ముఖ పుస్త‌క ఉల్లాసమే…మాన‌వ‌ సంబంధాల‌కు ఖ‌ల్లాస్..!

 

మ‌నిషి జీవితంలో మాన‌వ సంబంధాల‌దే ముఖ్య‌మైన స్థానం. స‌మాజంలో ప‌రిపూర్ణమైన‌ మ‌నిషిగా ఎద‌గాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన మాన‌వ సంబంధాల‌ను కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబంతోనే కాదు త‌న తోటి వారందరితో గౌర‌వం, అప్యాయ‌త‌తో కూడిన వైఖ‌రిని క‌లిగి ఉండాలి. మాన‌వ సంబంధాలు ఎంత ముఖ్య‌మో, ప్ర‌తీ మ‌నిషికి సాటి మ‌నిషి ఎంత ప్ర‌ముఖ‌మైన వాడో మ‌న భారతీయ ధార్మిక గ్రంధాల్లో చాలా చ‌క్క‌గా పొందుప‌ర్చారు. అయితే పెరుగుతున్న సాంకేతిక‌త‌, సంపాద‌న కోసం తీస్తున్న ప‌రుగు మ‌నిషిని అనుబంధాల‌కు, ఆప్యాయ‌త‌ల‌కు దూరం చేస్తున్నాయి. చివరికి మ‌నిషిని మ‌నిషిని క‌లిపేందుకు ఉద్దేశించిన సాంకేతిక‌త‌ను కూడా మ‌నం త‌ప్పుడు దారిలోనూ వాడుకుంటూ మ‌న అజ్ఞానాన్ని చాటుకుంటున్నాం. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తున్న ఫేస్ బుక్ ను కూడా స‌రైన ప‌ద్ధ‌తిలో వాడుకోవ‌డం చేత‌కాక సాటి మ‌నిషితో ఆర్యోగ‌క‌ర సంబంధాల‌ను తెగ్గొట్టుకుంటున్నాం. మ‌న ఆత్మీయులు, స‌న్నిహితుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో ఒక లైక్ కొట్టో లేక ఒక కామెంట్ ప‌డేసో ఫోన్ దులిపేసుకుంటున్నాం. ఇటువంటి విధానంతో మానవ సంబంధాలు ఏ విధంగా మెరుగుప‌డ‌తాయి? మ‌నిషి ప‌రిపూర్ణ మాన‌వుడిగా ఎలా ఎదుగుతాడు?

 

మంచి వేదిక‌ను స‌రిగ్గా ఎందుకు ఉప‌యోగించుకోలేక‌పోతున్నాం?

 

గ‌తంలో మ‌న ఇంటికి వ‌చ్చిన బంధువుల‌కు, ఆత్మీయులకు మ‌నం స్నేహ పూర్వ‌క ఆతిధ్యాన్ని అందించేవాళ్లం. వాళ్ల క్షేమ స‌మాచారాన్ని క‌నుక్కున్నాక‌, మ‌న ఇంటిలో జ‌రిగిన వేడుక‌ల ఫోటోల‌ను లేదా మ‌నం సాధించిన అవార్డుల‌నో లేక సాధించిన ఘ‌న‌త‌ల‌ను వాళ్ల‌కు చెప్పేవాళ్లం. వాళ్ల‌తో ప్ర‌త్య‌క్షంగా మ‌న అనుభూతుల‌ను పంచుకోవ‌డం వ‌ల‌న సంబంధాల్లో గాఢ‌త ఎక్కువ‌గా ఉండేది. ఈ ఆధునిక యుగంలో అన్నీ మారిపోయాయి. ఉపాధి కోసం చాలా మంది ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స వ‌చ్చారు. మ‌నుష్యుల మ‌ధ్య దూరం పెరిగింది. అందుకే ఇటువంటి విష‌యాల‌ను పంచుకునేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ ఫేస్ బుక్ వంటి సామాజిక వేదిక‌లు వ‌చ్చాయి. ఒక వ్య‌క్తికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్నీ అత‌ను ఫేస్ బుక్ లో త‌న సన్నిహితుల‌తో స్నేహితుల‌తో షేర్ చేసుకునే స‌దుపాయం వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఫేస్ బుక్ లో త‌న స్నేహితుని ఫోటోను చూసి చాలా మంది లైక్ కొట్టి ఊరుకుంటున్నారు కానీ అత‌న్ని ప్ర‌త్య‌క్షంగా క‌లిసి విష్ చేయ‌డ‌మో లేక ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ స‌మాచారం క‌నుక్కోవ‌డ‌మో వంటి ప‌నులు చేయ‌డం లేదు. కేవ‌లం ఒక్క లైక్ ప‌డేస్తే అత‌న్ని అత‌నితో మీకున్న సంబందాన్ని మీరు ఏ విధంగా గౌర‌విస్తున్న‌ట్టు? ఇటువంటి లైక్ , కామెంట్స్ బంధాలు ఎన్ని రోజులు నిల‌బ‌డ‌తాయి?

 

 

ప్ర‌త్య‌క్షంగా మాట్లాడ‌ట‌మే సంబంధాల‌ను నిలుపుతుంది!

