ప్రధాని సెక్యూరిటీ గార్డ్ మీ కెరీర్‌ నూ కాపాడగలడు!!

 

 

శ్ర‌ద్ధ‌, నిబ‌ద్ద‌తతో పనిచేసే వాళ్లను మ‌నం నిశితంగా గ‌మ‌నిస్తే మ‌న‌కు కొన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. వాళ్లు తాము చేప‌ట్టిన ప‌నిని త‌దేక దృష్టితో ఎటువంటి పొర‌పాటు లేకుండా విజ‌యవంతంగా పూర్తి చేస్తారు. ఎన్ని ప్ర‌లోభాలు ఉన్నా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ దృష్టిని ప‌నిపైనే నిలుపుతారు. ఇటువంటి వ్యక్తుల‌ను ఆద‌ర్శంగా తీసుకుంటే మ‌నం కూడా కెరీర్ లో విజ‌యవంత‌మైన వ్య‌క్తులుగా ఎద‌గొచ్చు. అప్ప‌గించిన ప‌నిని శ్ర‌ద్ధ‌తో చేసిన ఉద్యోగుల‌కు కంపెనీల హెచ్ఆర్ పాల‌సీల్లో ఆకర్ష‌ణీయ‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ అధికారులను ఒకసారి ఆపాద‌మ‌స్త‌కం ప‌రిశీలిస్తే వాళ్లు త‌మ ప‌నిపై త‌ప్ప మిగ‌తా విష‌యాల‌పై ఎంత అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఉద్యోగులు కూడా కంపెనీలోని ఇత‌ర విష‌యాల‌పై దృష్టిని మ‌రల్చ‌కుండా చేస్తున్న ప‌నిపై మాత్ర‌మే ఫోక‌స్ చేస్తే బెస్ట్ ఎంప్లాయ్ గా గుర్తింపును పొంద‌వ‌చ్చు.

 

 

 

ల‌క్ష్యం మాత్ర‌మే గుర్తుండాలి..ఆక‌ర్ష‌ణ‌లు కాదు!

 

మీరు ఎప్పుడైనా పీఎం, సీఎం, రాష్ట్రప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ వ్య‌క్తుల‌ను గ‌మ‌నించారా? తాము ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన నాయ‌కులు ఎటువంటి కార్య‌క్ర‌మంలో ఉన్నా స‌రే ఆ భ‌ద్ర‌తాధికారులు మాత్రం తాము ఇవ్వాల్సిన ర‌క్ష‌ణ‌పైనే దృష్టి పెడ‌తారు. ప్ర‌ముఖులు పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో ఎన్నో వెలుగు జిలుగులు, ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వారు మాత్రం చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ తాము భ‌ద్ర‌త ఇవ్వాల్సిన వ్య‌క్తుల‌కు ఎటువంటి అపాయం క‌లుగుకుండా కాపాడుతూ ఉంటారు. చుట్టూ ఉన్న అంద‌రూ ఆ కార్య‌క్ర‌మాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటే వారు మాత్రం ఒక్క క్ష‌ణం కూడా ప‌క్కకు చూపు తిప్ప‌కుండా పూర్తి అప్ర‌మ‌త్త‌త‌తో ఉంటారు. వారిని దృష్టిని ఏ ఆక‌ర్ష‌ణ కూడా చెడ‌గొట్ట‌లేదు. ఇది చాలా సామాన్య‌మైన విష‌య‌మే అయినా సెక్యూరిటీ ఆఫీస‌ర్లు ప్ర‌ద‌ర్శించే ఆ ఫోక‌స్ ను ప్ర‌తీ ఒక్క‌రూ గ్ర‌హించ‌గ‌లిగితే జీవితంలో ఊహించని అభివృద్ధిని సాధించ‌వ‌చ్చు. అయితే వారి వారి కెరీర్ ల‌కు అన్వ‌యించుకున్న‌ప్పుడు దాన్ని స‌రైన రీతిలో ఆపాదించుకున్న‌ప్పుడు అద్భుతాలు ఆవిష్కృత‌మ‌వుతాయి.

