మోసపూరిత పద్ధతుల ద్వారా లా కోర్సులు పూర్తి చేయడమే కాకుండా బార్ కౌన్సిల్ లో సభ్యత్వం కూడా పొందిన లాయర్లపై మద్రాస్ హైకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు వాళ్లపై తగు విచారణ చేపట్టాలని అడ్వకోట్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. 2009 – 2016 మధ్య కాలంలో క్రమ పద్ధతిలో కాకుండా, సాధారణ విద్యా పద్ధతులకు భిన్నంగా చాలా మంది లా కోర్సులు చదివినట్టు తేలింది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్ట్ ఈ విధంగా లా డిగ్రీలను పొందిన వారిపై విచారణ చేపట్టాలని వెల్లడించింది.
ఈ విధంగా లా డిగ్రీలు పూర్తి చేసినట్టు తప్పుడు పత్రాలు సమర్పించి దాదాపు 713 మంది తమిళనాడు బార్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే తప్పుడు దృవపత్రాలు సమర్పించినట్టు తేలిన 42 మందిపై కేసులు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ విషయంపై స్పందించి తమిళనాడు బార్ కౌన్సిల్ వర్గాలు మోసపూరిత పద్ధతుల్లో సభ్యత్వం పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే 2008 కంటే ముందు సభ్యత్వం పొందిన వారు మాత్రం ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు తెలిపారు.