ఎలుక హృద‌యం..ఏనుగు శ‌రీరం..ఇలా ఉంటే లైఫ్ గ‌ల్లంతే!!

 

మ‌నిషి పుట్టుకే ఒక పోరాటంతో మొద‌ల‌వుతుంది. ఎన్నో ల‌క్ష‌ల శుక్ర క‌ణాల‌తో పోటీప‌డి కేవ‌లం ఒక్క శుక్ర‌కణం మాత్ర‌మే అండాన్ని చేరుకుంటుంది. అంటే ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్న ఒక శుక్ర‌క‌ణం మాత్ర‌మే మ‌నిషిగా రూపుదిద్దుకుంటుంది. ఈ ప‌రిణామం మ‌న‌కు ఏం నేర్పుతుంది? ప్ర‌తీ మ‌నిషి ఒక ప్ర‌త్యేకమైన వాడు లోకంలో మ‌రెవ‌రికీ సాధ్యం కానిది త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. జీవం పోసుకునేట‌ప్పుడే పెద్ద పోరాటం చేసి విజేత‌గా నిలిచిన మ‌నిషి త‌న జీవితంలో మాత్రం త‌న ప్రత్యేక‌త‌ను గుర్తించ‌కుండా పోటీలో వెనక‌బ‌డిపోతున్నాడు. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో, కెరీర్ ను నిర్మించుకోవ‌డంలో చాలా మంది త‌ప్పులు మీద త‌ప్పులు చేస్తూ త‌క్కువ స్థాయిలో ఉండిపోతున్నారు. చాలా మందికి అర్ధం కాని విష‌యం ఏంటంటే కెరీర్ ఛేంజ్ చేస్తే ఉన్న‌త స్థాయికి వెళ్లిపోతాం అనుకుంటున్నారు. అది పొర‌పాటు. కెరీర్ ను మార్చాల‌నుకున్న‌ప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవాలి. అప్పుడే విజ‌యం సాధ్య‌మ‌వుతుంది. చేసే ప‌నిపై నిబ‌ద్ధ‌త‌, ప‌నిపై ఆస‌క్తి, ప‌నిపై అంతులేని ప్రేమ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది ఫ‌లితాల‌ను ఇస్తుంది. లేదంటే గొప్ప‌వాళ్ల‌ను చూసి తాను అలాగే త‌యార‌వాల‌నుకుని చివ‌రికి బోల్తా ప‌డ్డ ఎలుక క‌థ‌లా ఉంటుంది జీవితం.

 

 

నీలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ను గుర్తించు!

 

పూర్వం ఒక అడ‌విలో ఒక ఎలుక ఉండేది. ఆహారానికి లోటు లేకుండా అది హాయిగా జీవించేది. కానీ త‌న రూపం చూసుకుని ఆ ఎలుక అనుక్ష‌ణం అసంతృప్తికి లోన‌య్యేది. ఒక‌రోజు ఆ అడ‌విలో త‌ప‌స్సు చేసుకుంటున్న ఒక మునీశ్వ‌రుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. లోప‌ల నవ్వుకున్న రుషి స‌రే నేను నీకు ఏ విధంగా స‌హాయం చేయ‌గ‌ల‌ను అని అడిగాడు. అప్పుడు ఎలుక స్వామీ ఈ అడ‌విలో జింక కంటే వేగంగా ప‌రిగెత్త గ‌లిగే జంతువును నేను చూడ‌లేదు. న‌న్ను జింక‌గా మార్చండి అని కోరింది. స‌రేన‌న్న రుషి ఎలుక‌ను జింక‌గా మార్చాడు. అయితే ఎలుక ఆనందం రెండు రోజులు కూడా నిలువ లేదు. త‌న‌తో స‌మానంగా ప‌రిగెత్తే పులి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని గ్ర‌హించి వెంట‌నే ముని ద‌గ్గ‌ర‌కు పరిగెత్తుకుంటూ వ‌చ్చింది. స్వామీ..నేను పొర‌పాటుగా కోరుకున్నాను. న‌న్ను పులిగా మార్చండి అని అడిగింది. స‌రేన‌ని ముని జింక రూపంలో ఉన్న ఎలుక‌ను పులిగా మార్చాడు. మ‌ర‌లా కొన్ని రోజుల‌కు ముని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అడ‌విలో బ‌ల‌మైన పులి కూడా భారీగా ఉన్న ఏనుగు ముందు త‌ల‌వంచ‌వ‌ల‌సిందే కాబ‌ట్టి న‌న్ను ఏనుగుగా మార్చండి అని కోరింది. ముని పులి రూపంలో ఉన్న ఎలుక‌ను ఏనుగుగా మార్చాడు. త‌ర్వాత‌ ఎన్ని అవాంతారాలు ఎదురైనా త‌లెత్కుకు నిల‌బ‌డే శిఖ‌రం ముందు భారీ ఏనుగు కూడా బ‌లాదూర్ కాబ‌ట్టి త‌న‌ను పెద్ద శిఖ‌రంగా మార్చ‌మ‌ని అడిగింది. శిఖ‌రంగా మారి గ‌ర్వంతో త‌లెగ‌రేసే లోపు ఒక ఎలుక వ‌చ్చి అంత పెద్ద శిఖ‌రానికి బొరియ చేయ‌డం చూసి ఎలుక ముందు శిఖ‌రం కూడా నిలువ‌లేదని గ్ర‌హించింది. త‌న పొర‌పాటును, అజ్ఞానాన్ని మ‌న్నించి త‌నను ఎప్ప‌టిలాగే ఎలుక‌లా మార్చ‌మ‌ని మునీశ్వ‌రుడ్ని శ‌ర‌ణు వేడింది.

 

 

ముందు నువ్వు మారాలి!

 

వేరొక‌రిని అనుస‌రించే వాళ్ల‌ను ఎవ‌రూ అనుస‌రించ‌రు అన్న మాట మీకు తెలిసే ఉంటుంది. ఎవ‌రో ఫలానా ప‌నిచేసార‌ని కెరీర్ ఛేంజ్ చేయ‌డం వ‌ల‌న ఉన్న‌త స్థానానికి చేరుకున్నార‌ని మ‌నం కూడా అలాగే చేస్తే ఎటువంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు స‌రిక‌దా తిరిగి కెరీర్ దారుణంగా దెబ్బ‌తింటుంది. చేసే ప‌ని చిన్న‌దైనా అందులో నీకు ఆనందం ఉందా? అవ‌స‌ర‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? భ‌విష్య‌త్ లో మ‌రింత ఎదిగేందుకు అవ‌కాశాలున్నాయా? అన్న విష‌యాల‌ను చూసుకోవాలి. కానీ చాలా మంది ప్ర‌స్తుతం ఒక రంగం బాగుంద‌ని అందులోకి మార‌డం అక్క‌డ నుంచి మ‌రో రంగానికి మార‌డం ఇలాంటి ప‌నులు చేస్తున్నారు. అలా అలా తిరిగి చివ‌రిని మొద‌ట చేసిన ప‌నినే మ‌ళ్లీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ మార్చాల్సింది కెరీర్ ను కాదు. మార్చుకోవాల్సింది మిమ్మిల్ని మీరు. లేదంటే ఎలుక క‌థ‌లా చివ‌రికి మీరు మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తారు. ఒక ప్రణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతూ మీ మ‌న‌సుకు నచ్చిన ప‌ని చేసుకుంటూ ముందుకు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే కెరీర్ ఛేంజ్ అనేది స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. అలా కాకుండా మిడి మిడి జ్ఞానంతో ఎవ‌రో చేసార‌ని, ఎవ‌రో ఉన్న‌తంగా ఎదిగార‌ని లేని పోని పోలిక‌లు పెట్టుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

 

 

సాకులు చెప్ప‌డం మానుకోండి!