 

 

త‌న కోస‌మే రెడ్ కార్పెట్ వేసార‌నుకోవ‌డం గుర్రం త‌ప్పు!!

 

ఒక ప్ర‌ధాన మంత్రి ఎటువంటి అద్భుత‌మైన కార్య‌క్ర‌మానికి వెళ్లినా అక్క‌డ‌కు సెక్యూరిటీ ఆఫీస‌ర్ కూడా వెళ్తాడు. పెద్ద పెద్ద దేశాధినేత‌లు, గొప్ప గొప్ప వ్య‌క్తులు చుట్టూ ఉంటారు. అంత మాత్రం చేత‌న తన‌ను తాను గొప్ప‌వాడుగా ఊహించుకుని గ‌ర్వ‌ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది. త‌న ప‌ని కేవ‌లం ప్ర‌ధానికి ఎటువంటి హానీ జ‌ర‌గుకుండా అత్యుత్త‌మ ర‌క్ష‌ణను అందించ‌డం అంతే. మిగ‌తా విష‌యాలు, సంఘ‌ట‌న‌లు ఏమీ అత‌న్ని ఆక‌ర్షించ‌కూడ‌దు? అలా కాకుండా తాను ప్ర‌ధాని సెక్యూరిటీని నేను చాలా గొప్ప‌వాడ్ని అనే ఆలోచ‌నా ధోర‌ణిలోకి వెళితే మొద‌టికే మోసం వ‌స్తుంది. పూర్వం కాలంలో రాజుపై గుర్రంపై ఊరుగుతుంటే కింద రెడ్ కార్పెట్ వేసి పూలు జ‌ల్లి స్వాగ‌తం ప‌లికేవారు. ఇదంతా కేవ‌లం రాజుగారి కోసం మాత్ర‌మే జ‌రుగుతుంది. అలా కాకుండా గుర్రం ఈ రెడ్ కార్పెట్, ఈ పూలు ఇవన్నీ త‌న కోస‌మే అనుకుంటే అది గుర్రం అజ్ఞానం అవుతుంది. రాజుగారు మీద కూర్చున్నంత వ‌ర‌కూ మాత్ర‌మే గుర్రానికి విలువ‌. త‌ర్వాత అది కూడా మిగ‌తా గుర్రాల్లానే ఒక మామూలు గుర్రం అంతే.

 

 

కంపెనీ ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే గుర్తుండాలి!

 

కంపెనీ త‌న ఉద్యోగుల‌ను ఏదైనా సెమినార్ కు పంపి అక్క‌డ బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేయ‌మ‌ని చెప్పిన‌ప్పుడు ఉద్యోగి కేవ‌లం కంపెనీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆలోచించాలి. అనుక్ష‌ణం త‌న జాబ్ పై దృష్టి సారించి కంపెనీ త‌న‌కిచ్చిన టార్గెట్ ను రీచ్ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. అలా కాకుండా అక్కడ ఉండే మిగ‌తా విష‌యాల‌పై దృష్టి సారిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ముఖ్యంగా కంపెనీని ప్ర‌మోట్ చేయ‌డానికి కంపెనీ విధివిధానాల‌ను ప్ర‌చారం చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు కేవ‌లం కంపెనీ ప్ర‌తినిధులుగానే వ్య‌వ‌హ‌రించాలి . కానీ సెమినార్ లో పాల్గొనే సాధార‌ణ ప్ర‌తినిధుల్లా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. సాధార‌ణ ప్ర‌తినిధుల్లా ప్ర‌వ‌ర్తించ‌డం అంటే కంపెనీకి న‌ష్టం చేకూరుస్తున్న‌ట్టు. ఈ విష‌యాన్ని ఉద్యోగులు బాగా గుర్తుంచుకోవాలి. అక్క‌డ కేవ‌లం త‌మ ఫోక‌స్ అంతా కంపెనీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లం..ఈ వేదిక‌ను ఎంత బాగా వాడుకోగ‌లం..అన్న విష‌యాల‌పైనే ఉండాలి. ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ ఆఫీస‌ర్ ఎంత ఫోక‌స్ తో ఉంటాడో అంతే ఫోక‌స్ గా ఉద్యోగి కూడా ఉండాలి. త‌ను నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో చుట్టూ ఉన్న ప్ర‌లోభాల‌ను, ఆక‌ర్ష‌ణ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌దు.

