శ‌వాల‌కూ హ‌క్కులుంటాయా?

 

‘బ‌తికున్న నాడు బువ్వ పెట్ట‌ని వాడు చ‌చ్చిపోయాక చ‌క్కెర పొంగ‌ళితో ముష్టాన్న భోజనం పెట్టాడ‌న్న‌ది’ సామెత‌. ఎందుకంటే మ‌న స‌మాజంలో పూర్వ కాలం నుంచి చ‌నిపోయిన వాళ్ల‌కు ఇచ్చే గౌర‌వం చాలా గొప్ప‌గా ఉంటుంది. చనిపోయిన వ్య‌క్తుల అంతిమ యాత్ర‌లో వాళ్ల‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను, ఆహార ప‌దార్ధాల‌ను ఇత‌ర విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌తనిస్తారు. దాదాపుగా చ‌నిపోయిన మ‌నిషి ఒక దైవ స‌మానంగా భావిస్తారు. మ‌న భారతీయ సంస్కృతిలో ఇది ఓ భాగం. అయితే మారుతున్న సామాజిక, ఆర్థిక ప‌రిణామాలు చ‌నిపోయిన మ‌నిషిపై, శవంపై మ‌న దృక్కోణాన్ని మార్చేస్తున్నాయి. భార‌తీయ‌, ఈజిప్ట్ వంటి పురాత‌న సంస్కృతుల్లో శ‌వానికి ఇచ్చే గౌర‌వాన్ని మర్చిపోయిన నేటి త‌రం శ‌వాన్ని త్వ‌ర‌లో పాడైపోయే ఒక మాంసం ముద్ద‌లా మాత్ర‌మే చూస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగాల్లో శ‌వాల ప‌ట్ల తీవ్ర‌మైన నిర్ల‌క్ష్యం రాజ్య‌మేలుతోంది. ముఖ్యంగా శ‌వాగారాల్లోని శ‌వాలను ఎలుక‌లు, పందికొక్కులు పీక్కుతింటున్నా అడిగే నాథుడు కూడా లేడు. శ‌వాల‌పై కొన‌సాగుతున్న ఈ నిర్ల‌క్ష్యంపై ప్ర‌తీ రోజూ వార్త‌లు వ‌స్తున్నా స్పందించేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అస‌లు శ‌వాల‌కూ హ‌క్కులు ఉంటాయా? ఆత్మీయులు లేని అనాధ శ‌వాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న నిర్లక్ష్య వైఖ‌రిని ప్ర‌శ్నించొచ్చా?

 

 

చ‌చ్చిన శ‌వాలంటే అంత చిన్న చూపా?

 

ఇటీవ‌లి కాలంలో ఏ ప‌త్రిక తిర‌గేసినా నేరాలు, హ‌త్య‌లు, రోడ్డు ప్ర‌మాదాల‌కు సంబంధించిన వార్త‌లే అధికంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌మాదాల్లో అనాధ‌లుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు, అయిన వాళ్లు లేక అనారోగ్యంతో క‌న్ను మూసిన వాళ్లు మ‌న దేశంలో ప్ర‌తీ రోజూ వంద‌ల సంఖ్య‌లో ఉంటారు. అనాధ శవాలుగా ప్ర‌భుత్వ మార్చురీల్లోకి వ‌చ్చి చేరే శ‌వాలు ఎక్కువ‌గానే ఉంటాయి. మ‌నం ముందు చెప్పుకున్న‌ట్టు బ‌తికున్న‌ప్పుడు విష‌యం తెలియ‌దు కానీ చ‌నిపోయాక ఒక మ‌నిషికి ఇవ్వాల్సిన క‌నీస‌మైన గౌర‌వం ఇవ్వాలి కానీ మ‌న ప్ర‌భుత్వ యంగ్రాంగం మాత్రం గౌర‌వం సంగ‌తి త‌ర్వాత శ‌వాల‌ను అత్యంత దారుణంగా అవ‌మానిస్తోంది. ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లోని శ‌వాగారాల్లో స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఎలుక‌లు, పందికొక్కులు శ‌వాల‌ను పీక్కుతింటున్న‌ట్టు ప్ర‌తీరోజూ పత్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి. అయినా అడిగే వారు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ యంత్రాంగం తమ వైఖ‌రిని మార్చుకోవడం లేదు. తాజాగా ఉస్మానియా ఆసుప‌త్రిలో ఒక గృహిణి శవం చెవులు, ముక్కును పందికొక్కులు తినేడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే గ‌తంలో గుంటూరు జ‌న‌ర‌ల్ ఆసుపత్రి ఐసీయూలో ఒక చిన్నారిని కూడా ఇలాగే పందికొక్కులు చేతులు, కాలివేళ్లు కొరికిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలుసు.

