మీరు “ది బెస్ట్” అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇది చదవండి!!

 

 

బీ ద బెస్ట్..ఇది విన‌డానికి చిన్న ప‌ద‌మే కావొచ్చు. కానీ దీన్ని అందుకోవాల‌న్నా..దీన్ని సాధించాల‌న్నా ఎంతో కృషి , ప‌ట్టుదల కావాల్సి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తంగా ఉండాలంటే మ‌నం చేసే ప‌నులు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌, మ‌న న‌డ‌వ‌డిక ఇలా అన్నీ ఎంతో బాధ్య‌త‌, నాణ్య‌త‌తో కూడి ఉండాలి. వీట‌న్నింటికి తోడు నిజాయితీ ఉండాలి. చేసే ప‌నిలో నిజాయితీ ఉంటే దాని నుంచి వ‌చ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక విద్యార్ధి అయినా, ఉద్యోగి అయినా లేదా వ్యాపార‌వేత్త అయినా ద బెస్ట్ గా ఎదాగ‌లంటే ఎన్నో ల‌క్ష‌ణాల‌ను, అర్హ‌త‌ల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ గా ఎదగాలంటే ముందుగా మీరు ఎదుటివారికి ద బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. మీ కుటుంబ స‌భ్యులు, మీ సహోద్యోగులు, మీ కింద ప‌నిచేసే వారు, మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, మీ తోటివారు ఇలా ఎవ‌రికైనా అత్యుత్త‌మైన‌ది ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే మీరు బెస్ట్ గా ఎదుగుతారు.

 

 

బాధ్య‌త అంటే అత్యుత్త‌మ‌మైన‌ది అందించ‌డ‌మే!!

 

ఒక తండ్రి త‌న పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ను అందించాలంటే వాళ్ల‌కు అత్యుత్త‌మైన స‌దుపాయాలు క‌ల్పించాలి. మంచి స్కూల్, మంచి పెంప‌కం, మంచి తిండి, మంచి ప్ర‌వ‌ర్త‌న అందించ‌గ‌లిగితే వారు ది బెస్ట్ పౌరులుగా ఎదుగుతారు. కెరీర్ ప‌రంగా, ప్ర‌వ‌ర్త‌న ప‌రంగా, సామాజిక ప‌రంగా అత్యున్న‌తమైన వ్య‌క్తులుగా త‌యార‌వుతారు. ఇక్క‌డ ఇంకో అద్భుత‌మైన విష‌యం దాగుంది. తండ్రి త‌న పిల్ల‌ల‌కు ది బెస్ట్ పెంప‌కం అందించిన‌ప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వాళ్లు మంచి పౌరులుగా ఎదిగిన‌ప్పుడు వారు కూడా వాళ్ల పిల్ల‌ల‌తో పాటు స‌మాజానికి అదే విధ‌మైన విలువ‌లు, బాధ్య‌త అందిస్తారు. ఒక ప‌ని చేసినప్పుడు విలువ‌లు, నాణ్య‌త‌, నిజాయితీతో కూడిన ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తారు. దీని వ‌ల‌న వారు ఎవ‌రికి మేలు చేసినా అది అత్యుత్త‌మంగా, మంచిదిగా ఉంటుంది. దాని వ‌ల‌న అవ‌త‌లి వ్యక్తుల‌కు మేలు జ‌ర‌గ‌డ‌మే కాకుండా వీరు కూడా త‌మ అత్యుత్త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో స‌మాజంలో , త‌మ వ్యాపారంలో, ఉద్యోగ జీవితంలో ఉన్న‌తంగా ఎదుగుతారు.

 

 

ఇవ్వ‌డం నేర్చుకుంటే నీకు అన్నీ వ‌స్తూనే ఉంటాయ్!!

 

ఇప్పుడు మ‌న స‌మాజంలో చాలా మందికి ఇవ్వ‌డం అనేది అస్స‌లు తెలీడం లేదు. నేను క‌ష్ట‌ప‌డి సంపాదించాను నేను ఎందుకు ఇవ్వాలి? నేనెందుకు స‌హాయ చేయాలి? అన్న ధోర‌ణి మ‌నుష్యుల్లో పెరిగిపోతోంది. ఇది చాలా త‌ప్పు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాంట్లో మ‌న సంక్షేమానికి త‌గిన మొత్తాన్ని అట్టిపెట్టుకున్న త‌ర్వాత మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆప‌ద‌లో, అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఇవ్వ‌గ‌లిగితే మ‌న వ్య‌క్తిత్వ నిర్మాణంలో ఎంతో మార్పు వ‌స్తుంది. ఎందుకంటే ఇలా ఆప‌ద‌లో ఉన్న మీ పొరుగువారికో, మీ సహోద్యోగికో, మీ కింద ప‌నిచేసే వారికో మీకు చేత‌నైనంత స‌హాయం చేస్తే అది ఎంతో ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. ఇలా ఇవ్వ‌డం వ‌ల‌న మీకు వ‌స్తూనే ఉంటుంది అన్న విష‌యాన్ని ఎప్పుడూ మ‌ర్చిపోకండి. ఎందుకంటే ఒక మంచి స‌దుద్దేశ్యంతో, నిజాయితీగా, మ‌న‌స్ఫూర్తిగా మీరు స‌హాయం చేసిన‌ప్పుడు ప్ర‌కృతి మీకు అంత‌కు రెట్టింపు సంప‌ద‌ను అందిస్తుంది. ఇది సృష్టిలో ఉన్న ఒక అద్భుత‌మైన విష‌యం. కాబ‌ట్టి ఎప్పుడూ మీకు స‌హాయం చేసే శ‌క్తి, అవ‌కాశం ఉన్న‌ప్పుడు క‌చ్చితంగా ఇత‌రుల‌కు స‌హాయం చేయండి. ఒక‌సారి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు అర్జెంట్ 20 ల‌క్ష‌ల అవ‌సరం పడింది. ఎంత సూప‌ర్ స్టార్ అయినా స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోతే ఎవ‌రినో ఒక‌రిని స‌హాయం కోరాల్సిందే. బ్యాంకు ఖాతాలు, ఇంట్లో ఉన్న బీరువాలు అన్నీ గాలిస్తే 16 ల‌క్ష‌లు స‌మ‌కూరాయి. ఇంకో 4 ల‌క్ష‌లు కావాల్సి ఉంది. స్నేహితుల‌కు ఫోన్ చేస్తే ఒకట్రెండు రోజులు స‌మ‌యం ఇస్తే నాలుగు ల‌క్ష‌లు స‌మ‌కూరుస్తామ‌ని చెప్పారు. ఇంత‌లో ర‌జ‌నీ చిన్న‌నాటి స్నేహితుడు అత‌ని ఇంటికి వ‌చ్చాడు. మా అమ్మాయి పెళ్లి రెండురోజుల్లో ఉంది. ఒక ల‌క్ష రూపాయ‌లు అవ‌స‌రం ప‌డింది. ఎలాగైనా నువ్వే స‌ర్దాలి అని ర‌జ‌నీని అడిగాడు. రజ‌నీకాంత్ వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న 16 ల‌క్ష‌ల్లో ఒక ల‌క్ష రూపాయ‌ల తీసి త‌న స్నేహితుడికి ఇచ్చి అమ్మాయి పెళ్లి ఘ‌నంగా చేయి అని పంపించాడు. ర‌జ‌నీ చేసిన ప‌నికి అత‌ని భార్య కాస్త నొచ్చుకుంద‌ట‌. మ‌న‌మే ఇప్పుడు డ‌బ్బు అవ‌స‌రం ప‌డి అంద‌ర్నీ అడిగాం. ఇప్పుడు మీరు ఈ స‌హాయం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని అడిగింది. దానికి ర‌జ‌నీ నేను ల‌క్ష రూపాయ‌ల స‌హాయం చేస్తే నా స్నేహితుడు ప‌ని సంపూర్ణంగా పూర్త‌వుతుంది. అత‌ను సంతోషంగా ఉంటాడు. నేను నాలుగు ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ క్ష‌ణం నుంచి 5 ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తాను. పెద్ద తేడా లేదు. కాబ‌ట్టి స‌హాయం చేయ‌డంలో నాకు వెసులుబాటు ఉంది అందుకే చేసాను అని చెప్పాడు. ఇటువంటి వ్య‌క్తిత్వ నిర్మాణం చేసుకున్నాడు క‌నుక‌నే అత‌ను నిజ‌జీవితంలోనూ సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు మ‌న స‌మాజానికి అలాంటి సూప‌ర్ స్టార్ లు కావాలి.