 

ఉన్న‌త స్థానానికి వెళ్లిన వ్య‌క్తుల‌ను మ‌నం చూస్తూ ఉంటాం. వాళ్లు సాధించిన‌ప్పుడు మ‌నం ఎందుకు సాధించ‌లేం అన్న ఆలోచ‌న మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా? ఇక్క‌డ వాళ్ల‌తో పోల్చుకుని తిక‌మ‌క ప‌డ‌మ‌ని కాదు పోల్చుకోవ‌డం వేరు స్పూర్తిని పొందడం వేరు. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని గుర్తించ‌గ‌ల‌గాలి. మ‌నం ముందు చెప్పుకున్నాం. ల‌క్ష‌లాది ఇత‌ర శుక్ర‌క‌ణాల‌తో పోటీప‌డి నువ్వు ఈ భూమిమీద‌కు వ‌చ్చావు. అంటే నీలో చాలా ప్ర‌త్యేక‌త ఉంది. మ‌రి అలాంట‌ప్పుడు మిగిలిన వారు సాధించింది నువ్వు కూడా సాధించ‌గ‌ల‌వు. కానీ సాకులు చెపుతూ కార‌ణాలు వెతుకుతూ చాలా మంది త‌మ‌కు తాము స‌ర్దిచెప్పుకుంటారు. విజ‌యం సాధించిన‌ వ్య‌క్తుల‌కు అన్నీ అనుకూలంగా ఉన్నాయ‌ని, వాళ్ల‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని, ఆర్థిక వన‌రులు ఉన్నాయ‌ని ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చెపుతారు. జీవితం అంద‌రికీ అవ‌కాశాలను ఇస్తుంది. వాటిని గుర్తించ‌గ‌లిగిన వాడు ఉన్న‌త స్థానంలో ఉంటాడు. గుర్తించ‌లేని వాడు ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా కింది స్థాయిలోనే ఉండిపోతాడు.

 

 

నీ కెరీర్ ను నువ్వే నిల‌బెట్టుకోవాలి!

 

నిజానికి భూమి మీద సంభ‌వించే ప్ర‌తీ ఘ‌ట‌న‌కు ఒక కార‌ణం ఉంటుంది. నువ్వు కూడా ఈ భూమి మీద‌కు ఏదో ఒక‌టి సాధించ‌డానికే వ‌చ్చావు. ఇక్కడ ఉంటే కొద్ది కాలంలో దాన్ని సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. సాకులు చెప్పుకుంటూ స‌మ‌ర్ధింపులు చేసుకుంటూ కాలం గ‌డిపేస్తే సాధించేందుకు ఏమీ మిగ‌ల‌దు. అవ‌కాశాలు మ‌న త‌లుపు త‌డుతున్న‌ప్పుడు గుర్తించాలి. వాటిని రెండు చేతుల‌తో అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకోలేన‌ప్పుడు నిన్న కాపాడ‌టం ఎవ‌రి త‌ర‌మూ కాదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూనే నీకు ఏ ప‌నిపై ఆస‌క్తి ఉందో.. ఏ ప‌ని చేస్తే నువ్వు ఉన్న‌తంగా ఎదుగుతాను అనుకుంటున్నావో దాన్ని గుర్తించ‌డం చాలా ముఖ్యం. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మీ కెరీర్ పై మీకు స్ప‌ష్ట‌త ఉండాలి. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా వినియోగించుకుంటూ ప‌క్క వాళ్ల‌తో పోలిక‌లు పెట్టుకోకుండా , స్పూర్తిగా మాత్ర‌మే తీసుకుంటే మీ కెరీర్ వెలిగిపోతుంది.

 

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

ప్రధాని సెక్యూరిటీ గార్డ్ మీ కెరీర్‌ నూ కాపాడగలడు!!

 

 

శ్ర‌ద్ధ‌, నిబ‌ద్ద‌తతో పనిచేసే వాళ్లను మ‌నం నిశితంగా గ‌మ‌నిస్తే మ‌న‌కు కొన్ని విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. వాళ్లు తాము చేప‌ట్టిన ప‌నిని త‌దేక దృష్టితో ఎటువంటి పొర‌పాటు లేకుండా విజ‌యవంతంగా పూర్తి చేస్తారు. ఎన్ని ప్ర‌లోభాలు ఉన్నా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వాళ్లు మాత్రం త‌మ దృష్టిని ప‌నిపైనే నిలుపుతారు. ఇటువంటి వ్యక్తుల‌ను ఆద‌ర్శంగా తీసుకుంటే మ‌నం కూడా కెరీర్ లో విజ‌యవంత‌మైన వ్య‌క్తులుగా ఎద‌గొచ్చు. అప్ప‌గించిన ప‌నిని శ్ర‌ద్ధ‌తో చేసిన ఉద్యోగుల‌కు కంపెనీల హెచ్ఆర్ పాల‌సీల్లో ఆకర్ష‌ణీయ‌మైన ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ అధికారులను ఒకసారి ఆపాద‌మ‌స్త‌కం ప‌రిశీలిస్తే వాళ్లు త‌మ ప‌నిపై త‌ప్ప మిగ‌తా విష‌యాల‌పై ఎంత అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఉద్యోగులు కూడా కంపెనీలోని ఇత‌ర విష‌యాల‌పై దృష్టిని మ‌రల్చ‌కుండా చేస్తున్న ప‌నిపై మాత్ర‌మే ఫోక‌స్ చేస్తే బెస్ట్ ఎంప్లాయ్ గా గుర్తింపును పొంద‌వ‌చ్చు.

 

 

 

ల‌క్ష్యం మాత్ర‌మే గుర్తుండాలి..ఆక‌ర్ష‌ణ‌లు కాదు!

 

మీరు ఎప్పుడైనా పీఎం, సీఎం, రాష్ట్రప‌తి వంటి ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ వ్య‌క్తుల‌ను గ‌మ‌నించారా? తాము ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన నాయ‌కులు ఎటువంటి కార్య‌క్ర‌మంలో ఉన్నా స‌రే ఆ భ‌ద్ర‌తాధికారులు మాత్రం తాము ఇవ్వాల్సిన ర‌క్ష‌ణ‌పైనే దృష్టి పెడ‌తారు. ప్ర‌ముఖులు పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో ఎన్నో వెలుగు జిలుగులు, ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా వారు మాత్రం చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను గ‌మ‌నిస్తూ తాము భ‌ద్ర‌త ఇవ్వాల్సిన వ్య‌క్తుల‌కు ఎటువంటి అపాయం క‌లుగుకుండా కాపాడుతూ ఉంటారు. చుట్టూ ఉన్న అంద‌రూ ఆ కార్య‌క్ర‌మాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటే వారు మాత్రం ఒక్క క్ష‌ణం కూడా ప‌క్కకు చూపు తిప్ప‌కుండా పూర్తి అప్ర‌మ‌త్త‌త‌తో ఉంటారు. వారిని దృష్టిని ఏ ఆక‌ర్ష‌ణ కూడా చెడ‌గొట్ట‌లేదు. ఇది చాలా సామాన్య‌మైన విష‌య‌మే అయినా సెక్యూరిటీ ఆఫీస‌ర్లు ప్ర‌ద‌ర్శించే ఆ ఫోక‌స్ ను ప్ర‌తీ ఒక్క‌రూ గ్ర‌హించ‌గ‌లిగితే జీవితంలో ఊహించని అభివృద్ధిని సాధించ‌వ‌చ్చు. అయితే వారి వారి కెరీర్ ల‌కు అన్వ‌యించుకున్న‌ప్పుడు దాన్ని స‌రైన రీతిలో ఆపాదించుకున్న‌ప్పుడు అద్భుతాలు ఆవిష్కృత‌మ‌వుతాయి.

