ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లందుకుంటున్న‌ ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’

 

ప్రముఖ విద్యావేత్త‌, ట్యూట‌ర్స్ ప్రైడ్ అధినేత‌ డా. ఆర్.బి. అంకం గారు రాసిన ‘పిల్లల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కం ఇప్పుడు మార్కెట్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ఆధునిక యుగంలో అతిపెద్ద స‌వాలుగా మారిన పిల్ల‌ల పెంప‌కంపై డా. అంకం గారు చెప్పిన ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముక్కుసూటిగా చెప్పిన విష‌యాలు ప్రతీ త‌ల్లిదండ్రుల గుండెను తాకుతున్నాయి. సాంకేతిక విప్ల‌వం తెచ్చిన అభివృద్ధి మాన‌వాళి జీవితాల‌ను ఎంత‌గా స‌ర‌ళ‌త‌రం చేసిందో తెలీదు కానీ పిల్ల‌ల పెంప‌కాన్ని మాత్రం అతిపెద్ద స‌వాలుగా మార్చింది. ఇంట‌ర్నెట్ లో పిల్ల‌లు ఏం చూస్తున్నారో, సోష‌ల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారో తెలియ‌క తల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు. మ‌రోవైపు ఉమ్మడి కుటుంబాలు క‌నుమ‌రుగైన దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల్లో పిల్ల‌ల‌కు మ‌న సంస్కృతీ, సాంప్ర‌దాయాలు, విలువ‌లు నేర్పించే పెద్ద‌లు క‌రువైపోయారు. దీంతో ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌ గౌర‌వ మ‌ర్యాద‌లు తెలీక ప్ర‌తీ చిన్న విష‌యానికీ టెక్నాల‌జీపై ఆధార‌ప‌డుతున్న నేటి త‌రాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ పుస్త‌కంలో డా.ఆర్.బి. అంకం గారు స‌వివ‌రంగా పొందుప‌ర్చారు.

 

పుస్త‌కంలోని ప్ర‌తీ అక్ష‌రం త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన విష‌యం కావ‌డంతో విడుద‌లైన త‌క్కువ స‌మ‌యంలోనే అశేష పాఠ‌కాద‌ర‌ణ పొందింది. ఈ పుస్త‌కంలో శాస్త్రీయంగా, విపులంగా చ‌ర్చించిన విష‌యాలు న‌చ్చి మాజీ ఐపీఎస్ అధికారి జే.డీ. ల‌క్ష్మీనారాయ‌ణ గారు అలాగే భార‌తీయ సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న భార‌తీయం స‌త్య‌వాణి గారు ముందుమాట‌ను రాసారు. పుస్త‌కంలోని అద్భుత విష‌యం పాఠ‌కులంద‌రికీ చేరాల‌న్న ఉద్దేశంలో ప్ర‌ముఖ ప‌బ్లిషింగ్ సంస్థ ఎమెస్కో ఈ పుస్త‌కాన్ని ప్ర‌చురించింది. అలాగే తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది.

 

 

జాతీయ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న ప్ర‌ముఖ ర‌చయిత‌లు, సాహితీవేత్త‌లు, సాహిత్యాభిమానులు ‘పిల్ల‌ల పెంప‌కంలో 21 అద్భుత సూత్రాలు’ పుస్త‌కాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌శంసించారు. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ పుస్త‌కాన్ని , ర‌చ‌యిత డా. ఆర్.బి.అంకం గారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

 

వందేళ్ల చరిత్ర ఉన్న ఓ కాలేజీ..చదివే విద్యార్ధుల సంఖ్య 1..ఎందుకు?

 