 

 

చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిజాయితీ ఉండాలి!

 

మీరు ఒక కంపెనీలో ప‌నిచేస్తున్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ లేన‌ప్పుడు ప‌నిచేయ‌కుండా త‌ప్పించుకోవ‌డం, ఏదో చేస్తున్నాం లే అన్న ధోర‌ణిలో ఉండ‌టం వంటివి అస్స‌లు చేయ‌కండి. ఎందుకంటే ఇటువంటి వైఖ‌రి మీ కెరీర్ ను దారుణంగా దెబ్బ‌తీస్తుంది. ఎందుకంటే చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిబ‌ద్ధ‌త లేక‌పోతే ఆ కంపెనీ వ‌దిలి వేరే కంపెనీకి వెళ్లిన‌ప్పుడు మీ ప‌నితీరు దారుణంగా దెబ్బ‌తిని ఉంటుంది. మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, లేదా య‌జ‌మాని మీకు న‌చ్చ‌ని విధంగా ఉన్న‌ప్ప‌టికీ మీ ప‌నితీరులో ఎటువంటి తేడా ఉండ‌కూడ‌దు. న‌చ్చ‌ని చోటు నుంచి వెళ్లిపోవాలి కానీ ప‌ని చేయ‌డం మానేయ‌డం, నిజాయితీగా లేక‌పోవ‌డం వంటి చేస్తే అది మీ వ్య‌క్తిత్వాన్ని, మీ ఉద్యోగ జీవితాన్ని దెబ్బ‌తీస్తుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్లు తమ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న వాళ్లు విష‌యంలో నిజాయితీగా ఉండాలి. వారికి ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా ఆదుకునేందుకు రెడీగా ఉండాలి. అలాగే నిబ‌ద్ధ‌త‌, ప‌నితీరు న‌చ్చ‌ని ఉద్యోగుల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. వాళ్ల‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలించుకోండి. బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తే మీకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వ‌డానికి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు. కాబ‌ట్టి ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడూ చేస్తున్న ప‌నిలో నిజాయితీ, నిబ‌ద్ధ‌త చూపిస్తూ, ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకునేందుకు మీ ప‌రిధి మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తే వ్య‌క్తిగా మంచి స్థితికి చేరుకుంటారు. మంచి చేయ‌కున్నా ఫ‌ర్వాలేదు ఎవ‌రికైనా చెడు చేయాల‌న్న తలంపు వ‌స్తే అది గోడ‌కు కొట్టి బంతిలా రెట్టింపు వేగంతో మీ వైపుకు వ‌స్తుంది. మీకే చెడు జ‌రుగుతుంది. అటువంటి ప్ర‌తికూల త‌పంపులు ఎప్పుడూ మ‌న‌కు మేలు చేయ‌వు.

 

 

విత్త‌నం నాటిన వెంట‌నే ఫ‌లాలు రావు!!

 

పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు వేట‌కు వెళ్లి బాగా అలిసిపోయి దాహంతో నీళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చాలా సేపు తిరిగిన త‌ర్వాత ఒక బాట ప‌క్క‌న మామిడి టెంక‌లు నాటుతున్న వృద్ధుడు క‌నిపించాడు. రాజును చూసిన వెంట‌నే వృద్ధుడు అత‌ని ఒక చెట్టు కింద‌కు తీసుకెళ్లి దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగాక కాస్త స్థిమిత‌ప‌డ్డ రాజు ఏమ‌య్యా పెద్దాయ‌న బాట ప‌క్క‌న ఇలా మామిడి టెంక‌లు నాటుతున్నావు.ఎందుకు? అని అడిగాడు. దానికి వృద్ధుడు రాజా మామిడి మొక్క‌లు వ‌స్తాయ‌ని ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. దానికి రాజు న‌వ్వి ఈ మొక్క‌లు పెరిగి చెట్టుగా మారి మామిడి పండ్లు ఇచ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది క‌దా? అప్ప‌టి వ‌ర‌కూ నువ్వు బ‌తుకుదాం అనుకుంటున్నావా? అని అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు వృద్ధుడు కూడా న‌వ్వి రాజా నేను నా కోసం ఈ మొక్క‌లు నాట‌డం లేదు. రేప‌టి త‌రం కోసం నాటుతున్నాను. గ‌తంలో ఎవ‌రో ఇక్క‌డ మొక్క నాటారు కాబట్టే మీరు, నేను ఈ చెట్టు కింద కూర్చుని సేద‌తీరుతున్నాం. నేను కూడా అదే విధంగా రేప‌టి మ‌న పిల్ల‌ల కోసం ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. వృద్ధుని దూర‌దృష్టికి, అత‌ని సేవానిర‌తికి ఆశ్చ‌ర్య‌పోయిన రాజు త‌న రాజ్యంలో మ‌రిన్ని చెట్టు నాటించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు. ఇప్ప‌డు స్టార్ట‌ప్ లు ప్రారంభిస్తున్న ఔత్సాహికులు ఈ క‌థ నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చు. ఒక సంస్థ ప్రారంభించ‌గానే ఫ‌లితాలు వ‌చ్చేయ‌వు. ఓపిగ్గా వ్య‌వ‌హ‌రించి, నిజాయితీగా, నాణ్య‌త ప్రధాన వ‌న‌రుగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఇవ్వ‌డం నేర్చుకోండి. మీకు వ‌స్తూనే ఉంటుంది. సామ‌ర్ధ్యం మేర‌కు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఫ‌లితం ఎలా ఉన్నా దాన్ని తీసుకునే నైపుణ్యాన్ని సాధించాలి. సో..గివ్ ద బెస్ట్ అండ్ యు గెట్ ద బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

జీతాల్లేని ఈ ఫేస్‌బుక్ కూలీలు ఏం చేస్తున్నారో తెలుసా??

 

సోష‌ల్ మీడియా..గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం. రెండు వైపులా ప‌దునున్న ఈ సామాజిక మాధ్య‌మం అనే క‌త్తితో ప్ర‌జ‌లు కూర‌గాయ‌లు కోసుకోవ‌డం మాని త‌మ గొంతుల‌తో పాటు ప‌క్క‌వాళ్ల గొంతులు కూడా తెగ్గోస్తున్నారు. ప‌క్క ఇంట్లో ఉన్న‌వాడికి కూడా అభినంద‌న‌లో, ఆప్యాయ‌త‌తో, ఆస‌రానో అందిచాల్సిన టైంలో కూడా ఒక మెసెజ్ , ఒక లైక్ ప‌డేసి మానవ సంబంధాల‌ను గొయ్యి తీసి పాతిపెట్టేస్తున్నారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో ఫేస్‌‍బుక్ లో, ట్విట్ట‌ర్ లో పెద్ద గొంతు వేసుకుని ప‌డిపోయే న‌యా ఉత్త‌ర కుమారులు బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్డు మీద ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా త‌యార‌య్యారు. ఒక మ‌నిషి ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేక‌, ఒక విష‌యం గూర్చి కూలంకుషంగా చ‌ర్చించే విజ్ఞానం లేక కామెంట్ల రూపంలో, పోస్ట్ ల రూపంలో అర‌కొత పైత్యాన్ని, ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతూ మాన‌సిక రోగులుగా మారిపోతున్నారు. ప‌రిస్థితి ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో పాటు మ‌నుష్యులు మాన‌సికంగా ప‌రిణితి సాధించ‌లేని ఒక దుర్భ‌లురుగా మారిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విసృతి, అది మ‌నుష్యు జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వైనం, బీట‌లు వారుతున్న బంధాలు, సామాజిక మాధ్యమాల పుణ్యమాని పెరుగుతున్న మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై “కెరీర్ టైమ్స్” అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ.

