కేఫ్ కాఫీ డే సిద్ధార్థ మళ్లీ పుడితే…!!

 

నేత్రావతి నది..రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నది మంచి జోరుమీదుంది. బ్రిడ్జిపై నడుస్తున్న సిద్ధార్ధ మనస్సులో ఆలోచనలు కూడా కింద ఉన్న నదిలో నీరులాగే సుడులు తిరుగుతున్నాయి. ‘ఇంక తప్పదు ఈ ఒత్తిడిని నేను భరించలేను. నాకున్న సమస్యలన్నింటికీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం’. గట్టిగా ఊపిరి పీల్చుకున్న సిద్ధార్ధ నదిలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు. సడెన్ గా అప్పుడే ఆగు అన్న గొంతు వినపడటంతో దూకబోతున్నవాడల్లా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు. ప్రశాంత వదనంతో, మంచి తేజస్సుతో ఒక్క వ్యక్తి తనవైపే రావడాన్ని సిద్ధార్థ గమనించాడు. దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తి దేవుడు అని గుర్తించడానికి సిద్ధార్థకు ఎక్కువ సమయం పట్టలేదు. నేరుగా విషయంలోకి వచ్చిన దేవుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావ్? ఆత్మహత్య పాపం అని తెలీదా? అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సిద్ధార్థ తనకు ఎదురైన కష్టాలు, నష్టాలు, మోసాలు, బెదిరింపులు అన్నీ ఏకరువు పెట్టాడు. కొన్ని తప్పులు, మరికొన్ని పొరపాట్లు తనను ఈ స్థితికి తెచ్చాయని తనకు ఆత్మహత్య కంటే వేరే మార్గం లేదని బోరుమన్నాడు. సావధానంగా విన్న దేవుడు నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లు నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి అని చెపుతున్నావ్. ‘సరే నేను నీకు ఒక వరం ఇస్తాను. నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. ప్రస్తుత నీ సమస్యలు, నష్టాలు ఏవీ నీకు గుర్తుకు రావు. నువ్వు మరో చోట ఒక కొత్త వ్యక్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. హాయిగా జీవించు’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఒక కొత్త ప్రదేశంలో మళ్లీ పుట్టి ఒక కొత్త సిద్ధార్థగా తన నూతన జీవితాన్ని ప్రారంభించాడు సిద్ధార్థ. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం చేసి ఒకరి పనిచేయడం లేని సిద్ధార్థ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చిన్న స్టార్టప్ ప్రారంభించి రాత్రీ పగలు కష్టపడి దాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. వ్యాపారంలో మెల్లగా కుదురుకోగానే తన పోటీ కంపెనీల్లో కొన్నింటిని టేకోవర్ చేసి దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకడిగా ఎదిగాడు. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు బ్యాంకు రుణాలు తీసుకున్నాడు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లాడు. స్టాక్ మార్కెట్లో కంపెనీని లిస్ట్ చేయించాడు. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టాలన్న తొందరలో భారీగా రుణాలు తీసుకున్నాడు. ప్రభుత్వ పన్ను చట్టాలను సరిగా తెలియక కొంత, తెలిస్తే ఏమవుతుంది అన్న నిర్లక్ష్యంతో కొంత పన్ను చెల్లింపుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఫలితంగా పలు కేసుల్లో చిక్కుకున్నాడు. ఒకవైపు భారీగా పెరిగిపోయిన రుణాలు, మరోవైపు కేసులు, ఇంకోవైపు దేశంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ గా ఉండి ఇప్పుడు నలుగురిలో తలెత్తుకు తిరగ్గలనా అన్న భయాలు వెరిసి ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనే నిర్ణయానికొచ్చాడు. మళ్లీ అదే నేత్రావతి నది దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ వచ్చిన అతని ప్రయత్నాన్ని ఆపిన దేవుడు తను గతంలో ఎవరు? ఇప్పుడు ఎవరు? తను ఏం చేసింది అంతా వివరంగా చెప్పుకొచ్చాడు. చూడు సిద్ధార్థ..ప్రతీ మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. చేయాలి కూడా. ఎందుకంటే తప్పు చేసిన ప్రతీసారీ కింద పడిన ప్రతీసారీ మనం పైకి లేచి ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. మరోసారి అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. జీవితం అంతా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవడమే జీవితం. నీలా ఆత్మహత్య చేసుకుంటే నేను సృష్టించిన ఈ జగత్తులో ఒక్క ప్రాణి కూడా మనుగడ సాగించి ఉండేది కాదు. తప్పులు చేసి ఎంతగా నష్టపోయినా, ఎంత కిందకు చేరుకున్నా ధైర్యంతో ముందుకు సాగితే జీవితం మనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మనిషి సృష్టించుకున్న ఈ డబ్బు కన్నా, ఈ వ్యాపార సామ్రాజ్యాల కన్నా ప్రాణం విలువైనది. అది లేకపోతే ఈ ప్రయాణం ఎందుకు? ఈ డబ్బు ఎందుకు? విజయం అనేది మన ఆనందం, సంతృప్తిలో ఉంటుంది కానీ డబ్బులు, వ్యాపార సామ్రాజ్యాలలో ఉండదు.