 

ఫేస్ బుక్ లో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ వంద‌లాది మంది మిత్రులు ఉంటున్నారు. అందులో అధిక శాతం ముంది ముక్కూ మొఖం తెలియ‌ని వారే. ఒక వ్య‌క్తి త‌న ఫేస్ బుక్ లో త‌న జీవితంలో జ‌రిగిన ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ను పోస్ట్ చేసిన‌ప్పుడు అందులో చాలా మంది లైక్, లు కామెంట్ల‌తో స్పందిస్తారు. వాస్త‌వంగా చెప్పాలంటే అందులో చాలా వ‌ర‌కూ కృత్రిమ‌త‌తో కూడుకున్న పైపై అభినంద‌న‌లు మాత్ర‌మే ఉంటాయి. స‌ద‌రు వ్య‌క్తికి ప్రాణ మిత్రుడైన వ్య‌క్తి కూడా ఆ విధంగానే ఒక కామెంట్ ప‌డేసి ఊరుకుంటే ఆ ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య బంధం ఎలా ధృడ‌ప‌డుతుంది? త‌న స్నేహితుడిని ప్రత్య‌క్షంగా క‌ల‌వ‌డ‌మో లేక ఫోన్ చేసి మాట్లాడ‌మో చేసిన‌ప్పుడే ఆ ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తున్న‌వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఫేస్ బుక్ సాక్షిగా ఒక లైక్ ప‌డేసి ఊరుకుంటున్నారు. దీని వ‌ల‌న క‌ల‌కాలం కొన‌సాగాల్సిన సంబంధాలు మ‌ధ్య‌లోనే తెగిపోతున్నాయి.

 

ఫేస్ బుక్ లో టీచ‌ర్లు పెరిగిపోయారు!

 

ఇటీవ‌లి కాలంలో ఫేస్ బుక్ లో ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో ఒక మంచి ప‌ని చేయాల‌ని, మంచి విష‌యం చెప్పాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే కొంద‌రు టీచ‌ర్ల అవ‌తారమెత్తి మంచి విష‌యాల‌ను చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది కానీ వ్య‌క్తిగ‌త ప్ర‌చారం మాయ‌లో ప‌డి అస‌లు విష‌యాన్ని గాలికి వ‌దిలేస్తున్నారు. ప్ర‌స్తుతం సొసైటీలో చాలా మంది ఏదైనా ఒక ఘ‌ట‌న జ‌ర‌గ్గానే ముందు దాన్ని చిత్రీక‌రించి త‌న పేజ్ లో పోస్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ దాని కంటే ముందు ఆ ఘ‌ట‌న‌కు సాటి మ‌నిషి తాను నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌ల‌ను మ‌ర్చిపోతున్నారు. ఒక మ‌నిషికి ప్ర‌మాదం జ‌రిగి గాయాల‌తో బాధ‌ప‌డుతుంటే అత‌నికి సాయం చేయ‌కుండా ఆ యాక్సిడెంట్ ను చిత్రీక‌రించ‌డానికే మ‌నుష్యులు ముందుండ‌టం మ‌నం ఎంత దిగ‌జారిపోయామో అన్న విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే సెల‌బ్రిటీల‌తో ఫోటోలు దిగ‌డం , వాటిని పోస్ట్ చేసి అత‌ను నాకు బాగా కావాల్సిన వాడు అని చెప్పుకోవ‌డం వంటి మానసిక రుగ్మ‌త‌ల‌కు గుర‌వుతున్నారు. మ‌రికొంత త‌ను పెట్టిన ఫోటోకు లైక్ రాకుంటే మాన‌సికంగా చిరాకు ప‌డిపోతున్నారు. అస‌లు విష‌యాన్ని గాలికొదిలి ప్ర‌చారం కోసం ఎగ‌బ‌డుతూ తోటి వారితో సంబంధాల‌ను మ‌న‌కు మ‌న‌మే చెడ‌గొట్టుకుంటున్నాం.

 

 

సాంకేతిక‌త‌ను వాడుకోవాలి కానీ దానికి బ‌లికాకూడ‌దు!

 

సాంకేతిక‌త అంటే ఎక్క‌డినుంచో ఊడిప‌డ‌లేదు. మ‌న అవ‌స‌రాల కోసం మ‌నం సృష్టించుకున్న ఒక వేదిక‌. అయితే దాన్ని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకోక‌పోవ‌డం అన‌ర్ధాల‌కు దారితీస్తోంది. ఫేస్ బుక్ కావ‌చ్చు మ‌రే ఇత‌ర డిజిట‌ల్ మీడియా కావ‌చ్చు స‌రైన రీతిలో వాడుకోవ‌డం చేత‌కాక‌పోతే అది మ‌న‌కు స‌మాధి క‌డుతుంది. ఇప్పుడు స‌రిగ్గా అదే జ‌రుగుతోంది. లోతుగా ఆలోచించ‌డం చేత‌కాక మ‌న‌ సౌక‌ర్యం కోసం రూపొందించుకున్న ట‌క్నాల‌జీనే మ‌న‌కు శత్రువుగా చేసుకుంటున్నాం. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో విప‌రిణామాలు సంభవించే ప్ర‌మాదం ఉంది. ప్ర‌స్తుతం రాజ్య‌మేలుతున్న డిజిటల్ మీడియా అయినా ఆ త‌ర్వాత రాబోతున్న స్పేస్ టెక్నాల‌జీ అయినా ఏదైనా మ‌న సౌక‌ర్యం కోసం మాత్ర‌మే. మ‌న‌తో ఎప్పుడూ శాశ్వ‌తంగా ఉండేవి మ‌నుష్యుల మ‌ధ్య ప్రేమ‌లు, ఆప్యాయ‌తలు. వాటిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేక‌పోతే మ‌నం సృష్టించుకున్న సాంకేతిక‌త‌కు మ‌న‌మే బ‌లి అవుతాం.

( ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసినవారు)

 

ఘ‌రానా లాయ‌ర్లపై చ‌ర్య‌లకు ఆదేశించిన జ‌డ్జి!

మోస‌పూరిత ప‌ద్ధ‌తుల ద్వారా లా కోర్సులు పూర్తి చేయ‌డ‌మే కాకుండా బార్ కౌన్సిల్ లో స‌భ్య‌త్వం కూడా పొందిన లాయ‌ర్ల‌పై మ‌ద్రాస్ హైకోర్టు క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఈ మేర‌కు వాళ్ల‌పై త‌గు విచార‌ణ చేపట్టాల‌ని అడ్వ‌కోట్ జ‌న‌ర‌ల్ కు ఆదేశాలు జారీ చేసింది. 2009 – 2016 మ‌ధ్య కాలంలో క్ర‌మ ప‌ద్ధ‌తిలో కాకుండా, సాధారణ విద్యా ప‌ద్ధ‌తుల‌కు భిన్నంగా చాలా మంది లా కోర్సులు చ‌దివిన‌ట్టు తేలింది. ఈ విష‌యంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్ట్ ఈ విధంగా లా డిగ్రీల‌ను పొందిన వారిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని వెల్ల‌డించింది.

 

ఈ విధంగా లా డిగ్రీలు పూర్తి చేసిన‌ట్టు త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి దాదాపు 713 మంది త‌మిళ‌నాడు బార్ కౌన్సిల్ లో స‌భ్యులుగా న‌మోదు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో ఇప్ప‌టికే త‌ప్పుడు దృవ‌ప‌త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు తేలిన 42 మందిపై కేసులు న‌మోదు చేయాల‌ని కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. ఈ విష‌యంపై స్పందించి త‌మిళ‌నాడు బార్ కౌన్సిల్ వ‌ర్గాలు మోస‌పూరిత ప‌ద్ధ‌తుల్లో స‌భ్య‌త్వం పొందిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. అయితే 2008 కంటే ముందు స‌భ్యత్వం పొందిన వారు మాత్రం ఎటువంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని వారు తెలిపారు.

 

బేతాళ క‌థ‌ల‌కు సీక్వెల్ గా మారిన విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు!

చంద‌మామ క‌థ‌ల పుస్త‌కం చ‌దివిన వారంద‌రికీ బేతాళ క‌థ‌లు సుప‌రిచిత‌మే. ఆ క‌థ‌ల్లో చెట్టుపై నుంచి శ‌వాన్ని దించి భుజంపై వేసుకుని మౌనంగా న‌డక సాగిస్తున్న విక్ర‌మార్కున్ని శ‌వంలోని బేతాళుడు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. విక్ర‌మార్కుని మౌనాన్ని భ‌గ్నం చేసేందుకు ఇలా చెప్పిన క‌థ‌లు బేతాళ క‌థ‌లుగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లు కూడా బేతాళ క‌థ‌ల‌ను గుర్తుకుతెస్తున్నాయి. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు స్ప‌ష్టంగా తెలిసినా విక్ర‌మార్కుని మౌనం భంగం కాగానే ఎగిరిపోయే బేతాళునిలా స‌మ‌స్య మాత్రం మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. కార్పోరేట్ విద్యా సంస్థ‌ల మార్కుల దాహానికి విద్యార్ధులు పిట్ల‌ల్లా రాలుతున్నా రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత మ‌ళ్లీ స‌మ‌స్య‌ను శ‌వంలా మూట‌గ‌ట్టి చెట్టెక్కిస్తున్నారు. చివ‌రికి విద్యార్ధుల ఆత్మ‌ల‌కు కూడా శాంతి క‌లిగించ‌కుండా కార్పోరేట్ యాజ‌మాన్యాల‌కు కొమ్ము కాస్తూ విద్యార్ధుల ఆత్మ‌లు చెట్టు కొమ్మ‌ల్లోనే మ‌గ్గిపోయేలా చేస్తున్నారు.

 

ర్యాంకులు తీసుకొచ్చే యంత్రాలు అర్ధంత‌రంగా ఆగిపోతున్నాయి!

 

ఇటీవ‌లి కాలంలో కార్పోరేట్ విద్యా సంస్థ‌ల్లో విద్యార్ధుల‌ ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి త‌ట్టుకోలేక అంద‌మైన భ‌విష్య‌త్ ను, ప్రాణంగా ప్రేమించే త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి పెట్టి బ‌ల‌వ‌ర్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కేవ‌లం డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా న‌డుస్తున్న కార్పోరేట్ విద్యా సంస్థ‌లకు పిల్లల ఆత్మ‌హ‌త్య‌లు ప‌ట్ట‌వు. వారి మాన‌సిక స్థితి ప‌ట్ట‌దు. ఎంత సేపు వాళ్ల‌ను మార్కులు, ర్యాంకులు తీసుకు వ‌చ్చే యంత్రాలుగానే చూస్తారు. మ‌రోవైపు ఘ‌ట‌న జ‌ర‌గ్గానే రెండు రోజులు హ‌డావుడి చేసి త‌ర్వాత దాన్ని మ‌ర్చిపోవ‌డం మీడియాకు అల‌వాటుగా మారింది. ఇక ఈ పెను స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారాన్ని చూపించాల్సిన ప్ర‌భుత్వాలే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించడ‌మే ఇప్పుడు దుర‌దృష్ట‌క‌ర అంశం.

