత్తగా..


కొత్త సంవత్సరంలో కొత్తగా ఒక ఉద్యోగాన్ని సాధించలేమా..? కాస్త కృషి చేస్తే తప్పక సాధించవచ్చు.? ఇప్పటికే ఏదో ఒక రంగంలో అనుభవం ఉంటే మంచిది. లేకున్నా ఫర్వాలేదు. కాస్త కష్టపడితే చాలు. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యం ఉంటోంది. అది లేకుంటే కొలువు సాధించడం కష్టమన్న భావన నుంచి మొదట బయటపడాలి. ఎందుకంటే ఎలాంటి అనుభవం లేకున్నా.. మంచి ప్రణాళిక కసరత్తుతో కూడిన సన్నద్ధత, ఉద్యోగాన్వేషణ చేస్తే తప్పకుండా కొత్త కొలువును సాధించవచ్చు. ఎలాంటి ఉద్యోగ అనుభవం లేకున్నా..విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయకముందే సంస్థలు.. కళాశాల ప్రాంగణాలకు వచ్చి.. ప్రతిభావంతులను ఏటా కోట్లు వేతనం ఇచ్చి ముందస్తుగానే నియమించుకుంటున్నాయి. అంటే ఆయా సంస్థలకు ప్రతిభ, నైపుణ్యాలు ముఖ్యం కాని.. అనుభవంకాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.
చాలా మంది చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు రాకుంటే సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించి ఒక కొత్త అంశంపై శిక్షణ తీసుకోవడమో.. లేక నైపుణ్యాలను పెంచుకోవడమో చేయాలి. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థల్లో మొదట పని చేసేందుకు ప్రయత్నించాలి. జీతం ఇచ్చినా.. ఇవ్వకున్నా.. అక్కడ శిక్షణకు చేరాలి. ఇలా చేయడం వల్ల కొన్నాళ్లకు మీకు ఎంతోకొంత అనుభవం వస్తుంది. అది తర్వాత మంచి ఉద్యోగాలను సాధించేందుకు దోహదం చేస్తుంది. మీరు శిక్షణకు చేరిన సంస్థలో మంచి ప్రతిభకనబరిస్తే.. ఆ సంస్థే మీకు ఉద్యోగం ఇవ్వవచ్చు. అందువల్ల చదువు పూర్తయిన తొలినాళ్లలో ఖాళీగా ఉండకుండా.. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన ఏదో ఒక సంస్థలోకి ‘ప్రవేశించడం’ మేలు.
ఉద్యోగ వేటలో ఉన్నపుడు మీ నైపుణ్యాలు, ప్రతిభ, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవడం ముఖ్యం. ఉద్యోగ అనుభవం లేనివారికి విద్యార్హతలు.. ప్రతిభ.. చదువుకొనే రోజుల్లో చేసిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, శిక్షణ తదితర అంశాలు కీలకం. అవే వారికి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే మీకు సరిపోయే కొలువును ఎంచుకోవాలి. ఆ వృత్తికి కావాల్సిన కనీస అర్హతలతో పాటు.. కాస్త ప్రత్యేక నైపుణ్యాలు, ప్రతిభను కూడా సాధించేందుకు కృషి చేయాలి. దీని వల్ల మీకు తగిన అనుభవం లేకున్నా సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు మొగ్గు చూపుతుంది. ఇలాంటి అవకాశం సాధించాలంటే మీరు ఎంచుకున్న రంగంపై పట్టుసాధించాలి. ఇందుకు ఆయా రంగాలపై కొంత పరిశోధన అవసరం.
ఒకరంగాన్ని ఎంచుకున్న తర్వాత అందులో ఉన్న విభిన్న ఉద్యోగ అవకాశాలపై అధ్యయనం చేయాలి. ఆయా రంగాల్లో ఉన్న రకరకాల ఉద్యోగాలు.. వాటి స్థాయిలపై స్పష్టమైన అవగాహన సాధించాలి. దీనివల్ల మీ అర్హతలకు పక్కాగా సరిపోయే ఉద్యోగం ఏదో తెలుస్తుంది. తర్వాత వాటిని లక్ష్యంగా చేసుకొని దరఖాస్తులు చేయవచ్చు. అంతేకాని మీకు సరిపడని.. అన్ని రకాల ఉద్యోగాలకోసం దరఖాస్తులు చేయవద్దు. విద్యార్హతలు ఎక్కువగా ఉన్నాయని అనుభవం అవసరమైన ఉన్నత స్థానాలు.. ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవద్దు. ఒక ఉద్యోగంపై పూర్తిస్థాయి అవగాహన కలిగాక.. దానికి తగినట్లుగా రెజ్యూమెలు సిద్ధం చేసుకొని.. వాటిని పంపాలి. విద్యార్థి దశలో, శిక్షణ కాలంలో మీరు సాధించిన విజయాలు, కనబరించిన ప్రత్యేక నైపుణ్యాల వివరాలను వెల్లడించాలి. తగిన అనుభదవం లేకున్నా సదరు ఉద్యోగానికి ఎలా అర్హులో.. ఆ ఉద్యోగం అంటే ఎందుకు ఇష్టమో వివరించాలి. ఇలా చేయడం వల్ల తప్పకుండా ఇంటర్వ్యూపిలుపు వస్తుంది. ఇంటర్వ్యూలో కొత్త వ్యక్తి లేదా విద్యార్థిలాగా కాకుండా రెజ్యూమెలో పేర్కొన్న వివరాలకు తగినట్లు కాస్త పరిపక్వత, అనుభవం ఉన్న వ్యక్తిలాగా వ్యవహరించాలి.
ఇక ఈతరం యువతకు సామాజిక అనుసంధాన వేదికల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. అయితే వీటిని ఉద్యోగాలు సాధించేదుకూ వినియోగించుకోవచ్చు. ఆయా రంగాల్లో నిపుణులను అనుసరించడం, పరిచయాలు పెంచుకోవడానికి సామాజిక అనుసంధాన వేదికలు చక్కగా ఉపయోగపడుతాయి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాల సమాచారం కోసమే వెలిసిన లింక్డ్‌ఇన్‌, షైన్‌.కామ్‌, మోన్‌స్టర్‌ తదితర సైట్లు ఇప్పుడు సామాజిక అనుసంధాన్నీ అందిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలు, నిపుణులను కలుసుకోవచ్చు. ఈ అవకాశాలనూ సద్వినియోగం చేసుకొంటే.. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాని కేవలం ఉద్యోగ అనుభవం లేదని చింతిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు.
వాస్తవానికి చాలా మందితో పోల్చితే మీకు లేనిదల్లా అనుభవమే. ప్రతిభ, నైపుణ్యాలు, విద్యార్హతలు ఉన్నపుడు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవడమే తరువాయి. మరి వీటిని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో.. అందుకు ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొదించుకొని కొత్త కొలువుకోసం కాస్త కొత్తగా సిద్ధం కండి.