 

 

అస‌లు ల‌క్ష్యం ఎప్పుడో నీరుగారిపోయింది!!

 

బ‌య‌ట స‌మాజంలో ఒక అన్యాయం జ‌రిగింది.. లేదా ఒక అక్ర‌మం జ‌రిగింది.. ఇది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి మ‌న‌కు ఒక‌ప్పుడు వార్తాప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్లు వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే దిక్కు. వాళ్లు రిపోర్ట్ చేసింది విని మ‌నం ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌చ్చేవాళ్లం. త‌ర్వాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది. ఒక‌ విష‌యం లేదా సంఘ‌ట‌న జ‌రిగిన‌ వెంట‌నే అంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను సోష‌ల్ మీడియాలో సూచిస్తారు. దీని వ‌ల‌న స‌మ‌స్య‌కు చాలా వేగంగా ప‌రిష్కారం దొరుకుతుంది. అయితే ఇంత అద్భుత‌మైన వేదిక‌ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తూ, స్వీయ గుర్తింపు కోస‌, విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌నకు వాడుకోవ‌డంతో ఈ వేదిక అస‌లు ల‌క్ష్యం మెల్ల‌గా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో అస‌త్యాల‌ను, సొంత అజెండాల‌ను ప్ర‌చారం చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా సంస్థ‌ల‌కు, సోష‌ల్ మీడియా అనేది అనుబంధ సంస్థ‌గా మారిపోయింది. దీంతో సామాజిక మాధ్యమం ఆవిర్భావ ల‌క్ష్యం నీరుగారిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా అవ‌స‌రానికి మించి సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తూ త‌న తెలివితేట‌లను, త‌న సామాజిక బాధ్య‌త‌ను, త‌న గొప్ప‌తనాన్ని కేవ‌లం త‌న వాల్ మీదే ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు.

 

 

స్వీయ గుర్తింపు కోసం పాకులాట త‌ప్ప నిబ‌ద్ధ‌త ఏది??

 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయేవాళ్లు, లింక్డ్ ఇన్ లో ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేసేవాళ్లు నిజంగా ఒక మ‌నిషి ఎదురుగా నిల్చుని మాట్లాడ‌గ‌ల‌రా? అంటే క‌చ్చితంగా లేరు అనే చెప్పాలి. ఒక నాయకుడి కోసం, అతని అవినీతి కోసం , అతని అసమర్దత కోసం ప్రతీరోజూ ఫేస్‌బుక్ లో పుంఖాపుంఖాలు రాసే మహానుభావులు ఆ నాయకుడి రోడ్డు మీద నడిచిపోతుంతే కనీసం దగ్గరగా వెళ్లేందుకు కూడా ధైర్యం చేయరు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం వీళ్లకి లేదు. తమ ఆక్రోషానికి కాస్త పైత్యాన్ని రంగరించి ఫేస్‌బుక్ లో పోస్ట్ లు పెడుతూ పేపర్ పులులుగానే మిగిలిపోతారు. వీళ్లు పెట్టిన పోస్ట్ లకు పదిమంది లైక్ కొడితేనో లేక బాగుంది అని కామెంట్ చేస్తేనో నేను సమాజానికి ఎంతో చేసాను అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఒక రకమైన మానసిక ధౌర్బల్యంలోకి జారిపోతున్నారు. వీళ్లకు ఎంతసేపు గుర్తించబడాలనే తాపత్రయం తప్పితే చిత్తశుద్ధితో పనిచేయాలనే విధానం ఉండదు. అవతలి వాడ్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో తిడుతూ ఒక రకమైన చెత్తను పోస్ట్ చేస్తూ దానికి మురిసిపోతూ పైగా తాను నిజమైన సామాజిక సేవకులుగా ఊహించుకుంటారు. వీళ్లలో ఒక్కరూ కూడా బయటకు వచ్చి సమస్యపై స్పందించి దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న దృష్టిలో ఉండరు. ఒక వ్యక్తికి పెద్ద ఆపద వచ్చింది నాకు ప్రత్యక్షంగా సహాయం చేయండి అని ఫేస్‌బుక్ లో పోస్ట్ వస్తే ఎంతమంది ఆ బాధితుడి ఇంటికి వెళ్లి ఆ ఆపదను తీరుస్తారు. ఒక్కరూ కూడా వెళ్లరు. ఎవరిదైనా పుట్టిన రోజు రాగానే వాట్సాప్ లో మెసెజ్ , ఫేస్‌బుక్ లో ఒక గూగుల్ డస్ట్ ఫోటోను పెట్టి చేతులు దులుపుకునే వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రత్యక్షంగా వెళ్లి అతనికి శుభాకాంక్షలు చెపుదాం. అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుందాం అనుకునే వాళ్లు ఎంతమంది?

 

 

ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే విజేతలు!!

 

అణగారిన వర్గాలు, లేదా అణిచివేయబడిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలంటే ప్రశ్నించే ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి నాయకులను, అధికారులను ప్రశ్నించడం మానేసారు. ఒక నాయకుడ్ని, అధికారిని ప్రత్యక్షంగా కలిసి అతని నిలదీయలేని వారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు. అలా అని ఒక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కాదు. అలా పోస్ట్ చేయడం వలన ఆ సమస్య తీవ్రత పదిమందికి తెలుస్తుంది. ఈ పది మందితో ఫేస్‌బుక్ లో చర్చ పెట్టి కామెంట్లు చేసుకుంటూ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారానికి చేరువ కావాలన్నా, సామాజిక మార్పును సాధించాలన్నా ఎవరినైనా ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో అవాకులు, చెవాకులు వాగితే ఉపయోగం ఏముంటుంది? ఒక అన్యాయం జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించాల్సిందే. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతే సమస్య ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి దాన్ని పరిష్కరించేది ఎవరు? ఫేస్‌బుక్ పేపర్ పులులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విషయంపై ఒక పోస్ట్ పెట్టి తన సామాజిక బాధ్యత అద్భుతం అంటూ తనలో తానే మురిసిపోయి ఒక రకమైన మానసిక రుగ్మతకు లోనవుతున్నారు.

 

 

“గుడ్ మార్నింగ్” , “గుడ్ నైట్” బ్యాచ్ ను వదిలించుకోండి!