 

 

విద్యార్ధుల ఆత్మ‌హత్య‌లకు నివార‌ణ చ‌ర్య‌లు ఎక్క‌డ‌?

 

గ‌తంలో ఏమైనా రెండు మూడు ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు తూతూ మంత్రంగా చ‌ర్య‌లు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వాలు అవి స‌రిగ్గా అమ‌లవుతున్నాయో లేదో అన్న విష‌యాన్ని కూడా స‌రిగ్గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గ‌డిచిన రెండేళ్లుగా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్యల శాతం పెరిగిపోతున్నా ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న శాశ్వ‌త చ‌ర్య‌లు మాత్రం శూన్యం. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తీ నెలా ఇలా విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా ప్ర‌భుత్వం నుంచి మాత్రం స్పంద‌న రావ‌డం లేదు. గ‌తంలో ఇలాంటి దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అది చేస్తాం..ఇది చేస్తాం..అని ప్ర‌భుత్వ పెద్ద‌లు హ‌డావుడి అయినా చేసే వారు. ఇప్పుడు అటువంటి ప్ర‌తిస్పంద‌న కూడా ఎక్క‌డా కాన‌రావ‌డం లేదు. విద్యార్ధుల ఆత్మ‌హత్య‌ల‌కు వాళ్లు అల‌వాటు ప‌డిపోయారో లేక జ‌నాలు వీటికి అల‌వాటు ప‌డిపోయి ఉంటారులే అని అనుకుంటున్నారో తెలియ‌దు కానీ అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 

ఇంత జ‌రుగుతున్నా విద్యా సంస్థ‌ల్లో మానసిక నిపుణుల ఊసేదీ??

 

ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డుతూ విద్యార్ధులు పిట్ట‌ల్లా రాలిపోతున్నా అటు కార్పోరేట్ కాలేజీలు కానీ ఇటు ప్ర‌భుత్వాలు శాశ్వ‌త చ‌ర్య‌లు తీసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. క‌నీసం నిబంధ‌న‌ల‌ను కూడా అమ‌లు చేసేందుకు అధికారులు మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థ‌ల్లో సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించాల‌న్న నిబంధ‌న అమ‌లు కావ‌డం లేదు. ఆ నిబంధ‌న‌ను పాటించి ఉంటే క‌నీసం స‌గం మంది ప్రాణాలు అయినా ద‌క్కి ఉండేవి. విద్యార్ధుల మానసిక ఆరోగ్యంపై ఎప్ప‌టిక‌ప్పుడు శ్ర‌ద్ధ వ‌హిస్తూ వారి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సైకాల‌జిస్ట్ ల‌ స‌హాయం అవ‌స‌ర‌మ‌వుతుంది. వాళ్ల‌కు కౌన్సిలింగ్ లు నిర్వ‌హించ‌డం వాళ్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది, ఒత్తిడిని త‌గ్గించుకునే మార్డాల అన్వేష‌ణ తదిత‌ర విష‌యాల‌పై చ‌ర్చ జ‌రిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డి ఉండేది. కానీ కార్పోరేట్ కాలేజీలు మాత్రం సైకాల‌జిస్ట్ ల‌ను నియ‌మించుకునే విష‌యంలో మాత్రం మీనమేషాలు లెక్క‌పెడుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికైనా కార్పోరేట్ విద్యా సంస్థ‌లు నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటే కొన్ని ప్రాణాలు అయినా ద‌క్కుతాయి. త‌ల్లిదండ్రుల‌కు క‌డుపు కోత బాధ త‌ప్పుతుంది.

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఆ ప‌నులు చేయాల్సిందేనా?

ఒక దేశంలో పుట్టిన పౌరునికి ఆ దేశంపై క‌చ్చితంగా భ‌క్తి ఉండాలి. ఎందుకంటే అమ్మ జ‌న్మ‌నిస్తే పుట్టిన గ‌డ్డ జీవితాన్ని ఇస్తుంది. అమ్మ రుణం తీర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయోమో కానీ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకోవ‌డం అంత సులువు కాదు. అందుకే పుట్టిన గ‌డ్డకు జీవితాంతం రుణ ప‌డి ఉండాలి. దేశ సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వ‌చ్చినా సేవ చేసేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి. ఇటీవ‌లి కాలంలో ప్ర‌సార మాధ్య‌మాల్లో, సోష‌ల్ మీడియాలో దేశ‌భ‌క్తి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించ‌డం, సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ప్రేక్ష‌కులు నిల్చుని జాతీయ గీతాన్ని గౌర‌వించ‌డంపై ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేపారు. దేశ‌భ‌క్తి అనేది అంత‌ర్గ‌త విష‌య‌మా లేక బ‌ల‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌జేసేదా అన్న దానిపై మొదటి నుంచి రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం దేశ‌భ‌క్తి అనే దాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డం, ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అడ్డుపెట్టుకుని త‌మ లోపాల‌ను కప్పిపుచ్చుకోవాలని ప్ర‌య‌త్నించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. దేశ‌భ‌క్తి అంటే బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించే బాహ్య విష‌యం అస్స‌లు కాదు, అది నిజాయితీతో కూడిన అంత‌ర్గ‌త విష‌యం. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ కీల‌క విష‌యాన్ని గుర్తిస్తే వాస్త‌వానికి,భ్ర‌మ‌కు మ‌ధ్య ఉన్న స‌న్నని గీత ద‌ర్శ‌న‌మిస్తుంది.