 

 

మానవ హ‌క్కులు మ‌నుష్యుల‌కేనా? శ‌వాల‌కు ఉండ‌వా?

 

బ‌తికున్న మ‌నిషికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఎన్నో చ‌ట్టాలున్నాయి. పైగా వ్య‌క్తిగ‌త హ‌క్కుల‌కు భంగం క‌లిగినప్పుడు వ్య‌క్తి స్వేచ్ఛ‌కు విఘాతం క‌లిగి న‌ప్పుడు అత‌ని హ‌క్కుల‌ను కాపాడేందుకు మానవ హ‌క్కులు సంఘాలున్నాయి. మ‌నిషి హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు అత‌ని వ్యక్తిగ‌త భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ లేన‌ప్పుడు మానవ హ‌క్కులు క‌మీష‌న్ ముందుండి పోరాడుతుంది. గ‌తంలో నెల్స‌న్ మండేలా, మ‌హాత్మా గాంధీ, మ‌లాలా వంటి వారు మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి ఖ్యాతి గ‌డించారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది. బ‌తికున్న మ‌నుష్యుల‌కు హ‌క్కులు కావాలి కాబ‌ట్టి పోరాటం చేసి సాధించుకుంటున్నారు. మ‌రి చ‌నిపోయిన శ‌వాల సంగ‌తేంటి? ఇండియా లాంటి దేశంలో శ‌వాల‌ను దైవంతో స‌మానంగా చూసుకుంటారు. క‌దా? మ‌రి వాటి హ‌క్కుల‌ను కాపాడేందుకు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా? ఈ ప్ర‌శ్న‌కు లేదు అనే స‌మాధానం చెప్పాల్సి వ‌స్తుంది. అత్యంత హేయ‌మైన ప‌రిస్థితుల్లో ఒక శ‌వాన్ని రోజుల త‌ర‌బ‌డి ఒక ఐస్ రూమ్ లో ఉంచుతున్నారు. ఒక వేళ ఆధారాల కోసం ఉంచాల్సిన వ‌చ్చిన‌ప్పుడు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుని వాటిని జాగ్ర‌త్త‌గా గౌరవంతో భ‌ద్ర‌ప‌రిస్తే మ‌న సంస్కృతికి, చనిపోయిన వారి ఆత్మ‌కు శాంతి క‌లుగుతుంది. ఒక వేళ శవం యొక్క సంబంధీకుల‌కు హ‌క్కులు క‌ల్పిస్తున్నా వాటిని కాపాడేందుకు స‌రైన సంస్థ‌, వ్య‌వ‌స్థ కూడా లేవు.

 

 

శ‌వం దేశానికి చెందుతుంది!

 

అస‌లు ఒక మ‌నిషి చ‌నిపోయాక అతని శ‌వం దేశానికి చెందుతుంది. ఆత్మీయులు, ర‌క్త సంబంధీకులు లేని అనాధ శ‌వాల బాధ్య‌త‌ను పూర్తిగా ప్ర‌భుత్వ‌మే తీసుకోవాలి. మ‌న పురాత‌న సంస్కృతిని అనుస‌రించి వాటికి త‌గిన గౌరవం ఇవ్వాలి. వాటికి స‌రైన ప‌ద్ధ‌తిలో శ‌వ సంస్కారాన్ని నిర్వ‌హించాలి. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం యొక్క బాధ్య‌త‌లు అని ప్ర‌ముఖ ఫోరెన్సిక్ వైద్యుడు డాక్ట‌ర్ విద్యాసాగ‌ర్ చెప్పుతున్నారు. అయితే ప్ర‌భుత్వం త‌మ బాధ్య‌త‌లను స‌రైన విధంగా నిర్వ‌హించ‌డం అన్న‌దే ఇప్పుడు శ‌వాల హ‌క్కుల ఉల్లంఘ‌న‌గా పిల‌వ‌బ‌డుతోంది. లేదంటే ప్రాణం లేని శ‌వాలకు హ‌క్కులెందుకు? వ‌ంద‌ల సంఖ్య‌లో శ‌వాలు వ‌స్తున్న‌ప్పుడు డాక్ట‌ర్ల‌కు వీటిని నిర్వ‌హ‌ణ చేయ‌డం అనేది క‌ష్ట సాధ్యంగానే ఉంటుంది. అయితే చిత్త‌శుద్దితో ప్ర‌య‌త్నిస్తే ఇది అసాధ్యం ఏమీ కాదు. మ‌రోవైపు అనాధ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు కొన్ని స్వ‌చ్ఛంధ సంస్థ‌లు పనిచేస్తున్నాయి. కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నా అనాధ‌ శ‌వాల‌కు స‌రైన విధంగా అంత్యక్రియ‌లు చేయ‌డంలో అటువంటి సంస్థ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాయి.