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా మొదలయ్యాయి. రోడ్లపై ఎక్కడ చూసినా కనిపిస్తున్న హోర్డింగ్స్ చూస్తూ తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేసిందని చంకలు గుద్దుకుంటున్నాం. మనకు మనమే తెలుగు భాషాభిమానులుగా తెగ ఫీలైపోతున్నాం. ఇక ప్రభుత్వం హంగామా అయితే చెప్పనే అవసరం లేదు. ఈ హడావుడిలో ఓ దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇప్పుడు మరుగున పడిపోయింది. అదేదో మామూలు అషామాషీ వార్త కాదు. నిజమైన భాషాభిమానుల గుండెల్ని పిండేసే వార్త. అన్నింటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్ లో వచ్చింది ప్రపంచ తెలుగు మహా సభల్లో ప్రభుత్వాన్ని కీర్తించడంలో బిజీగా ఉన్న మన తెలుగు పత్రికలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ విచారకరమైన వార్త ఏంటంటే.. వందేళ్ల చరిత్ర కలిగిన ఓ ప్రముఖ కళాశాలలో తల్లి భాషను నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన విద్యార్ధుల సంఖ్య కేవలం ఒక్కటంటే ఒక్కటి. ఇతర భాషలో సరైన విధంగా భావవ్యక్తీకరణ చేయాలంటే సొంత భాషపై తల్లి భాషపై పట్టు ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని అందరూ విస్మరిస్తున్న వేళ తెలుగును బతికించుకోవాలంటే సమావేశాలు, సభలు మాత్రమే పెట్టుకుంటే సరిపోదు.

 

 

 

ఒక్కడే విద్యార్ధి, ఒక్కరే టీచర్!

 

1860 లో ప్రారంభించిన విజయనగరం మహారాజా కాలేజీకి మంచి గుర్తింపు ఉంది. మొదట్లో రాజులు ఈ కాలేజీని నిర్వహించినప్పటకీ స్వాతంత్ర వచ్చాక ప్రభుత్వ కళాశాలగా మారింది. ఇక్కడ సంస్కృత కళాశాలకు మంచి గుర్తింపు ఉంది. దేశంలో గొప్ప గొప్ప సంస్కృత, తెలుగు పండితులు ఇక్కడ విద్యాభ్యాసం చేసారు. ప్రస్తుతం ఈ కాలేజీలో సంస్కృతం, తెలుగు పాఠ్యాంశాలుగా ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ మాత్రమే కావాల్సి రావడంతో ఈ కోర్సు వైపు కన్నెత్తి చూసే నాథుడు కూడా లేడు. ప్రస్తుతం విద్యా సంవతర్సంలో ఈ కాలేజీలో సదరు కోర్సులో కేవలం ఒకే ఒక్క విద్యార్ధి చదువుతున్నాడు. దీంతో ఉన్న ఇద్దరు తెలుగు, సంస్కృతం పండితులను వేరే కాలేజీలకు బదిలీ చేసారు. మొత్తం కాలేజీకి ఒక్క స్టూడెంట్, ఒక ప్రిన్సిపల్, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఒక గొప్ప కాలేజీలో కేవలం ఒక విద్యార్ధి మాత్రమే ఉండటం తెలుగు తో పాటు ఇతర భాషలపై మనకున్న నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది.

 

 

తెలుగులో చదివితే పనికిరాని వాళ్లమైపోతామా?

 

మన శరీరంలో ఏదైనా ఒక అవయవం ఎక్కువగా పెరిగితే ఏమవుతుంది. దాన్ని అంగవైకల్యం అంటాం. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ అలాంటి అంగవైకల్యం తోనే బాధపడుతోంది. కేవలం ఇంగ్లీష్ పైన మాత్రమే దృష్టి సారిస్తూ మాతృభాషను సమాధి చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ అవసరమే. ఇది ఎవరూ కాదనరు. ఇంగ్లీష్ కావాలి అని మన తెలుగును చంపుకుంటామా? ఇంగ్లీష్ అనేది మనకు జీవన భృతిని కల్పించే భాష మాత్రమే. అందులో మన ఆత్మ ఉండదు. మన తల్లి భాషలోనే మన నిజమైన ఆత్మ ఉంటుంది. పైగా తెలుగు భాషను క్షుణ‌్ణంగా నేర్చుకుంటే ఇంగ్లీష్ భాషపై మరింత పట్టు సంపాదించొచ్చు. ఎందుకంటే మాతృభాషలో మనం భావవ్యక్తీకరణ సరైన విధంగా చేయగలిగితే మరే ఇతర భాషలు నేర్చుకున్నా అది చాలా సులువుగా వంటబడుతుంది. అలా కాకుండా ఏకంగా మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్ భాషనే పట్టుకు వేలాడుతున్న వారిని ఏమనాలి?

 

 

తల్లిదండ్రులే మొదటి దోషులు!