 

 

దేశభ‌క్తికి ప్రామాణికం ఏంటి?

 

సినిమా హాళ్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శించే ముందు జాతీయ గీతం త‌ప్ప‌న‌స‌రిగా ఉండాల‌న్న నిబంధ‌న తెచ్చిన‌ప్పుడు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. జాతీయ గీతం కోసం నిమిషం పాటు నిల‌బ‌డి ఉండ‌లేమా అని కొంద‌రు. నిమిషం పాటు నిల‌బ‌డితే దేశంపై ప్రేమ ఉన్న‌ట్టా? అని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం సినిమా హాళ్ల‌లో జాతీయ గీతాన్ని త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అయిష్టంగా నిల‌బ‌డే వారు కొంద‌రైతే నిల‌బ‌డని వారిపై సాటి ప్రేక్ష‌కులు దాడి చేసిన ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకున్నాయి. ఒక సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇలా జ‌ఠిలం చేసి దేశ‌భ‌క్తికి ప్రామాణికాన్ని త‌యారు చేయాల‌ని అనుకోవ‌డం వివాదాల‌కు దారితీసింది. ఇక నోట్ల రద్దు స‌మయంలోనూ దేశ‌భ‌క్తి అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్ల ర‌ద్దుతో ఇబ్బందుల తలెత్తిన‌ప్పుడు దేశ‌భ‌క్తి ఉన్నవాళ్లు ఈ ఇబ్బందిని సంతోషంగా భ‌రించాల్సిందేనని ప్ర‌భుత్వ వ‌ర్గాలు మ‌రోసారి సున్నిత‌మైన విష‌యాన్ని వాడుకున్నారు. దేశ‌భక్తి ఉన్నావాళ్లు ఏటీఎం ల ముందు ఎన్ని గంట‌లైనా నిల్చుంటార‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఏటీఏం ల ముందు గంట‌ల కొద్దీ నిల్చోవ‌డానికి ,దేశ‌భ‌క్తికీ మ‌ధ్య సంబంధం ఏంటో చాలా మందికి ఇప్ప‌టికీ అర్ధం కాలేదు.

 

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి?

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం అంటే సినిమా థియేట‌ర్ లో జాతీయ గీతం రాగానే లేచి నిల‌బ‌డి త‌ర్వాత దేశం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించ‌డం కాదు. దేశ‌భ‌క్తి అంటే దేశం ప‌ట్ల బాధ్య‌త క‌లిగి ఉండ‌టం. మ‌న చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల ప‌ట్ల‌, మ‌నుష్యుల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఒక బాధ్య‌త‌ను క‌లిగి ఉండ‌టం నిజ‌మైన దేశభ‌క్తి. అనాధ‌లు, వ‌యోవృద్ధుల‌కు చేత‌నైన స‌హాయం చేయ‌డం వారు స‌మాజంలో ధైర్యంగా బ‌తికేందుకు అనువైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌డం కూడా దేశ‌భ‌క్తిలో ఒక భాగ‌మే. అంతే కానీ తీరిగ్గా సినిమా చూడ‌టానికి వెళ్లి నిమిషం పాటు మొక్కుబ‌డిగా న‌లుగురితో పాటు నిల్చుని నాకు దేశం ప‌ట్ల అప‌రిమిత‌మైన ప్రేమ‌, భ‌క్తి ఉన్నాయి అనుకుంటే అంత‌కంటే ఆత్మ‌వంచ‌న మ‌రొక‌టి ఉండ‌దు. మూడు గంట‌ల పాటు సినిమా చూసో లేక డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎం ముందు నిల్చునో నేనే ఏ దేశంలో అతిపెద్ద దేశ‌భ‌క్తి అనుకుంటే మన‌ల్ని ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు. అది మ‌న అజ్ఞానం మాత్ర‌మే కాక దేశ‌భ‌క్తి పేరు చెప్పి మ‌న‌ల్ని ఉచ్చులోకి లాగుతున్న రాజ‌కీయ నాయకుల వ‌ల‌లో మ‌నం ప‌డిన‌ట్టే.

 

నిజ‌మైన దేశ‌భ‌క్తులకు గౌర‌వం ద‌క్కుతోందా?

 

మ‌న దేశంలో నిజ‌మైన దేశ‌భ‌క్తులంటే స‌రిహ‌ద్దులో కాపలా కాసే సైనికులు, జ‌నాల‌కు తిండి పెట్టే రైతు, భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేసే ఉపాధ్యాయుడు. కానీ మ‌నం దేశంలో ఈ దేశ‌భ‌క్తుల‌కు ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్కుతుందా అంటే అవును అని ట‌క్కున స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి గానే మిగిలిపోతారు. ప్ర‌జ‌ల నుంచి రావాల్సినంత గుర్తింపు రాదు. పోనీ ప్ర‌భుత్వం వీరి సంక్షేమం కోసం ఏమైనా చ‌ర్య‌లు చేప‌డుతుందా అంటే అదీ లేదు. నిజ‌మైన దేశ‌భ‌క్తులకు మ‌న దేశంలో ద‌క్కే గౌర‌వం ఇలా ఉంటుంది. డ‌బ్బులు కోసం సినిమాల్లో యాక్ట్ చేస్తూ త‌మ‌ను తాము దైవాంశ‌సంభూతులుగా భావించుకునే సినీ స్టార్లు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వ్యాపార‌స్తులకే సోసైటీలో క్రేజ్. ప్ర‌భుత్వం కూడా ఇటువంటి వారిని కాపాడేందుకే అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంది.