 

 

సంస్థ విశ్వాసాన్ని నిల‌బెట్టండి!

 

ఒక ఉద్యోగికి సంస్థ మాత్ర‌మే దైవం. త‌న‌కు సంస్థ కంటే ముఖ్య‌మైన‌ది ఇంకేది ఉండ‌కూడ‌దు. త‌ను విధుల్లో ఉన్న‌ప్పుడు కేవ‌లం సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే పాటుప‌డాలి. సంస్థ త‌న‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేయాలి. ఇక్క‌డే చాలా మంది ఇలా ఆలోచిస్తారు. సంస్థ కోసం ఇంత‌లా ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏదో పైపైన అలా చేసుకుంటూ వెళ్లిపోదాం అనుకుంటారు. ఇటువంటి ఆలోచ‌నా విధానం కెరీర్ ను తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. సంస్థ కోసం శ్ర‌మించిన‌ప్పుడు, దాన్ని త‌గిన విధంగా ప్ర‌చారం చేసుకున్న‌ప్పుడు క‌చ్చితంగా గుర్తింపు వ‌స్తుంది. మీ స‌మ‌ర్ధ‌త వెల్ల‌డైన‌ప్పుడు కంపెనీ మీపై ఎన‌లేని న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. కెరీర్ లో ఉన్న‌త‌స్థానాన్ని క‌ల్పిస్తుంది. క‌ష్ట‌ప‌డే వాళ్ల‌ను, ఫోక‌స్ తో ప‌నిచేసే వాళ్ల‌ను వ‌దులుకునేందుకు ఏం కంపెనీ సిద్ధంగా ఉండ‌దు. అప్ప‌గించిన ప‌నిని జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీలా పూర్తి ఫోక‌స్ తో పూర్తి చేయాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

 

పిల్లలను చదువుకు దూరం చేసే ఏ సిద్ధాంతమైనా పనికిమాలినదే!

 

ఒకప్పుడు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం అనేది అంతర్లీనంగా ఉండేది. కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమైనప్పటికీ చాలా మంది విద్యార్ధులు దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. అయితే విప్లవ సాహిత్యంతో తీవ్రంగా ప్రభావితమైన వారు, తాము నమ్మిన సిద్ధాంతమే పూర్తిగా సరైనది అనుకునేవాళ్లు, అన్యాయం జరిగిన వాళ్లు, ఒక వాదాన్ని పూర్తి స్థాయిలో అథ్యయనం చేయని వాళ్లు తీవ్రవాదులుగా మారేవారు. అయితే ఆ తర్వాత రాను రానూ బాగా చదువుకున్న వాళ్లు ఉన్నత విద్యా వంతులు కూడా సమాజంలో జరుగుతున్న దోపీడికి తీవ్రవాదులుగా మారి హింస ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దీని వలన మన దేశంలో మావోయిస్టు తీవ్రవాదులు బాగా పెరిగిపోయారు. వారి సిద్ధాంతాలను, భావజాలాలను విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ రాజ్యానికి, రాజ్య వ్యతిరేక శక్తులకు జరుగుతున్న పోరాటంలో అమాయకులు, చిన్నపిల్లలు బలైపోవడం అన్నది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనులు విమర్శలపాలవుతున్నాయి. చదువు లేకుండా ఒక మనిషి అభివృద్ధి సాధించడం అన్నది అసాధ్యం. ఆదివాసీల పిల్లలకు చదువు అందుకుండా స్కూళ్లను పేల్చేయడం వంటి చర్యల ద్వారా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు తామే తూట్లు పొడుచుకుంటున్నారు.