 

 

త‌న కోస‌మే రెడ్ కార్పెట్ వేసార‌నుకోవ‌డం గుర్రం త‌ప్పు!!

 

ఒక ప్ర‌ధాన మంత్రి ఎటువంటి అద్భుత‌మైన కార్య‌క్ర‌మానికి వెళ్లినా అక్క‌డ‌కు సెక్యూరిటీ ఆఫీస‌ర్ కూడా వెళ్తాడు. పెద్ద పెద్ద దేశాధినేత‌లు, గొప్ప గొప్ప వ్య‌క్తులు చుట్టూ ఉంటారు. అంత మాత్రం చేత‌న తన‌ను తాను గొప్ప‌వాడుగా ఊహించుకుని గ‌ర్వ‌ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది. త‌న ప‌ని కేవ‌లం ప్ర‌ధానికి ఎటువంటి హానీ జ‌ర‌గుకుండా అత్యుత్త‌మ ర‌క్ష‌ణను అందించ‌డం అంతే. మిగ‌తా విష‌యాలు, సంఘ‌ట‌న‌లు ఏమీ అత‌న్ని ఆక‌ర్షించ‌కూడ‌దు? అలా కాకుండా తాను ప్ర‌ధాని సెక్యూరిటీని నేను చాలా గొప్ప‌వాడ్ని అనే ఆలోచ‌నా ధోర‌ణిలోకి వెళితే మొద‌టికే మోసం వ‌స్తుంది. పూర్వం కాలంలో రాజుపై గుర్రంపై ఊరుగుతుంటే కింద రెడ్ కార్పెట్ వేసి పూలు జ‌ల్లి స్వాగ‌తం ప‌లికేవారు. ఇదంతా కేవ‌లం రాజుగారి కోసం మాత్ర‌మే జ‌రుగుతుంది. అలా కాకుండా గుర్రం ఈ రెడ్ కార్పెట్, ఈ పూలు ఇవన్నీ త‌న కోస‌మే అనుకుంటే అది గుర్రం అజ్ఞానం అవుతుంది. రాజుగారు మీద కూర్చున్నంత వ‌ర‌కూ మాత్ర‌మే గుర్రానికి విలువ‌. త‌ర్వాత అది కూడా మిగ‌తా గుర్రాల్లానే ఒక మామూలు గుర్రం అంతే.

 

 

కంపెనీ ప్ర‌యోజ‌నాలు మాత్ర‌మే గుర్తుండాలి!

 

కంపెనీ త‌న ఉద్యోగుల‌ను ఏదైనా సెమినార్ కు పంపి అక్క‌డ బ్రాండ్ ప్ర‌మోష‌న్ చేయ‌మ‌ని చెప్పిన‌ప్పుడు ఉద్యోగి కేవ‌లం కంపెనీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఆలోచించాలి. అనుక్ష‌ణం త‌న జాబ్ పై దృష్టి సారించి కంపెనీ త‌న‌కిచ్చిన టార్గెట్ ను రీచ్ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. అలా కాకుండా అక్కడ ఉండే మిగ‌తా విష‌యాల‌పై దృష్టి సారిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంది. ముఖ్యంగా కంపెనీని ప్ర‌మోట్ చేయ‌డానికి కంపెనీ విధివిధానాల‌ను ప్ర‌చారం చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు కేవ‌లం కంపెనీ ప్ర‌తినిధులుగానే వ్య‌వ‌హ‌రించాలి . కానీ సెమినార్ లో పాల్గొనే సాధార‌ణ ప్ర‌తినిధుల్లా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. సాధార‌ణ ప్ర‌తినిధుల్లా ప్ర‌వ‌ర్తించ‌డం అంటే కంపెనీకి న‌ష్టం చేకూరుస్తున్న‌ట్టు. ఈ విష‌యాన్ని ఉద్యోగులు బాగా గుర్తుంచుకోవాలి. అక్క‌డ కేవ‌లం త‌మ ఫోక‌స్ అంతా కంపెనీకి ఎటువంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌గ‌లం..ఈ వేదిక‌ను ఎంత బాగా వాడుకోగ‌లం..అన్న విష‌యాల‌పైనే ఉండాలి. ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే సెక్యూరిటీ ఆఫీస‌ర్ ఎంత ఫోక‌స్ తో ఉంటాడో అంతే ఫోక‌స్ గా ఉద్యోగి కూడా ఉండాలి. త‌ను నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో చుట్టూ ఉన్న ప్ర‌లోభాల‌ను, ఆక‌ర్ష‌ణ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌దు.

 

 

సంస్థ విశ్వాసాన్ని నిల‌బెట్టండి!

 

ఒక ఉద్యోగికి సంస్థ మాత్ర‌మే దైవం. త‌న‌కు సంస్థ కంటే ముఖ్య‌మైన‌ది ఇంకేది ఉండ‌కూడ‌దు. త‌ను విధుల్లో ఉన్న‌ప్పుడు కేవ‌లం సంస్థ ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే పాటుప‌డాలి. సంస్థ త‌న‌పై పెట్టుకున్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నం చేయాలి. ఇక్క‌డే చాలా మంది ఇలా ఆలోచిస్తారు. సంస్థ కోసం ఇంత‌లా ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏదో పైపైన అలా చేసుకుంటూ వెళ్లిపోదాం అనుకుంటారు. ఇటువంటి ఆలోచ‌నా విధానం కెరీర్ ను తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. సంస్థ కోసం శ్ర‌మించిన‌ప్పుడు, దాన్ని త‌గిన విధంగా ప్ర‌చారం చేసుకున్న‌ప్పుడు క‌చ్చితంగా గుర్తింపు వ‌స్తుంది. మీ స‌మ‌ర్ధ‌త వెల్ల‌డైన‌ప్పుడు కంపెనీ మీపై ఎన‌లేని న‌మ్మ‌కాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. కెరీర్ లో ఉన్న‌త‌స్థానాన్ని క‌ల్పిస్తుంది. క‌ష్ట‌ప‌డే వాళ్ల‌ను, ఫోక‌స్ తో ప‌నిచేసే వాళ్ల‌ను వ‌దులుకునేందుకు ఏం కంపెనీ సిద్ధంగా ఉండ‌దు. అప్ప‌గించిన ప‌నిని జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీలా పూర్తి ఫోక‌స్ తో పూర్తి చేయాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

 

ఆ విషయంలో నిజాయితీగా ఉంటే మీకు ఉద్యోగం వచ్చినట్టే !!

