జీతాల్లేని ఈ ఫేస్‌బుక్ కూలీలు ఏం చేస్తున్నారో తెలుసా??

 

సోష‌ల్ మీడియా..గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం. రెండు వైపులా ప‌దునున్న ఈ సామాజిక మాధ్య‌మం అనే క‌త్తితో ప్ర‌జ‌లు కూర‌గాయ‌లు కోసుకోవ‌డం మాని త‌మ గొంతుల‌తో పాటు ప‌క్క‌వాళ్ల గొంతులు కూడా తెగ్గోస్తున్నారు. ప‌క్క ఇంట్లో ఉన్న‌వాడికి కూడా అభినంద‌న‌లో, ఆప్యాయ‌త‌తో, ఆస‌రానో అందిచాల్సిన టైంలో కూడా ఒక మెసెజ్ , ఒక లైక్ ప‌డేసి మానవ సంబంధాల‌ను గొయ్యి తీసి పాతిపెట్టేస్తున్నారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో ఫేస్‌‍బుక్ లో, ట్విట్ట‌ర్ లో పెద్ద గొంతు వేసుకుని ప‌డిపోయే న‌యా ఉత్త‌ర కుమారులు బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్డు మీద ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా త‌యార‌య్యారు. ఒక మ‌నిషి ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేక‌, ఒక విష‌యం గూర్చి కూలంకుషంగా చ‌ర్చించే విజ్ఞానం లేక కామెంట్ల రూపంలో, పోస్ట్ ల రూపంలో అర‌కొత పైత్యాన్ని, ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతూ మాన‌సిక రోగులుగా మారిపోతున్నారు. ప‌రిస్థితి ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో పాటు మ‌నుష్యులు మాన‌సికంగా ప‌రిణితి సాధించ‌లేని ఒక దుర్భ‌లురుగా మారిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విసృతి, అది మ‌నుష్యు జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వైనం, బీట‌లు వారుతున్న బంధాలు, సామాజిక మాధ్యమాల పుణ్యమాని పెరుగుతున్న మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై “కెరీర్ టైమ్స్” అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ.

 

 

అస‌లు ల‌క్ష్యం ఎప్పుడో నీరుగారిపోయింది!!

 

బ‌య‌ట స‌మాజంలో ఒక అన్యాయం జ‌రిగింది.. లేదా ఒక అక్ర‌మం జ‌రిగింది.. ఇది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి మ‌న‌కు ఒక‌ప్పుడు వార్తాప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్లు వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే దిక్కు. వాళ్లు రిపోర్ట్ చేసింది విని మ‌నం ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌చ్చేవాళ్లం. త‌ర్వాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది. ఒక‌ విష‌యం లేదా సంఘ‌ట‌న జ‌రిగిన‌ వెంట‌నే అంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను సోష‌ల్ మీడియాలో సూచిస్తారు. దీని వ‌ల‌న స‌మ‌స్య‌కు చాలా వేగంగా ప‌రిష్కారం దొరుకుతుంది. అయితే ఇంత అద్భుత‌మైన వేదిక‌ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తూ, స్వీయ గుర్తింపు కోస‌, విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌నకు వాడుకోవ‌డంతో ఈ వేదిక అస‌లు ల‌క్ష్యం మెల్ల‌గా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో అస‌త్యాల‌ను, సొంత అజెండాల‌ను ప్ర‌చారం చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా సంస్థ‌ల‌కు, సోష‌ల్ మీడియా అనేది అనుబంధ సంస్థ‌గా మారిపోయింది. దీంతో సామాజిక మాధ్యమం ఆవిర్భావ ల‌క్ష్యం నీరుగారిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా అవ‌స‌రానికి మించి సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తూ త‌న తెలివితేట‌లను, త‌న సామాజిక బాధ్య‌త‌ను, త‌న గొప్ప‌తనాన్ని కేవ‌లం త‌న వాల్ మీదే ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు.