 

 

విద్య‌కు వ్య‌థ‌గా మారిన తీవ్ర‌వాదం!

 

తీవ్ర‌వాదంతో బాగా న‌ష్ట‌పోయిన దేశాల జాబితాలో మ‌న దేశం కూడా ఉంది. కశ్మీర్ తీవ్ర‌వాదులు మొదులుకుని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు, బోడో తీవ్ర‌వాదులు, మావోయిస్టులు ఇలా తీవ్రవాద సంస్థ‌ల జాబితా చాలానే ఉంది. ప్ర‌స్తుతం అందులో కొన్ని సంస్థ‌లు క‌నుమ‌రుగైనా ఇప్ప‌టికీ టెర్రరిజం బాధిత దేశాల్లో ఇండియా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదం మూలంగా ప్ర‌జ‌ల సామాజిక, భౌగోళిక‌, ఆర్థిక స్థితిగ‌తులు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా మంది పిల్ల‌లు విద్య‌కు దూర‌మై చివ‌ర‌కు తీవ్ర‌వాదులుగా మారుతున్న వైనం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డం వ‌ల‌న పిల్ల‌లు చెట్లు కింద చ‌దువుకునే దుస్థితి దాపురించింది. తీవ్ర‌వాదుల దాడుల భ‌యంతో కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా మూత‌బ‌డ్డాయి. దీంతో విద్యార్ధులు చ‌దువుకునే అవ‌కాశాన్ని కోల్పోతున్నారు. ఒక‌వైపు పేద‌రికం మ‌రోవైపు చ‌దువుకునే వెసులుబాటు లేక‌పోవ‌డంతో చాలా మంది టీనేజ్ పిల్ల‌లు నేర‌గాళ్లుగా మారి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తూ చివ‌రికి తీవ్రవాదంపై మొగ్గు చూపుతున్నారు.

 

 

పూర్తిగా ప‌డ‌కేసిన విద్య!

 

బీహార్ లోని మావోయిస్ట్ ప్ర‌భావిత జిల్లాల్లో ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంది. తీవ్రవాదులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డంతో పాటు టీచ‌ర్ల‌ను కూడా భ‌య‌పెట్ట‌డంతో చాలా మంది ఉపాధ్యాయులు సుధీర్ఘ సెల‌వులు పెట్టి విధుల‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. దీంతో పిల్ల‌లు స్కూల్ మొఖం చూడ‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొన్ని స్కూళ్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ మొత్తం అన్ని త‌రగతుల‌ను ఒకే రూమ్ లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఏం వింటున్నామో తెలియ‌క విద్యార్ధులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. 500 మందికి పైగా విద్యార్ధులు ఉన్న స్కూళ్లు కూడా ఇప్పుడు కేవ‌లం 100 మంది విద్యార్ధుల‌కే ప‌రిమిత‌మైపోయాయి. మ‌రోవైపు మావోయిస్టుల‌కు భ‌య‌పడి చాలా మంది టీచ‌ర్లు కూడా విధుల‌కు రావ‌డం మానుకున్నారు. దీంతో స‌రైన నిర్వ‌హ‌ణ లేక బీహార్, ఝార్ఖండ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా స్కూళ్లు మూత‌పడ్డాయి. మిగిలిన స్కూళ్లు కూడా ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు వ‌చ్చిన విద్యార్ధులు రాక భవంతులు లేక చెట్ల కింద కాలం వెళ్ల‌దీస్తున్నాయి.