 

ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే ఒక మహా యుద్ధాన్ని గెలవడం లాంటిది. గెలుపుకి ఓటమికి మధ్య చిన్న అంతరం మాత్రమే ఉంటుంది. బలం ఉన్నా పొరపాట్లు చేసినవాళ్లు యుద్ధంలో ఓడిపోయినట్టు ఎన్ని నైపుణ్యాలు ఉన్నా చిన్న చిన్న తప్పులు మీకు ఉద్యోగం రాకుండా అడ్డుపడతాయి. ముఖ్యంగా క్లాస్ రూమ్ సబ్జెక్ట్ లో నెంబర్‌వన్ గా ఉన్న వాళ్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం మనం చూస్తూనే ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంటర్వ్యూకు, గదిలో కూర్చుని పరీక్ష రాయడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇంటర్వ్యూ అంటే రెండు గంటల్లో మీ నైపుణ్యాలతో పాటు మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఒక ప్రక్రియ. ఇక్కడ నైపుణ్యం మాత్రమే ఉంటే సరిపోదు. నిజాయితీ, వాస్తవికంగా ఆలోచించే లక్షణం ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తారు. ఉన్నది ఉన్నట్టు.. తెలిసింది తెలిసినట్టు చెప్పడమే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా హాబీలు, జామ్ ( జస్ట్ ఏ మినిట్ ) రౌండ్ లో నిజాయితీ అనేది అభ్యర్ధులకు బాగా ఉపయోగపడుతుంది.

 

 

తప్పులో కాలేయకండి!

 

చాలా మంది అభ్యర్ధులు హాబీల విషయంలో రెజ్యుమెలో పేర్కొన్న దానికి వాస్తవంగా వాళ్లు ఇష్టపడే దానికి ఎక్కడా పొంతన ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఇంటర్వ్వూలో విఫలం అయ్యే అవకాశాలున్నాయి. ఉదాహరణకు మీరు రెజ్యుమెలో హాబీల దగ్గర బుక్ రీడింగ్ అని రాసారు అనుకోండి. అక్కడ చాలా పర్టిక్యులర్ గా మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతారో తప్పనిసరిగా వివరించాలి. బుక్ రీడింగ్ అని చెప్పినప్పుడు రిక్రూటర్ల నుంచి మీకు విభిన్న ప్రశ్నలు ఎదురు కావచ్చు. ప్రముఖ వ్యక్తులు బయోగ్రఫీలు చదివారా? అని అడగొచ్చు. అప్పుడు తెల్లమొఖం వేసే పరిస్థితి ఎదురుకావచ్చు. అందుకే చాలా క్లియర్ గా నేను ఫిక్షన్ పుస్తకాలు మాత్రమే చదువుతాను అని వెల్లడించాలి. అది కూడా మీకు నిజంగా పుస్తకం పఠనం అంటే ఆసక్తి ఉండి మీరు నిజంగా ఫిక్షన్ పుస్తకాలు చదువుతున్నప్పుడు మాత్రమే అలా రాయాలి. లేని విషయాన్ని చెప్పడం వలన రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండవు. ఎవరో రాసారని కాకుండా నిజంగా మీకు ఆసక్తి అంశాన్నే హాబీలుగా పేర్కొనాలి.

 

 

అబద్దాలు చెపితే అడ్డంగా బుక్కవుతారు!

 

మనం ముందు చెప్పుకున్నట్టు హాబీల విషయంలో అస్సలు అబద్దాలు చెప్పకూడదు. ఒక విష‍యంపై సరైన అవగాహన లేనప్పుడే అది నా హాబీ అని చెప్పడం అంటే మీకు మీరు నష్టం చేసుకుంటున్నట్టే. ఉదాహరణకు సినిమాలు చూడటం నా హాబీ అని చెప్పారనుకొండి. సినిమాకు సంబంధించి అన్ని విషయాలపైన కనీసం ప్రాథమిక అంశాల మీద కాస్త అయినా పట్టు ఉండాలి. ఫలానా దర్శకుడు తీసిన హిట్ సినిమాలు ఏవి అన్న ప్రశ్న ఎదురు కావచ్చు. లేదా ఫలానా నటుడి గురించి వివరాలు అడగొచ్చు. అప్పుడు నీళ్లు నమిలితే ఉపయోగం ఉండదు. మీరు అబద్దం చెప్పారన్న విషయం రిక్రూటర్స్ కు చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. హాబీ అనేది మీ ఇష్టంలోని గాఢతను తెలియజేయాలి. అది సినిమా కావచ్చు, పోటగ్రఫీ కావచ్చు, క్రికెట్ కావచ్చు మరేదైనా కావచ్చు. అందులోని ప్రాథమిక విషయాలపై ఏం అడిగినా చెప్పే విధంగా ఆ గాఢత ఉండాలి. అంతేకాని నోటికి వచ్చింది చెపితే మీరు ఇంటర్వ్యూలో విజేతలు కాలేరు.

 

 

‘జస్ట్ ఏ మినిట్’ లో కూడా నిజాయితీయే కీలకం!

 

ఇప్పుడు ఇంటర్వ్యూలో జామ్ ( జస్ట్ ఏ మినిట్ ) కూడా చాలా కీలకంగా మారింది. ఒక నిమిషం టైం ఇచ్చి ఒక అంశం ఇచ్చి మాట్లాడమని చెపుతారు. చాలా వరకూ ఇంటర్వ్యూల్లో జామ్ లో మీ రోల్ మోడల్ గురించి చెప్పండి అని అడుగుతారు. మీకు ఎంత మంచి కమ్యూనికేషన్ ఉన్నా ఎంత పద సంపద ఉన్నా మీరు చెప్పినదాంట్లో వాస్తవికత కనిపించకపోతే రిక్రూటర్స్ నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. జామ్ లో చాలా మంది అభ్యర్ధులు రోల్ మోడల్ గురించి చెప్పమనగానే తమ కమ్యూనికేషన్ ను ఉపయోగించి ఒక ప్రముఖ వ్యక్తి గురించి గడాగడా చెప్పేస్తారు. అది పూర్తి తప్పు. రోల్ మోడల్ గురించి చెప్పమన్నప్పుడు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచాడో అతని నుంచి ఏం నేర్చుకున్నారో మీరు చెప్పగలగాలి. ధైర్యం, ఏదైనా సాధించగలననే నమ్మకం మీకు ఎలా వచ్చిందో చెప్పాలి. అంతేకానీ అతని జీవిత చరిత్రను అప్పజెపితే రిక్రూటర్స్ మీకు ఎందుకు ఉద్యోగం ఇస్తారు? ఎందుకంటే మీ నిజాయితీని పరీక్షించాలనుకుంటున్నవారికి మీరు కృత్రిమ జవాబులు చెపితే ఎలా నచ్చుతుంది?

 

 

మీ నిజాయితీకి అడుగడుగునా పరీక్ష ఎదురవుతుంది!

 

ఇంటర్వ్యూలో ఇదొక్కటే కాదు. మీ నుంచి వాస్తవికతతో కూడిన సమాధానం రాబట్టేందుకు రిక్రూటర్స్ చాలా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అభ్యర్ధుల సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు రకరకాల ప్రశ్నలు సంధిస్తారు. అకస్మాత్తుగా వారు వేసే ప్రశ్నలకు తెల్లమొఖం వేసినా గుర్తుకు రావట్లేదు అని చెప్పినా మీరు విఫలమైనట్టే. ఉదాహరణకు మధ్యాహ్నం భోజనం ఏం చేసావు? మీ నాన్న ఈరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? అని అడుగుతారు. వాటికి వెంటనే ఉన్నది ఉన్నట్టు టక్కున సమాధానం చెప్పాలి. మీ ఐక్యూని, ఒక విష‍యంపై మీ నిజాయితీని అంచనా వేసేందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అయోమయానికి గురికాకుండా సమయస్పూర్తిగా సమాధానాలు చెప్పాలి. వాస్తవికతతో నిజాయితీగా ఉంటే ఇంటర్వ్యూలో మీ విజయాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

 

ఈ భూమిపై అత్యంత విలువైన వస్తువేంటో తెలుసా?