 

 

ఓపిక, సహనంతో వేచి ఉండాలి!

మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఓపికతో వేచి చూడటం. విత్తనం మొక్కలా మారి ఎదిగి మనకు ఫలసాయం అందించాలన్నా, తల్లి కడుపులో ఒక చిన్నారి మనిషిగా రూపుదాల్చాలన్నా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ ఉత్సాహంతో వేచి ఉండాలి. అలా అని ఒక పనిని ఏదో తూతూమంత్రంగా చేసి మంచి ఫలితాల కోసం వేచిచూడమని కాదు. చేయాల్సిన పనిని నాణ్యంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా కష్టపడి చేసి దాని ఫలితాల కోసం ఎదురు చూడాలి. కుటుంబంతో అన్ని విషయాలను పంచుకుంటూ వచ్చే ఫలితం కోసం అధికంగా ఆలోచిండచం మాని ఎటువంటి ఫలితం వచ్చినా తీసుకునేందుకు సిద్దంగా ఉండాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనిషి ఒత్తిడిని జయించగలడు. అలా కాకుండా ఒక పని చేసి దాని ఫలితం కోసం ఎదురు చూడటం, ఏం జరగవచ్చని తీవ్రంగా ఆలోచించడం వంటివి చేస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యలకు దారితీస్తాయి. మనిషి కర్తవ్యం ముగిసిన వెంటనే ఫలితాన్ని పరమాత్మ అస్థిత్వానికి విడిచిపెట్టేయాలి. అంటే మూఢంగా దేవుడ్ని నమ్మమని కాదు. తాజాగా చంద్రయాన్ 2 ప్రయోగంలో రాకెట్ ను శక్తివంచన లేకుండా కష్టపడి తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రయోగం ముందు రోజు దేవుని వద్దకు వెళ్లి మోకరిల్లారు. ఎందుకు వారు చేయాల్సిన పనిని 100 శాతం కచ్చితత్వంతో, నైపుణ్యంతో చేసారు. ఫలితం బాగుండాలని దేవుడ్ని శరణు వేడుకున్నారు. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

 

 

ధైర్యమే జీవితం!

మనం ముందు చెప్పుకున్న దేవుడు, సిద్ధార్థ కథలానే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఎన్నో అపజయాలు , కష్టాలు, నష్టాలు ఉంటాయి. వాటన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారం కాదు. ఈ కథలోని సారాన్ని ఈ తరం విద్యార్ధులు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. సరిగ్గా మార్కులు రాలేదనో, పక్కవాడి కంటే తక్కువ జీతం వచ్చిందనో, ఉద్యోగం పోయిందనో ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. చక్కగా జీవితాన్ని సంపూర్ణంగా గడిపేందుకు దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇంత విశాలమైన ప్రపంచాన్ని, ప్రకృతిని ఇచ్చాడు. కింద పడిన ప్రతీసారి లేచే చంటి పిల్లాడిలా ఎప్పటికప్పుడు లేచి కొత్తగా జీవితం అనే పరుగును మొదలుపెట్టాలి. సిద్ధార్థ లాంటి ప్రతిభావంతులకు ఆస్తులన్నీ పోయి కేఫ్ కాఫీ డే వంటి సంస్థలు పోతే ఏమైనా అవుతుందా? మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టి తన సామర్ధ్యంతో మరింతగా ఉన్నతంగా ఎదగగలరు. కానీ అప్పటి వరకూ విజేతగా ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకుని పరాజితునిగా నిలిచిపోయారు. కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి తలెత్తుకు తిరిగే వారినే దేవుడు, ఈ ప్రకృతి ప్రేమతో అక్కున చేర్చుకుంటాయి. భయపడేవాళ్లకు, బెదిరిపోయే వాళ్లకు, తప్పులు చేసేందుకు తటపటాయించే వారికి ఇక్కడ స్థానం లేదు. విద్యార్ధులూ గుర్తు పెట్టుకోండి. ధైర్యమే జీవితం.

డా. ఆర్‌.బీ. అంకం

 

 

నిన్ను నువ్వు తెలుసుకోవ‌డ‌మే విజ‌యం!