 

 

స్వీయ గుర్తింపు కోసం పాకులాట త‌ప్ప నిబ‌ద్ధ‌త ఏది??

 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయేవాళ్లు, లింక్డ్ ఇన్ లో ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేసేవాళ్లు నిజంగా ఒక మ‌నిషి ఎదురుగా నిల్చుని మాట్లాడ‌గ‌ల‌రా? అంటే క‌చ్చితంగా లేరు అనే చెప్పాలి. ఒక నాయకుడి కోసం, అతని అవినీతి కోసం , అతని అసమర్దత కోసం ప్రతీరోజూ ఫేస్‌బుక్ లో పుంఖాపుంఖాలు రాసే మహానుభావులు ఆ నాయకుడి రోడ్డు మీద నడిచిపోతుంతే కనీసం దగ్గరగా వెళ్లేందుకు కూడా ధైర్యం చేయరు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం వీళ్లకి లేదు. తమ ఆక్రోషానికి కాస్త పైత్యాన్ని రంగరించి ఫేస్‌బుక్ లో పోస్ట్ లు పెడుతూ పేపర్ పులులుగానే మిగిలిపోతారు. వీళ్లు పెట్టిన పోస్ట్ లకు పదిమంది లైక్ కొడితేనో లేక బాగుంది అని కామెంట్ చేస్తేనో నేను సమాజానికి ఎంతో చేసాను అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఒక రకమైన మానసిక ధౌర్బల్యంలోకి జారిపోతున్నారు. వీళ్లకు ఎంతసేపు గుర్తించబడాలనే తాపత్రయం తప్పితే చిత్తశుద్ధితో పనిచేయాలనే విధానం ఉండదు. అవతలి వాడ్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో తిడుతూ ఒక రకమైన చెత్తను పోస్ట్ చేస్తూ దానికి మురిసిపోతూ పైగా తాను నిజమైన సామాజిక సేవకులుగా ఊహించుకుంటారు. వీళ్లలో ఒక్కరూ కూడా బయటకు వచ్చి సమస్యపై స్పందించి దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న దృష్టిలో ఉండరు. ఒక వ్యక్తికి పెద్ద ఆపద వచ్చింది నాకు ప్రత్యక్షంగా సహాయం చేయండి అని ఫేస్‌బుక్ లో పోస్ట్ వస్తే ఎంతమంది ఆ బాధితుడి ఇంటికి వెళ్లి ఆ ఆపదను తీరుస్తారు. ఒక్కరూ కూడా వెళ్లరు. ఎవరిదైనా పుట్టిన రోజు రాగానే వాట్సాప్ లో మెసెజ్ , ఫేస్‌బుక్ లో ఒక గూగుల్ డస్ట్ ఫోటోను పెట్టి చేతులు దులుపుకునే వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రత్యక్షంగా వెళ్లి అతనికి శుభాకాంక్షలు చెపుదాం. అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుందాం అనుకునే వాళ్లు ఎంతమంది?

 

 

ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే విజేతలు!!

 

అణగారిన వర్గాలు, లేదా అణిచివేయబడిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలంటే ప్రశ్నించే ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి నాయకులను, అధికారులను ప్రశ్నించడం మానేసారు. ఒక నాయకుడ్ని, అధికారిని ప్రత్యక్షంగా కలిసి అతని నిలదీయలేని వారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు. అలా అని ఒక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కాదు. అలా పోస్ట్ చేయడం వలన ఆ సమస్య తీవ్రత పదిమందికి తెలుస్తుంది. ఈ పది మందితో ఫేస్‌బుక్ లో చర్చ పెట్టి కామెంట్లు చేసుకుంటూ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారానికి చేరువ కావాలన్నా, సామాజిక మార్పును సాధించాలన్నా ఎవరినైనా ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో అవాకులు, చెవాకులు వాగితే ఉపయోగం ఏముంటుంది? ఒక అన్యాయం జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించాల్సిందే. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతే సమస్య ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి దాన్ని పరిష్కరించేది ఎవరు? ఫేస్‌బుక్ పేపర్ పులులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విషయంపై ఒక పోస్ట్ పెట్టి తన సామాజిక బాధ్యత అద్భుతం అంటూ తనలో తానే మురిసిపోయి ఒక రకమైన మానసిక రుగ్మతకు లోనవుతున్నారు.