 

 

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

 

ప్ర‌స్తుతం బీహార్, ఝార్ఖండ్, ఒడిషాల‌లో మావోయిస్టుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో పోలీసులు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా కాస్త విజ‌య‌వంత‌మ‌య్యారు. దీంతో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేసిన ఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. అయినా ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన ప్రాంతాల్లో మాత్రం ప‌రిస్థితి అలానే ఉంది. పేల్చేసిన స్కూల్ భ‌వ‌నాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. మావోయిస్టులతో ప్రాణ భ‌యం ఉంద‌ని చాలా మంది స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో చాలా స్కూళ్లు తాత్కాలిక శిబిరాల్లోనూ, చెట్ల కింద న‌డుస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక చ‌దువులు కాస్త వ‌ర్షాకాలం చ‌దువులుగా మారిపోయాయి. ఎండ కాసినా , వ‌ర్షం ప‌డినా స్కూళ్లను పూర్తిగా మూసివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో పిల్ల‌లు పూర్తి స్థాయిలో చ‌ద‌వ‌లేక చ‌దువుకోక ప్రాథ‌మిక స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీంతో దేశంలోనే ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ స్వాతంత్ర పూర్వం నాటి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పోలీసు రక్షణలో చాలా వరకూ స్కూళ్లు నడుస్తున్నాయి. అయితే పోలీసులే నిజమైన విలన్లని మావోయిస్టులు చెపుతున్నారు. అణిచివేత ద్వారా స్కూళ్లను తెరిపించినా పెద్దగా ఉపయోగం లేదన్నది వారి వాదన. అయితే రాజ్యం, సమసమాజ స్థాపన వంటి సిద్ధాంతాల వలన మధ్యలో పిల్లలు చదువులేకుండా నష్టపోతున్నారన్న ప్రశ్నకు మావోయిస్టుల దగ్గర సమాధానం లేదు.

 

 

ఆధిపత్య ధోరణులతో పిల్లలు నలిగిపోతున్నారు!

 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం అన్ని రకాల సంబంధాలకు దూరంగా ఉన్న మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి కమ్యూనికేషన్ లేని గ్రామాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు మావోయిస్టుల చెప్పిన మాటలకు, సాహిత్యానికి ప్రభావితమవుతున్నారు. అయితే హింసా మార్గం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపించినా అవి మనుగడ సాగించలేవని గతంలోనే తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంటుంది.తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, మారుమూల గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. అవి నత్తనడకన సాగడంతో ప్రజలు మావోయిస్టులే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. మరోవైపు తీవ్రవాదులకు, పోలీసులకు జరుగుతున్న పోరాటంలో చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు స్కూళ్లను పేల్చివేయడంతో వాళ్లు విద్యకు దూరమవుతున్నారు. తర్వాత క్రమంగా తీవ్రవాదులుగా మారుతున్నారు. ఈ పరిణామం అస్సలు సహేతుకం కాదు. అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే చర్యలు మాని వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఆ ప‌నులు చేయాల్సిందేనా?

ఒక దేశంలో పుట్టిన పౌరునికి ఆ దేశంపై క‌చ్చితంగా భ‌క్తి ఉండాలి. ఎందుకంటే అమ్మ జ‌న్మ‌నిస్తే పుట్టిన గ‌డ్డ జీవితాన్ని ఇస్తుంది. అమ్మ రుణం తీర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయోమో కానీ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకోవ‌డం అంత సులువు కాదు. అందుకే పుట్టిన గ‌డ్డకు జీవితాంతం రుణ ప‌డి ఉండాలి. దేశ సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వ‌చ్చినా సేవ చేసేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి. ఇటీవ‌లి కాలంలో ప్ర‌సార మాధ్య‌మాల్లో, సోష‌ల్ మీడియాలో దేశ‌భ‌క్తి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించ‌డం, సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ప్రేక్ష‌కులు నిల్చుని జాతీయ గీతాన్ని గౌర‌వించ‌డంపై ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేపారు. దేశ‌భ‌క్తి అనేది అంత‌ర్గ‌త విష‌య‌మా లేక బ‌ల‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌జేసేదా అన్న దానిపై మొదటి నుంచి రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం దేశ‌భ‌క్తి అనే దాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డం, ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అడ్డుపెట్టుకుని త‌మ లోపాల‌ను కప్పిపుచ్చుకోవాలని ప్ర‌య‌త్నించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. దేశ‌భ‌క్తి అంటే బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించే బాహ్య విష‌యం అస్స‌లు కాదు, అది నిజాయితీతో కూడిన అంత‌ర్గ‌త విష‌యం. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ కీల‌క విష‌యాన్ని గుర్తిస్తే వాస్త‌వానికి,భ్ర‌మ‌కు మ‌ధ్య ఉన్న స‌న్నని గీత ద‌ర్శ‌న‌మిస్తుంది.