ప్రతీ వస్తువుకు, ఒక అంశానికి, ఒక పరిణామానికి ఇలా అన్నింటింకి విలువ ఉంటుంది. ఆయా కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా ఆ విలువ మారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏంటన్నదానిపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. కొందరు బంగారం విలువైనది అంటే మరికొందరు భూమి అన్నింటికంటే విలువైనది అని చెపుతూ ఉంటారు. కొందరు వారి వారి అనుభవాలు, పరిస్థితులు ఆధారంగా విలువైన వస్తువులు జాబితాకు నిర్వచనం చెప్పుకుంటారు. అయితే ఇదే విషయంపై ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి. అసలు ఈ భూమిపై అన్నింటికంటే విలువైన వస్తువు మనిషి మాత్రమేనని ఆ సర్వే తేల్చింది. డబ్బులు, వస్తువులు, ఇళ్లు ఇవన్నీ విలువను కోల్పోయే వని కానీ మనిషి మాత్రం కాలంతో పాటు తన విలువను పెంచుకుంటాడని వెల్లడించింది. మానవ వనరులు అనేవి ఎప్పటికీ తరగని అంతులేని ఆస్తి అన్నది స్పష్టమైంది.

 

 

మనుష్యులే అత్యంత విలువైన వారు!

 

మనిషి చాలా విలువైన వాడని వెల్లడించిన సర్వే విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ విషయాలను వెల్లడించింది. ఈ భూమిలో ప్రతీ వస్తువు కాలగమనంలో తన విలువను కోల్పోతూ ఉంటుంది. అది బంగారం కావచ్చు. ఏదైనా ఇతర వస్తువు కావచ్చు. ఉదాహరణకు మనం ఎంత విలువైన కారును లేదా ఇళ్లును కొనుగోలు చేసినా కొన్ని రోజులు పోయాక వాటి విలువ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దీన్నే ఆర్థిక పరిభాషలో విలువ తరుగుదల అని అంటూ ఉంటారు. కాలంతో పాటు మనం విలువైనవి అనుకున్నవి అన్నీ తమ విలువను పోగొట్టుకుంటున్నప్పుడు మరి కాలంతో పాటు విలువ పెరిగే సాధనం ఏమన్నా ఉందా? అంటే అది మనిషి మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి తన చిన్నతనంలో నైపుణ్యాలలేమితో తక్కువ విలువను కలిగి ఉంటాడు. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ తన నైపుణ్యాలను పెంచుకుంటూ తన విలువను కూడా పెంచుకుంటాడు. ఇది ఒక్క మనిషికే సాధ్యం. అందుకే ఈ భూమిపై విలువైనదేంటి అన్న సర్వేలో మనుష్యులకే అగ్రస్థానం దక్కింది.

 

 

మానవ వనరుల నిర్వహణ పరిశ్రమగా ఎదగాలి!

 

అయితే ఇంతటి కీలకమైన మనిషిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో సరైన ముందడుగు పడటం లేదు. మానవ వనరులు సద్వినియోగం విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష‌యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మానవ వనరుల ఆధారంగా నిర్వహించే సర్వీసెస్ కు రుణాలు ఇచ్చేందుకు వాటిని ఒక పరిశ్రమగా గుర్తించేందుకు బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావు. అదే ఒక వస్తువు కొని పరిశ్రమ పెడతామంటే చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తారు. వస్తూత్పత్తి కి రుణాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఉద్దేశ్యం కాదు కానీ కాలంతో పాటు విలువను కోల్పోయే వస్తువుకు రుణాలు ఇస్తున్నప్పుడు కాలంతో పాటు విలువను పెంచుకునే వాటికి రుణాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. మానవ వనరుల నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన విషయం. వాటికి రుణాలు ఇచ్చి ప్రొత్సాహిస్తే విలువైన దానికి మరింత విలువ సమకూరి మెరుపును సంతరించుకుంటుంది.

 

 

మానవ సంబంధాలే మనిషి ఎదుగుదలలో కీలకం!

 

అయితే ఈ మానవ వనరుల నిర్వహణలో కూడా కొన్ని పద్ధతులను సరైన రీతిలో అవలంభించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఒక పర్సనాలిటీ డవలప్‌మెంట్ క్లాస్ లో ఏం నేర్పిస్తారు? భావవ్యక్తీకరణ, అవతలి వ్యక్తులతో ఆకట్టుకునేలా మాట్లాడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం వంటివి నేర్పిస్తారు. ఇవన్నీ వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయాలే కానీ ఒక మనిషితో సంబంధాలను ఎలా నెలకొల్పుకొవాలి? వాళ్లతో ఒక మంచి రిలేషన్ ను ఎలా కొనసాగించాలి? అన్న విషయాలను నేర్పించడం లేదు. ఒక మనిషితో మరో మనిషి ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నప్పుడే మాత్రమే మానవ వనరులు నిర్వహణలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మనిషి తన ఆలోచనా శక్తి, సంబంధాలపై గౌరవాన్ని పెంచుకున్నప్పుడు సమాజానాకి మేలు జరుగుతుంది. లేదంటే ఎన్ని వ్యక్తిత్య వికాస తరగతులు చెప్పినా అవి కొరగాకుండా పోవడం ఖాయం.

 

 

విలువైన వస్తువును భద్రంగా కాపాడుకుందాం!

 

ఒక విలువైన వస్తువును మనం ఎంత భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువైన మనిషిని ఇంకెంత బాగా కాపాడుకోవాలి. ముఖ్యంగా కాలంతో పాటు తన విలువను పెంచుకునే మనిషికి మరింత విలువను ఆపాదించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మానవ వనరులు నిర్వహణ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పి ఆ రంగంలో ఉన్న సంస్థలను చేయూతనిచ్చి వాటిని ఒక పరిశ్రమగా గుర్తిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. వాటిని సర్వీసెస్ గా కాకుండా ఒక విలువైన వస్తువును అందించే సంస్థలుగా గుర్తించి రుణాలు మంజూరు చేస్తే వాటికి మరింత మంది నిపుణులను అందించేందుకు వీలు కలుగుతుంది. సరైన మానవ వనరుల నిర్వహణ, శిక్షణ ఉంటే చాలు ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. ఎందుకంటే విలువైనవి ఎప్పుడూ తమ విలువను గుర్తించమని అర్ధించవు. మనమే వాటి ప్రాధాన్యతను గుర్తించి ఆ విలువను మన అభివృద్ధికి వాడుకోవాలి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్..దేన్ని ఎలా వాడుకోవాలో మీకు తెలుసా??

