ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లందుకుంటున్న‌ ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’

 

ప్రముఖ విద్యావేత్త‌, ట్యూట‌ర్స్ ప్రైడ్ అధినేత‌ డా. ఆర్.బి. అంకం గారు రాసిన ‘పిల్లల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ఆధునిక యుగంలో అతిపెద్ద స‌వాలుగా మారిన పిల్ల‌ల పెంప‌కంపై డా. అంకం గారు చెప్పిన ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముక్కుసూటిగా చెప్పిన విష‌యాలు ప్రతీ త‌ల్లిదండ్రుల గుండెను తాకుతున్నాయి. సాంకేతిక విప్ల‌వం తెచ్చిన అభివృద్ధి మాన‌వాళి జీవితాల‌ను ఎంత‌గా స‌ర‌ళ‌త‌రం చేసిందో తెలీదు కానీ పిల్ల‌ల పెంప‌కాన్ని మాత్రం అతిపెద్ద స‌వాలుగా మార్చింది. ఇంట‌ర్నెట్ లో పిల్ల‌లు ఏం చూస్తున్నారో, సోష‌ల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారో తెలియ‌క తల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రోవైపు ఉమ్మడి కుటుంబాలు క‌నుమ‌రుగైన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌కు మ‌న సంస్కృతీ, సాంప్ర‌దాయాలు, విలువ‌లు నేర్పించే పెద్ద‌లు క‌రువైపోయారు. దీంతో ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌ గౌర‌వ మ‌ర్యాద‌లు తెలీక ప్ర‌తీ చిన్న విష‌యానికీ టెక్నాల‌జీపై ఆధార‌ప‌డుతున్న నేటి త‌రాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పుస్త‌కంలో డా.ఆర్.బి. అంకం గారు స‌వివ‌రంగా పొందుప‌ర్చారు.

 

పుస్త‌కంలోని ప్ర‌తీ అక్ష‌రం త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన విష‌యం కావ‌డంతో విడుద‌లైన త‌క్కువ స‌మ‌యంలోనే అశేష పాఠ‌కాద‌ర‌ణ పొందింది. ఈ పుస్త‌కంలో శాస్త్రీయంగా, విపులంగా చ‌ర్చించిన విష‌యాలు న‌చ్చి మాజీ ఐపీఎస్ అధికారి జే.డీ. ల‌క్ష్మీనారాయ‌ణ గారు అలాగే భార‌తీయ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న భార‌తీయం స‌త్య‌వాణి గారు ముందుమాట‌ను రాసారు. పుస్త‌కంలోని అద్భుత విష‌యం పాఠ‌కులంద‌రికీ చేరాల‌న్న ఉద్దేశంలో ప్ర‌ముఖ ప‌బ్లిషింగ్ సంస్థ ఎమెస్కో ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. అలాగే తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది.

 

 

జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ప్ర‌ముఖ ర‌చయిత‌లు, సాహితీవేత్త‌లు, సాహిత్యాభిమానులు ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌శంసించారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ పుస్త‌కాన్ని , ర‌చ‌యిత డా. ఆర్.బి.అంకం గారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

 

వైభ‌వంగా ఐటాప్ – 2018 అవార్డుల ప్ర‌ధానోత్సవం

 

అత్యుత్త‌మ ఉపాధ్యాయుల‌ను ఘ‌నంగా స‌త్క‌రించే ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 2 న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జరిగింది. న‌గ‌రంలో హైటెక్ సిటీ స‌మీపంలో ఉన్న ట్రైడెంట్ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా ఈ అవార్డుల వేడుకను నిర్వ‌హించారు. హైద‌రాబాద్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హరించింది.

 

 

20 కి పైగా విభాగాల్లో అక‌డ‌మిక్, నాన్ అక‌డ‌మిక్ ఉపాధ్యాయుల‌ను ఐటాప్ 2018 అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించారు. ఇందులో ఒక‌రికి మ‌హా మ‌హోపాధ్యాయ అవార్డు, 5 గురుకి జీవిత కాల సాఫ‌ల్య పుర‌స్కారం, 100 మందికి ఐటాప్ అవార్డులు అందుకున్నారు. అలాగే మ‌రో 70 మంది స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐటాప్ 2018 అవార్డు కోసం దాదాపు 700 మంది అక‌డ‌మిక్ , నాన్ అక‌డమిక్ ఉపాధ్యాయులు, కోచ్ లు, ప్రొఫెస‌ర్లు, డీన్ లు, ప్రిన్సిపాల్ లు నామినేష‌న్లు వేసారు. అత్యంత క‌ఠిన‌త‌ర‌మైన ఎంపిక ప్ర‌క్రియ అనంత‌రం జ్యూరీ సభ్యులు అవార్డు గ్ర‌హీత‌ల‌ను ప్ర‌క‌టించారు. నామినేష‌న్ వేసిన ప్ర‌తీ ఒక్క‌రూ కార్యక్ర‌మంలో పాల్గ‌నే వీలుండ‌టంతో దాదాపు 1000 మంది వ‌ర‌కూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యారు.

 

 

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొద‌లుకుని మెట్రో సిటీల్లో ఉన్న విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్లుగా, డీన్లుగా ప‌నిచేస్తున్న వారు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం విశేషం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వ‌ర్యులు, శ్రీ కొణిజేటి రోశ‌య్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణా శాస‌న మండ‌లి ఛైర్మ‌న్, స్వామి గౌడ్ గారు, తెలంగాణా బీసీ క‌మీష‌న్ ఛైర్మ‌న్ శ్రీ బీ.సీ. రాములు గారు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణా వాట‌ర్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్. శ్రీ వీర‌మ‌ళ్ల ప్ర‌కాశ్ రావు గారు, తెలుగు విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ శ్రీ. ఎస్.వీ. స‌త్య‌నారాయ‌ణ గారు, ప‌లువురు ఐఏఎస్ ఆఫీస‌ర్లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

 

చిన్న స్థాయి , గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయుల‌ను చిన్న చిన్న వేదిక‌ల‌పై స‌త్క‌రించ‌డం అన్న‌దే మ‌నం ఇప్ప‌టివ‌ర‌కూ చూసాం. కానీ ట్యూట‌ర్స్ ప్రైడ్ వారి స‌హ‌కారంతో ఐటాప్ 2018 లో ఉపాధ్యాయుల‌ను హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ట్రైడెంట్ హోట‌ల్ లో వారికి ఒక ఆనంద అనుభూతిని పంచుతూ అందించ‌డం నిజంగా అభినంద‌నీయం.

 

వందేళ్ల చరిత్ర ఉన్న ఓ కాలేజీ..చదివే విద్యార్ధుల సంఖ్య 1..ఎందుకు?