 

 

చనిపోయిన వాళ్ల‌ను క‌చ్చితంగా గౌర‌వించాల్సిందే!

 

మ‌న దేశంలో మ‌న సంస్కృతిలో శ‌వంతో మ‌న‌కు ఒక ఎమోష‌న‌ల్ అటాచ్ మెంట్ ఉంటుంది. అంటే దాన‌ర్ధం అనాధ శ‌వ‌మైనంత మాత్రాన ఒక శ‌వాన్ని మార్చురీలో అధ్యాన్నమైన స్థితిలో జంతువులకు ఆహారంగా వేయ‌డం అన్న‌ది చాలా దుర్మార్గ‌మైన విష‌యం. శ‌వాన్ని గౌర‌వంగా సాగ‌నంప‌డం అనేది మ‌న సంస్కృతిని కాపాడుకోవ‌డ‌మే. శ‌వాల‌కు ప్ర‌త్యేక‌మైన హ‌క్కులు ఉండేలా..వాటిని గౌర‌వించేందుకు ప్ర‌త్యేక‌మైన చ‌ట్టం తీసుకొస్తే మ‌న సంస్కృతితో ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో అనాధ ఆత్మ‌ల‌కు శాంతి క‌లుగుతుంది.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

పిల్లలను చదువుకు దూరం చేసే ఏ సిద్ధాంతమైనా పనికిమాలినదే!

 

ఒకప్పుడు కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం అనేది అంతర్లీనంగా ఉండేది. కమ్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితమైనప్పటికీ చాలా మంది విద్యార్ధులు దాన్ని అదుపులోనే ఉంచుకునే వారు. అయితే విప్లవ సాహిత్యంతో తీవ్రంగా ప్రభావితమైన వారు, తాము నమ్మిన సిద్ధాంతమే పూర్తిగా సరైనది అనుకునేవాళ్లు, అన్యాయం జరిగిన వాళ్లు, ఒక వాదాన్ని పూర్తి స్థాయిలో అథ్యయనం చేయని వాళ్లు తీవ్రవాదులుగా మారేవారు. అయితే ఆ తర్వాత రాను రానూ బాగా చదువుకున్న వాళ్లు ఉన్నత విద్యా వంతులు కూడా సమాజంలో జరుగుతున్న దోపీడికి తీవ్రవాదులుగా మారి హింస ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని నమ్మడం మొదలు పెట్టారు. దీని వలన మన దేశంలో మావోయిస్టు తీవ్రవాదులు బాగా పెరిగిపోయారు. వారి సిద్ధాంతాలను, భావజాలాలను విమర్శించాలన్న ఉద్దేశం కాదు కానీ రాజ్యానికి, రాజ్య వ్యతిరేక శక్తులకు జరుగుతున్న పోరాటంలో అమాయకులు, చిన్నపిల్లలు బలైపోవడం అన్నది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించాలన్న ఉద్దేశంతో చేస్తున్న పనులు విమర్శలపాలవుతున్నాయి. చదువు లేకుండా ఒక మనిషి అభివృద్ధి సాధించడం అన్నది అసాధ్యం. ఆదివాసీల పిల్లలకు చదువు అందుకుండా స్కూళ్లను పేల్చేయడం వంటి చర్యల ద్వారా మావోయిస్టులు తమ సిద్ధాంతాలకు తామే తూట్లు పొడుచుకుంటున్నారు.