 

ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం వ్యక్తులు తయారయ్యారు. ఉదయం లేవగానే తన ఫోన్ బుక్ లో ఉన్నవారందరికీ ఒక గుడ్ మార్నింగ్ మెసెజ్ పెడతారు. తన పక్కనే ఉన్న తన భార్యకో, తన ఆత్మీయులకో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ ఇలా వాట్సాప్ లలో గుడ్ ‌మార్నింగ్ లు చెపుతారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతారు. వీళ్లలో ఒక్కరు కూడా తన ఫ్రెండ్ ను ప్రత్యక్షంగా కలిసి విషెస్ చెప్పరు. వాట్సాప్ ఒక మెసెస్ టైప్ చేసి చేతులు దులుపుకుంటారు. కనీసం ఫోన్ చేసి అయినా వాళ్లతో మాట్లాడాలి అన్న ఇంగితం కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఒక వాట్సాప్ మెసెజ్ రాగానే వెనుకా ముందా చూడకుండా అందరి ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేసేయడం. తాము తమకు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేసే వాహకాలుగా పనిచేస్తున్నామన్న సోయ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఒక మెసెజ్ రాగానే అందులో నిజమెంత? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మెసెజ్ వలన వచ్చే పరిణామాలేంటి? అన్న విషయాలు ఆలోచించకుండా ఉన్నత విద్యావంతులు కూడా మెసెజ్ లను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఎంతసేపూ ఫార్వార్డ్ మెసెజ్ లు చేసి చేసీ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ఒక విషయంపై తన సొంత అభిప్రాయాలను రాసి దానిపై విమర్శలను కూడా స్వీకరించే స్థాయి ఎంత మందికి ఉంది. ఒక అద్భుతమైన మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ తన ఒక్కడికే పరిమితం అనుకోవడం, తాను చేసిందే కరెక్ట్ అనుకోవడం వంటి అవలక్షణాలను పెంచుకుంటున్నారు.

 

 

ఈ ఫేస్‌బుక్ కూలీలతో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు!

 

ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే లాభసాటి సంస్థ. దాని వ్యవస్థాపకుడు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. విచిత్రం ఏమిటంటే ఫేస్‌బుక్ ఇలాంటి అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లను చాలా మందిని తయారు చేసింది. వీళ్లనే ఇప్పుడు ఫేస్‌బుక్ కూలీలు అని కూడా అంటారు. వీళ్లకి ఫేస్‌బుక్ ఒక పైసా కూడా ఇవ్వదు. వీళ్లు మాత్రం కంటెంట్ రాసి ఫేస్‌బుక్ కు ఆదాయం సమకూరుస్తారు. నిరంతరం ఫేస్‌బుక్ లో విహరించే ఈ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లే వాళ్లకు ఆస్తి. నిజంగా పనిచేసే వాళ్లు , సమస్యపై స్పందించేవాళ్లు ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకానీ ఫేస్‌బుక్ లో చర్చకు దిగరు. తమ స్వీయ గుర్తింపు కోసం పాకులాడరు. పెద్ద బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పరిమితంగానే ఉంటారు. క్షేత్ర స్థాయిలో తాము చేసిన పనిని మాత్రమే అందులో ప్రస్తావిస్తారు. క్రేజ్ ఉన్న ఒక హీరోను తిడుతూ ఒకడు, పొగుడుతూ మరొకడు తాము పాపులర్ కావాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ సొంత ప్రతిభతో ఆ పాపులారిటీని సంపాదించుకోవాలని ఒక్కరోజూ అనుకోరు. పాపులారిటీ, గుర్తింపు అనేది చేసే పని, నిజాయితీ, కష్టించే మనస్తత్వం వలన వస్తుంది. ఇలా సోషల్ మీడియాలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వాల్ మీద మాత్రమే సామాజిక బాధ్యతను నిర్వర్తించే వాళ్లకు దూరంగా ఉండండి. వీళ్ల వలన దేశానికే కాదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బీ కేర్ ఫుల్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్  చేస్తున్నవారు) 

 

 

ఎలుక హృద‌యం..ఏనుగు శ‌రీరం..ఇలా ఉంటే లైఫ్ గ‌ల్లంతే!!

 

మ‌నిషి పుట్టుకే ఒక పోరాటంతో మొద‌ల‌వుతుంది. ఎన్నో ల‌క్ష‌ల శుక్ర క‌ణాల‌తో పోటీప‌డి కేవ‌లం ఒక్క శుక్ర‌కణం మాత్ర‌మే అండాన్ని చేరుకుంటుంది. అంటే ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న ఒక శుక్ర‌క‌ణం మాత్ర‌మే మ‌నిషిగా రూపుదిద్దుకుంటుంది. ఈ ప‌రిణామం మ‌న‌కు ఏం నేర్పుతుంది? ప్ర‌తీ మ‌నిషి ఒక ప్ర‌త్యేకమైన వాడు లోకంలో మ‌రెవ‌రికీ సాధ్యం కానిది త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. జీవం పోసుకునేట‌ప్పుడే పెద్ద పోరాటం చేసి విజేత‌గా నిలిచిన మ‌నిషి త‌న జీవితంలో మాత్రం త‌న ప్రత్యేక‌త‌ను గుర్తించ‌కుండా పోటీలో వెనక‌బ‌డిపోతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో, కెరీర్ ను నిర్మించుకోవ‌డంలో చాలా మంది త‌ప్పులు మీద త‌ప్పులు చేస్తూ త‌క్కువ స్థాయిలో ఉండిపోతున్నారు. చాలా మందికి అర్ధం కాని విష‌యం ఏంటంటే కెరీర్ ఛేంజ్ చేస్తే ఉన్న‌త స్థాయికి వెళ్లిపోతాం అనుకుంటున్నారు. అది పొర‌పాటు. కెరీర్ ను మార్చాల‌నుకున్న‌ప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవాలి. అప్పుడే విజ‌యం సాధ్య‌మ‌వుతుంది. చేసే ప‌నిపై నిబ‌ద్ధ‌త‌, ప‌నిపై ఆస‌క్తి, ప‌నిపై అంతులేని ప్రేమ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది ఫ‌లితాల‌ను ఇస్తుంది. లేదంటే గొప్ప‌వాళ్ల‌ను చూసి తాను అలాగే త‌యార‌వాల‌నుకుని చివ‌రికి బోల్తా ప‌డ్డ ఎలుక క‌థ‌లా ఉంటుంది జీవితం.

 

 

నీలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ను గుర్తించు!

 

పూర్వం ఒక అడ‌విలో ఒక ఎలుక ఉండేది. ఆహారానికి లోటు లేకుండా అది హాయిగా జీవించేది. కానీ త‌న రూపం చూసుకుని ఆ ఎలుక అనుక్ష‌ణం అసంతృప్తికి లోన‌య్యేది. ఒక‌రోజు ఆ అడ‌విలో త‌ప‌స్సు చేసుకుంటున్న ఒక మునీశ్వ‌రుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. లోప‌ల నవ్వుకున్న రుషి స‌రే నేను నీకు ఏ విధంగా స‌హాయం చేయ‌గ‌ల‌ను అని అడిగాడు. అప్పుడు ఎలుక స్వామీ ఈ అడ‌విలో జింక కంటే వేగంగా ప‌రిగెత్త గ‌లిగే జంతువును నేను చూడ‌లేదు. న‌న్ను జింక‌గా మార్చండి అని కోరింది. స‌రేన‌న్న రుషి ఎలుక‌ను జింక‌గా మార్చాడు. అయితే ఎలుక ఆనందం రెండు రోజులు కూడా నిలువ లేదు. త‌న‌తో స‌మానంగా ప‌రిగెత్తే పులి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని గ్ర‌హించి వెంట‌నే ముని ద‌గ్గ‌ర‌కు పరిగెత్తుకుంటూ వ‌చ్చింది. స్వామీ..నేను పొర‌పాటుగా కోరుకున్నాను. న‌న్ను పులిగా మార్చండి అని అడిగింది. స‌రేన‌ని ముని జింక రూపంలో ఉన్న ఎలుక‌ను పులిగా మార్చాడు. మ‌ర‌లా కొన్ని రోజుల‌కు ముని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అడ‌విలో బ‌ల‌మైన పులి కూడా భారీగా ఉన్న ఏనుగు ముందు త‌ల‌వంచ‌వ‌ల‌సిందే కాబ‌ట్టి న‌న్ను ఏనుగుగా మార్చండి అని కోరింది. ముని పులి రూపంలో ఉన్న ఎలుక‌ను ఏనుగుగా మార్చాడు. త‌ర్వాత‌ ఎన్ని అవాంతారాలు ఎదురైనా త‌లెత్కుకు నిల‌బ‌డే శిఖ‌రం ముందు భారీ ఏనుగు కూడా బ‌లాదూర్ కాబ‌ట్టి త‌న‌ను పెద్ద శిఖ‌రంగా మార్చ‌మ‌ని అడిగింది. శిఖ‌రంగా మారి గ‌ర్వంతో త‌లెగ‌రేసే లోపు ఒక ఎలుక వ‌చ్చి అంత పెద్ద శిఖ‌రానికి బొరియ చేయ‌డం చూసి ఎలుక ముందు శిఖ‌రం కూడా నిలువ‌లేదని గ్ర‌హించింది. త‌న పొర‌పాటును, అజ్ఞానాన్ని మ‌న్నించి త‌నను ఎప్ప‌టిలాగే ఎలుక‌లా మార్చ‌మ‌ని మునీశ్వ‌రుడ్ని శ‌ర‌ణు వేడింది.