 

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా మొదలయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్న హోర్డింగ్స్ చూస్తూ తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేసిందని చంకలు గుద్దుకుంటున్నాం. మనకు మనమే తెలుగు భాషాభిమానులుగా తెగ ఫీలైపోతున్నాం. ఇక ప్రభుత్వం హంగామా అయితే చెప్పనే అవసరం లేదు. ఈ హడావుడిలో ఓ దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు మరుగున పడిపోయింది. అదేదో మామూలు అషామాషీ వార్త కాదు. నిజమైన భాషాభిమానుల గుండెల్ని పిండేసే వార్త. అన్నింటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్ లో వచ్చింది ప్రపంచ తెలుగు మహా సభల్లో ప్రభుత్వాన్ని కీర్తించడంలో బిజీగా ఉన్న మన తెలుగు పత్రికలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విచారకరమైన వార్త ఏంటంటే.. వందేళ్ల చరిత్ర కలిగిన ఓ ప్రముఖ కళాశాలలో తల్లి భాషను నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన విద్యార్ధుల సంఖ్య కేవలం ఒక్కటంటే ఒక్కటి. ఇతర భాషలో సరైన విధంగా భావవ్యక్తీకరణ చేయాలంటే సొంత భాషపై తల్లి భాషపై పట్టు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని అందరూ విస్మరిస్తున్న వేళ తెలుగును బతికించుకోవాలంటే సమావేశాలు, సభలు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు.

 

 

 

ఒక్కడే విద్యార్ధి, ఒక్కరే టీచర్!

 

1860 లో ప్రారంభించిన విజయనగరం మహారాజా కాలేజీకి మంచి గుర్తింపు ఉంది. మొదట్లో రాజులు ఈ కాలేజీని నిర్వహించినప్పటకీ స్వాతంత్ర వచ్చాక ప్రభుత్వ కళాశాలగా మారింది. ఇక్కడ సంస్కృత కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. దేశంలో గొప్ప గొప్ప సంస్కృత, తెలుగు పండితులు ఇక్కడ విద్యాభ్యాసం చేసారు. ప్రస్తుతం ఈ కాలేజీలో సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలుగా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ మాత్రమే కావాల్సి రావడంతో ఈ కోర్సు వైపు కన్నెత్తి చూసే నాథుడు కూడా లేడు. ప్రస్తుతం విద్యా సంవతర్సంలో ఈ కాలేజీలో సదరు కోర్సులో కేవలం ఒకే ఒక్క విద్యార్ధి చదువుతున్నాడు. దీంతో ఉన్న ఇద్దరు తెలుగు, సంస్కృతం పండితులను వేరే కాలేజీలకు బదిలీ చేసారు. మొత్తం కాలేజీకి ఒక్క స్టూడెంట్, ఒక ప్రిన్సిపల్, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఒక గొప్ప కాలేజీలో కేవలం ఒక విద్యార్ధి మాత్రమే ఉండటం తెలుగు తో పాటు ఇతర భాషలపై మనకున్న నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది.

 

 

తెలుగులో చదివితే పనికిరాని వాళ్లమైపోతామా?

 

మన శరీరంలో ఏదైనా ఒక అవయవం ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది. దాన్ని అంగవైకల్యం అంటాం. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ అలాంటి అంగవైకల్యం తోనే బాధపడుతోంది. కేవలం ఇంగ్లీష్ పైన మాత్రమే దృష్టి సారిస్తూ మాతృభాషను సమాధి చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ అవసరమే. ఇది ఎవరూ కాదనరు. ఇంగ్లీష్ కావాలి అని మన తెలుగును చంపుకుంటామా? ఇంగ్లీష్ అనేది మనకు జీవన భృతిని కల్పించే భాష మాత్రమే. అందులో మన ఆత్మ ఉండదు. మన తల్లి భాషలోనే మన నిజమైన ఆత్మ ఉంటుంది. పైగా తెలుగు భాషను క్షుణ‌్ణంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ భాషపై మరింత పట్టు సంపాదించొచ్చు. ఎందుకంటే మాతృభాషలో మనం భావవ్యక్తీకరణ సరైన విధంగా చేయగలిగితే మరే ఇతర భాషలు నేర్చుకున్నా అది చాలా సులువుగా వంటబడుతుంది. అలా కాకుండా ఏకంగా మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్ భాషనే పట్టుకు వేలాడుతున్న వారిని ఏమనాలి?

 

 

తల్లిదండ్రులే మొదటి దోషులు!

 

మరే ఇతర దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ దేశం వాళ్లు అయినా ముందు వాళ్ల మాతృభాషకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మనం మాత్రం ఏకంగా మన భాషలను చంపేసుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. చైనాలో, జపాన్ లో ఇలా ఎక్కడైనా వాళ్లు వాళ్ల భాషకే పెద్ద పీట వేస్తారు. వాళ్ల భాష నేర్చుకోవడం వలన వాళ్లేమీ వెనుకబాటు తనంలో ఉండిపోలేదే. ప్రపంచంలోనే వేగవంతమైన శక్తులుగా ఎదుగుతున్నారు. మనం మాత్రం బాగా ఇంగ్లీష్ నేర్చుకుని రాత్రిళ్లు కాల్ సెంటర్లలో పనిచేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి? మాతృభాషకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుగా మేల్కోవాలి. తమ పిల్లలకు ఇంగ్లీష్ తో సమానంగా మాతృభాషను కూడా నేర్పించాలి. ఇంట్లో పిల్లలు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రమే ఆనందపడాలి. ఇంటిదగ్గర వాళ్లకు ఎలా మాట్లాడాలో, ఎలా రాయాలో, ఎలా చదవాలో కొద్ది సమయం కేటాయించి వాళ్లకు తెలుగు నేర్పించాలి. అప్పుడే తెలుగు బతుకుతుంది.

 

 

ఆర్భాటాలు మాని చర్యలు చేపట్టాలి!

 

హైదరాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇలా జరగడం చాలా మంచిదే. అయితే అసలు ఉద్దేశాన్ని గాలికొదిలే ప్రచారాలకు , ఆర్భాలకు దూరంగా తెలుగును బతికించేందుకు నిజమైన కార్యాచరణ కావాలి. ఇప్పటికే తెలుగు మహాసభల హోర్టింగ్ ల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న కొన్ని తప్పులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇది రంద్రాన్వేషణ కాదు కానీ తెలుగును బతికించడంలో మన చిత్తశుద్ధిని చాటిచెప్పే విధంగా చర్యలు ఉండాల్సిందే. తెలంగాణాలో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చడం మంచి నిర్ణయం. అలాగే ఏపీ లో కూడా అటువంటి చర్యలు జరగాలి. మరే తెలుగు కాలేజీలోనూ ఒక్కడే విద్యార్ధి ఉండే దుస్థితి రాకుండా ప్రభుత్వాల తక్షణ చర్యలు చేపట్టాలి. తెలుగు చదివే వాళ్లకు నమ్మకం కలిగించాలి. తెలుగులో చదివితే కలిగే ఉపయోగాలను చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల్లో తెలుగు చదివే ఆ ఒక్కడు కూడా మిగలకపోవచ్చు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

తెలుగు మ‌హాస‌భ‌లతో తెలుగుకు ప‌ట్టిన తెగులు వ‌దిలిపోద్దా??

 

తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక తొలిసారిగా హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వీటిని నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ స‌మాయుత్త‌మైంది. ఈ నెల 15 నుంచి 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 50 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్ర‌పంచం న‌లుమూలల నుంచి తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో తెలుగు భాష‌కు ఒరిగేదేంటి అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. యునెస్కో విడుద‌ల చేసే మృత భాష‌ల జాబితాలోకి త్వ‌ర‌లో తెలుగు కూడా చేర‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డం తెలుగు భాషాభిమానుల గుండెల్ని పిండేసింది. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ గా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ప్ప‌టికీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అద్భ‌త‌మైన భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష ఇప్పుడు మ‌న విద్యా విధానంతో, ఇత‌ర భాష‌ల‌పై మోజుతో ప్ర‌మాదంలో ప‌డింది. ప‌క్క రాష్ట్రాల వారు త‌మ భాషను అభివృద్ధి చేసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మ‌న మాత్రం ప‌ర‌భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం.