 

మరే ఇతర దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ప్రపంచంలో ఏ దేశం వాళ్లు అయినా ముందు వాళ్ల మాతృభాషకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మనం మాత్రం ఏకంగా మన భాషలను చంపేసుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. చైనాలో, జపాన్ లో ఇలా ఎక్కడైనా వాళ్లు వాళ్ల భాషకే పెద్ద పీట వేస్తారు. వాళ్ల భాష నేర్చుకోవడం వలన వాళ్లేమీ వెనుకబాటు తనంలో ఉండిపోలేదే. ప్రపంచంలోనే వేగవంతమైన శక్తులుగా ఎదుగుతున్నారు. మనం మాత్రం బాగా ఇంగ్లీష్ నేర్చుకుని రాత్రిళ్లు కాల్ సెంటర్లలో పనిచేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి? మాతృభాషకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుగా మేల్కోవాలి. తమ పిల్లలకు ఇంగ్లీష్ తో సమానంగా మాతృభాషను కూడా నేర్పించాలి. ఇంట్లో పిల్లలు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రమే ఆనందపడాలి. ఇంటిదగ్గర వాళ్లకు ఎలా మాట్లాడాలో, ఎలా రాయాలో, ఎలా చదవాలో కొద్ది సమయం కేటాయించి వాళ్లకు తెలుగు నేర్పించాలి. అప్పుడే తెలుగు బతుకుతుంది.

 

 

ఆర్భాటాలు మాని చర్యలు చేపట్టాలి!

 

హైదరాబాద్ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఇలా జరగడం చాలా మంచిదే. అయితే అసలు ఉద్దేశాన్ని గాలికొదిలే ప్రచారాలకు , ఆర్భాలకు దూరంగా తెలుగును బతికించేందుకు నిజమైన కార్యాచరణ కావాలి. ఇప్పటికే తెలుగు మహాసభల హోర్టింగ్ ల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న కొన్ని తప్పులు ఇబ్బందిగా ఉన్నాయి. ఇది రంద్రాన్వేషణ కాదు కానీ తెలుగును బతికించడంలో మన చిత్తశుద్ధిని చాటిచెప్పే విధంగా చర్యలు ఉండాల్సిందే. తెలంగాణాలో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చడం మంచి నిర్ణయం. అలాగే ఏపీ లో కూడా అటువంటి చర్యలు జరగాలి. మరే తెలుగు కాలేజీలోనూ ఒక్కడే విద్యార్ధి ఉండే దుస్థితి రాకుండా ప్రభుత్వాల తక్షణ చర్యలు చేపట్టాలి. తెలుగు చదివే వాళ్లకు నమ్మకం కలిగించాలి. తెలుగులో చదివితే కలిగే ఉపయోగాలను చెప్పాలి. లేకుంటే రానున్న రోజుల్లో తెలుగు చదివే ఆ ఒక్కడు కూడా మిగలకపోవచ్చు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

తెలుగు మ‌హాస‌భ‌లతో తెలుగుకు ప‌ట్టిన తెగులు వ‌దిలిపోద్దా??

 

తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డ్డాక తొలిసారిగా హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వీటిని నిర్వ‌హించేందుకు కేసీఆర్ స‌ర్కార్ స‌మాయుత్త‌మైంది. ఈ నెల 15 నుంచి 19 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 50 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్ర‌పంచం న‌లుమూలల నుంచి తెలుగు వారు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఈ మ‌హాస‌భ‌ల నిర్వ‌హ‌ణ‌తో తెలుగు భాష‌కు ఒరిగేదేంటి అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. యునెస్కో విడుద‌ల చేసే మృత భాష‌ల జాబితాలోకి త్వ‌ర‌లో తెలుగు కూడా చేర‌వ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించ‌డం తెలుగు భాషాభిమానుల గుండెల్ని పిండేసింది. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ గా ప్ర‌ఖ్యాతి గాంచిన‌ప్ప‌టికీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అద్భ‌త‌మైన భాష‌ల్లో తెలుగు ఒక‌టి. అటువంటి తెలుగు భాష ఇప్పుడు మ‌న విద్యా విధానంతో, ఇత‌ర భాష‌ల‌పై మోజుతో ప్ర‌మాదంలో ప‌డింది. ప‌క్క రాష్ట్రాల వారు త‌మ భాషను అభివృద్ధి చేసుకోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటే మ‌న మాత్రం ప‌ర‌భాషా వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం.