 

 

“గుడ్ మార్నింగ్” , “గుడ్ నైట్” బ్యాచ్ ను వదిలించుకోండి!

 

ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం వ్యక్తులు తయారయ్యారు. ఉదయం లేవగానే తన ఫోన్ బుక్ లో ఉన్నవారందరికీ ఒక గుడ్ మార్నింగ్ మెసెజ్ పెడతారు. తన పక్కనే ఉన్న తన భార్యకో, తన ఆత్మీయులకో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ ఇలా వాట్సాప్ లలో గుడ్ ‌మార్నింగ్ లు చెపుతారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతారు. వీళ్లలో ఒక్కరు కూడా తన ఫ్రెండ్ ను ప్రత్యక్షంగా కలిసి విషెస్ చెప్పరు. వాట్సాప్ ఒక మెసెస్ టైప్ చేసి చేతులు దులుపుకుంటారు. కనీసం ఫోన్ చేసి అయినా వాళ్లతో మాట్లాడాలి అన్న ఇంగితం కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఒక వాట్సాప్ మెసెజ్ రాగానే వెనుకా ముందా చూడకుండా అందరి ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేసేయడం. తాము తమకు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేసే వాహకాలుగా పనిచేస్తున్నామన్న సోయ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఒక మెసెజ్ రాగానే అందులో నిజమెంత? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మెసెజ్ వలన వచ్చే పరిణామాలేంటి? అన్న విషయాలు ఆలోచించకుండా ఉన్నత విద్యావంతులు కూడా మెసెజ్ లను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఎంతసేపూ ఫార్వార్డ్ మెసెజ్ లు చేసి చేసీ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ఒక విషయంపై తన సొంత అభిప్రాయాలను రాసి దానిపై విమర్శలను కూడా స్వీకరించే స్థాయి ఎంత మందికి ఉంది. ఒక అద్భుతమైన మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ తన ఒక్కడికే పరిమితం అనుకోవడం, తాను చేసిందే కరెక్ట్ అనుకోవడం వంటి అవలక్షణాలను పెంచుకుంటున్నారు.

 

 

ఈ ఫేస్‌బుక్ కూలీలతో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు!

 

ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే లాభసాటి సంస్థ. దాని వ్యవస్థాపకుడు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. విచిత్రం ఏమిటంటే ఫేస్‌బుక్ ఇలాంటి అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లను చాలా మందిని తయారు చేసింది. వీళ్లనే ఇప్పుడు ఫేస్‌బుక్ కూలీలు అని కూడా అంటారు. వీళ్లకి ఫేస్‌బుక్ ఒక పైసా కూడా ఇవ్వదు. వీళ్లు మాత్రం కంటెంట్ రాసి ఫేస్‌బుక్ కు ఆదాయం సమకూరుస్తారు. నిరంతరం ఫేస్‌బుక్ లో విహరించే ఈ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లే వాళ్లకు ఆస్తి. నిజంగా పనిచేసే వాళ్లు , సమస్యపై స్పందించేవాళ్లు ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకానీ ఫేస్‌బుక్ లో చర్చకు దిగరు. తమ స్వీయ గుర్తింపు కోసం పాకులాడరు. పెద్ద బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పరిమితంగానే ఉంటారు. క్షేత్ర స్థాయిలో తాము చేసిన పనిని మాత్రమే అందులో ప్రస్తావిస్తారు. క్రేజ్ ఉన్న ఒక హీరోను తిడుతూ ఒకడు, పొగుడుతూ మరొకడు తాము పాపులర్ కావాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ సొంత ప్రతిభతో ఆ పాపులారిటీని సంపాదించుకోవాలని ఒక్కరోజూ అనుకోరు. పాపులారిటీ, గుర్తింపు అనేది చేసే పని, నిజాయితీ, కష్టించే మనస్తత్వం వలన వస్తుంది. ఇలా సోషల్ మీడియాలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వాల్ మీద మాత్రమే సామాజిక బాధ్యతను నిర్వర్తించే వాళ్లకు దూరంగా ఉండండి. వీళ్ల వలన దేశానికే కాదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బీ కేర్ ఫుల్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్  చేస్తున్నవారు) 