 

పిల్ల‌ల‌కు తెలుగును దూరం చేస్తుంది మ‌న‌మే!

 

తెలుగు భాష‌కు ద్రోహం చేస్తున్న వాళ్ల‌లో మొద‌టి దోషులు క‌చ్చితంగా త‌ల్లిదండ్రులే. ప‌ర భాషపై విప‌రీత‌మైన వ్యామోహాన్ని పెంచుకుని త‌మ పిల్ల‌ల‌ను తెలుగు భాష‌కు దూరం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఎంద‌రో. తెలుగు మీడియంలో చ‌దివితే ఉద్యోగం రాదు తెలుగు చదివితే చిన్న స్థాయిలో ఉండిపోతారు అన్న అపోహ‌ల‌ను, అవాస్త‌వాల‌ను ప్రచారం చేయ‌డంలో కొన్ని ప్ర‌యివేట్ విద్యా సంస్థ‌లు విజ‌యం సాధించాయి. వారి మాయ‌లో ప‌డి చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను తెలుగులో చ‌దివించ‌డం మానుకున్నారు. స‌మాజంలో వ‌చ్చిన ఈ స్ప‌ష్ట‌మైన, దుర‌దృష్ట‌క‌ర‌మైన మార్పుకు ఈ త‌రం ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఘోర‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఒక వైపు స్కూల్లో తెలుగు మాట్లాడితేనే కొట్టే టీచ‌ర్లు, మ‌రోవైపు ఇంట్లో కూడా పిల్ల‌ల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడ‌మ‌ని ఒత్తిడి చేస్తూ న‌యా మాయానందంలో త‌మ‌ను తాము మోసం చేసుకుంటున్న త‌ల్లిదండ్రులు. వెర‌సి తెలుగు భాష ఇప్పుడు అంప‌శయ్య పైకి చేరుకుంది.

 

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావా?

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావ‌ని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేమ‌ని చాలా మందిలో ఉన్న భావ‌న‌. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వ‌కుంటే పిల్ల‌లు ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని చాలా మంది త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజ‌మే..ప్ర‌స్తుత కార్పోరేట్ జ‌మానాలో ఉద్యోగాన్ని సాధించాలన్నా దాన్ని కాపాడుకుంటూ మ‌రింత‌గా ఎద‌గాలన్నా ఇంగ్లీష్ లో నైపుణ్యం అవ‌స‌ర‌మే. ఇందులో సందేహం లేదు. అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషైన తెలుగుపై నిర్ల‌క్ష్యం ఎందుక‌న్న‌ది ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక పీరియ‌డ్, ఒక స‌బ్జెక్ట్ గా తెలుగును చ‌దివినంత మాత్రాన పిల్ల‌లు ప‌నికిరాని వారిగా మారిపోతారా? ఇప్పుడు తెలుగు భాషాభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ గా చేయ‌డంలో మీన‌మేషాలు లెక్కించింది. ఇప్పుడు తెలంగాణీ సీఎం కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. మ‌రి ఆయ‌న ఆదేశాలు ఎంత వ‌ర‌కూ అమ‌లవుతాయో క్షీణ ద‌శ‌లో ఉన్న తెలుగుకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుతం పుస్త‌కాలు చ‌దివే అలవాటున్న పిల్ల‌ల చేతుల్లో ఇంగ్లీష్ పుస్త‌కాలు త‌ప్పించి తెలుగు పుస్త‌కాలు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. పిల్ల‌ల్లో పుస్త‌క ప‌ఠ‌నంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బాల సాహిత్యంలో మ‌రిన్ని పుస్త‌కాలు రావాల్సి ఉంది. అలాగే త‌ల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌చ్చేలా వారికి శిక్ష‌ణ‌నివ్వాలి.

 

 

తెలుగును బ‌తికించ‌డం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది!

 

తెలుగుకు ప్రాచీన భాష హోదా ద‌క్కింద‌న్న ఆనందం ఎక్కువకాలం నిల‌వ‌కుండానే ఇటీవ‌ల యునెస్కో విడుద‌ల చేసిన ఒక నివేదిక ఆందోళ‌న రేపింది. తెలుగు భాష‌పై ఇదే ర‌క‌మైన వైఖ‌రి కొన‌సాగుతూ ఉంటే మ‌రికొద్ది సంవత్సరాల్లో తెలుగు కూడా మృత భాషల జాబితాలో చేరిపోవ‌చ్చ‌న్న‌ది ఆ నివేదిక సారాంశం. తియ్య‌నైన తెలుగు భాష క‌నుమ‌రుగు కావ‌చ్చ‌న్న ఆలోచ‌నే భ‌రింప‌రానిదిగా ఉంది. దేశ భాష‌లందు తెలుగు భాష లెస్స అన్న శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌న తెలుగు భాష‌ను బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అది ముందుగా త‌ల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. చిన్న‌త‌నం నుంచి పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో జాయిన్ చేసినా ఇంటి ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలుగులో మాట్లాడ‌టం నేర్పించాలి. అలాగే కొంచెం స‌మ‌యం తీసుకుని వాళ్ల‌కు తెలుగు భాష‌ను క్షుణ్ణంగా నేర్పించాలి. వాళ్ల‌కు తెలుగులో ఉన్న మంచి బాల సాహిత్యాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేయాలి. స్కూళ్ల‌లో ఎలా అయితే తెలుగు మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధిస్తారోఇంట్లో కూడా అలానే ఇంగ్లీష్ మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధించి కుటుంబం మొత్తం తెలుగులోనే మాట్లాడుకోవాలి. క‌ఠిన ప‌దాల‌కు , సామెత‌ల‌కు పిల్ల‌ల‌కు అర్ధాల‌ను వివ‌రించి చెప్పాలి. ఏ ప‌దాన్ని ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో వాడాలి అన్న‌దానిపై పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియజేయాలి. కుంగిపోతున్న తెలుగును బ‌తికించ‌డం కేవ‌లం త‌ల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. వారు త‌ల్చుకుంటే మ‌న భాష‌ను బ‌తికించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మేమీ కాదు.

 

 

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్య‌మే!

 

తెలంగాణా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల స్ఫూర్తితో మ‌నం తెలుగును బ‌తికించుకునేందుకు, దాన్ని త‌ర్వాత త‌రాల‌కు అందించేందుకు కృషి చేయాలి. తెలంగాణాలోని అన్ని పాఠ‌శాలలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌న్నెండో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగును త‌ప్ప‌నిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. అయితే ఇది స‌రిగ్గా అమ‌లు జ‌రిగేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. తెలుగు భాష‌ను మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించి వ‌దిలేయ‌డం కాకుండా వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు భాష గొప్ప‌త‌నంపై త‌ల్లిదండ్రుల‌ను చైత‌న్యం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో చ‌దివిన విద్యార్ధుల‌కు కూడా ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చేస్తే చాలా మంది తెలుగులో చ‌దివేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే మ‌న ప‌క్క‌రాష్ట్రాల త‌రాహాలోనే భాష‌పై ప్రేమ‌ను పెంచుకుని దాని అభివృద్ధికి అనుక్ష‌ణం ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేసిన‌ప్పుడు తియ్య‌నైన మ‌న‌ తెలుగు భాష త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుని త‌ళుకులీనుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

యునెస్కో రిపోర్ట్…మన విద్య దుస్థితి మరోసారి వెల్లడైంది!!