 

పిల్ల‌ల‌కు తెలుగును దూరం చేస్తుంది మ‌న‌మే!

 

తెలుగు భాష‌కు ద్రోహం చేస్తున్న వాళ్ల‌లో మొద‌టి దోషులు క‌చ్చితంగా త‌ల్లిదండ్రులే. ప‌ర భాషపై విప‌రీత‌మైన వ్యామోహాన్ని పెంచుకుని త‌మ పిల్ల‌ల‌ను తెలుగు భాష‌కు దూరం చేస్తున్న త‌ల్లిదండ్రులు ఎంద‌రో. తెలుగు మీడియంలో చ‌దివితే ఉద్యోగం రాదు తెలుగు చదివితే చిన్న స్థాయిలో ఉండిపోతారు అన్న అపోహ‌ల‌ను, అవాస్త‌వాల‌ను ప్రచారం చేయ‌డంలో కొన్ని ప్ర‌యివేట్ విద్యా సంస్థ‌లు విజ‌యం సాధించాయి. వారి మాయ‌లో ప‌డి చాలా మంది పేరెంట్స్ త‌మ పిల్ల‌ల‌ను తెలుగులో చ‌దివించ‌డం మానుకున్నారు. స‌మాజంలో వ‌చ్చిన ఈ స్ప‌ష్ట‌మైన, దుర‌దృష్ట‌క‌ర‌మైన మార్పుకు ఈ త‌రం ప్ర‌త్య‌క్ష సాక్షిగా ఘోర‌మైన పాపాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఒక వైపు స్కూల్లో తెలుగు మాట్లాడితేనే కొట్టే టీచ‌ర్లు, మ‌రోవైపు ఇంట్లో కూడా పిల్ల‌ల్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడ‌మ‌ని ఒత్తిడి చేస్తూ న‌యా మాయానందంలో త‌మ‌ను తాము మోసం చేసుకుంటున్న త‌ల్లిదండ్రులు. వెర‌సి తెలుగు భాష ఇప్పుడు అంప‌శయ్య పైకి చేరుకుంది.

 

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావా?

 

తెలుగు నేర్చుకుంటే ఉద్యోగాలు రావ‌ని ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గ‌లేమ‌ని చాలా మందిలో ఉన్న భావ‌న‌. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చ‌ద‌వ‌కుంటే పిల్ల‌లు ఈ పోటీ ప్ర‌పంచంలో మ‌నుగ‌డ సాగించ‌లేర‌ని చాలా మంది త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. నిజ‌మే..ప్ర‌స్తుత కార్పోరేట్ జ‌మానాలో ఉద్యోగాన్ని సాధించాలన్నా దాన్ని కాపాడుకుంటూ మ‌రింత‌గా ఎద‌గాలన్నా ఇంగ్లీష్ లో నైపుణ్యం అవ‌స‌ర‌మే. ఇందులో సందేహం లేదు. అయితే ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషైన తెలుగుపై నిర్ల‌క్ష్యం ఎందుక‌న్న‌ది ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌. ఒక పీరియ‌డ్, ఒక స‌బ్జెక్ట్ గా తెలుగును చ‌దివినంత మాత్రాన పిల్ల‌లు ప‌నికిరాని వారిగా మారిపోతారా? ఇప్పుడు తెలుగు భాషాభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న ఇదే. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ గా చేయ‌డంలో మీన‌మేషాలు లెక్కించింది. ఇప్పుడు తెలంగాణీ సీఎం కేసీఆర్ తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు. మ‌రి ఆయ‌న ఆదేశాలు ఎంత వ‌ర‌కూ అమ‌లవుతాయో క్షీణ ద‌శ‌లో ఉన్న తెలుగుకు ఎంత వ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయో వేచి చూడాలి. ప్ర‌స్తుతం పుస్త‌కాలు చ‌దివే అలవాటున్న పిల్ల‌ల చేతుల్లో ఇంగ్లీష్ పుస్త‌కాలు త‌ప్పించి తెలుగు పుస్త‌కాలు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. పిల్ల‌ల్లో పుస్త‌క ప‌ఠ‌నంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు బాల సాహిత్యంలో మ‌రిన్ని పుస్త‌కాలు రావాల్సి ఉంది. అలాగే త‌ల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ నేర్పిస్తూనే అదే స‌మ‌యంలో తెలుగు చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌చ్చేలా వారికి శిక్ష‌ణ‌నివ్వాలి.