 

ప్రస్తుతం విద్యార్ధులు ఫేస్‌బుక్ పై అధిక సయమం వెచ్చిస్తున్నారు. ఫోటోలు షేర్ చేయడానికి, ఫ్రెండ్స్ తో చాట్ చేయడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి, ఇష్టమైన విషయాలను షేర్ చేయడానికి ఫేస్‌బుక్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఒక సర్వే ప్రకారం రోజులో మన దేశంలో విద్యార్ధులు దాదాపు 5 నుంచి 6 గంటలు ఫేస్‌బుక్ లోనే గడుపుతున్నారని తేలింది. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన ఆ విలువైన సమయాన్ని ఫేస్‌బుక్ చూస్తూ వృధా చేయడం ఆందోళన రేపుతోంది. ఏ మాధ్యమాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఎంత సమయం కేటాయించాలన్న దానిపై సరైన అవగాహన లేకపోవడం ఇప్పుడు సమస్యకు మూలకారణంగా కనిపిస్తోంది. ఫేస్‌బుక్ లో తమ ప్రొఫైల్ కు సంబంధించి ఒక పేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి పరిమితం కావాల్సింది పోయి చాటింగ్ లకు వీడియోలు చూస్తూ విద్యార్ధులు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, ఏయే నైపుణ్యాలను పెంచుకోవాలో అన్న దానిపై సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

 

 

నైపుణ్యాలు అనే మాటనే మర్చిపోతున్నారు!

 

తాజాగా వీబాక్స్ ఇండియా అనే సంస్థ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2018 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల విద్యాసంస్థలు, ఏఐసీటీసీ వంటి వివిధ విద్యా సంబంధిత సంస్థల సహకారంతో ఈ నివేదిక విడుదలైంది. అయితే ఉద్యోగానికి నైపుణ్యాలే కీలకమైన ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది విద్యార్ధులకు సరైన నైపుణ్యాలే లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేసేందుకు నెట్‌వర్కింగ్ ను పెంచుకునేందుకు విద్యార్ధులు సిద్ధంగా లేరు. మరోవైపు రెజ్యుమె తో పాటు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉండడం కూడా ముఖ‌్యమే. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ లో చురుగ్గా ఉంటున్నారు కానీ అది పోసుకోలు కబుర్లు చెప్పుకునేందుకు యూట్యూబ్ సినిమాలు, వీడియోలు చూసేందుకు మాత్రమే విద్యార్ధులు ప్రాధాన్యతనిస్తున్నారు. జాబ్ మార్కెట్ ఆన్‌లైన్ మోడ్ లోకి మారిపోయిన నేపథ్యంలో ఆన్‌లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటే అంత ఉపయోగం. అయితే విద్యార్ధులు ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకోవడం విఫలమవుతున్నట్టు తెలుస్తోంది.

 

 

నైపుణ్యాల సాధనలో ఇవే కీలకం!

 

ఒక విద్యార్ధికి థియరీ నాలెడ్జ్ అనేది ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ పట్టు కూడా అంతే ముఖ‌్యం. కానీ చాలా మంది విద్యార్ధులు ఇదే కరవవుతోంది. అసలు ఇంటర్న్‌షిప్స్ చేస్తే విద్యార్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా మంది విద్యార్ధులు మాత్రం ఇంటర్న్‌షిప్ అంటే చాలా ముఖం తిప్పుకుంటున్నారు. ఇక ఇంటర్న్‌షిప్ ను ఎంచుకుంటున్న కొద్ది మంది కూడా దాన్ని ఉద్యోగ సాధనకు ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇక నెట్‌వర్కింగ్ లో చాలా మంది విద్యార్ధులు వెనుకబడి ఉన్నారు. అసలు నెట్‌వర్క్ లేకుండా కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం అసంభవం. ఈ విషయాన్ని విద్యార్ధులు అసలు గుర్తించడం లేదు. వివిధ సందర్భాల్లో , వేదికల్లో ఏర్పడిన పరిచయాలను సుధీర్ఘ కాలం పాటు కొనసాగించాలి. ఉద్యోగ సాధనలో నెట్‌వర్కింగే కీలకం. అయితే పరిచయాలను కొనసాగించడంలో 85 శాతం మంది విఫలమవుతున్నట్టు సర్వేలు చెపుతున్నారు. ఇక రెజ్యుమెను సరైన రీతిలో తయారు చేసుకోవడం కూడా చాలా మంది విద్యార్దులుకు తెలియడం లేదు. అసలు రెజ్యుమె తయారీలో కీవర్డ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఉద్యోగ ప్రకటనకు అనుగుణంగా రెజ్యుమెను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హలతో పాటు నాయకత్వ ప్రతిభను ప్రతిబింబించే ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ను కూడా అందులో ప్రస్తావించాలి.

 

 

దేన్ని ఎంతవరకు ఎలా వాడాలో తెలియాలి!

 

మన దేశంలో ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బాగా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ డిజిటల్ విప్లవాన్ని అందుకుని విద్యార్ధులు ఉద్యోగ సాధనలో దూసుకుపోవాలి. కానీ వాస్తవానికి అలా జరగడం లేదు. విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉంటున్నారు. కానీ ఆన్‌లైన్ ను ఉద్యోగాన్ని సాధించేందుకు కాకుండా వీడియోలు చూసేందుకు సోషల్ మీడియాలో టైం పాస్ కబుర్లు చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్నారు.మన విద్యార్ధుల్లో 92 శాతం మంది ఫేస్‌బుక్ , 62 శాతం మంది యూట్యూబ్ లలో అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. అదే సమయంలో జాబ్ ను తెచ్చిపెట్టే ప్రొఫెషనల్ ఆన్‌లైన్ సోర్స్ లింక్డ్ ఇన్ ను కేవలం 26 శాతం మంది మాత్రమే చూస్తున్నారు. అందులో సరైన ప్రోఫైల్ ను పెట్టేందుకు కూడా చాలా మంది విద్యార్ధులకు తీరిక ఉండటం లేదు. అసలు దేనికి ప్రాధాన్యతనివ్వాలి? దేన్ని ఎంత సమయం చూడాలి? దేన్ని ఏ విధంగా వాడుకోవాలి? అన్న దానిపై అధిక శాతం మంది విద్యార్ధులకు అసలు అవగాహనే కొరవడుతోంది.

 

 

వేదికలను వాడుకోవడం తెలియాల్సిందే!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. ఇంటర్వ్యూలు, అభ్యర్ధుల ఎంపిక అనేది గతంలో జరిగిన విధంగా లేదు. ఇప్పుడు కంపెనీలు ఆన్‌లైన్ ప్రొఫెల్స్ ద్వారా తమకు కావాల్సిన అభ్యర్ధులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. అందుకే విద్యార్ధులు అర్హతలు, నైపుణ్యాలు ఆన్‌లైన్ రిక్రూటర్స్ కు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రిక్రూటర్స్ అభ్యర్ధి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ , సోషల్ మీడియాలో వాళ్ల గుర్తింపును పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫేస్‌బుక్ పేజ్ లో ఇతర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తూ యాక్టివ్ గా ఉండాలి. అలా అని వాటిలో సమయాన్ని వృధా చేసుకోకుండా లింక్‌ఇన్ వంటి మాధ్యమాల్లో ప్రోఫైల్ ను అప్‌డేట్ గా ఉంచుకోవాలి. ఆన్‌లైన్ ను సమర్ధవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన అభ్యర్ధులు ప్రస్తుత మార్కెట్లో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు సమర్పించినవారు)

 

 

టాలెంట్ ను గుర్తించ‌గ‌ల‌గ‌డ‌మే టాప్ స‌క్సెస్!!