 

 

దేశభ‌క్తికి ప్రామాణికం ఏంటి?

 

సినిమా హాళ్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శించే ముందు జాతీయ గీతం త‌ప్ప‌న‌స‌రిగా ఉండాల‌న్న నిబంధ‌న తెచ్చిన‌ప్పుడు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. జాతీయ గీతం కోసం నిమిషం పాటు నిల‌బ‌డి ఉండ‌లేమా అని కొంద‌రు. నిమిషం పాటు నిల‌బ‌డితే దేశంపై ప్రేమ ఉన్న‌ట్టా? అని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం సినిమా హాళ్ల‌లో జాతీయ గీతాన్ని త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అయిష్టంగా నిల‌బ‌డే వారు కొంద‌రైతే నిల‌బ‌డని వారిపై సాటి ప్రేక్ష‌కులు దాడి చేసిన ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకున్నాయి. ఒక సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇలా జ‌ఠిలం చేసి దేశ‌భ‌క్తికి ప్రామాణికాన్ని త‌యారు చేయాల‌ని అనుకోవ‌డం వివాదాల‌కు దారితీసింది. ఇక నోట్ల రద్దు స‌మయంలోనూ దేశ‌భ‌క్తి అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్ల ర‌ద్దుతో ఇబ్బందుల తలెత్తిన‌ప్పుడు దేశ‌భ‌క్తి ఉన్నవాళ్లు ఈ ఇబ్బందిని సంతోషంగా భ‌రించాల్సిందేనని ప్ర‌భుత్వ వ‌ర్గాలు మ‌రోసారి సున్నిత‌మైన విష‌యాన్ని వాడుకున్నారు. దేశ‌భక్తి ఉన్నావాళ్లు ఏటీఎం ల ముందు ఎన్ని గంట‌లైనా నిల్చుంటార‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఏటీఏం ల ముందు గంట‌ల కొద్దీ నిల్చోవ‌డానికి ,దేశ‌భ‌క్తికీ మ‌ధ్య సంబంధం ఏంటో చాలా మందికి ఇప్ప‌టికీ అర్ధం కాలేదు.

 

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి?