 

 

తెలుగును బ‌తికించ‌డం త‌ల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది!

 

తెలుగుకు ప్రాచీన భాష హోదా ద‌క్కింద‌న్న ఆనందం ఎక్కువకాలం నిల‌వ‌కుండానే ఇటీవ‌ల యునెస్కో విడుద‌ల చేసిన ఒక నివేదిక ఆందోళ‌న రేపింది. తెలుగు భాష‌పై ఇదే ర‌క‌మైన వైఖ‌రి కొన‌సాగుతూ ఉంటే మ‌రికొద్ది సంవత్సరాల్లో తెలుగు కూడా మృత భాషల జాబితాలో చేరిపోవ‌చ్చ‌న్న‌ది ఆ నివేదిక సారాంశం. తియ్య‌నైన తెలుగు భాష క‌నుమ‌రుగు కావ‌చ్చ‌న్న ఆలోచ‌నే భ‌రింప‌రానిదిగా ఉంది. దేశ భాష‌లందు తెలుగు భాష లెస్స అన్న శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌ల మాట‌ల‌ను గుర్తుకు తెచ్చుకుని మ‌న తెలుగు భాష‌ను బ‌తికించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అది ముందుగా త‌ల్లిదండ్రుల నుంచే మొదలు కావాలి. చిన్న‌త‌నం నుంచి పిల్ల‌ల‌ను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో జాయిన్ చేసినా ఇంటి ద‌గ్గ‌ర వాళ్ల‌కు తెలుగులో మాట్లాడ‌టం నేర్పించాలి. అలాగే కొంచెం స‌మ‌యం తీసుకుని వాళ్ల‌కు తెలుగు భాష‌ను క్షుణ్ణంగా నేర్పించాలి. వాళ్ల‌కు తెలుగులో ఉన్న మంచి బాల సాహిత్యాన్ని చ‌ద‌వ‌డం అల‌వాటు చేయాలి. స్కూళ్ల‌లో ఎలా అయితే తెలుగు మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధిస్తారోఇంట్లో కూడా అలానే ఇంగ్లీష్ మాట్లాడొద్ద‌ని ఆంక్ష‌లు విధించి కుటుంబం మొత్తం తెలుగులోనే మాట్లాడుకోవాలి. క‌ఠిన ప‌దాల‌కు , సామెత‌ల‌కు పిల్ల‌ల‌కు అర్ధాల‌ను వివ‌రించి చెప్పాలి. ఏ ప‌దాన్ని ఎక్క‌డ ఏ సంద‌ర్భంలో వాడాలి అన్న‌దానిపై పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే తెలియజేయాలి. కుంగిపోతున్న తెలుగును బ‌తికించ‌డం కేవ‌లం త‌ల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. వారు త‌ల్చుకుంటే మ‌న భాష‌ను బ‌తికించుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మేమీ కాదు.

 

 

చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్య‌మే!

 

తెలంగాణా జ‌రుగుతున్న ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల స్ఫూర్తితో మ‌నం తెలుగును బ‌తికించుకునేందుకు, దాన్ని త‌ర్వాత త‌రాల‌కు అందించేందుకు కృషి చేయాలి. తెలంగాణాలోని అన్ని పాఠ‌శాలలో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌న్నెండో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగును త‌ప్ప‌నిసరి చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్ప‌ది. అయితే ఇది స‌రిగ్గా అమ‌లు జ‌రిగేలా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. తెలుగు భాష‌ను మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించి వ‌దిలేయ‌డం కాకుండా వాటి అమ‌లును ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా తెలుగు భాష గొప్ప‌త‌నంపై త‌ల్లిదండ్రుల‌ను చైత‌న్యం చేయాలి. అలాగే తెలుగు మీడియంలో చ‌దివిన విద్యార్ధుల‌కు కూడా ఉద్యోగావ‌కాశాలు ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చేస్తే చాలా మంది తెలుగులో చ‌దివేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అలాగే మ‌న ప‌క్క‌రాష్ట్రాల త‌రాహాలోనే భాష‌పై ప్రేమ‌ను పెంచుకుని దాని అభివృద్ధికి అనుక్ష‌ణం ప్ర‌య‌త్నం చేయాలి. ఇలా చేసిన‌ప్పుడు తియ్య‌నైన మ‌న‌ తెలుగు భాష త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుని త‌ళుకులీనుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

గాంధీ, ఎన్టీఆర్, కేసీఆర్…బలమైన నాయకుల సక్సెస్ సీక్రెట్ ఇదే!