 

 

9 టు 5 రోటీన్ జాబ్ మీకు నచ్చదా? అయితే ఈ కెరీర్స్ పై లుక్కేయండి!

 

దయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5  జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.

 

ఫ్రీలాన్స్ వెబ్‌ డిజైనర్ 

 

      ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ పనీ వెబ్ సైట్ ద్వారానో లేక మొబైల్ యాప్ ద్వారానో జరుగుతుంది. సమాచార ప్రదర్శనకు, తమ సంస్థ ప్రధాన ఉద్దేశం చెప్పడానికి ప్రతీ కంపెనీకి ప్రత్యేకమైన వెబ్‌సైట్ ఉండాల్సిందే. దీనికి చిన్నా పెద్దా అన్న తేడా లేదు. ప్రతీ సంస్థకు ఇప్పుడు సొంత వెబ్‌ సైట్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు తమ కంపెనీలు వెబ్‌సైట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జరుపుతున్నాయి. అయితే కంపెనీకి వెబ్‌సైట్ తప్పనిసరి కానీ కేవలం వెబ్‌డిజైనింగ్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోలేవు. అందుకే దాదాపు అన్ని సంస్థలు వెబ్‌డిజైనింగ్ ను ఔట్‌సోర్సింగ్ చేస్తున్నాయి. కాబట్టి పనివేళలతో సంబంధం లేకుండా నచ్చిన సమయంలో పనిచేసుకోవచ్చు. కానీ కంపెనీ నిర్దేశించిన గడువు లోగా వర్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వెబ్‌ డిజైనర్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో కంప్యూటర్స్ ఉంటే చాలు నెలకు రెండు మూడు ప్రాజెక్ట్ లు చేసి 25 నుంచి 30 వేల వరకూ సంపాదించే వీలుంది. బాగా పనిచేస్తారని పేరు సంపాదిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. 
 
 
 
 

సోషల్ మీడియా కన్సల్టెంట్ 

 

       ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది.  యువత అంతా తమ అభిప్రాయాలను, భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎక్కువ సమయంలో అందులోనే గడుపుతున్నారు. దీంతో కంపెనీలు తమ ప్రచార వ్యూహాలను మార్చుకున్నాయి. సోషల్ మీడియాను తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. తమ కంపెనీని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే పనిని సోషల్ మీడియా కన్సల్టెంట్స్ కు అప్పగిస్తున్నాయి.  సోషల్ మీడియా కన్సల్టెంట్స్ తాము తీసుకున్న పనిని తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసినందుకు వీరికి నెలకు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ అందుతున్నాయి. ఇంగ్లీష్ పై కాస్త పట్టు ఉండి, చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా సోషల్ మీడియా కన్సల్టెంట్ అయిపోవచ్చు. 
 

పర్సనల్ ట్రైనర్ 

 