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం అంటే సినిమా థియేట‌ర్ లో జాతీయ గీతం రాగానే లేచి నిల‌బ‌డి త‌ర్వాత దేశం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించ‌డం కాదు. దేశ‌భ‌క్తి అంటే దేశం ప‌ట్ల బాధ్య‌త క‌లిగి ఉండ‌టం. మ‌న చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల ప‌ట్ల‌, మ‌నుష్యుల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఒక బాధ్య‌త‌ను క‌లిగి ఉండ‌టం నిజ‌మైన దేశభ‌క్తి. అనాధ‌లు, వ‌యోవృద్ధుల‌కు చేత‌నైన స‌హాయం చేయ‌డం వారు స‌మాజంలో ధైర్యంగా బ‌తికేందుకు అనువైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌డం కూడా దేశ‌భ‌క్తిలో ఒక భాగ‌మే. అంతే కానీ తీరిగ్గా సినిమా చూడ‌టానికి వెళ్లి నిమిషం పాటు మొక్కుబ‌డిగా న‌లుగురితో పాటు నిల్చుని నాకు దేశం ప‌ట్ల అప‌రిమిత‌మైన ప్రేమ‌, భ‌క్తి ఉన్నాయి అనుకుంటే అంత‌కంటే ఆత్మ‌వంచ‌న మ‌రొక‌టి ఉండ‌దు. మూడు గంట‌ల పాటు సినిమా చూసో లేక డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎం ముందు నిల్చునో నేనే ఏ దేశంలో అతిపెద్ద దేశ‌భ‌క్తి అనుకుంటే మన‌ల్ని ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు. అది మ‌న అజ్ఞానం మాత్ర‌మే కాక దేశ‌భ‌క్తి పేరు చెప్పి మ‌న‌ల్ని ఉచ్చులోకి లాగుతున్న రాజ‌కీయ నాయకుల వ‌ల‌లో మ‌నం ప‌డిన‌ట్టే.

 

నిజ‌మైన దేశ‌భ‌క్తులకు గౌర‌వం ద‌క్కుతోందా?

 

మ‌న దేశంలో నిజ‌మైన దేశ‌భ‌క్తులంటే స‌రిహ‌ద్దులో కాపలా కాసే సైనికులు, జ‌నాల‌కు తిండి పెట్టే రైతు, భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేసే ఉపాధ్యాయుడు. కానీ మ‌నం దేశంలో ఈ దేశ‌భ‌క్తుల‌కు ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్కుతుందా అంటే అవును అని ట‌క్కున స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి గానే మిగిలిపోతారు. ప్ర‌జ‌ల నుంచి రావాల్సినంత గుర్తింపు రాదు. పోనీ ప్ర‌భుత్వం వీరి సంక్షేమం కోసం ఏమైనా చ‌ర్య‌లు చేప‌డుతుందా అంటే అదీ లేదు. నిజ‌మైన దేశ‌భ‌క్తులకు మ‌న దేశంలో ద‌క్కే గౌర‌వం ఇలా ఉంటుంది. డ‌బ్బులు కోసం సినిమాల్లో యాక్ట్ చేస్తూ త‌మ‌ను తాము దైవాంశ‌సంభూతులుగా భావించుకునే సినీ స్టార్లు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వ్యాపార‌స్తులకే సోసైటీలో క్రేజ్. ప్ర‌భుత్వం కూడా ఇటువంటి వారిని కాపాడేందుకే అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంది.

 

త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేందుకు తెర‌పైకి దేశ‌భ‌క్తి కార్డు!

 

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని హ‌క్కుల‌తో పాటు కొన్ని బాధ్య‌తలు కూడా ఉంటాయి. అలాగే ప్ర‌భుత్వాలు కూడా త‌మ సొంత అజెండాతో కాకుండా దేశానికి, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాల‌ను తీసుకుని అందుకు అనుగుణంగా ప‌రిపాలించాల్సి ఉంటుంది. కానీ గ‌డిచిన కొన్ని రోజులుగా ప్ర‌భుత్వం తాము తీసుకున్న నిర్ణ‌యాలు విఫ‌లం కావ‌డంతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దేశ‌భ‌క్తి అనే కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. దేశ‌భ‌క్తి అనేది పౌరుల వ్య‌క్తిగ‌త విష‌యం. మీరు త‌ప్ప‌నిసరిగా దేశ‌భ‌క్తిని క‌లిగి ఉండాల‌ని ఆదేశించ‌డం అంటే అది నియంతృత్వం కింద‌కు వ‌స్తుంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అది విఫ‌లం కాగానే వాటిపై వ్య‌తిరేక‌త రాగానే అలా వ్య‌తిరేకించే వారిని దేశ‌ద్రోహులుగా ముద్ర వేయ‌డం స‌మంజ‌సం కాదు. అది ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్సర్ చేసినవారు)