 

ఒక ఆశ‌యం, ఒక స్పూర్తి ప్ర‌పంచవ్యాప్తం కావాలి, చ‌రిత్ర‌లో నిలిచిపోవాలి అంటే దాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే నాయ‌కుడు, నాయ‌క‌త్వం కావాలి. అయితే ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేసే ఒక బ‌ల‌మైన‌ నాయ‌కుడు త‌యారు కావ‌డం అన్న‌ది అంత సులువైన విష‌య‌మేమీ కాదు. ఎందుకంటే నాయ‌కునిగా ఎద‌గాలంటే ఎన్నో స‌వాళ్ల‌ను మ‌రెన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవ‌రు కాద‌న్నా ఔనన్నా కుల వ్య‌వ‌స్థ ముఖ్య‌పాత్ర‌ పోషించే ఇండియా లాంటి దేశంలో సామాజిక వ‌ర్గం అండ‌దండ‌లు లేకుండా ఒక వ్య‌క్తి బ‌ల‌మైన నాయ‌కునిగా ఎద‌గ‌డం అసాధ్యం. విభిన్న వ‌ర్గాల‌ను క‌లుపుకుంటూనే అదే స‌మ‌యంలో స్వంత వ‌ర్గం వారిని కూడా ఆక‌ట్టుకున్న‌ప్పుడే నాయ‌కునికిగా మ‌నుగ‌డ సాధ్యం. బుద్ధుడు నుంచి నేటి కంచె ఐలయ్య వ‌ర‌కూ ఉద్య‌మాలు విజ‌యవంతం కావాలంటే సామాజిక వ‌ర్గాల మ‌ద్ధ‌తు అత్య‌వ‌సరం. గాంధీజీ దేశంలోనే బ‌ల‌మైన నాయ‌కునిగా ఎదిగి దేశానికి స్వాతంత్రం సాధించగ‌లిగాడంటే అత‌నికి సొంత సామాజిక వ‌ర్గం నుంచి పూర్తి స‌హ‌కారం ఉండ‌టం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంది. ఇలా స్పూర్తిని నింపుకుంటూ విభిన్న వ్య‌క్తుల‌ను క‌లుపుకుంటూ ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్లిన‌ప్పుడే ఉద్యోగులు మంచి టీమ్ లీడ‌ర్ గా ఎదిగి కెరీర్ లో ఉన్న‌త స్థానాల‌కు చేర‌గ‌లుగుతారు.

 

 

చ‌రిత్ర‌లో నాయ‌క‌త్వానికి ఆన‌వాళ్లు తెలుసా?

 