 

 

ముందు నువ్వు మారాలి!

 

వేరొక‌రిని అనుస‌రించే వాళ్ల‌ను ఎవ‌రూ అనుస‌రించ‌రు అన్న మాట మీకు తెలిసే ఉంటుంది. ఎవ‌రో ఫలానా ప‌నిచేసార‌ని కెరీర్ ఛేంజ్ చేయ‌డం వ‌ల‌న ఉన్న‌త స్థానానికి చేరుకున్నార‌ని మ‌నం కూడా అలాగే చేస్తే ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు స‌రిక‌దా తిరిగి కెరీర్ దారుణంగా దెబ్బ‌తింటుంది. చేసే ప‌ని చిన్న‌దైనా అందులో నీకు ఆనందం ఉందా? అవ‌స‌ర‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? భ‌విష్య‌త్ లో మ‌రింత ఎదిగేందుకు అవ‌కాశాలున్నాయా? అన్న విష‌యాల‌ను చూసుకోవాలి. కానీ చాలా మంది ప్ర‌స్తుతం ఒక రంగం బాగుంద‌ని అందులోకి మార‌డం అక్క‌డ నుంచి మ‌రో రంగానికి మార‌డం ఇలాంటి ప‌నులు చేస్తున్నారు. అలా అలా తిరిగి చివ‌రిని మొద‌ట చేసిన ప‌నినే మ‌ళ్లీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ మార్చాల్సింది కెరీర్ ను కాదు. మార్చుకోవాల్సింది మిమ్మిల్ని మీరు. లేదంటే ఎలుక క‌థ‌లా చివ‌రికి మీరు మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తారు. ఒక ప్రణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతూ మీ మ‌న‌సుకు నచ్చిన ప‌ని చేసుకుంటూ ముందుకు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. అలా కాకుండా మిడి మిడి జ్ఞానంతో ఎవ‌రో చేసార‌ని, ఎవ‌రో ఉన్న‌తంగా ఎదిగార‌ని లేని పోని పోలిక‌లు పెట్టుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

 

 

సాకులు చెప్ప‌డం మానుకోండి!

 

ఉన్న‌త స్థానానికి వెళ్లిన వ్య‌క్తుల‌ను మ‌నం చూస్తూ ఉంటాం. వాళ్లు సాధించిన‌ప్పుడు మ‌నం ఎందుకు సాధించ‌లేం అన్న ఆలోచ‌న మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా? ఇక్క‌డ వాళ్ల‌తో పోల్చుకుని తిక‌మ‌క ప‌డ‌మ‌ని కాదు పోల్చుకోవ‌డం వేరు స్పూర్తిని పొందడం వేరు. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని గుర్తించ‌గ‌ల‌గాలి. మ‌నం ముందు చెప్పుకున్నాం. ల‌క్ష‌లాది ఇత‌ర శుక్ర‌క‌ణాల‌తో పోటీప‌డి నువ్వు ఈ భూమిమీద‌కు వ‌చ్చావు. అంటే నీలో చాలా ప్ర‌త్యేక‌త ఉంది. మ‌రి అలాంట‌ప్పుడు మిగిలిన వారు సాధించింది నువ్వు కూడా సాధించ‌గ‌ల‌వు. కానీ సాకులు చెపుతూ కార‌ణాలు వెతుకుతూ చాలా మంది త‌మ‌కు తాము స‌ర్దిచెప్పుకుంటారు. విజ‌యం సాధించిన‌ వ్య‌క్తుల‌కు అన్నీ అనుకూలంగా ఉన్నాయ‌ని, వాళ్ల‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని, ఆర్థిక వన‌రులు ఉన్నాయ‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెపుతారు. జీవితం అంద‌రికీ అవ‌కాశాలను ఇస్తుంది. వాటిని గుర్తించ‌గ‌లిగిన వాడు ఉన్న‌త స్థానంలో ఉంటాడు. గుర్తించ‌లేని వాడు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా కింది స్థాయిలోనే ఉండిపోతాడు.

 

 

నీ కెరీర్ ను నువ్వే నిల‌బెట్టుకోవాలి!

 

నిజానికి భూమి మీద సంభ‌వించే ప్ర‌తీ ఘ‌ట‌న‌కు ఒక కార‌ణం ఉంటుంది. నువ్వు కూడా ఈ భూమి మీద‌కు ఏదో ఒక‌టి సాధించ‌డానికే వ‌చ్చావు. ఇక్కడ ఉంటే కొద్ది కాలంలో దాన్ని సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. సాకులు చెప్పుకుంటూ స‌మ‌ర్ధింపులు చేసుకుంటూ కాలం గ‌డిపేస్తే సాధించేందుకు ఏమీ మిగ‌ల‌దు. అవ‌కాశాలు మ‌న త‌లుపు త‌డుతున్న‌ప్పుడు గుర్తించాలి. వాటిని రెండు చేతుల‌తో అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోలేన‌ప్పుడు నిన్న కాపాడ‌టం ఎవ‌రి త‌ర‌మూ కాదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూనే నీకు ఏ ప‌నిపై ఆస‌క్తి ఉందో.. ఏ ప‌ని చేస్తే నువ్వు ఉన్న‌తంగా ఎదుగుతాను అనుకుంటున్నావో దాన్ని గుర్తించ‌డం చాలా ముఖ్యం. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మీ కెరీర్ పై మీకు స్ప‌ష్ట‌త ఉండాలి. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకుంటూ ప‌క్క వాళ్ల‌తో పోలిక‌లు పెట్టుకోకుండా , స్పూర్తిగా మాత్ర‌మే తీసుకుంటే మీ కెరీర్ వెలిగిపోతుంది.

 

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

‘అజ్ఞాతవాసి’ వీరుడా లేక శూరుడా??