 

ప్ర‌పంచంలో వేగ‌వంతమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. ప్ర‌పంచంలో 35 ఏళ్ల లోపు యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న న‌వ యువ దేశం..అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో అగ్ర‌దేశాల‌కు పోటీ.. ఇండియా గూర్చి చెప్పేట‌ప్పుడు విన‌సొంపుగా ఉన్న ఈ స్టేట్ మెంట్లు నాణెనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు మాత్రం ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో మ‌న దేశం వెనక‌బాటుత‌నం మ‌రోసారి సుస్ప‌ష్ట‌మైంది. తాజాగా యునెస్కో విడుద‌ల చేసిన ఓ నివేదిక, ప్ర‌పంచం మొత్తం మీద‌ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల్లో 35 శాతం మంది ఇండియాలోనే ఉన్నార‌ని వెల్ల‌డించింది. ఇండియా మొత్తం జ‌నాభాలో 26 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిరక్ష్య‌రాస్యులేన‌ని వెల్లడించింది. ప్ర‌పంచం వేగంగా దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఇప్ప‌టికీ సంపూర్ణ అక్ష‌రాస్యత‌ను సాధించ‌డంలో విఫలం కావ‌డం అంటే అభివృద్ధికి దూర‌మ‌వుతున్న‌ట్టే. అయినా మొద్దు నిద్ర పోతున్న పాల‌కులు విద్యా రంగంపై శీత‌క‌న్ను వేస్తూనే ఉన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి సాధించ‌కుండా దేశాభివృద్ధి సాధ్యం కాద‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌ర్చిపోయి నేల విడిచి సాము చేస్తున్న ప్ర‌భుత్వం వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ఎప్పుడు అవ‌గ‌తం చేసుకుంటుందోన‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌. మ‌రోవైపు తెలంగాణాలో కూడా ఇప్ప‌టికీ 34 శాతం మంది ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాద‌ని యునెస్కో నివేదిక చెపుతోంది.

 

 

అస‌లు యునెస్కో నివేదిక‌లో ఏముంది?

 

తాజాగా యునెస్కో వారి గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ మాన‌ట‌రింగ్ నివేదిక విడుద‌లైంది. ఆ నివేదిక‌లో వెల్ల‌డైన విష‌యాలు ఇండియా విద్యా రంగ దుస్థితిని మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇండియాలో దాదాపు 26 కోట్ల మంది చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిర‌క్ష‌రాస్యులేన‌ని ఆ రిపోర్ట్ లో తేలింది. గ‌తంతో పోల్చుకుంటే అక్ష‌రాస్యుల సంఖ్య కాస్త పెరిగిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ నిర‌క్ష్య‌రాస్యులు సంఖ్య భారీగా ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. దేశంలోని మొత్తం జ‌నాభాలో 73 శాతం మంది మాత్ర‌మే అక్ష‌రాస్యుల‌ని యునెస్కో నివేదిక వెల్ల‌డించింది. ఇక తెలంగాణా విష‌యానికొస్తే ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. తెలంగాణా మొత్తం జ‌నాభాలో అక్ష‌రాస్యుల సంఖ్య 65 శాతం మాత్ర‌మేన‌ని తేలింది. అంటే దాదాపు 35 శాతం మంది తెలంగాణా ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం కూడా రాదు. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డం, పేద‌రికం కార‌ణంగా చాలా మంది పిల్ల‌లు ప్రాథ‌మిక స్థాయిలోనే చ‌దువుకు ఫుల్ స్టాప్ పెడుతున్నార‌ని యునెస్కో నివేదిక‌లో వెల్ల‌డైంది. మ‌రోవైపు అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌పంచంలో చాలా దేశాలు త‌మ జీడీపీ లో అధిక శాతం నిధులను విద్యా రంగానికి కేటాయిస్తున్నాయి. కానీ మ‌న దేశంలో మొత్తం జీడీపీలో విద్యారంగానికి కేటాయిస్తున్న మొత్తం 3.8 శాతం మాత్ర‌మే. ప్ర‌పంచంలో స‌గ‌టున ప్ర‌తీ దేశం త‌మ జీడీపీ 5 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలి. క‌నీసం ఆ బెంచ్ మార్క్ స‌గ‌టును కూడా ఇండియా అందుకోలేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం.

 

 

తెలంగాణాలో ప‌రిస్థితి ద‌య‌నీయం!

 

యునెస్కో రిపోర్ట్ లో తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి వెల్ల‌డైన గ‌ణాంకాలు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ చాలా మంది విద్య‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణా మొత్తం జ‌నాభాలో దాదాపు 25 శాతం మంది నిర‌క్ష్య‌రాస్యులుగానే ఉంట‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముందు నుంచీ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల‌కు తోడు కొత్త‌గా బ‌డిలో చేరుతున్న మ‌ధ్య‌లోనే మానేయ‌డం నిర‌క్ష్య‌రాస్యుల‌ను పెంచుతోంది. ఇండియాలో దాదాపు కోటీ ఇరవై లక్షల మంది పిల్లలు అసలు స్కూల్ కే రావడం లేదని లెక్కలు చెపుతున్నాయి. ఈ సంఖ్య తెలంగాణాలో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపవుట్లను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సుముఖంగా లేరు. దీంతో వాళ్లను ఒప్పించి పిల్లలను బడికి తీసుకురావడం అనేది అధికార్లకు సవాలుగా మారింది. అలాగే చదువురాని నడి వయస్కులకు ఇప్పుడు చదవడం,రాయడం నేర్పించడం కూడా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను అందుకోవాలంటే ప్రతీ ఒక్కరు చదవడం,రాయడం పై కనీస అవగాహన తెచ్చుకోవాలి. మరి ఇంత మంది నిరక్ష్యరాస్యులు ఉన్న నేపథ్యంలో ఆ లక్ష్యాలను ఎలా చేరుకుంటారన్నది పెద్ద ప్రశ్న.

 

ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత!