 

 

విద్య‌కు వ్య‌థ‌గా మారిన తీవ్ర‌వాదం!

 

తీవ్ర‌వాదంతో బాగా న‌ష్ట‌పోయిన దేశాల జాబితాలో మ‌న దేశం కూడా ఉంది. కశ్మీర్ తీవ్ర‌వాదులు మొదులుకుని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు, బోడో తీవ్ర‌వాదులు, మావోయిస్టులు ఇలా తీవ్రవాద సంస్థ‌ల జాబితా చాలానే ఉంది. ప్ర‌స్తుతం అందులో కొన్ని సంస్థ‌లు క‌నుమ‌రుగైనా ఇప్ప‌టికీ టెర్రరిజం బాధిత దేశాల్లో ఇండియా ముందు వ‌రుస‌లో ఉంటుంది. ముఖ్యంగా ఉగ్ర‌వాదం మూలంగా ప్ర‌జ‌ల సామాజిక, భౌగోళిక‌, ఆర్థిక స్థితిగ‌తులు తీవ్రంగా దెబ్బ‌తింటున్నాయి. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా మంది పిల్ల‌లు విద్య‌కు దూర‌మై చివ‌ర‌కు తీవ్ర‌వాదులుగా మారుతున్న వైనం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, ఒడిషా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డం వ‌ల‌న పిల్ల‌లు చెట్లు కింద చ‌దువుకునే దుస్థితి దాపురించింది. తీవ్ర‌వాదుల దాడుల భ‌యంతో కొన్ని స్కూళ్లు అయితే ఏకంగా మూత‌బ‌డ్డాయి. దీంతో విద్యార్ధులు చ‌దువుకునే అవ‌కాశాన్ని కోల్పోతున్నారు. ఒక‌వైపు పేద‌రికం మ‌రోవైపు చ‌దువుకునే వెసులుబాటు లేక‌పోవ‌డంతో చాలా మంది టీనేజ్ పిల్ల‌లు నేర‌గాళ్లుగా మారి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తూ చివ‌రికి తీవ్రవాదంపై మొగ్గు చూపుతున్నారు.

 

 

పూర్తిగా ప‌డ‌కేసిన విద్య!

 

బీహార్ లోని మావోయిస్ట్ ప్ర‌భావిత జిల్లాల్లో ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంది. తీవ్రవాదులు స్కూళ్ల‌ను పేల్చేయ‌డంతో పాటు టీచ‌ర్ల‌ను కూడా భ‌య‌పెట్ట‌డంతో చాలా మంది ఉపాధ్యాయులు సుధీర్ఘ సెల‌వులు పెట్టి విధుల‌కు గైర్హాజ‌ర‌వుతున్నారు. దీంతో పిల్ల‌లు స్కూల్ మొఖం చూడ‌కుండా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. కొన్ని స్కూళ్లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ మొత్తం అన్ని త‌రగతుల‌ను ఒకే రూమ్ లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఏం వింటున్నామో తెలియ‌క విద్యార్ధులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. 500 మందికి పైగా విద్యార్ధులు ఉన్న స్కూళ్లు కూడా ఇప్పుడు కేవ‌లం 100 మంది విద్యార్ధుల‌కే ప‌రిమిత‌మైపోయాయి. మ‌రోవైపు మావోయిస్టుల‌కు భ‌య‌పడి చాలా మంది టీచ‌ర్లు కూడా విధుల‌కు రావ‌డం మానుకున్నారు. దీంతో స‌రైన నిర్వ‌హ‌ణ లేక బీహార్, ఝార్ఖండ్ లోని మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో చాలా స్కూళ్లు మూత‌పడ్డాయి. మిగిలిన స్కూళ్లు కూడా ఉపాధ్యాయులు లేక ఉపాధ్యాయులు వ‌చ్చిన విద్యార్ధులు రాక భవంతులు లేక చెట్ల కింద కాలం వెళ్ల‌దీస్తున్నాయి.