 

ఒక వ్య‌క్తి సామ‌ర్ధ్యాన్ని, అతను సాధించిన‌ విజ‌యాల‌ను చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు అత‌న్ని విజేత‌గా, వీరుడిగా కీర్తిస్తూ ఉంటాం. వీరుడు అంటే ల‌క్ష‌ల్లో ఒక‌డు. ఎన్నో ఆటుపోట్ల‌ను, క‌ష్టన‌ష్టాల‌ను భ‌రిస్తే గానీ వీరుడు కావ‌డం కుద‌ర‌దు. అయితే వీరునిగా మారితే తుది ల‌క్ష్యం చేరుకున్న‌ట్టేనా? అస‌లు వీరులే ప్ర‌పంచ విజేత‌లా? వీరులను త‌ల‌దన్నే వారు, వీరుల‌కంటే గొప్ప‌వాళ్లు లేరా? మ‌నం మ‌న ఇతిహాసాల్లో ఒక వ్య‌క్తిని కీర్తించేట‌ప్పుడు వీర‌, శూర అన్న మాట‌లు వింటూ ఉంటాం. వీరత్వం ఓకే మ‌రి శూరత్వం ఏంటి? అస‌లు వీరత్వంతో పాటు శూరత్వం కూడా ఒక ప్ర‌త్యేక ల‌క్ష‌ణ‌మా ? అని అంటే క‌చ్చితంగా అవున‌నే చెప్పాలి. అత్యుత్త‌మ ప‌నితీరును క‌న‌బ‌ర్చ‌డంలో వీరత్వం అనేది తుది గ‌మ్యం కాదు.వీర‌త్వం తో పాటు శూర‌త్వం కూడా ఉన్న‌ప్పుడే ఒక మ‌నిషికి పూర్తి మార్కులు వేయ‌వచ్చు. సాధించిన దానితో సంతృప్తి ప‌డిపోయినా లేక ఎత్తుకు పై ఎత్తులు వేసే సామ‌ర్ధ్యం లేక‌పోయినా అత‌ను వీరునిగానే మిగిలిపోతాడు. ముఖాముఖి త‌ల‌పడిన‌ప్పుడు వీరుడు ఎంతటి బ‌ల‌వంతుడైనా శూరుడ్ని మాత్రమే విజ‌యం వ‌రిస్తుంది.

 

 

శూరులే విశ్వ‌విజేత‌లు!

 

వీరత్వం అనేది ఒక వ్యక్తి సామర్ధ్యానికి నిదర్శనం అయితే శూరత్వం అనేది అతనికున్న ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు ఇద్దరు అత్యుత్తమ సామర్ధ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు టెన్నిస్ ఆడుతున్నారు అనుకుందాం. అంటే ఇద్దరు వీరులు పోటీలో తలపడుతున్నారు. ఇక్కడ విజయం ఎవర్ని వరిస్తుంది.? వీరుడికి ఉండాల్సిన లక్షణాలతో పాటు అదనంగా ప్రత్యేకత ఉన్న శూరుడే ఇక్కడ విజయం సాధిస్తాడు. ఎందుకంటే అతను తన సామర్ధ్యం, నైపుణ‌్యంతో పాటు అవసరమైన సందర్భంలో తన విచక్షణను ఉపయోగించి ఎత్తుకు పై ఎత్తు వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. బంతిని బలంగా కొట్టే సత్తాతో పాటు ఎక్కడ కొడితే ప్రత్యర్ధి నిలవరించొచ్చు? ప్రత్యర్థి బలహీనతలు ఏంటి? ఇవన్నీ అతను చదివేస్తాడు. కేవలం బంతిని బలంగా కొట్టే నేర్పు ఉన్నప్పుడు వీరుడిగానే మిగిలిపోతారు. బంతిని బలంగా కొట్టే నేర్పుతో పాటు ప్రత్యర్ధిని మానసికంగా చదివేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని తన ప్రణాళికలు అమలు చేసే వాడే శూరుడు. ప్రపంచాన్ని జయించిన విజేతలు, రాజ్యాలు విస్తరించిన మహావీరులను నిశితంగా గమనిస్తే వారిలో యుద్ధనైపుణ‌్యం ఉన్న వీరులే కాదు సరైన సమయానికి సరైన ప్రణాళికలు వేసే శూరులు కనిపిస్తారు.

 

 

వీరత్వం అన్నిచోట్లా మనుగడ సాగించలేదు!

 

మనం క్రీడల్లో ఒక అథ్లెటిక్స్ నో లేక వెయిట్ లిఫ్టింగ్ వంటి గేమ్స్ ను తీసుకున్నప్పుడు అక్కడ వ్యక్తిగత ప్రతిభ అన్నది మాత్రమే కనిపిస్తుంది. తన సత్తా తాను ప్రదర్శించి తన బలాన్ని తాను ప్రదర్శించి విజయం సాధిస్తారు. కానీ అవతలి వారితో ముఖాముఖీ తలపడినప్పుడు ఒక వ్యక్తి సామర్ధ్యానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. వీరుడు తన తన ప్రతిభను ప్రదర్శించి లక్షల్లో ఒకడిగా నిలిచినా శూరత్వాన్ని అభివృద్ధి చేసుకోకపోతే వీరుడిగానే మిగిలిపోతాడు. వ్యక్తిగత జీవితంలో అయినా వృత్తిగత జీవితంలో అయినా వీరుని స్థాయికి చేరుకోవడం ఒక ఘనతే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అదే స్థాయిలో ఉండిపోకుండా వీరుడు అనే వాడు శూరుడిగా మారేందుకు ప్రయత్నం చేయాలి. కేవలం తన సామర్ధ్యాన్ని మాత్రమే నమ్ముకోకుండా సమస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం, అవతలి వారి కన్నా ఆలోచనలో ఒక మెట్టు ముందు ఉండేందుకు ప్రయత్నించడం ఇవన్నీ ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వాడిగా మారుస్తాయి. ఆ ప్రత్యేకమైన వాడే శూరుడు. వీరుడు కేవలం తన సంక్షేమం దగ్గర ఆగిపోతే శూరుడు తన సంక్షేమంతో పాటు ఒక సమూహానికి స్పూర్తిగా నిలుస్తాడు. ఒక బృందాన్ని విజయవంతంగా నడిపిస్తాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. తన సత్తాకు పరీక్ష ఎదురైనప్పుడు దాన్ని ఆలోచనతో అధిగమిస్తాడు.

 

 

పవన్‌ కళ్యాణ్ వీరుడు మాత్రమే!!

 

మనం జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఒక ఉదాహరణగా తీసుకుంటే మనకు వీరత్వం , శూరత్వంపై మరింత స్పష్టత వస్తుంది. కోట్లాది మంది అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో వీరుడు. తన సామర్ధ్యంతో, తనకు ఉన్న క్రేజ్ తో పాలిటిక్స్ లో సంచలనం రేపుతున్నాడు. అయితే శూరత్వం అనే లక్షణాన్ని సాధించుకున్నప్పుడే అతను అభిమానులు ఆశిస్తున్న సీఎం పీఠం అధిష్టించగలడు. అతనికి కేవలం బలం మాత్రమే ఉంది. వ్యూహం లేదు. తెలివిగా ఎత్తులు వేసే చాతుర్యం లేదు. ప్రత్యర్ధులకు అందకుండా వారి బలహీనతల ఆధారంగా లబ్ది పొందే ఒడుపు లేదు. ఇవన్నీ సంపాదించినప్పుడే పవన్ కళ్యాణ్ వీరుడితో పాటు శూరుడు కూడా అవుతాడు. వీరుడికి వ్యూహం లేనప్పుడు అతన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు శూరులు. వీరులను వాడుకుంటూ మహాసామ్రాజ్యాన్ని నిర్మించడం శూరుల లక్షణం. కాబట్టి శూరుడిగా ఎదగాలనుకుంటున్న ఒక వీరుడు ..మరో శూరుని వలలో పడకుండా తన సొంత తెలివితేటలను సమకూర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన పని ఇదే. తను వీరుడిగానే ఉండిపోయి మిగిలిన శూరులకు ప్రయోజనం కలిగించాలా? లేక తానే శూరుడిగా మారాలా? అన్న దానిపై స్పష్టత తెచ్చుకోవాలి.

 

 

శూరత్వమే శిఖరంపైకి చేర్చుతుంది!