 

త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేందుకు తెర‌పైకి దేశ‌భ‌క్తి కార్డు!

 

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని హ‌క్కుల‌తో పాటు కొన్ని బాధ్య‌తలు కూడా ఉంటాయి. అలాగే ప్ర‌భుత్వాలు కూడా త‌మ సొంత అజెండాతో కాకుండా దేశానికి, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాల‌ను తీసుకుని అందుకు అనుగుణంగా ప‌రిపాలించాల్సి ఉంటుంది. కానీ గ‌డిచిన కొన్ని రోజులుగా ప్ర‌భుత్వం తాము తీసుకున్న నిర్ణ‌యాలు విఫ‌లం కావ‌డంతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దేశ‌భ‌క్తి అనే కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. దేశ‌భ‌క్తి అనేది పౌరుల వ్య‌క్తిగ‌త విష‌యం. మీరు త‌ప్ప‌నిసరిగా దేశ‌భ‌క్తిని క‌లిగి ఉండాల‌ని ఆదేశించ‌డం అంటే అది నియంతృత్వం కింద‌కు వ‌స్తుంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అది విఫ‌లం కాగానే వాటిపై వ్య‌తిరేక‌త రాగానే అలా వ్య‌తిరేకించే వారిని దేశ‌ద్రోహులుగా ముద్ర వేయ‌డం స‌మంజ‌సం కాదు. అది ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్సర్ చేసినవారు)

 

నిఫ్ట్ 2018 అడ్మిష‌న్ నోటిఫికేష‌న్

నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్ ) 2018 సంవత్స‌రానికి గాను అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు అప్లికేష‌న్స్ ను ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొత్తం 3,010 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేష‌న్ లో ఫ్యాష‌న్ డిజైన్, లెద‌ర్ డిజైన్, యాక్సెస‌రీ డిజైన్, టెక్స్ టైల్ డిజైన్ వంటి ప‌లు గ్రాడ్యుయేష‌న్ కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తోంది.

 

అదే విధంగా మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్ మెంట్, మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ వంటి మాస్ట‌ర్ డిగ్రీల‌ను కూడా నిఫ్ట్ ఆఫ‌ర్ చేస్తోంది. నిఫ్ట్ లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 20 నుంచి ప్రారంభ‌మైంది.

 

ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేది :  29 డిసెంబ‌ర్ 2017
ఫీజు క‌ట్టేందుకు ఆఖ‌రు తేది  :  02 జ‌న‌వ‌రి 2018
అడ్మిట్ కార్డు ఇచ్చే తేది  :   09 జ‌న‌వ‌రి 2018
రాత ప‌రీక్ష   :   21 జ‌న‌వ‌రి 2018

ద‌ర‌ఖాస్తు ఆన్ లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

మ‌రిన్ని వివ‌రాల‌కు http://nift.ac.in/

 

 

మా పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడితే మీకెందుకు నొప్పి??

కృష్ణా జిల్లా నందిగామలో దీక్షా ఇంట‌ర్ కాలేజీ విద్యార్ధుల‌ను ఒక లెక్చ‌ర‌ర్ అమానుషంగా కొట్ట‌డం మ‌న‌ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. నూనూగు మీసాల యువ‌కులను అమాన‌వీయంగా ప‌శువుల‌ను కొట్టిన‌ట్టు క‌ర్ర‌తో కొట్డడం చూప‌రుల‌కు బాధ‌తో పాటు ఆగ్ర‌హాన్ని కూడా తెప్పించింది. దీక్షా కాలేజీలో ఇంట‌ర్ విద్యార్ధుల‌కు గ‌ణితం భోధించే శ్రీనివాస్ ప్ర‌సాద్ అనే లెక్చ‌ర‌ర్, ఈ అమానుషానికి పాల్ప‌డ్డాడు. వాట్స‌ప్ లో వైర‌ల్ అయిన ఈ వీడియో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌లు రేపింది.

 

వేగంగా స్పందించిన స‌ర్కారు!

 

పిల్ల‌ల‌ను చావ చిత‌క్కొడుతున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విసృతంగా వ్యాప్తి చెంద‌డంతో విష‌యం ప్ర‌భుత్వం వ‌ర‌కూ వెళ్లింది. దీంతో వెంట‌నే కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. దీక్షా క‌ళాశాల‌ను త‌దుప‌ది ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కూ మూసేయాల‌ని, పిల్ల‌ల‌పై పైశాచికంగా దాడి చేసిన లెక్చ‌ర‌ర్ శ్రీనివాస్ పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు దానికి ప్ర‌భుత్వాలు స్పందించిన విధానం చూస్తే దీక్షా కాలేజీ ఘ‌ట‌న‌లో వ్య‌వ‌స్థ వేగంగా ప‌నిచేసింది.