క్రీస్తు పూర్వమే భారతదేశంలో హిందూ మతం మనుగడ ప్రమాదంలో పడింది. ముఖ్యంగా వర్ణ వ్యవస్థ వెర్రి తలలు వేయడంతో కొన్ని వర్గాల వారు హిందూ మతానికి పూర్తిగా దూరమయ్యారు. బౌద్ధ మతాన్ని ప్రభోధించిన బుద్ధుని భోధనలకు ప్రభావితమై చాలా మంది హిందూ మతం నుంచి బౌద్ధం లోకి మారిపోయారు. అయితే పురాతన కాలం నుంచి బలంగా పాతుకుపోయిన హిందూ మతాన్ని సవాలు చేస్తూ బుద్ధుడు బౌద్ధమతాన్ని ప్రారంభించి బౌద్ధులు దృష్టిలో దేవునిగా మారడం వెనుక అంతులేని నాయకత్వం పటిమ కనిపిస్తుంది. ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో బుద్ధుడు విభిన్న వర్గాలకు, వ్యక్తులు ఎనలేని సహాయం చేసి వాళ్ల మనస్సులను గెల్చుకున్నాడు. అటు తర్వాత అతను రాజ్యాన్ని, అధికారాన్ని త్యజించి సన్యాసిగా మారి బౌద్ధాన్ని ప్రభోధించినప్పుడు అతని నుంచి సహాయం పొందిన వారంతా అతని సంకల్పానికి సహాయపడ్డారు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడంలో ఎనలేని కృషి చేసారు. మనదేశంతో పాటు విదేశాలకు కూడా బౌద్ధం విస్తరించిందంటే బుద్ధుడు అందర్నీ ఆకట్టుకుంటూ, వారి నుంచి ఎలా సహాయం పొందాడో అర్ధమవుతుంది. కొన్ని వర్గాల కొన్ని సమూహాల సహాయం లేనిదే ఎవరూ నాయకుడు కాలేదన్నది బుద్ధుని కాలంలోనే రుజువైంది. ఇక బౌద్ధం దెబ్బకు, ఇతర మతాల ప్రభావానికి ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డ హిందూ మతాన్ని కాపాడుకునేందుకు తీసుకొచ్చిన భక్తి ఉద్యమం వెనుక కూడా కొన్ని వర్గాల అండ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హిందూ మతం క్షీణిస్తే ముందుగా నష్టపోయేది బ్రహ్మణ వర్గం కాబట్టి వాళ్లు వెనుక నుండి భక్తి ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు పరోక్షంగా కృషి చేసారు.

 

 

వీరులైనా, శూరులైనా సామాజిక వర్గం అండ ఉండాల్సిందే!

 

క్రీస్తు పూర్వం మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చంద్ర గుప్త మౌర్యుడు తన ప్రధాన మంత్రి చాణక్యుని సహాయంతో హిందూ మతాన్ని విస్తరించేందుకు కృషి చేసాడు. చాణక్యుడు బ్రహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సాక్షాత్తూ మహారాజు చంద్రగుప్తుడు తన శిష్యుడు కాబట్టి తన ప్రణాళికలను సుస్పష్టంగా అమలు చేసుకున్నాడు. ఈ పరిణామానికి వెనుక నుంచి బ్రహ్మణ వర్గం అండదండలు చాణక్యునికి పుష్కలంగా ఉన్నాయి. ఇక తురుష్కుల దాడుల నేపథ్యంలో హిందూ ధర్మం మరోసారి ప్రమాదంలో పడ్డప్పుడు ఛత్రపతి శివాజీ బలమైన నాయకునిగా ఎదిగాడు. తన వర్గం, తన సమూహం అండదండలతో బలమైన రాజ్యాన్ని నిర్మించుకుని హిందూ ధర్మ పరిరక్షణ చేసాడు. ఎంతటి వీరులకైనా, నాయకులకైనా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి బలమైన వర్గం అండ ఉంటేనే వారి నాయకత్వం నిలబడుతుంది. లేకుంటే ఎంతటి గొప్పవాడైనా బలమైన నాయకుడు కాలేడు. తనకు పూర్తి సహాయ సహకారాలు అందించే ఒక వర్గం సహాయం తీసుకుంటూనే అదే సమయంలో మిగిలిన వాళ్ల మనసులను కూడా గెల్చుకున్నప్పుడే నాయకునికి గెలుపు సాధ్యమవుతుంది. ఇలా విభిన్న వ్యక్తులను, విషయాలను కలుపుకుని పోవడం అన్నది నాయకునికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఈ విషయంలో మహాత్మా గాంధీని విజయవంతమైన నాయకునిగా చెప్పవచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గాంధీ నాయకత్వం ఎందుకు విజయవంతమైంది?