 

గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీరూభాయ్ అంబానీనే తీసుకొండి. అతను ఒక మామూలు వ్యక్తి. కానీ అతనికి దార్శనికత అనే ఒక గొప్ప వీరత్వం ఉంది. దాన్ని మరింత పదును పెట్టుకుని సమయానుకూల నిర్ణయాలు తీసుకుని శూరుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎందరో వీరులను ముందుండి నడిపించి ఒక పెద్ద వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు. అతనికన్నా ఎంతో సామర్ధ్యం , సత్తా ఉన్న వీరులు కేవలం అతనికి సహకరించడానికి మాత్రమే పరిమితం అయిపోయారు. వీరులను గుర్తించి వారిని తనకు అనుకూలంగా వాడుకుని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించే వాడే శూరుడు. అసలు వీరత్వం అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇందులో సందేహం లేదు. అయితే దానితోనే సంతృప్తి పడిపోకుండా శూరునిగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి. నాయకత్వ లక్షణాలు పెంపోదించుకోవడం, పరిస్థితులకు తగ్గట్టు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుత సాధిస్తే మరింత ఉన్నత స్థితి సాధ్యమవుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్..దేన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుసా??

 

ప్రస్తుతం విద్యార్ధులు ఫేస్‌బుక్ పై అధిక సయమం వెచ్చిస్తున్నారు. ఫోటోలు షేర్ చేయడానికి, ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, ఇష్టమైన విషయాలను షేర్ చేయడానికి ఫేస్‌బుక్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం రోజులో మన దేశంలో విద్యార్ధులు దాదాపు 5 నుంచి 6 గంటలు ఫేస్‌బుక్ లోనే గడుపుతున్నారని తేలింది. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన ఆ విలువైన సమయాన్ని ఫేస్‌బుక్ చూస్తూ వృధా చేయడం ఆందోళన రేపుతోంది. ఏ మాధ్యమాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఎంత సమయం కేటాయించాలన్న దానిపై సరైన అవగాహన లేకపోవడం ఇప్పుడు సమస్యకు మూలకారణంగా కనిపిస్తోంది. ఫేస్‌బుక్ లో తమ ప్రొఫైల్ కు సంబంధించి ఒక పేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి పరిమితం కావాల్సింది పోయి చాటింగ్ లకు వీడియోలు చూస్తూ విద్యార్ధులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏయే నైపుణ్యాలను పెంచుకోవాలో అన్న దానిపై సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

 

 

నైపుణ్యాలు అనే మాటనే మర్చిపోతున్నారు!

 

తాజాగా వీబాక్స్ ఇండియా అనే సంస్థ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2018 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల విద్యాసంస్థలు, ఏఐసీటీసీ వంటి వివిధ విద్యా సంబంధిత సంస్థల సహకారంతో ఈ నివేదిక విడుదలైంది. అయితే ఉద్యోగానికి నైపుణ్యాలే కీలకమైన ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది విద్యార్ధులకు సరైన నైపుణ్యాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు నెట్‌వర్కింగ్ ను పెంచుకునేందుకు విద్యార్ధులు సిద్ధంగా లేరు. మరోవైపు రెజ్యుమె తో పాటు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉండడం కూడా ముఖ‌్యమే. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉంటున్నారు కానీ అది పోసుకోలు కబుర్లు చెప్పుకునేందుకు యూట్యూబ్ సినిమాలు, వీడియోలు చూసేందుకు మాత్రమే విద్యార్ధులు ప్రాధాన్యతనిస్తున్నారు. జాబ్ మార్కెట్ ఆన్‌లైన్ మోడ్ లోకి మారిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ఉపయోగం. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకోవడం విఫలమవుతున్నట్టు తెలుస్తోంది.

 

 

నైపుణ్యాల సాధనలో ఇవే కీలకం!

 

ఒక విద్యార్ధికి థియరీ నాలెడ్జ్ అనేది ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ పట్టు కూడా అంతే ముఖ‌్యం. కానీ చాలా మంది విద్యార్ధులు ఇదే కరవవుతోంది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేస్తే విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్ధులు మాత్రం ఇంటర్న్‌షిప్ అంటే చాలా ముఖం తిప్పుకుంటున్నారు. ఇక ఇంటర్న్‌షిప్ ను ఎంచుకుంటున్న కొద్ది మంది కూడా దాన్ని ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇక నెట్‌వర్కింగ్ లో చాలా మంది విద్యార్ధులు వెనుకబడి ఉన్నారు. అసలు నెట్‌వర్క్ లేకుండా కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం అసంభవం. ఈ విషయాన్ని విద్యార్ధులు అసలు గుర్తించడం లేదు. వివిధ సందర్భాల్లో , వేదికల్లో ఏర్పడిన పరిచయాలను సుధీర్ఘ కాలం పాటు కొనసాగించాలి. ఉద్యోగ సాధనలో నెట్‌వర్కింగే కీలకం. అయితే పరిచయాలను కొనసాగించడంలో 85 శాతం మంది విఫలమవుతున్నట్టు సర్వేలు చెపుతున్నారు. ఇక రెజ్యుమెను సరైన రీతిలో తయారు చేసుకోవడం కూడా చాలా మంది విద్యార్దులుకు తెలియడం లేదు. అసలు రెజ్యుమె తయారీలో కీవర్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రకటనకు అనుగుణంగా రెజ్యుమెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హలతో పాటు నాయకత్వ ప్రతిభను ప్రతిబింబించే ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ను కూడా అందులో ప్రస్తావించాలి.

 

 

దేన్ని ఎంతవరకు ఎలా వాడాలో తెలియాలి!

 

మన దేశంలో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బాగా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ డిజిటల్ విప్లవాన్ని అందుకుని విద్యార్ధులు ఉద్యోగ సాధనలో దూసుకుపోవాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉంటున్నారు. కానీ ఆన్‌లైన్ ను ఉద్యోగాన్ని సాధించేందుకు కాకుండా వీడియోలు చూసేందుకు సోషల్ మీడియాలో టైం పాస్ కబుర్లు చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్నారు.మన విద్యార్ధుల్లో 92 శాతం మంది ఫేస్‌బుక్ , 62 శాతం మంది యూట్యూబ్ లలో అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జాబ్ ను తెచ్చిపెట్టే ప్రొఫెషనల్ ఆన్‌లైన్ సోర్స్ లింక్డ్ ఇన్ ను కేవలం 26 శాతం మంది మాత్రమే చూస్తున్నారు. అందులో సరైన ప్రోఫైల్ ను పెట్టేందుకు కూడా చాలా మంది విద్యార్ధులకు తీరిక ఉండటం లేదు. అసలు దేనికి ప్రాధాన్యతనివ్వాలి? దేన్ని ఎంత సమయం చూడాలి? దేన్ని ఏ విధంగా వాడుకోవాలి? అన్న దానిపై అధిక శాతం మంది విద్యార్ధులకు అసలు అవగాహనే కొరవడుతోంది.

 

 

వేదికలను వాడుకోవడం తెలియాల్సిందే!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. ఇంటర్వ్యూలు, అభ్యర్ధుల ఎంపిక అనేది గతంలో జరిగిన విధంగా లేదు. ఇప్పుడు కంపెనీలు ఆన్‌లైన్ ప్రొఫెల్స్ ద్వారా తమకు కావాల్సిన అభ్యర్ధులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. అందుకే విద్యార్ధులు అర్హతలు, నైపుణ్యాలు ఆన్‌లైన్ రిక్రూటర్స్ కు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రిక్రూటర్స్ అభ్యర్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ , సోషల్ మీడియాలో వాళ్ల గుర్తింపును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫేస్‌బుక్ పేజ్ లో ఇతర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ యాక్టివ్ గా ఉండాలి. అలా అని వాటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా లింక్‌ఇన్ వంటి మాధ్యమాల్లో ప్రోఫైల్ ను అప్‌డేట్ గా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ ను సమర్ధవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అభ్యర్ధులు ప్రస్తుత మార్కెట్లో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు సమర్పించినవారు)

 

 

బెస్ట్ ప‌ర్స‌న్ Vs రైట్ ప‌ర్స‌న్!!