      ప్రస్తుతం నైపుణ్యం లేని వ్యక్తికి జాబ్ మార్కెట్ లో విలువ లేదు. అడకమిక్ అర్హతలు ఎన్ని ఉన్నా కమ్యూనికేషన్, లీడర్ షిఫ్ వంటి లక్షణాలు లేకపోతే కంపెనీలు జాబ్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత నిర్దాక్షిణ్యంగా తొలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఉద్యోగికి, ఉద్యోగార్ధికి భావవ్యక్తీకరణ, నాయకత్వం లక్షణాలను పెంపోదించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఈ రెండు విషయాలను నేర్పించే పర్సనల్ ట్రైనర్స్ కు ఆదరణ పెరిగింది. ఉద్యోగికి వెసులుబాటు ఉన్న సమయంలో వీరు అతని దగ్గరికి వెళ్లి ఈ విషయాల్లో అతన్ని ట్రైనప్ చేస్తారు. ముఖ‌్యంగా ఉదయం సాయింత్రం వేళ్లలో మాత్రమే వీరికి పని ఉంటుంది. మంచి భోధనా నైపుణ్యం ఉంటే పర్సనల్ ట్రైనర్స్ నెలకు 25 నుంచి 30 వేలు సంపాదించవచ్చు. 
 
 
 
 

రియల్ ఎస్టేట్ ఏజెంట్ 

 

        ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా మారిపోయింది. భూమికి ఉన్న విలువను గుర్తించి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారికి ఎక్కడ , ఎలా, ఎంత అన్న విషయాలపై అవగాహన ఉండదు. ఇటువంటి గైడ్ చేసి వారికి అనుకూలమైన స్థలాన్ని, వారి పెట్టుబడి మెత్తం ఆధారంగా చూపించేందుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఏర్పడింది. ఈ కెరీర్ లో చేయవలసింది చాలా చిన్న పని. ఇన్వెస్టర్ తో భూమి యజమానితో మాట్లాడి ఇద్దరికి సంధానకర్తగా వ్యవహరించి అనుకున్న సమయానికి భూమికి చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి వివాదాలు లేని భూమిని ఇన్వెస్టర్లకు చూపిస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వెలిగిపోవచ్చు.  ప్రస్తుతం రియల్ ఎస్టేట్  పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కెరీర్ కు ఢోకా ఉండకపోవచ్చు. 
 
 
 
 

ట్యాక్స్ కన్సల్టెంట్ 

     
 

    ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది. 

 
 
(ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)
 
 
 

ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వీటిని సరిచూసుకోండి!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉద్యోగం సంపాదించడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. నైపుణ్యతకు, నాయకత్వ లక్షణాలకు పెద్ద పీట వేస్తున్న కంపెనీలు నాణ్యమైన అభ్యర్ధులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు అభ్యర్ధుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇంటర్వ్యూకు వెళ్లినా ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళన చాలా మందికి ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ధైర్యంగా తన నైపుణ్యాలను ప్రదర్శించే వారే ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూను విజేతలు కావాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలని హెచ్ఆర్ నిపుణులు చెపుతున్నారు. లేటేస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా వీటిని పదును పెట్టుకుంటే కచ్చితంగా జాబ్ సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

 

సంపూర్ణ అవగాహన చాలా అవసరం!

 

 

ఒక కంపెనీకి ఇంటర్వ్యూకు వెళుతున్నప్పుడు అభ్యర్ధులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ కంపెనీపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాళ్ల లక్ష్యాలు ఇలా అన్ని విషయాలపై ఒక నాలెడ్జ్ ను సంపాదించాలి. ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ గూర్చి మీకు ఏం తెలుసున్నదే అక్కడ కీలకంగా మారుతుంది. ముఖ‌్యంగా ఈ కంపెనీలో నిర్దేశించిన విధులకు తాను ఏ విధంగా న్యాయం చేయగలను అన్న విషయాన్ని అభ్యర్ధి సావధానంగా చెప్పాల్సి ఉంటుంది. దీని వలన కంపెనీ తన నుంచి ఏ ఆశిస్తుందో అన్న విషయంపై పూర్తి సాధికారత వస్తుంది. ఇలా ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ పూర్తి సమాచారం , అవగాహన మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాబ్ విష‍యంలో ఎంత సీరియస్ గా ఉన్నారన్న విష‍యం ఇంటర్వ్యూ చేసేవాళ్లకి అర్ధమవుతుంది.

 

 

కంపెనీకి అనుగుణంగా సీవీ!