ఎప్పుడూ నెమ్మ‌దిగా, సైలెంట్ గా ఉండే ఒక వ్య‌క్తి అక‌స్మాత్తుగా కోపంతో ఊగిపోవ‌డాన్ని మీరు చాలా సంద‌ర్భాల్లో చూసి ఉంటారు. అంత సావ‌ధానంగా మ‌సులుకునే వ్య‌క్తి ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌గానే మ‌నం సాధారణంగా ఒక మాట అంటుంటాం. ‘వీడి లోని అస‌లు మ‌నిషి నిద్ర లేచాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్నది నిజంగా వీడినేనా?’  అవ‌త‌లి వాళ్ల కోపం మితిమీరిపోయిన‌ప్పుడు ఇదీ వీడి అస‌లైన స్వ‌భావం అంటూ విమ‌ర్శలు కూడా గుప్పిస్తాం. మ‌నం చూస్తున్న దృష్టి కోణం నుంచి మ‌నం ప్ర‌తీ ఒక్క‌రిపై ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు సంబంధించి, మ‌న ప్ర‌వ‌ర్త‌నకు సంబందించి ఒక స్వీయ గుర్తింపును కూడా ఏర్ప‌రుచుకుంటాం. మెల్ల‌గా అన్ని విష‌యాల్లో మ‌న‌మే చాలా గొప్ప‌వాళ్లం. మ‌నం చేసిన‌వ‌న్నీ ఒప్పులే. మ‌నం త‌ప్పు చేయ‌డానికి చాలా ఫ‌లానా విష‌యం కార‌ణం అంటూ మ‌న‌ల్ని మ‌నం స‌మ‌ర్ధించుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో ఇత‌రులు త‌ప్పుల‌ను, లోపాల‌ను ఎత్తిచూపుతూ వాళ్ల‌ను త‌క్కువ చేయ‌డానికి, నింద‌లు మోప‌డానికి అల‌వాటు ప‌డ‌తాం. ఎంత‌సేపు ఇత‌రుల‌ను నిందించ‌డంలో మునిగిపోయి మ‌న‌లోని లోపాల‌ను, పొర‌పాట్ల‌ను గుర్తించ‌డం పూర్తిగా మానుకుంటాం. స‌రిగ్గా ఇక్క‌డే వ్య‌క్తిత్వ నిర్మాణం, వికాసం దెబ్బ‌తింటాయి. మ‌నిషి సంబంధాల ప‌రంగా, విలువ‌ల ప‌రంగా ప‌త‌నం కావ‌డం మొద‌ల‌వుతుంది.

అంద‌రూ మీలా ఎందుకు ఉంటారు?

 

ఈ ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు.  పుట్టి పెరిగిన సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, విలువ‌లు, నేప‌థ్యం ఆధారంగా ఒక మ‌నిషి వ్య‌క్తిత్వం నిర్మించ‌బ‌డుతుంది.  ఒక మనిషి ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌క్తిత్వం మ‌రో మ‌నిషిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోలి ఉండ‌దు. ఒకే ఇంట్లో పెరిగిన‌ప్ప‌టికీ వారి వారి అనుభ‌వాలు, ఆలోచ‌న‌లు బ‌ట్టి కుటుంబ సభ్యులే విభిన్నమైన ఆలోచ‌నల‌ను, వ్యక్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఆలోచ‌న‌ల్లో సారూప్య‌తులు ఉంటాయి కానీ అచ్చుగుద్దిన‌ట్టు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు ఉండ‌టం అసాధ్యం అనే చెప్పాలి. కాబ‌ట్టి అంద‌రూ మీలా ఆలోచించాలి..మీలా ఉండాలి..అన్న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ‌దిలేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక ప్ర‌త్యేకమైన వ్య‌క్తిత్వం ఉందో అలానే మిగిలిన వారికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని గుర్తించండి. ఎంత‌సేపూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నించ‌డం  అన్న‌ది మీ స‌మ‌యాన్ని వృధా చేస్తుంది త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌రికి ఒక‌రు గౌర‌వంఇచ్చుకుని అపార్ధాలకు, అహాల‌కు తావులేకుండా స‌ర్దుకుపోవ‌డం అన్న‌ది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణం చేయ‌గ‌ల‌రు. అది స్నేహితులైనా, భార్యాభ‌ర్త‌లైనా, కుటుంబ స‌భ్యులైనా.

 

‘నేను’ అనే దాన్ని మీ మ‌న‌స్సులోంచి తీసేయండి! 