 

 

న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

 

ప్ర‌స్తుతం బీహార్, ఝార్ఖండ్, ఒడిషాల‌లో మావోయిస్టుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో పోలీసులు గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాలుగా కాస్త విజ‌య‌వంత‌మ‌య్యారు. దీంతో మావోయిస్టులు స్కూళ్ల‌ను పేల్చేసిన ఘ‌ట‌న‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. అయినా ఇప్ప‌టికే న‌ష్ట‌పోయిన ప్రాంతాల్లో మాత్రం ప‌రిస్థితి అలానే ఉంది. పేల్చేసిన స్కూల్ భ‌వ‌నాల స్థానంలో కొత్త వాటిని నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. మావోయిస్టులతో ప్రాణ భ‌యం ఉంద‌ని చాలా మంది స్కూల్ భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో చాలా స్కూళ్లు తాత్కాలిక శిబిరాల్లోనూ, చెట్ల కింద న‌డుస్తున్నాయి. అయితే ఈ తాత్కాలిక చ‌దువులు కాస్త వ‌ర్షాకాలం చ‌దువులుగా మారిపోయాయి. ఎండ కాసినా , వ‌ర్షం ప‌డినా స్కూళ్లను పూర్తిగా మూసివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీంతో పిల్ల‌లు పూర్తి స్థాయిలో చ‌ద‌వ‌లేక చ‌దువుకోక ప్రాథ‌మిక స్థాయిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. దీంతో దేశంలోనే ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ స్వాతంత్ర పూర్వం నాటి వెనుకబాటుతనంలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పుడు పోలీసు రక్షణలో చాలా వరకూ స్కూళ్లు నడుస్తున్నాయి. అయితే పోలీసులే నిజమైన విలన్లని మావోయిస్టులు చెపుతున్నారు. అణిచివేత ద్వారా స్కూళ్లను తెరిపించినా పెద్దగా ఉపయోగం లేదన్నది వారి వాదన. అయితే రాజ్యం, సమసమాజ స్థాపన వంటి సిద్ధాంతాల వలన మధ్యలో పిల్లలు చదువులేకుండా నష్టపోతున్నారన్న ప్రశ్నకు మావోయిస్టుల దగ్గర సమాధానం లేదు.

 

 

ఆధిపత్య ధోరణులతో పిల్లలు నలిగిపోతున్నారు!

 

ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం అన్ని రకాల సంబంధాలకు దూరంగా ఉన్న మారుమూల పల్లెలకు మాత్రమే పరిమితమైపోయింది. అటువంటి కమ్యూనికేషన్ లేని గ్రామాల్లో తమ ప్రభావాన్ని పెంచుకుని తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. అక్కడ ప్రజలు మావోయిస్టుల చెప్పిన మాటలకు, సాహిత్యానికి ప్రభావితమవుతున్నారు. అయితే హింసా మార్గం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాలు స్థాపించినా అవి మనుగడ సాగించలేవని గతంలోనే తేలిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యహరించాల్సి ఉంటుంది.తీవ్రవాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకురావడం, మారుమూల గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలి. అవి నత్తనడకన సాగడంతో ప్రజలు మావోయిస్టులే కరెక్ట్ అనే భావనలో ఉన్నారు. మరోవైపు తీవ్రవాదులకు, పోలీసులకు జరుగుతున్న పోరాటంలో చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. మావోయిస్టులు స్కూళ్లను పేల్చివేయడంతో వాళ్లు విద్యకు దూరమవుతున్నారు. తర్వాత క్రమంగా తీవ్రవాదులుగా మారుతున్నారు. ఈ పరిణామం అస్సలు సహేతుకం కాదు. అటు ప్రభుత్వం ఇటు మావోయిస్టులు విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే చర్యలు మాని వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఆ ప‌నులు చేయాల్సిందేనా?