 

చాలా మంది అభ్యర్ధులు ఒక సీవీ ని రెడీ చేసుకు పెట్టుకుని దాన్నే ప్రతీ ఇంటర్వ్యూకు తీసుకెళ్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఇంటర్వ్యూకు వెళుతున్న కంపెనీ, అక్కడి పొజిషన్ ఆధారంగా సీవీని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. చూడగానే సీవీ ఆకట్టుకునేలా ఉండాలి. సంక్షిప్తంగా సింపుల్ ఇంగ్లీష్ లో సీవీ ఉండాలి. అనవసర ఆడంబరాలు, డాంబికాలు లేకుండా సీవీని చాలా శ్రద్ధగా తయారు చేసుకోవాలి. అప్పటివరకూ సాధించిన అచీవ్‌మెంట్స్ ను చిన్న చిన్న వాక్యాలతో రాసుకుంటే చూసిన వారిని ఈజీగా అర్ధమవుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను బుల్లెట్ పాయింట్స్ తో రాసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగా సీవీలో అబద్ధాలకు, అతిశయోక్తులకు చోటు లేకుండా చూసుకోవాలి.

 

కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవాలి!

 

అసలు ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఒక అభ్యర్ధిలోని సత్తాను, సామర్ధ్యాన్ని గుర్తించే ప్రక్రియ. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఒక వ్యూహం ప్రకారం బెరుకు లేకుండా సమగ్రంగా సమాధానాలు చెప్పాలి. అలా చెప్పాలి అంటే అభ్యర్ధులు కమ్యూనికేషన్ వ్యూహం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వాళ్లు ఏమి అడుగుతున్నారు. అన్న దాన్ని చూసుకుని ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని చాలా క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెపుతున్న సమాధానాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంశాలపై పట్టు ఉన్న వారికి జాబ్ రావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

 

 

సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్ పరిశీలన!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్ధుల ప్రొఫైల్ ను చూసే ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రొఫైల్ ను ప్రొఫెషనల్ గా తయారు చేసుకోవడంపై అభ్యర్ధులు దృష్టిపెట్టాలి. ఎటువంటి వివాదాలు, లోపాలు లేకుండా సోషల్ మీడియా ప్రొఫైల్, వ్యక్తిగత పేజ్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. తనకు సంబంధించిన రంగంపై చేస్తున్న పోస్ట్ లు, అభిప్రాయాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి మంచి కంపెనీలో మంచి జాబ్ కావాలంటే సోషల్ మీడియా ప్రొఫైల్ పై కూడా దృష్టి పెట్టాలి.

 

ఇంప్రెషన్, ఫాలోఅప్ కూడా కీలకం!

 

ఇంటర్వ్యూలో గెలుపు సాధించామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు అభ్యర్ధులు మంచి ఇంప్రెషన్ ను కలిగించాలి. చెప్పిన సమయానికి ఇంటర్వ్యూకు రావడం, మంచి డ్రెస్సింగ్, కాన్ఫిడెన్స్, ఐ కాంటాక్ట్, చెప్పే విషయంలో క్లారిటీ, గతంలో సాధించిన అచీవ్‌మెంట్స్ పై ఆచితూచి మాట్లాడటం వంటివి అభ్యర్ధులపై మంచి ఇంప్రెషన్ ను కలిగిస్తాయి. ఇంటర్వ్యూలో చేసే వాళ్లకు మంచి ఇంప్రెషన్ కలిగించారంటే ఉద్యోగం వచ్చినట్టే. కంపెనీ మీ నుంచి ఏం ఆశిస్తుందో సూచన ప్రాయంగా తెలియజేస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని తుది ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. అలాగే ఫాలోఅప్ ను మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ కంపెనీలో అవకాశం ఉందా అని అడగటం ద్వారా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటే కంపెనీకి అదనపు లాభం చేకూరుతుందని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలగాలి.

 

(ఈ ఆర్టికల్  ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)