ఏదైనా ఒక వ్య‌వస్థ కానీయండి..సంస్థ కానీయండి..అది అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించాలంటే స‌మ‌ర్ధులైన వ్య‌క్తులు కావాల్సిందే. లేకుంటే ఆ సంస్థ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డుతుంది. ఒక వ్య‌వ‌స్థ‌ను నిర్మించాలంటే నిర్మించాలంటే దాన్ని విజ‌య‌వంతంగా న‌డిపించాలంటే ముందుగా స‌మ‌ర్ధుల‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మే చాలా కీల‌క‌మైన విష‌యం. అయితే స‌రిగ్గా ఇక్క‌డే ఒక ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. అదేంటంటే రైట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోవాలా? లేక బెస్ట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోవాలా? మాన‌వ వ‌న‌రులు ఎంపికలో ఇది చాలా కీల‌క‌మైన విష‌యం. ఈ విష‌యంలో తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే సంస్థ భ‌విష్య‌త్ ఆధారప‌డి ఉంటుంది. స‌మ‌ర్ధుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ‘కెరీర్ టై్మ్స్’ ప్ర‌త్యేక క‌థ‌నం.

 

స‌క్సెస్ కు స‌ర్కిల్ కు సంబంధం ఉంది!

 

ఒక ప్ర‌ముఖ ర‌చ‌యిత చెప్పిన‌ట్టు నువ్వు ఇప్ప‌టికీ స‌క్సెస్ సాధించలేక‌పోతున్నావు అంటే ఒక్క‌సారి నీ చుట్టూ ఉన్న స‌ర్కిల్ ను ఒక్క‌సారి స‌రిచూసుకోవాల్సిందే. మ‌న చుట్టూ ఉన్న స‌ర్కిల్ మాత్ర‌మే మ‌న సక్సెస్ ను డిసైడ్ చేస్తుంది. విజ‌యం మిమ్మ‌ల్ని వ‌రించ‌డం లేదు అంటే క‌చ్చితంగా స‌ర్కిల్ ను మార్చాల్సిందే. స‌ర్కిల్ అంటే వేరే ఏమీ కాదు. నీ చుట్టూ రైట్ పీపుల్ ఉండేలా చూసుకోవ‌డ‌మే. స‌ర్కిల్ అంటే స్నేహితులు, స‌న్నిహితులే కాదు మీ కింద ప‌నిచేసే ఉద్యోగులు కూడా రైట్ ప‌ర్స‌న్ అయి ఉండాలి. రైట్ ప‌ర్స‌న్ నీ ప‌క్క‌న ఉన్న‌ప్పుడు ఆల‌స్య‌మైనా నీకు విజ‌యం వ‌చ్చి తీరుతుంది. నిరంత‌రం నీ ఉన్న‌తిని కోరుకుని అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిన్ను హెచ్చ‌రించే రైట్ ప‌ర్స‌న్ వ‌ల‌న వ్య‌క్తికి వ్య‌వ‌స్థ‌కు మేలు జ‌రుగుతుంది.

 

బెస్ట్ ప‌ర్స‌న్స్ కు రైట్ ప‌ర్స‌న్స్ తేడా ఏంటి?

 

మనం ముందుగా చెప్పుకున్న‌ట్టు మానవ వ‌న‌రులు ఎంపిక‌లో ఇది ఎప్ప‌టికీ చాలా క్లిష్ట‌మైన ప్ర‌శ్నే. బెస్ట్ ప‌ర్స‌న్ అంటే పూర్తి స్థాయిలో నైపుణ్యం క‌లిగి ఉండి ఏ ప‌నిని ఎప్పుడు చేయాలో క‌చ్చితంగా తెలిసిన వాడే బెస్ట్ ప‌ర్స‌న్. అయితే బెస్ట్ ప‌ర్స‌న్ క‌దా మన ఛాయిస్ కావాల్సింది? ఇక రైట్ ప‌ర్స‌న్ అవ‌స‌రం ఏముంది? అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌వ‌చ్చు. కానీ దీర్ఘ‌కాలానికి రైట్ ప‌ర్స‌న్ మాత్ర‌మే సంస్థ‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లుగుతాడు. ఎందుకంటే బెస్ట్ ప‌ర్స‌న్ ఎప్పుడూ ఒక సంస్థలో, ఒకే ప‌నిని విశ్వాసంగా చేసేందుకు సిద్థంగా ఉండ‌డు. వివ‌రంగా చెప్పాలంటే బెస్ట్ ప‌ర్స‌న్స్ కు స్థిర‌త్వం ఉండ‌దు. అది వాళ్ల‌కు అనివార్య‌త కూడా కావ‌చ్చు. అదే రైట్ ప‌ర్సన్స్ కు అంత నైపుణ్యం ఉండ‌క‌పోవచ్చు. కానీ న‌మ్మి ప‌నిని అప్ప‌గిస్తే క‌ష్ట‌ప‌డి దాన్ని సాధించేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాడు.

 

రైట్ ప‌ర్స‌న్ ను గుర్తించ‌డ‌మే విజ‌యం!

 

బెస్ట్ ప‌ర్స‌న్ ఎవరికైనా హైరింగ్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. కానీ రైట్ ప‌ర్స‌న్ హైరింగ్ ద్వారా దొరికేందుకు వీలు లేదు. రైట్ ప‌ర్స‌న్ అనేవాడు వ్య‌క్తిగ‌త సంబంధాల ద్వారా మాత్ర‌మే మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తాడు. స‌రైన రైట్ ప‌ర్స‌న్ ను గుర్తించి అత‌న్ని స‌రైన ప్లేస్ లో డిప్యూట్ చేయ‌గ‌లిగితే సంస్థ‌కు తిరుగుండ‌దు. స్వాతంత్రోద్య‌మ కాలంలోనూ గాంధీజీ ఇదే ర‌క‌మైన విధానాన్ని అవ‌లంభించి స్వాత్రంత్రాన్ని సాధించ‌గ‌లిగాడు. కీల‌క‌మైన స్థానాల్లో రైట్ ప‌ర్స‌న్స్ కు నియ‌మించి వారి కింద బెస్ట్ ప‌ర్స‌న్ ను నియ‌మించ‌డం వ‌ల‌న అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇదే సూత్రాన్ని వ్యాపారంలో కూడా అవ‌లంభిస్తే అవే విజ‌య‌వంత‌మైన ఫ‌లితాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

 

స్థిరంగా ఉన్న‌దానికి బ‌ల‌మెక్కువ‌!

 

రైట్ ప‌ర్స‌న్ ఎంపిక చేసుకోవ‌డం అనేది ఒక్క వ్యాపార సంస్థ‌ల‌కే కాదు, వ్య‌వ‌స్థ‌ల‌కు, కుటుంటాల‌కు కూడా అది చాలా కీల‌కమైన విష‌యం. ఒక రైట్ ప‌ర్స‌న్ ఉన్న‌ప్పుడు ఆ కుటుంబం, ఆ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా సాగిపోతాయి. ఎందుకంటే అక్క‌డ స్థిర‌త్వం ఉంటుంది. ఏదైనా స్థిరంగా ఉన్న‌దానికి ఉన్న విలువ ప‌రుగులు తీసే దానికి ఎప్ప‌టికీ ఉండ‌దు. మాన‌వ వ‌న‌రులు ఎంపిక‌కు ఈ సూత్రాన్ని అన్వ‌యించుకుని రైట్ ప‌ర్స‌న్ ను ఎంపిక చేసుకోగ‌లిగితే అది సంస్థ విజయానికి దోహ‌ద‌ప‌డుతుంది.