 

 

స్పంద‌న స‌రే..ప‌ర్య‌వ‌సానాలు ఆలోచించారా?

 

పిల్ల‌ల‌ను అమానుషంగా కొట్టిన లెక్చ‌ర‌ర్ పై కాలేజీపై ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు బాగానే ఉన్నాయి. మ‌రి ఉన్న ప‌ళంగా కాలేజీకి తాళం వేస్తే విద్యార్ధుల భ‌విష్య‌త్ ఏంటి? ఈ విష‌యంపై మాత్రం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేన‌ట్టుగానే క‌నిపిస్తోంది. స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు వేగంగా స్పందిచ‌డ‌మే కాదు దానికి ప‌రిష్కార మార్గాలు కూడా చూపించిన‌ప్పుడే నిజ‌మైన స‌మ‌ర్ధ‌త బ‌య‌ట‌ప‌డుతుంది. దీక్షా కాలేజీ విష‌యంలో ఈ విష‌యాన్ని పూర్తిగా విస్మ‌రించిన‌ట్టు ఉన్నారు. విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో కాలేజీ మూసేస్తే ఇప్పుడు వాళ్ల‌కు ఎక్క‌డ అడ్మిష‌న్ దొరుకుతుంది?

 

మీడియా అతిపై పేరెంట్స్ ఫైర్!

 

కార్పోరేట్ కాలేజీల నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌ల‌ను యాడ్స్ రూపంలో సంపాదిస్తున్న మీడియా సంస్థ‌లు కూడా ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు అనాలోచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. టీఆర్పీ లు మాత్ర‌మే ల‌క్ష్యంగా విద్యార్ధుల భ‌విష్య‌త్ తో ఆట‌లాడుకుంటున్నాయి. విద్యార్ధుల‌పై అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన లెక్చ‌ర‌ర్, కాలేజీపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో, విద్యా సంవ‌త్స‌రం మ‌ధ్య‌లో ఉన్న విద్యార్ధుల భ‌విష్య‌త్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విష‌యంపై మాత్రం ఏ మీడియా సంస్థ కూడా క‌థ‌నం ప్ర‌సారం చేయ‌లేదు. వార్త రాయ‌లేదు. అందుకే దీక్షా కాలేజీ అంశంలో మీడియా ప్ర‌తినిధుల‌పైకి విద్యార్ధుల త‌ల్లిదండ్రులు తిర‌గ‌బ‌డ్డారు. వ్య‌వ‌హ‌రాన్ని జ‌ఠిలం చేసి త‌మ పిల్ల‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

 

చైనా సంస్థ‌ల‌కూ తాళాలు వేయ‌గ‌ల‌రా?

 

దీక్షా కాలేజీ విష‌యంలో ఆఘ‌మేఘాల మీద స్పందించిన ప్ర‌భుత్వం మిగ‌తా విద్యా సంస్థల విష‌యంలోనే ఇలానే స్పందించ‌గ‌లుగుతుందా? ఎందుకు ఇలా చెప్పాల్సి వ‌స్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర‌శ్రేణి కార్పోరేట్ విద్యా సంస్థ‌లు కూడా ఇలానే పిల్ల‌ల‌ను హింసించిన ఘ‌ట‌న‌లు వెలుగు చూసినా వాటి యాజమాన్యాల‌పై ప్ర‌భుత్వాలు ఎప్పుడు కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. అయినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే కాదు. ఇటువంటి ఇబ్బందిక‌ర సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్పు చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డ ఎంత ముఖ్య‌మో అలానే విద్యార్ధుల భ‌విష్య‌త్, క్షేమం ఆలోచించ‌డం కూడా అంతే ముఖ్యం. లేకుంటే కొండ నాలుక‌కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా త‌యారవుతుంది వ్య‌వ‌హారం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన‌వారు)

 

ప‌నివాళ్ల‌ కాళ్లు మొక్కి కార్పోరేట్ కంపెనీల‌కు కొత్త పాఠం నేర్పిన‌ త‌మిళ వ్యాపారి!

 

తాజాగా త‌మిళ‌నాడులో ఒక ట్రాన్స్ పోర్ట్ సంస్థ యజమాని త‌న సంస్థ‌లో ప‌నిచేసే డ్రైవ‌ర్ల కాళ్లు మొక్క‌డం దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోట్లాది రూపాయ‌ల‌కు అధిప‌తి అయ్యిండి చిన్న స్థాయిలో త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ప‌నివాళ్ల కాళ్ల‌పై అత‌ను ఎందుకు ప‌డ్డాడు? త‌న కింద ప‌నిచేసే వాళ్ల‌ను అంత‌లా గౌర‌వించాల్సిన అవ‌స‌ర‌ముందా? అత‌ను చేసిన ప‌నిని అంద‌రూ ఎందుకు అంత‌లా ప్ర‌శంసిస్తున్నారు. ఒకవైపు ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటే మ‌రోవైపు అత‌ను చేసిన ప‌ని హెచ్ఆర్ నైపుణ్యాల్లో అత‌నికున్న ప‌ట్టును తెలియజేస్తోంద‌ని మాన‌వ వ‌న‌రుల విభాగంలో త‌ల‌లు పండిన మేధావులు చెపుతున్నారు.