 

చైనా లాంటి దేశాల‌తో ఆర్థిక వృద్ధిలో పోటీప‌డ‌తామ‌ని చెపుతున్న ఇండియా , కీల‌కమైన విద్యా రంగంపై మాత్రం శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో యువ‌కులు ఉన్నా వారికి సరైన నైపుణ్యాలు లేక అభివృద్ధి వెనుక‌బడుతున్నా మ‌న విధానక‌ర్త‌లు మాత్రం క‌ళ్లు తెర‌వ‌డం లేదు. ఒక‌వైపు చ‌దువుకున్న వాళ్లు ప‌నిచేసేందుకు అన‌ర్హులుగా తేలుతుంటే మ‌రోవైపు అస‌లు ఆ కొద్ది పాటి అక్ష‌రజ్ఞానం కూడా లేని వాళ్లు కోట్ల‌లో తేలుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు రేసులో ఉన్న వర్ధమాన దేశాలతో పోటీ ఎలా సాధ్యం? ఒక వైపు నిరక్షరాస్యత, మరోవైపు నైపుణ్యాల లేమి ఈ రెండు జాడ్యాలను వదిలించుకోకుంటే పోటీ పడటం మాట అటుంచి కనీసం రేసులో కూడా నిలవలేని పరిస్థితి వస్తుందని ప్రభుత్వాలు గ్రహించలేకపోవడం విడ్డూరంగా ఉంది. పైకి మాత్రం ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, పనిచేసే యువకులు మా దగ్గరే ఉన్నారు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఆత్మవంచన తప్పించి మరేమీ కాదు. సమస్యకు మూలాలు గుర్తించి పరిష్కారాన్ని వెతకడం మాని సాధించిన కొద్దిపాటి ప్రగతినే గొప్పగా చెప్పుకుంటే ఇండియా ఎప్పటికీ అగ్రదేశం కానేరదు.

 

 

తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి దిగజారుతుంది!

 

125 కోట్ల జనాభాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు ఇంకా చదవడం రాయడం రాదు అంటే మన దేశం ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యుద్ధప్రాతిపదికన నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రయత్నం చేయకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి సాధ్యం కాదు. రానున్న 20 ఏళ్లలో చైనా ను దాటి అగ్రరాజ్యంగా ఎగుదుతామని గప్పాలు కొడుతున్న నేతలు ముందుగా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోయి ప్రజలకు విద్యను అందించకుండా, విద్యార్ధులకు నైపుణ్యాలను అందించకుండా మీనమేషాలు లెక్కిస్తే ఎప్పటికే ఇండియా వర్ధమాన దేశంగానే మిగిలిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

గాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్…బలమైన నాయకుల సక్సెస్ సీక్రెట్ ఇదే!

 

ఒక ఆశ‌యం, ఒక స్పూర్తి ప్ర‌పంచవ్యాప్తం కావాలి, చ‌రిత్ర‌లో నిలిచిపోవాలి అంటే దాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే నాయ‌కుడు, నాయ‌క‌త్వం కావాలి. అయితే ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసే ఒక బ‌ల‌మైన‌ నాయ‌కుడు త‌యారు కావ‌డం అన్న‌ది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే నాయ‌కునిగా ఎద‌గాలంటే ఎన్నో స‌వాళ్ల‌ను మ‌రెన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవ‌రు కాద‌న్నా ఔనన్నా కుల వ్య‌వ‌స్థ ముఖ్య‌పాత్ర‌ పోషించే ఇండియా లాంటి దేశంలో సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు లేకుండా ఒక వ్య‌క్తి బ‌ల‌మైన నాయ‌కునిగా ఎద‌గ‌డం అసాధ్యం. విభిన్న వ‌ర్గాల‌ను క‌లుపుకుంటూనే అదే స‌మ‌యంలో స్వంత వ‌ర్గం వారిని కూడా ఆక‌ట్టుకున్న‌ప్పుడే నాయ‌కునికిగా మ‌నుగ‌డ సాధ్యం. బుద్ధుడు నుంచి నేటి కంచె ఐలయ్య వ‌ర‌కూ ఉద్య‌మాలు విజ‌యవంతం కావాలంటే సామాజిక వ‌ర్గాల మ‌ద్ధ‌తు అత్య‌వ‌సరం. గాంధీజీ దేశంలోనే బ‌ల‌మైన నాయ‌కునిగా ఎదిగి దేశానికి స్వాతంత్రం సాధించగ‌లిగాడంటే అత‌నికి సొంత సామాజిక వ‌ర్గం నుంచి పూర్తి స‌హ‌కారం ఉండ‌టం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంది. ఇలా స్పూర్తిని నింపుకుంటూ విభిన్న వ్య‌క్తుల‌ను క‌లుపుకుంటూ ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లిన‌ప్పుడే ఉద్యోగులు మంచి టీమ్ లీడ‌ర్ గా ఎదిగి కెరీర్ లో ఉన్న‌త స్థానాల‌కు చేర‌గ‌లుగుతారు.

 

 

చ‌రిత్ర‌లో నాయ‌క‌త్వానికి ఆన‌వాళ్లు తెలుసా?

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ వెర్రి తలలు వేయడంతో కొన్ని వర్గాల వారు హిందూ మతానికి పూర్తిగా దూరమయ్యారు. బౌద్ధ మతాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలకు ప్రభావితమై చాలా మంది హిందూ మతం నుంచి బౌద్ధం లోకి మారిపోయారు. అయితే పురాతన కాలం నుంచి బలంగా పాతుకుపోయిన హిందూ మతాన్ని సవాలు చేస్తూ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించి బౌద్ధులు దృష్టిలో దేవునిగా మారడం వెనుక అంతులేని నాయకత్వం పటిమ కనిపిస్తుంది. ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో బుద్ధుడు విభిన్న వర్గాలకు, వ్యక్తులు ఎనలేని సహాయం చేసి వాళ్ల మనస్సులను గెల్చుకున్నాడు. అటు తర్వాత అతను రాజ్యాన్ని, అధికారాన్ని త్యజించి సన్యాసిగా మారి బౌద్ధాన్ని ప్రభోధించినప్పుడు అతని నుంచి సహాయం పొందిన వారంతా అతని సంకల్పానికి సహాయపడ్డారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడంలో ఎనలేని కృషి చేసారు. మనదేశంతో పాటు విదేశాలకు కూడా బౌద్ధం విస్తరించిందంటే బుద్ధుడు అందర్నీ ఆకట్టుకుంటూ, వారి నుంచి ఎలా సహాయం పొందాడో అర్ధమవుతుంది. కొన్ని వర్గాల కొన్ని సమూహాల సహాయం లేనిదే ఎవరూ నాయకుడు కాలేదన్నది బుద్ధుని కాలంలోనే రుజువైంది. ఇక బౌద్ధం దెబ్బకు, ఇతర మతాల ప్రభావానికి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డ హిందూ మతాన్ని కాపాడుకునేందుకు తీసుకొచ్చిన భక్తి ఉద్యమం వెనుక కూడా కొన్ని వర్గాల అండ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ మతం క్షీణిస్తే ముందుగా నష్టపోయేది బ్రహ్మణ వర్గం కాబట్టి వాళ్లు వెనుక నుండి భక్తి ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు పరోక్షంగా కృషి చేసారు.

 

 

వీరులైనా, శూరులైనా సామాజిక వర్గం అండ ఉండాల్సిందే!