 

 

మాన‌వ వ‌న‌రుల ఎంపికలో స‌రైన నిర్ణ‌యాలే ఇప్పుడు కంపెనీల భ‌విష్య‌త్ ను నిర్ణ‌యిస్తున్నాయి. అందుకే హెచ్ఆర్ విభాగంలో కొత్త త‌ర‌హా విధానాలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. అందుకు అనుగుణంగానే హెచ్ఆర్ విభాగాన్ని బ‌లోపేతం చేసేందుకు కంపెనీలు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల ఎంపిక మొద‌లుకుని, ప‌ని వాతావ‌ర‌ణం, సౌక‌ర్యాలు, ఉత్పాద‌కత‌ మొదలైన విష‌యాల్లో ఎన్న‌డూ లేని కొత్త ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. ఒక‌వైపు ఆటోమేష‌న్, మ‌రోవైపు కృత్రిమ మేధను సొంతం చేసుకుంటూనే అదే స‌మ‌యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగుల‌ను కాపాడుకోవడ‌మే కంపెనీ యొక్క అస‌లైన విజ‌యం. అందుకే కొద్దో గొప్పో బ‌ల‌హీన‌త‌లు ఉన్నా ఉద్యోగుల ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టేందుకు అధిక శాతం కంపెనీలు రెడీగా ఉన్నాయి.

 

 

ప్ర‌తిభ కలిగిన ఉద్యోగులే కంపెనీకి బ‌లం!

 

రీసెంట్ గా నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో ప్ర‌తిభ‌ను ప్రోత్సాహిస్తూ క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకున్న కంపెనీలు తమ పోటీ సంస్థ కంటే 15 శాతం ఎక్కువ ఉత్పాద‌క‌త‌ను సాధించాయ‌ని తేలింది. లాభాల‌ను సాధించాల‌న్నా, విలువ‌ను పెంచుకోవాల‌న్నా టాలెంట్ ను ఒడిసిప‌ట్టుకోవ‌డ‌మే కీల‌క‌మ‌న్న‌ది సీనియ‌ర్ హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ఒక ఉత్ప‌త్తిని ప్ర‌వేశ‌పెట్టినా లేక కొత్త బిజినెస్ మోడ‌ల్ ను లాంచ్ చేసినా అవి ఎక్కువ రోజులు మ‌నుగ‌డ సాగించ‌లేక‌పోతున్నాయి. అందుకే ఆవిష్క‌ర‌ణ‌, అభివృద్ధి అనేది ఒక నిరంత‌ర ప్ర‌క్రియ‌గా మారిపోయింది. కొత్త‌గా ఆలోచించకుంటే కంపెనీలకు మ‌న‌గ‌డ అన్న‌దే లేని ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిభ క‌లిగిన ఉద్యోగులను నియ‌మించుకోవ‌డం, వారిని జాగ్ర‌త్త‌గా కాపాడుకోవడం కంపెనీల‌కు అనివార్యంగా మారింది. నాణ్య‌త‌ను, ప్ర‌తిభ‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం అన్న విష‌యంలో ఏ కంపెనీ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటుంటే ఆ కంపెనీయే మార్కెట్లో ముందు ఉంటుంది.

ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను ఎలా గుర్తించాలి!

ప్ర‌తీ కంపెనీలో అర్ధ‌వంతంగా ప‌నిచేసే కొందరు ఉద్యోగులు ఉంటారు. వీరు సంస్థ‌పై న‌మ్మ‌కముంచి సంస్థ‌కు త‌మ వ‌ల‌న లాభం చేకూరాల‌న్న దృక్ఫ‌ధంతో ప‌నిచేస్తారు. స‌వాళ్ల‌ను స్వీక‌రించేందుకు, కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకు వీరెప్పుడూ స‌దా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా త‌మ వృత్తికి గౌర‌వం ఇచ్చుకుంటూనే అదే స‌మ‌యంలో కంపెనీ ఉన్న‌తి కోసం పాటుప‌డతారు. ముఖ్యంగా కంపెనీకి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన ప‌నుల‌ను నేర్చుకునేందుకు, వాటిని విజ‌యవంతంగా అమ‌లు చేసేందుకు పూర్తి సంసిద్ధులుగా ఉంటారు. అయితే ఇటువంటి ఉద్యోగుల‌ను గుర్తించ‌డం అన్న‌ది కంపెనీ ముందున్న అతిపెద్ద స‌వాలు. ఇచ్చిన ప‌నిని నిజాయితీతో చేయ‌డం, కంపెనీ ల‌క్ష్యాల‌ను త‌న ల‌క్ష్యాలుగా భావించ‌డం, వృత్తిగ‌త జీవితాన్ని వ్య‌క్తిగ‌త జీవితాన్ని సమ‌న్వయం చేసుకోవ‌డం, మానిసికంగా చాలా ఆరోగ్యంగా ఉండ‌టం ఇటువటి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని ఒడిసిప‌ట్టుకునేందుకు వారిని కాపాడుకునేందుకు టాలెంట్ మేనేజ్ మెంట్ నిపుణులు ఏం చేస్తున్నార‌న్న‌దే కీల‌కం.

 

 

ప్ర‌తిభ ఉన్న‌ప్పుడు బ‌ల‌హీన‌త‌ల్ని ప్రేమించ‌డం నేర్చుకోవాలి!

అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కూ ప‌నిచేయించుకుంటార‌ని త‌ర్వాత వాళ్ల‌ను నిర్దాక్ష్యింగా బ‌య‌ట‌కు పంపుతార‌ని కార్పోరేట్ కంపెనీల‌పై ఒక అప‌వాదు ఉంది. అయితే ఇందులో వాస్త‌వం లేకుండా ఈ అప‌వాదు రాలేదు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వేళ్ల మీద లెక్క‌పెట్ట‌గలింగేంత మంది మాత్ర‌మే ఇప్పుడు టాలెంట్ ను క్ర‌మ‌శిక్ష‌ను, మ‌ర్యాద‌ను క‌లిగి ఉన్నారు. అటువంటి వారిని కాపాడుకోలేకోతే సంస్థ‌కు న‌ష్టం. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తిని కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు అతని బ‌ల‌హీన‌త‌ల‌ను కూడా అంగీక‌రించాలి. అత‌ని ప‌ని విధానం, మానసిన ప‌రిణితి, బాధ్య‌త ఇవ‌న్నీ స‌రిచూసుకుని అత‌ని ప్ర‌తిభ‌ను అంచనా వేయాలి. ఈ క్ర‌మంలో ప‌ని విష‌యంలో మంచి ప్ర‌తిభను చూపిస్తూ చిన్న చిన్న లోపాల‌ను క‌లిగి ఉన్నా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కంపెనీ త‌మ‌ను త‌గిన విధంగా గుర్తిస్తోంద‌ని వారు భావించిన‌ప్పుడు వాళ్లు మ‌రింత ఉత్సాహంతో పని చేస్తారు.

 

 

ప్ర‌తిభను కాపాడేందుకు ప్ర‌త్యేక‌మైన నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌!