సీడీఎస్ఈతో 414 పోస్టులు భర్తీ


త్రివిధ దళాల్లో ఉద్యోగమే లక్ష్యంగా నిర్ణయించుకున్న యువతకు సీడీఎస్ఈకి మించిన అవకాశం మరొకటి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా నేరుగా లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. పైలట్ కావాలని కోరుకున్నవారి కల కూడా ఎయిర్ఫోర్స్ ద్వారా నెరవేరుతుంది. శిక్షణ సమయంలో రూ.21,000 స్టైపెండ్ అనంతరం రూ.75 వేల వేతనంతో కెరీర్ ప్రారంభించవచ్చు. అంతేకాదు కెరీర్లో త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు చూద్దాం…

గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలుంటాయి. అయితే వాటిలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్నిచ్చే పరీక్షలు మాత్రం కొన్నే. అలాంటి పోటీ పరీక్షల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సీడీఎస్ఈ. ఎందుకంటే ఈ పరీక్షలో ఎంపికైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ వీటిలో ఎందులోనైనా ఉన్నత స్థాయి ఉద్యోగం సొంతమవుతుంది. భారతదేశ సైనిక దళాల్లో ఆఫీసర్ ఉద్యోగం లెఫ్టినెంట్ హోదాతో ఆరంభవవుతుంది. ఆ హోదాను సొంతంచేసే పరీక్ష ఇదే. ఇంతకంటే పెద్ద పోస్టులేవీ త్రివిధ దళాల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేయరు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లకే తర్వాత దశలకు అనుమతిస్తారు. దీనికోసం సీనియారిటీ, ప్రతిభను కొలమానంగా తీసుకుంటారు. ఉదాహరణకు ఇప్పుడున్న చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఒకప్పుడు లెఫ్టినెంట్గా కెరీర్ ప్రారంభించినవాళ్లే. భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చీఫ్ అయ్యేవారంతా ఒకప్పుడు సీడీఎస్ఈ (కొంతమంది విషయంలో ఎన్డీఏ) ద్వారా కెరీర్ ప్రారంభించినవాళ్లేనని చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్గా చేరినవాళ్లు పరీక్షల ద్వారా పదిహేనేళ్ల సర్వీస్తోనే కల్నల్ హోదాకు చేరుకోవచ్చు. సీనియార్టీ ద్వారా ఇదే హోదాను అందుకోవడానికి 26 ఏళ్లు పడుతుంది. ఆకర్షణీయ వేతనం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండడం ఇవన్నీ సీడీఎస్ఈ ద్వారా కలిసివచ్చే అవకాశాలు. అందుకే డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్ జీవితంలో స్థిరపడిపోవచ్చు.

పరీక్ష స్థాయి కఠినమే…
ప్రయోజనాలకు తగ్గట్టుగానే పరీక్ష స్థాయి ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేస్తే పోలా అనుకునో, ఒకరాయి వేసి చూద్దామనో భావించి ఈ పరీక్షరాస్తే ప్రయోజనం శూన్యమే. ఎందుకంటే చీకట్లో బాణాలు సంధించడం ద్వారా సీడీఎస్ఈలో అదృష్టం వరించదు. ఈ పరీక్షలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ సీడీఎస్ఈ పరీక్షను నిర్వహిస్తోంది. కాబట్టి దీన్నే లక్ష్యంగా చేసుకుని చదివితే రెండు లేదా మూడు ప్రయత్నాలతో గమ్యాన్ని చేరుకోవచ్చు.