 

క్రీస్తు పూర్వం మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చంద్ర గుప్త మౌర్యుడు తన ప్రధాన మంత్రి చాణక్యుని సహాయంతో హిందూ మతాన్ని విస్తరించేందుకు కృషి చేసాడు. చాణక్యుడు బ్రహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సాక్షాత్తూ మహారాజు చంద్రగుప్తుడు తన శిష్యుడు కాబట్టి తన ప్రణాళికలను సుస్పష్టంగా అమలు చేసుకున్నాడు. ఈ పరిణామానికి వెనుక నుంచి బ్రహ్మణ వర్గం అండదండలు చాణక్యునికి పుష్కలంగా ఉన్నాయి. ఇక తురుష్కుల దాడుల నేపథ్యంలో హిందూ ధర్మం మరోసారి ప్రమాదంలో పడ్డప్పుడు ఛత్రపతి శివాజీ బలమైన నాయకునిగా ఎదిగాడు. తన వర్గం, తన సమూహం అండదండలతో బలమైన రాజ్యాన్ని నిర్మించుకుని హిందూ ధర్మ పరిరక్షణ చేసాడు. ఎంతటి వీరులకైనా, నాయకులకైనా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి బలమైన వర్గం అండ ఉంటేనే వారి నాయకత్వం నిలబడుతుంది. లేకుంటే ఎంతటి గొప్పవాడైనా బలమైన నాయకుడు కాలేడు. తనకు పూర్తి సహాయ సహకారాలు అందించే ఒక వర్గం సహాయం తీసుకుంటూనే అదే సమయంలో మిగిలిన వాళ్ల మనసులను కూడా గెల్చుకున్నప్పుడే నాయకునికి గెలుపు సాధ్యమవుతుంది. ఇలా విభిన్న వ్యక్తులను, విషయాలను కలుపుకుని పోవడం అన్నది నాయకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఈ విషయంలో మహాత్మా గాంధీని విజయవంతమైన నాయకునిగా చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాంధీ నాయకత్వం ఎందుకు విజయవంతమైంది?

 

విదేశాల్లో బారిష్టర్ చదువు పూర్తి చేసి ఇండియాకు వచ్చిన గాంధీజీ , దేశంలోనే ఒక బలమైన నాయకునిగా ఎలా ఎదగగలిగారు? చదువు పూర్తి చేసి తన ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉండే చిన్న వివాదాలను గాంధీజీ పరిష్కరించేవాడు. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారస్తుల సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించేవాడు. స్వయంగా గాంధీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్లకు గాంధీజీపై గురి కుదిరింది. ముఖ్యంగా సారాభాయి మిల్స్ వ్యవహారంలో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించడం అతని ప్రతిష్ఠను ను పెంచింది. అతను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఉద్యమాలు నడిపేటప్పుడు స్వంత సామాజిక వర్గానికి చెందిన ట్రేడర్లు గాంధీజీకి పూర్తి సహకారం అందించేవారు. ఫండింగ్ రూపంలో కానీ జన సమీకరణ రూపంలో కానీ ఇలా విభిన్న మార్గాల్లో గాంధీజీ ఉద్యమం విజయవంతమయ్యేలా కృషి చేసేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గాలు వారు కావడం వలన వారి సహకారంతో గాంధీజీ దేశంలో బలమైన నాయకునిగా ఎదిగాడు. మరోవైపు అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వర్గ , సామాజిక సమీకరణలను అందిపుచ్చుకోలేక స్వాతంత్ర సాధనలో విఫలమయ్యారు. తన సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటూనే వారి సహాయం పొందుతూనే అదే సమయంలో మిగిలిన వర్గాల వారినీ, కులాల వారిని ఆకర్షించి గాంధీజీ జాతి పితగా మారాడు.

 

 

బలమైన నాయకుని వెనుక ‘బలమైన వర్గం’ ఉంటుంది!

 

సినిమాల్లో తిరుగులేని కథానాయకునిగా వెలుగుతున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినప్పుడు ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం అండగా నిలబడింది. ముఖ‌్యంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన్ను బాగా ప్రమోట్ చేసేందుకు ఒక దిన పత్రిక ఎనలేని కృషి చేసింది. ఆయన రాజకీయ ప్రచారానికి తమ పత్రికలో బాగా ప్రాధాన్యం ఇచ్చి ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేసింది. ఆ పత్రిక ఒక్కటే కాదు పబ్లిక్ మీటింగ్ లకు ఆర్థిక సమీకరణ, జన సమీకరణ వంటి పనులను ఒక సామాజిక వర్గం బలంగా చేసింది. ఫలితం ఆయన తిరుగులేని నాయకునిగా ఎదిగి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వైఎస్ఆర్ పాదయాత్ర కూడా ఒక చరిత్ర సృష్టించిందంటే అతని స్వంత సామాజిక వర్గం చేసిన కృషిని కొట్టిపారేయలేం. అలాగే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ అతన్ని బలమైన నాయకునిగా ఎదిగేలా చేసేందుకు అతని సామాజిక వర్గం అందించిన సహాయ సహకారాలు సుస్ఫష్టం. అంటే కేవలం సామాజిక వర్గాల అండతోనే బలమైన నాయకులు తయారవుతారని పూర్తిగా చెప్పలేం కానీ స్వంత వర్గం అండ లేకుంటే మాత్రం పెద్ద నాయకుడు కావడం అనేది అసాధ్యం.

 

 

విద్యార్ధులు ‘బలమైన నాయకత్వం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి!

 

ప్రస్తుత జాబ్ మార్కెట్లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే కొలువు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కు తోడు ఒక టీమ్ ను విజయవంతంగా నడిపే వాళ్లు ఇప్పుడు కంపెనీలకు కావాలి. విభిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న టీమ్ ను కుదుపులు లేకుండా నడపడం అంత సులువేం కాదు. అందుకే కంపెనీలు ఈ ఛాలెంజ్ ను తీసుకునే అభ్యర్ధుల కోసం వెతుకుతున్నాయి. బుద్డుడి దగ్గర్నుంచి కేసీఆర్ వరకూ ఒక బలమైన నాయకుడు కావాలంటే తమ వర్గం అండదండలు పొందుతూనే అదే సమయంలో అందర్నీ కలుపుకుపోయే లక్షణం ఉండాలి. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ లక్షణాన్ని స్వీకరించాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకుని, అందర్నీ ఆకట్టుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కెరీర్ లో అయినా వ్యక్తిగతంగా అయినా ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్న వారు) 

 

 

 

వృత్తులందు యాచక వృత్తి మేలయా!

 

ప్ర‌తీ మ‌నిషి త‌న జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంలో చేయి చాచి ప‌క్క‌వాడ్ని యాచించే ఉంటాడు. మ‌రీ అడుక్కోవ‌డం అన్న మాట‌ను ఉప‌యోగించడం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ యాచించ‌డం అనేది స్థాయిని పెద్ద చిన్న అని మారుతూ ఉంటుంది. కొంద‌రు అవ‌స‌రాల‌కు స‌హాయాన్ని యాచిస్తే కొంద‌రు చేసిన స‌హాయాన్ని కృత‌జ్ఞ‌త‌ను, డ‌బ్బును,వ‌స్తువుల‌ను యాచిస్తారు. అస‌లు ఇంత‌కీ యాచ‌న కోసం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె హైద‌రాబాద్ లో ఓ గ్లోబ‌ల్ స‌మిట్ లో పాల్గొంటోంద‌ని న‌గ‌రంలోని బిచ్చ‌గాళ్లంద‌రినీ న‌గ‌ర శివార్ల‌కు త‌ర‌లించారు. వాస్త‌వాల‌ను దాచిపెట్టి ఎవ‌రో మెప్పు పొందాల‌ని వాళ్ల‌ను తాత్కాలిక‌ శిబిరాల‌కు త‌ర‌లించ‌డం విమ‌ర్శ‌ల పాలైంది. చిత్త‌శుద్ధితో పరిష్కారించాల్సిన ఒక జ‌ఠిల‌ స‌మ‌స్య‌ను ఆది నుంచి పెంచి పోషిస్తూ ఇప్పుడు ఉన్న‌ది లేనట్టుగా చూపేందుకు తాపత్ర‌య‌ప‌డ‌టం విడ్డూరంగా అనిపిస్తోంది. భార‌తీయ జీవ‌న విధానంలో యాచ‌న లేదా బిక్షాట‌న అనేది ఒక అంత‌ర్భాంగా ఉంటూ వ‌స్తోంది. ఆధ్మాత్మిక జీవ‌న శైలిలో ఒక భాగ‌మైన బిక్షాట‌న త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా స్వార్ధ‌ప‌రులు, సోమ‌రుల‌కు జీవ‌నోపాధిగా మారింది. పురాణ కాలం నుంచి నేటి వ‌ర‌కూ వివిధ మార్పులు చెందుతూ వ‌చ్చిన బిక్షాట‌న నేటి స‌మాజాన్ని ప‌ట్టి పీడించే ఒక విష వ‌ల‌యంగా మారిపోయింది. విద్యార్ధులు ఆ ప‌రిణామ క్ర‌మాన్ని ఓసారి గ‌మ‌నిస్తే సామాజిక బాధ్య‌త‌పై అవ‌గాహ‌న తెచ్చుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

 

 

అస‌లు ఈ యాచ‌న ఎక్క‌డ మొద‌లైంది?

 

మ‌న పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ యాచ‌న‌, బిక్షాట‌న అనే ప‌దాలు చాలా విరివిగా క‌నిపిస్తాయి. శ్రీకృష్ణుడు, కుచేలుని స్నేహం, స్నేహితుడ్ని నోరు తెరిచి యాచించేందుకు నోరు రాని కుచేలుడు త‌నే తిరిగి త‌న స్నేహితునికి అటుకుల‌ను కానుక‌గా ఇచ్చి అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం ఇవ‌న్నీ మ‌నం భాగ‌వతంలో చ‌దువుకున్నాం. త‌ను భార్య పిల్ల‌ల‌తో ఉన్న గృహ‌స్తు క‌నుక స్నేహితున్ని స‌హాయం కూడా యాచించ‌కుండా వెళ్లిపోయాడు. మ‌రోవైపు కుటుంబాన్ని త్య‌జించిన స‌న్యాసులు, మ‌హ‌ర్షులు మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా బిక్షాట‌న చేస్తారు. క‌ర్ణుడి క‌వ‌చ కుండ‌లాల‌ను తీసుకోవాలి అనుకున్న‌ప్పుడు ఇంద్రుడు, బ‌లి చ‌క్ర‌వ‌ర్తి అహంకారాన్ని అణిచేందుకు వామ‌నుడు…మ‌హ‌ర్షుల వేషంలోనే దానాన్ని తీసుకున్నారు. అలాగే బుద్ధుడు, సాయి బాబా వంటి వారు కూడా బిక్షాట‌న చేసిన వారే. వారు స‌ర్వం త్య‌జించిన స‌న్యాసులు క‌నుక త‌మ పొట్ట కూటి కోసం యాచించే వారు. వాళ్ల యాచ‌న‌లో ఒక ప‌విత్ర‌త‌, ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. ప్ర‌జ‌లు ఆహారాన్ని సంపాదించుకునే క్ర‌మంలో త‌మ‌కు తెలీకుండానే ఎన్నో పాపాలు మూట‌గ‌ట్టుకుంటారు. దైవ‌త్వం క‌లిగిన మ‌హ‌ర్షులకు ఆ ఆహారాన్ని బిక్ష‌గా వేసిన‌ప్పుడు వాళ్లు ఆ పాప ఫ‌లితాల నుంచి విముక్తి పొందుతారు. భారతీయ సంస్కృతీ, సంప్ర‌దాయాల్లో బిక్షాట‌న‌, యాచ‌న‌, దానం, ధ‌ర్మం వెనుక ఇన్ని నిగూఢ అర్ధాలు ఉంటాయి.

 

 

మ‌త గ్రంధాల ఊహ‌కు అంద‌ని మాఫియా ఏర్పాటైంది!

 

హిందూ మ‌తంలో , సంస్కృతిలో దానం చేయ‌డం అనేది చాలా ముఖ్య‌మైన విష‌యం. హిందువులు ప్ర‌తీ కార్య‌క్ర‌మంలో దాన ధ‌ర్మాల ప్ర‌స్తావ‌న ఉంటుంది.పండ‌గ‌ల్లోనూ, పెళ్లిళ్ల‌లోనూ, వేడుక‌ల్లోనూ పేద‌వారికి, నిస్స‌హాయుల‌కు స‌హాయం చేయ‌మ‌ని శాస్త్రాలు చెపుతాయి. అలాగే ఇస్లాం లో కూడా ఇదే ర‌క‌మైన ప్ర‌స్తావ‌న ఉంటుంది. ప్ర‌తీ ముస్లిం త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని పేద‌వారికి, అభాగ్యుల‌కు దానం చేయ‌మ‌ని ఖురాన్ చెపుతుంది. దాన ధ‌ర్మాల‌కు క్రైస్త‌వం కూడా అతీతం కాదు. ఆ మతంలో కూడా ఎటువంటి ప‌నిచేయ‌లేని, క‌ష్టాల్లో ఉన్న వారికి స‌హాయం చేయ‌మ‌ని ఉంటుంది. అయితే ఎంతో మంచి ఉద్దేశ్యంతో మ‌తాలు, మ‌త గ్రంధాలు ఉద్భోధించిన దాన ధ‌ర్మాలు కాలం మారుతున్న కొద్దీ కొంద‌రికీ బ‌తుకు తెరువుగా మారిపోయాయి. అస‌హాయుల‌కు, నిర్భాగ్యుల‌కు, విక‌లాంగుల‌కు స‌హాయం చేయాల‌న్న మతాల ఉద్భోధ‌ను కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ప‌నిచేసే శ‌క్తి ఉన్నా, అన్ని అవ‌య‌వాలు స‌రిగ్గా ప‌నిచేస్తున్నా చాలా మంది సోమ‌రిపోతులుగా మారి బిచ్చ‌గాళ్లుగా చెలామ‌ణీ అవుతున్నారు. మ‌న సంస్కృతి అందించిన మంచి విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ఎంత‌లా పెరిగిపోయింది అంటే బిచ్చ‌గాళ్లు అంద‌ర్నీ కంట్రోల్ చేసే ఒక నెట్ వ‌ర్క్ తో పాటు చిన్న పిల్ల‌ల‌తో, ఆడ‌వాళ్ల‌తో బిక్షాట‌న చేయించే గ్యాంగ్ లు ఏర్ప‌డి బెగ్గింగ్ మాఫియాను ఏర్పాటు చేసారు. దేశంలోని బొంబాయి, ఢిల్లీ వంటి మ‌హా న‌గ‌రాల‌ను ప‌క్క‌న పెడితే కోటి మంది జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 14 వేల మంది బిచ్చ‌గాళ్లు ఉన్నారు. వీళ్లంద‌రి సంవ‌త్స‌ర ఆదాయం 25 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. అయితే వీరిలో నిజమైన యాచ‌కులు కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మేన‌ని స‌ర్వేలో తేలింది. మిగిలిన 98 శాతం మంది ప‌నిచేసే స‌త్తా ఉన్న‌వారేన‌ని అయినా బిక్షాట‌న‌ను ఎంచుకున్నార‌ని తేలింది. కొంద‌రు వ్య‌క్తులు మాఫియాగా ఏర్ప‌డి చిన్న పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి వాళ్ల‌తో బిక్షాట‌న చేయిస్తున్నారు.