 

మీరు గొప్ప ఉపాధ్యాయుల‌ను, నాయ‌కుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఎప్పుడు ‘నేను’ అనే మాట‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌రు. ‘నేను’ అనే మాట మీలో అహంభావాన్ని క‌లిగిస్తుంది. అహంభావం మ‌నిషిని నైతికంగా దెబ్బ‌తీసి ప‌త‌నం దిశ‌గా న‌డిపిస్తుంది. ‘నేను’ అన్న‌దాన్ని మ‌న ఆలోచ‌న‌ల్లోంచి పూర్తిగా తొలిగించ‌డం కాస్త‌ క‌ష్ట‌మైన ప‌నే. అయినా ప్ర‌య‌త్నం చేయాలి. చ‌దువుకునే చోట‌, ప‌నిచేసే చోట, ప‌నిచేయించే చోట ఎక్క‌డైనా కానీయండి ‘నేను’ అనే మాట‌ను వాడ‌టంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. నిజంగా మీరు ఒక్క‌రే బాగా క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ మ‌నం క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పండి. నేను అనే మాట అపార్ధాల‌కు, అపోహ‌ల‌కు దారి తీస్తుంది. సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌న్నా, వ్యక్తుల‌కు గౌర‌వించాల‌న్నా ‘నేను’ అన్న ప‌దాన్ని మీ డిక్ష‌న‌రీ నుంచి పూర్తిగా తొలిగించి ఆ స్థానంలో ‘మేము’ అన్న ప‌దాన్ని చేర్చండి.

మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దుకోండి! 

 

ప్ర‌తీ మ‌నిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సంపూర్ణ‌మైన మ‌నిషి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అయితే త‌న‌లోని లోపాల‌ను గుర్తించ‌డం, వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. ‘నాకు అన్నీ తెలుసు…నేను చేసిన ప‌నికి తిరుగుండ‌దు.’ అని అనుకోవ‌డం పొర‌పాటు. ఆత్మ‌విశ్వాసానికి, అతి విశ్వాసానికి వెంట్రుక‌వాసి తేడా మాత్ర‌మే ఉంటుంది. ఆత్మ‌విశ్వాసం క‌చ్చితంగా ఉండాల్సిందే అయితే అది అతి విశ్వాసంగా మార‌కుండా చూసుకోవాలి. సంబంధాల విష‌యంలోనూ, ప్ర‌వ‌ర్త‌న విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. నిజాయితీగా స‌మీక్ష చేసుకున్న‌ప్పుడు మ‌న‌లోని లోపాలు, చేసిన పొర‌పాట్లు క‌చ్చితంగా మీ దృష్టికి వ‌స్తాయి. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం కాబ‌ట్టి దాన్ని అక్క‌డే వ‌దిలేసి అటువంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకొండి. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ సంబంధాలు, గౌర‌వం ఇచ్చుపుచ్చుకోవ‌డంలో త‌ప్ప‌నిస‌రిగా స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. మీదే త‌ప్పు ఉంద‌ని తేలితే లేదా ఎటువంటి భేజ‌షాల‌కు పోకుండా త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు కూడా వెనుకాడ‌కండి. క్ష‌మాప‌ణ చెప్ప‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకున్న‌ట్టు కాదు మీరు సంబంధాల‌కు అధిక విలువ ఇస్తున్న‌ట్టు.

 

మీ అభిప్రాయాల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు! 

 

మీరు కొంద‌రు వ్య‌క్తుల‌పై లేదా కొన్ని వ్య‌వస్థ‌ల‌పై ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను  క‌లిగి ఉండ‌టం మంచిదే. కానీ అది మీ ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌కుండా చూసుకోండి. ఎందుకంటే అభిప్రాయం క‌లిగి ఉండ‌టం వేరు అదే అభిప్రాయాన్ని మిగిలిన వారు కూడా క‌లిగి ఉండాల‌ని అనుకోవ‌డం వేరు. ప్ర‌తీ వ్యక్తికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటాడ‌ని గుర్తించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. అంద‌ర్నీ గౌర‌వించిన‌ప్పుడే మీకు గౌర‌వం ల‌భిస్తుంది. మీకు ఉన్న ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. మీదైన వ్య‌వ‌స్థ‌లో అది సాధ్య‌మేమో కానీ విభిన్న మ‌న‌స్త‌త్వాల మ‌నుష్య‌లు ఉన్న ప్ర‌పంచంలో అది అస్స‌లు సాధ్యం కాదు. ఎందుకంటే మీ అభిప్రాయాల‌తో ఏకీభ‌వించ‌ని వాళ్లు కూడా ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. కాబ‌ట్టి అంద‌రి అభిప్రాయాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను గౌర‌విస్తూ ముందుకు సాగితేనే విజ‌యం మీ ద‌రికి చేరుతుంది. లేకుంటే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ త‌ప్ప ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు.