2018 – 19 విద్యా సంవత్సరానికి గాను పీజీ వైద్య విద్య లో ప్రవేశాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ, తేదీలకు సంబంధించి జాతీయ పరీక్షల మండలి ( ఎన్ బీఈ) ప్రకటన విడుదల చేసింది. పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 7 న జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ( నీట్) ను నిర్వహించనున్నారు. తగిన అర్హతలు ఉన్న వైద్య విద్యార్ధులు పీజీ నీట్ 2018 కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష కూడా ఆన్ లైన్ లోనే ఉంటుంది.
పీజీ నీట్ 2018 ను ఒకే రోజు ఒకే విడతగా నిర్వహించనున్నారు. దీంతో విద్యార్ధులందరికీ ఒకే విధమైన క్వశ్చన్ పేపర్ వస్తుంది. గతంలో కొందరికి సులువుగా, మరికొందరికి కఠినంగా ప్రశ్నలు వచ్చాయన్న విమర్శల నేపథ్యంలో ఈ మార్పులు చేసారు. అయితే ఈ సారి తొలిసారిగి నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సరైన సమాధానికి 4 మార్కులు వస్తాయి. అలాగే తప్పు సమాధానానికి మైనస్ 1 మార్కు వస్తుంది. సమాధానం రాయకపోతే ఎటువంటి మార్కులు ఉండవు. పరీక్షలో మొత్తంగా 300 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయాన్ని 3గంటల 30 నిమిషాలుగా నిర్ణయించారు.