 

 

కోటీశ్వ‌రులే బిచ్చ‌గాళ్లుగా మారారు!

 

ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ కు వ‌స్తున్న సంద‌ర్భంగా నగ‌రంలోని బిచ్చ‌గాళ్ల‌ను శివార్ల‌లోని ఒక పున‌రావాస శిబిరానికి త‌ర‌లించారు. అంత‌ర్జాతీయ ప్ర‌తినిధులకు న‌గ‌రం గొప్ప‌త‌నాన్ని చూపించేందుకు వాళ్ల‌ను తాత్కాలిక గుడారాల‌కు తర‌లిస్తూ ప్ర‌భుత్వం త‌న మ‌న‌స్సాక్షిని దెబ్బ‌తీసుకుంటోంది. అయితే ఈ యాచ‌కుల త‌రలింపులో క‌న్నీరు పెట్టించే క‌థ‌లు, వ్య‌థ‌లు లు వెలుగు చూస్తున్నాయి. మొత్తం బిచ్చ‌గాళ్ల‌తో కొంద‌రు ఉద్దేశ‌పూర్వ‌కంగా బిచ్చ‌గాళ్లు అయిన వారు ఉంటే మ‌రికొంద‌రు బ‌ల‌వంతంగా లాక్కురాబ‌డిన‌వారు. కొంద‌ర్ని ప‌రిస్థితులు, క‌ష్టాలు బిచ్చ‌గాళ్లుగా మార్చాయి. లండ‌న్ లో ఎంబీయే చేసి ఉన్న‌తోద్యోగం చేసిన వారూ, అమెరికా లో గ్రీన్ కార్డు హోల్డ‌ర్ కూడా న‌గ‌ర వీధుల్లో బిచ్చ మెత్తుకుంటున్నారు. ఒక‌ప్పుడు కోటీశ్వ‌రులైన వీళ్లు బిచ్చ‌గాళ్లుగా మారిన వైనం ఆలోచింప‌జేయ‌డంతో పాటు కంట‌త‌డి కూడా పెట్టిస్తుంది. హైద‌రాబాద్ లో ఆనంద్ బాగ్ కు చెందిన 60 ఏళ్ల ఫ‌ర్జానా హైద‌రాబాద్ లో డిగ్రీ పూర్తిచేసి ఆ త‌ర్వాత లండ‌న్ లో ఎంబీయే కంప్లీట్ చేసింది. అక్క‌డే ఓ ఉన్న‌తోద్యోగం కూడా చేసింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ కు వ‌చ్చి పెళ్లి చేసుకుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో మానసికంగా కుంగిపోయిన ఫ‌ర్జానా మానసిక ప్ర‌శాంత‌త కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గా ద‌గ్గ‌ర ఉండిపోయి అక్కడే భిక్షాట‌న చేస్తోంది. పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ లో ఆమెను కూడా పున‌రావాస కేంద్రానికి తీసుకొచ్చారు.అయితే అన‌ర్గ‌ళంగా ఇంగ్లీష్ మాట్లాడం చూసి అవాక్కై ఆరా తీస్తే ఈ విష‌యాలు తెలిసాయి. ఇక ర‌బియా బ‌సిరిది మ‌రో దీన‌గాధ‌. అమెరికా హోట‌ల్ వ్యాపారం చేస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ కు ఆమె మూడో భార్య‌. అమెరికాలో ఆమెకు గ్రీన్ కార్డు కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం తండ్రి చనిపోవ‌డంతో హైద‌రాబాద్ కు వ‌చ్చింది. తండ్రి చ‌నిపోయాడ‌న్న బాధ‌కు తోడు అయిన‌వాళ్లంతా ఆమెను మోసం చేసి ఆస్తిని కాజేయ‌డంతో మాన‌సికంగా కుంగిపోయి ఇక్క‌డే ఉండిపోయింది. తర్వాత పొట్ట‌కూటి కోసం లంగ‌ర్ హౌజ్ ద‌ర్గాకు చేరుకుని అక్క‌డే ఉండిపోయింది.

 

 

శాశ్వ‌త ప‌రిష్కారం ఊసేదీ?

 

అస‌లు జీవితంలో బిచ్చ‌గాళ్ల‌ను చూడ‌లేదు అన్న వ్య‌క్తులు న‌గ‌రానికి అకస్మాత్తుగా ఊడిప‌డుతున్నారు అన్న చందంగా ప్ర‌భుత్వం చేస్తున్న అతి ఆపేక్ష‌ణీయంగా ఉంది. ముఖ్యంగా బిచ్చ‌గాళ్ల సంఖ్య‌ను త‌గ్గించ‌డానికి ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు శూన్యం. ఎవ‌రు నిజ‌మైన బిచ్చ‌గాళ్లు ఎవ‌రు బ‌ల‌వంతంగా ఈ రొంపిలోకి వ‌చ్చారు అన్న విష‌యం తేల్చ‌డం ప్ర‌భుత్వానికి ఏమంత క‌ష్టం కాదు. కానీ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌ను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా శాశ్వ‌త బిచ్చ‌గాళ్లుగా మారుస్తున్న బెగ్గింగ్ మాఫియా ఆట‌క‌ట్టించేందుకు ఒక్క ముంద‌డుగు కూడా ప‌డ‌లేదు. ఇప్పుడు ఎవ‌రి ప్రాప‌కం కోసమో బిచ్చ‌గాళ్లును నెల‌రోజులు అక్క‌డ ఇక్క‌డా తిప్పి మ‌ళ్లీ వ‌దిలేస్తారు. బెగ్గింగ్ ను పూర్తిగా అరిక‌ట్ట‌లేకున్నా బెగ్గ‌ర్స్ సంఖ్య‌ను త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి అదీ జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌రంగా చేయాల్సింది రెండు రోజులు ఉండి వెళ్లిపోయే విదేశీ ప్ర‌తినిధుల కోసం కాదు. బిచ్చ‌గాళ్ల‌కు శాశ్వ‌త పున‌రావాసం క‌ల్పించి వాళ్ల పిల్ల‌లు ఆ వృత్తి వైపు రాకుండా ఆలాగే కొత్త వాళ్లు ఆ వృత్తి రాకుండా చేసి బెగ్గింగ్ మాఫియాకు అరిక‌ట్ట‌డం. ఏ ప‌ని చేయ‌కుండా యాచించ‌డం ఎంత త‌ప్పో వాళ్ల పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచి స‌రైన విధంగా భోధించ‌గ‌లిగితే బెగ్గింగ్ అనే దాన్ని మ‌న‌దేశంలో లేకుండా చేయొచ్చు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)