 

య‌జమాని ఉద్యోగుల‌తో ఎప్పుడూ క‌ఠినంగానే ఉండాలా?

 

ఒక యాజమాని ఎప్పుడూ త‌న కింద ప‌నిచేసే ఉద్యోగుల‌తో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాలా? లేక వాళ్ల ప‌నితీరుకు త‌గిన ప్రోత్సాహ‌కాలు అందిస్తూ వాళ్లు అందిస్తున్న సేవ‌ల‌కు త‌గిన గుర్తింపును ఇవ్వాలా? ఈ విష‌యంలో హెచ్ఆర్ విభాగంలో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. గ‌తంతో పోల్చితే ఇప్పుడు ఉద్యోగుల‌తో కంపెనీలు కాస్త మర్యాద‌పూర్వ‌కంగా, సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాన‌వ స్వ‌భావాన్ని అధ్య‌య‌నం చేసి దాన్ని హెచ్ఆర్ కు జ‌త చేయ‌డంతో కొన్ని కంపెనీలు అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించాయి. ప్రొత్సాహం, ప్ర‌శంస అనేవి ఉత్పాద‌క‌త‌ను పెంచే రెండు అద్భుత‌మైన విష‌యాల‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. అందుకే కొన్ని టాప్ కంపెనీలు త‌మ హెచ్ఆర్ విభాగంలో ఈ రెండు విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. ఈ మార్పుతో మంచి ఫ‌లితాల‌ను కూడా సాధిస్తున్నాయి.

 

పేప‌ర్ గొప్ప‌దా?? పేప‌ర్ వెయిట్ గొప్ప‌దా??

 

విన‌డానికి చాలా సింపుల్ గా ఉన్నా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే విభిన్న కోణాల్లో, విభిన్న సంద‌ర్భాల్లో చూస్తే ఈ రెండు చాలా ముఖ్య‌మైన‌వి గా క‌నిపిస్తాయి. అదే స‌మ‌యంలో ఈ రెండింటికి మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధం కూడా ప‌రిగ‌ణించ‌ద‌గ్గ‌దే. ఒక‌టి లేకుంటే రెండోది మ‌నుగ‌డ సాగించ‌డం అసాధ్యం. నాపై ఉండ‌టం వ‌ల‌న ఎటువంటి ఉప‌యోగం లేని పేప‌ర్ వెయిట్ కు విలువ పెరిగింద‌ని పేప‌ర్ విర్ర‌వీగినా, నేను పైన‌ ఉండి ఎగ‌ర‌కుండా కాపాడ‌కుంటే పేప‌ర్ ఎక్క‌డో డ‌స్ట్ బిన్ లో ప‌డి ఉండేది అని పేప‌ర్ వెయిట్ అనుకున్నా అస‌లు కార్యం ర‌సాభాస‌గా మారుతుంది. సంద‌ర్భాన్ని అనుస‌రించి పేప‌ర్, పేప‌ర్ వెయిట్ రెండూ గొప్ప‌వే. ఒక‌దానికి మ‌రొక‌టి ప‌రస్ప‌ర గౌర‌వం ఇచ్చిపుచ్చుకున్న‌ప్పుడే వాటి గౌర‌వం మ‌రింత పెరుగుతుంది.

 

ఉద్యోగికి గౌర‌వం ఇస్తేనే యజ‌మానికి ఎదుగుద‌ల‌!

 

హెచ్ఆర్ విభాగాన్ని ప‌టిష్టం చేసుకున్న కంపెనీలను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఉద్యోగికి ఇచ్చే గౌర‌వం అర్ధ‌మ‌వుతుంది. కంపెనీకి ఉద్యోగులు అందిస్తున్న సేవ‌ల‌కు గాను వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ స్పంద‌న‌ను తెలియజేస్తారు. స‌రిగ్గా ప‌నిచేయ‌ని ఉద్యోగి విష‌యంలో ఎంత క‌ఠినంగా ఉంటారో అలానే కంపెనీ ఉన్న‌తికి కృషి చేసే ఉద్యోగికి త‌మ కృత‌జ్ఞ‌త‌తో కూడిన ప్ర‌తిస్పంద‌న‌ను కూడా అదే విధంగా తెలియ‌జేస్తారు. ఇప్పుడు త‌మిళ‌నాడులో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి చేసిన ప‌ని కూడా అదే. ఉద్యోగికి ప్రేమ‌తో కూడిన కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేసి త‌న కింద ప‌నిచేసే ఉద్యోగుల మ‌న‌సు గెల్చుకున్నాడు. వాస్త‌వానికి ఇది ప్ర‌స్తుతం పెద్ద పెద్ద కంపెనీల‌కు కూడా సాధ్యం కాని విష‌యం. ఇక స్టార్టప్ విష‌యం అయితే చెప్ప‌నే అక్క‌ర్లేదు. ఔత్సాహిక వ్యాపారవేత్త‌లు, కార్పోరేట్ రంగంలో దూసుకుపోవాల‌నుకుంటున్న వారు త‌మిళ వ్యాపారి చేసిన ప‌నిని ఒక‌సారి మ‌న‌నం చేసుకుంటే చాలు. భ‌విష్య‌త్ లో వాళ్ల కంపెనీలు ఉన్న‌త స్థానంలో నిల‌బ‌డ‌తాయి.

 

                                                     ( ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్స‌ర్ చేసిన వారు)