ఒక దేశంలో పుట్టిన పౌరునికి ఆ దేశంపై క‌చ్చితంగా భ‌క్తి ఉండాలి. ఎందుకంటే అమ్మ జ‌న్మ‌నిస్తే పుట్టిన గ‌డ్డ జీవితాన్ని ఇస్తుంది. అమ్మ రుణం తీర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయోమో కానీ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకోవ‌డం అంత సులువు కాదు. అందుకే పుట్టిన గ‌డ్డకు జీవితాంతం రుణ ప‌డి ఉండాలి. దేశ సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వ‌చ్చినా సేవ చేసేందుకు ప్ర‌తీ పౌరుడు సిద్ధంగా ఉండాలి. ఇటీవ‌లి కాలంలో ప్ర‌సార మాధ్య‌మాల్లో, సోష‌ల్ మీడియాలో దేశ‌భ‌క్తి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శించ‌డం, సినిమా చూసేందుకు వ‌చ్చిన‌ ప్రేక్ష‌కులు నిల్చుని జాతీయ గీతాన్ని గౌర‌వించ‌డంపై ప్ర‌జ‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయి వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేపారు. దేశ‌భ‌క్తి అనేది అంత‌ర్గ‌త విష‌య‌మా లేక బ‌ల‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌జేసేదా అన్న దానిపై మొదటి నుంచి రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ప్ర‌భుత్వం దేశ‌భ‌క్తి అనే దాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డం, ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అడ్డుపెట్టుకుని త‌మ లోపాల‌ను కప్పిపుచ్చుకోవాలని ప్ర‌య‌త్నించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. దేశ‌భ‌క్తి అంటే బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించే బాహ్య విష‌యం అస్స‌లు కాదు, అది నిజాయితీతో కూడిన అంత‌ర్గ‌త విష‌యం. విద్యార్ధులు, ఉద్యోగులు ఈ కీల‌క విష‌యాన్ని గుర్తిస్తే వాస్త‌వానికి,భ్ర‌మ‌కు మ‌ధ్య ఉన్న స‌న్నని గీత ద‌ర్శ‌న‌మిస్తుంది.

 

 

దేశభ‌క్తికి ప్రామాణికం ఏంటి?

 

సినిమా హాళ్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శించే ముందు జాతీయ గీతం త‌ప్ప‌న‌స‌రిగా ఉండాల‌న్న నిబంధ‌న తెచ్చిన‌ప్పుడు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. జాతీయ గీతం కోసం నిమిషం పాటు నిల‌బ‌డి ఉండ‌లేమా అని కొంద‌రు. నిమిషం పాటు నిల‌బ‌డితే దేశంపై ప్రేమ ఉన్న‌ట్టా? అని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం సినిమా హాళ్ల‌లో జాతీయ గీతాన్ని త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అయిష్టంగా నిల‌బ‌డే వారు కొంద‌రైతే నిల‌బ‌డని వారిపై సాటి ప్రేక్ష‌కులు దాడి చేసిన ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకున్నాయి. ఒక సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇలా జ‌ఠిలం చేసి దేశ‌భ‌క్తికి ప్రామాణికాన్ని త‌యారు చేయాల‌ని అనుకోవ‌డం వివాదాల‌కు దారితీసింది. ఇక నోట్ల రద్దు స‌మయంలోనూ దేశ‌భ‌క్తి అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్ల ర‌ద్దుతో ఇబ్బందుల తలెత్తిన‌ప్పుడు దేశ‌భ‌క్తి ఉన్నవాళ్లు ఈ ఇబ్బందిని సంతోషంగా భ‌రించాల్సిందేనని ప్ర‌భుత్వ వ‌ర్గాలు మ‌రోసారి సున్నిత‌మైన విష‌యాన్ని వాడుకున్నారు. దేశ‌భక్తి ఉన్నావాళ్లు ఏటీఎం ల ముందు ఎన్ని గంట‌లైనా నిల్చుంటార‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఏటీఏం ల ముందు గంట‌ల కొద్దీ నిల్చోవ‌డానికి ,దేశ‌భ‌క్తికీ మ‌ధ్య సంబంధం ఏంటో చాలా మందికి ఇప్ప‌టికీ అర్ధం కాలేదు.

 

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి?

 

దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం అంటే సినిమా థియేట‌ర్ లో జాతీయ గీతం రాగానే లేచి నిల‌బ‌డి త‌ర్వాత దేశం ప‌ట్ల బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించ‌డం కాదు. దేశ‌భ‌క్తి అంటే దేశం ప‌ట్ల బాధ్య‌త క‌లిగి ఉండ‌టం. మ‌న చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల ప‌ట్ల‌, మ‌నుష్యుల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల ఒక బాధ్య‌త‌ను క‌లిగి ఉండ‌టం నిజ‌మైన దేశభ‌క్తి. అనాధ‌లు, వ‌యోవృద్ధుల‌కు చేత‌నైన స‌హాయం చేయ‌డం వారు స‌మాజంలో ధైర్యంగా బ‌తికేందుకు అనువైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించ‌డం కూడా దేశ‌భ‌క్తిలో ఒక భాగ‌మే. అంతే కానీ తీరిగ్గా సినిమా చూడ‌టానికి వెళ్లి నిమిషం పాటు మొక్కుబ‌డిగా న‌లుగురితో పాటు నిల్చుని నాకు దేశం ప‌ట్ల అప‌రిమిత‌మైన ప్రేమ‌, భ‌క్తి ఉన్నాయి అనుకుంటే అంత‌కంటే ఆత్మ‌వంచ‌న మ‌రొక‌టి ఉండ‌దు. మూడు గంట‌ల పాటు సినిమా చూసో లేక డ‌బ్బులు డ్రా చేయ‌డానికి ఏటీఎం ముందు నిల్చునో నేనే ఏ దేశంలో అతిపెద్ద దేశ‌భ‌క్తి అనుకుంటే మన‌ల్ని ఆ దేవుడు కూడా కాపాడ‌లేడు. అది మ‌న అజ్ఞానం మాత్ర‌మే కాక దేశ‌భ‌క్తి పేరు చెప్పి మ‌న‌ల్ని ఉచ్చులోకి లాగుతున్న రాజ‌కీయ నాయకుల వ‌ల‌లో మ‌నం ప‌డిన‌ట్టే.

 

నిజ‌మైన దేశ‌భ‌క్తులకు గౌర‌వం ద‌క్కుతోందా?

 

మ‌న దేశంలో నిజ‌మైన దేశ‌భ‌క్తులంటే స‌రిహ‌ద్దులో కాపలా కాసే సైనికులు, జ‌నాల‌కు తిండి పెట్టే రైతు, భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేసే ఉపాధ్యాయుడు. కానీ మ‌నం దేశంలో ఈ దేశ‌భ‌క్తుల‌కు ద‌క్కాల్సినంత గౌర‌వం ద‌క్కుతుందా అంటే అవును అని ట‌క్కున స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి గానే మిగిలిపోతారు. ప్ర‌జ‌ల నుంచి రావాల్సినంత గుర్తింపు రాదు. పోనీ ప్ర‌భుత్వం వీరి సంక్షేమం కోసం ఏమైనా చ‌ర్య‌లు చేప‌డుతుందా అంటే అదీ లేదు. నిజ‌మైన దేశ‌భ‌క్తులకు మ‌న దేశంలో ద‌క్కే గౌర‌వం ఇలా ఉంటుంది. డ‌బ్బులు కోసం సినిమాల్లో యాక్ట్ చేస్తూ త‌మ‌ను తాము దైవాంశ‌సంభూతులుగా భావించుకునే సినీ స్టార్లు, కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన వ్యాపార‌స్తులకే సోసైటీలో క్రేజ్. ప్ర‌భుత్వం కూడా ఇటువంటి వారిని కాపాడేందుకే అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంది.

 

త‌ప్పులు క‌ప్పిపుచ్చుకునేందుకు తెర‌పైకి దేశ‌భ‌క్తి కార్డు!

 

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని హ‌క్కుల‌తో పాటు కొన్ని బాధ్య‌తలు కూడా ఉంటాయి. అలాగే ప్ర‌భుత్వాలు కూడా త‌మ సొంత అజెండాతో కాకుండా దేశానికి, ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాల‌ను తీసుకుని అందుకు అనుగుణంగా ప‌రిపాలించాల్సి ఉంటుంది. కానీ గ‌డిచిన కొన్ని రోజులుగా ప్ర‌భుత్వం తాము తీసుకున్న నిర్ణ‌యాలు విఫ‌లం కావ‌డంతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు దేశ‌భ‌క్తి అనే కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. దేశ‌భ‌క్తి అనేది పౌరుల వ్య‌క్తిగ‌త విష‌యం. మీరు త‌ప్ప‌నిసరిగా దేశ‌భ‌క్తిని క‌లిగి ఉండాల‌ని ఆదేశించ‌డం అంటే అది నియంతృత్వం కింద‌కు వ‌స్తుంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం అది విఫ‌లం కాగానే వాటిపై వ్య‌తిరేక‌త రాగానే అలా వ్య‌తిరేకించే వారిని దేశ‌ద్రోహులుగా ముద్ర వేయ‌డం స‌మంజ‌సం కాదు. అది ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం.

 

(ఈ ఆర్టిక‌ల్ ను స్పాన్సర్ చేసినవారు)