 

విదేశాల్లో బారిష్టర్ చదువు పూర్తి చేసి ఇండియాకు వచ్చిన గాంధీజీ , దేశంలోనే ఒక బలమైన నాయకునిగా ఎలా ఎదగగలిగారు? చదువు పూర్తి చేసి తన ప్రాంతం వచ్చినప్పుడు అక్కడ ఉండే చిన్న వివాదాలను గాంధీజీ పరిష్కరించేవాడు. ముఖ్యంగా వర్తకులు, వ్యాపారస్తుల సమస్యలను చాలా చాకచక్యంగా పరిష్కరించేవాడు. స్వయంగా గాంధీ కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వాళ్లకు గాంధీజీపై గురి కుదిరింది. ముఖ్యంగా సారాభాయి మిల్స్ వ్యవహారంలో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించడం అతని ప్రతిష్ఠను ను పెంచింది. అతను జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఉద్యమాలు నడిపేటప్పుడు స్వంత సామాజిక వర్గానికి చెందిన ట్రేడర్లు గాంధీజీకి పూర్తి సహకారం అందించేవారు. ఫండింగ్ రూపంలో కానీ జన సమీకరణ రూపంలో కానీ ఇలా విభిన్న మార్గాల్లో గాంధీజీ ఉద్యమం విజయవంతమయ్యేలా కృషి చేసేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత వర్గాలు వారు కావడం వలన వారి సహకారంతో గాంధీజీ దేశంలో బలమైన నాయకునిగా ఎదిగాడు. మరోవైపు అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వర్గ , సామాజిక సమీకరణలను అందిపుచ్చుకోలేక స్వాతంత్ర సాధనలో విఫలమయ్యారు. తన సొంత సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటూనే వారి సహాయం పొందుతూనే అదే సమయంలో మిగిలిన వర్గాల వారినీ, కులాల వారిని ఆకర్షించి గాంధీజీ జాతి పితగా మారాడు.

 

 

బలమైన నాయకుని వెనుక ‘బలమైన వర్గం’ ఉంటుంది!

 

సినిమాల్లో తిరుగులేని కథానాయకునిగా వెలుగుతున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించినప్పుడు ఆయన వెనుక ఒక బలమైన సామాజిక వర్గం అండగా నిలబడింది. ముఖ‌్యంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన్ను బాగా ప్రమోట్ చేసేందుకు ఒక దిన పత్రిక ఎనలేని కృషి చేసింది. ఆయన రాజకీయ ప్రచారానికి తమ పత్రికలో బాగా ప్రాధాన్యం ఇచ్చి ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేసింది. ఆ పత్రిక ఒక్కటే కాదు పబ్లిక్ మీటింగ్ లకు ఆర్థిక సమీకరణ, జన సమీకరణ వంటి పనులను ఒక సామాజిక వర్గం బలంగా చేసింది. ఫలితం ఆయన తిరుగులేని నాయకునిగా ఎదిగి స్వల్ప కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక వైఎస్ఆర్ పాదయాత్ర కూడా ఒక చరిత్ర సృష్టించిందంటే అతని స్వంత సామాజిక వర్గం చేసిన కృషిని కొట్టిపారేయలేం. అలాగే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ అతన్ని బలమైన నాయకునిగా ఎదిగేలా చేసేందుకు అతని సామాజిక వర్గం అందించిన సహాయ సహకారాలు సుస్ఫష్టం. అంటే కేవలం సామాజిక వర్గాల అండతోనే బలమైన నాయకులు తయారవుతారని పూర్తిగా చెప్పలేం కానీ స్వంత వర్గం అండ లేకుంటే మాత్రం పెద్ద నాయకుడు కావడం అనేది అసాధ్యం.

 

 

విద్యార్ధులు ‘బలమైన నాయకత్వం’ అంటే ఏమిటో తెలుసుకోవాలి!

 

ప్రస్తుత జాబ్ మార్కెట్లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే కొలువు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కు తోడు ఒక టీమ్ ను విజయవంతంగా నడిపే వాళ్లు ఇప్పుడు కంపెనీలకు కావాలి. విభిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్న టీమ్ ను కుదుపులు లేకుండా నడపడం అంత సులువేం కాదు. అందుకే కంపెనీలు ఈ ఛాలెంజ్ ను తీసుకునే అభ్యర్ధుల కోసం వెతుకుతున్నాయి. బుద్డుడి దగ్గర్నుంచి కేసీఆర్ వరకూ ఒక బలమైన నాయకుడు కావాలంటే తమ వర్గం అండదండలు పొందుతూనే అదే సమయంలో అందర్నీ కలుపుకుపోయే లక్షణం ఉండాలి. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ లక్షణాన్ని స్వీకరించాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకుని, అందర్నీ ఆకట్టుకుంటూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కెరీర్ లో అయినా వ్యక్తిగతంగా అయినా ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్న వారు)