 

ఇప్పుడు ప్ర‌తీ కంపెనీ ప్ర‌తిభ ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకుంటోంది. ఎందుకంటే టాలెంట్ ను గుర్తిస్తే స‌రిపోదు దానికి జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం అన్న‌ది చాలా క‌ఠిన‌త‌ర‌మైన విష‌యం. పోటీ కంపెనీల ప్ర‌లోభాలు, అంత‌ర్గ‌త రాజ‌కీయాలు వెర‌సి ప్ర‌తిభ ఉన్న‌వాళ్ల‌ను చాలా సార్లు ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి. అటువంటి స‌మ‌యంలోనే ప్ర‌తిభ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంది. నిన్ను గుర్తించామ‌ని చెపుతూ అత‌నికి కావాల్సిన ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించి అదే స‌మ‌యంలో భ‌రోసాను క‌ల్పించాలి. అప్పుడు అత‌ను మ‌రింత ఉత్సాహంగా సంస్థ కోసం ప‌నిచేస్తాడు. ఇక ఉన్న వాళ్ల‌ను కాపాడుకుంటూనే కొత్తగా వచ్చిన ఉద్యోగుల్లో స్పూర్తిని నింపి వాళ్ల‌ను ప్ర‌తిభావంతులుగా త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఉద్యోగుల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి దాన్ని స‌రైన విధానంలో వాడుకునే టాలెంట్ ఉన్న వారే అత్యున్న‌త స్థాయికి చేర‌గ‌లుగుతారు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్సర్ చేసిన‌వారు)

 

టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్..ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా??

 

వినడానికి చాలా సులభంగా అనిపించినా ఇంటర్వ్యూలో మాత్రం ఈ ప్రశ్న అభ్యర్ధలకు వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న అభ్యర్ధుల భవిష్యత్ ను డిసైడ్ చేస్తుంది. ఒక అభ్యర్థికి ఉద్యోగం వస్తుందా ? రాదా? అన్నది సరిగ్గా ఇక్కడే తేలిపోతుంది. అటువైపు రిక్రూటర్లు కూడా ఈ ప్రశ్న ద్వారానే తమకు కావాల్సిన అభ్యర్దులను ఎంపిక చేసుకుంటారు? ఉద్యోగాన్ని సాధించడంలో ఇంటర్వ్యూ అనేది చాలా కీలకం. చాలా మంది ఈ దశను దాటడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అకడమిక్ లో మంచి మార్కులు తెచ్చుకున్న వారు కూడా ఇంటర్వ్యూ దశ వచ్చేటప్పటికీ తడబడుతూ ఉంటారు. ఎందుకంటే రిక్రూటర్లు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు? ఏం సమాధానం చెప్తే వాళ్లు సంతృప్తి పడతారు అన్న విషయాలు తెలియడం అన్నది ఇంటర్వ్యూకు వెళ్లేవారికి అతిపెద్ద సవాలు. అయితే ధైర్యం, చిన్న అవగాహన, ఎక్స్‌పర్ట్స్ చెప్పే సూచనలు పాటిస్తే ఇంటర్వ్యూ గండాన్ని దాటి ఉద్యోగాన్ని పట్టడం అంత కష్టమేమీకాదు.

 

 

మీ గురించి మీరు చెప్పుకోవడం అంత సులువేమీ కాదు!

 

ఇంటర్వ్యూ గది లోకి వెళ్లగానే రిక్రూటర్ ముందుగా నీ గురించి చెప్పు అనగానే చాలా మంది అభ్యర్ధులకు చెమటలు పడతాయి. అసలు రిక్రూటర్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియదు. ఏం చెపితే ఏం అవుతుందో. ఎలా చెపితే వాళ్లకు నచ్చుతుందో? ఇలాంటి సందేహాలు ఒక్కసారిగా వారిని గందరగోళంలో పడేస్తాయి. అందుకే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న చాలా మందికి భయాన్ని కలుగుజేస్తుంది. అయితే కొద్దిగా సాధన చేస్తే ఈ ప్రశ్నకు చాలా సులువుగా జవాబు చెప్పవచ్చని హెచ్‌ఆర్ ఎక్స్‌పర్ట్స్ చెపుతున్నారు. అసలు నిజానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మనల్ని గూర్చి మనం చెప్పుకునేందుకు వచ్చే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్న వాళ్లకు ఉద్యోగం గ్యారంటీ.

 

 

రెజ్యుమెలో అంతా ఉంది కదా? మళ్లీ ఎందుకు చెప్పడం?

 

ఇంటర్వ్యూలో చాలా మంది అభ్యర్ధులకు కలిగే మొదటి సందేహం ఇదే. రెజ్యుమెలో మొత్తం సమాచారం ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు అడగడం అనుకోవడం అనవసర సందేహం. అసలు నిజానికి అక్కడే ఉంది అసలైన కిటుకు. కాస్త నిదానంగా ఆలోచిస్తే విషయం అర్ధమవుతుంది. రెజ్యుమెలో ఉన్న విషయం తెలుసుకుని సంతృప్తి చెంది మిమ్మల్ని ఇంటర్వ్యూకు పిలిచారు. అయినా మిమ్మల్ని అడుగుతున్నారు అంటే అర్ధమేమిటంటే..రెజ్యుమెలో లేనిది ఇంకా ఏమైనా ఉంటే చెప్పండని వాళ్ల ఉద్దేశం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నకు చెప్పే సమాధానంలో రెజ్యుమెలోని లేని విషయాలు చెపితే చాలా మంచిది. మన నేపథ్యం, కష్టపడే తత్వం, నేర్చుకునే ఆసక్తి ఇలా చాలా విషయాలు చెప్పొచ్చు. అయితే ఆ సమాధానంలో మీ నైపుణ్యం, అనుభవం కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది తెలియజేయాలి.

 

 

రెజ్యుమెలో ఉన్నవాటినే తిప్పి చెపితే ఉద్యోగం రానట్టే!

 

ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రశ్నలో చాలా మంది అభ్యర్ధులు ఒకటే తప్పు చేస్తారు. అదేంటంటే రెజ్యుమెలో ఉన్న విషయాలనే మళ్లీ మళ్లీ చెపుతారు. ఇది రిక్రూటర్లకు ఎంత మాత్రం నచ్చదు. ఎందుకంటే మీరు వాళ్ల సమయాన్ని వృధా చేస్తున్నట్టు వాళ్లు భావిస్తారు. ప్రత్యేకంగా అడిగితే తప్ప మీ హాబీలు, వ్యక్తిగత అభిరుచులు, ప్రాధాన్యాల గురించి చెప్పకూడదు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ప్రశ్న మీతో మాటలు కలపడానికి రిక్రూటర్ కు వీలు కల్పించే ప్రశ్న. తమ కంపెనీకి సరిపోయే అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలన్న ఒత్తిడి రిక్రూటర్ పై కూడా ఉంటుంది. కాబట్టి మీరు సరైన ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే ఉద్యోగం మీకే రావచ్చు. మీ గురించి మీరు చెప్పుకుంటున్నప్పుడు సమాధానాన్ని ఒకటి రెండు నిమిషాల్లోనే ముగించేందుకు ప్రిపేర్ కండి.

 

 

సమాధానాలు ఇలా ఉండాలి!

 

కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగానికి మీరు ఏ విధంగా సరిపోతారో రిక్రూటర్ సరైన పద్ధతిలో వివరించండి. సదరు జాబ్ కు సరిపోయే అర్హతలు, ఒకవేళ ఎక్కువ అర్హతలు ఉన్నప్పటికీ ఆ ఉద్యోగానికి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో వివరించండి. ఆ రంగంలో మీ అనుభవం. సాంకేతిక నైపుణ్యాలు, అదే విధంగా మీరు ఆ ఉద్యోగాన్ని చేయడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో కూడా రిక్రూటర్ కు స్పష్టంగా తెలియజేయగలగాలి. మీ బలాలను ప్రభావవంతంగా చెప్పడమే కాదు. ఇంటర్వ్యూకు వచ్చిన మిగిలిన అభ్యర్ధుల కంటే వాళ్ల కంటే మీరు మెరుగు అన్నట్టు ఓ రెండు, మూడు అంశాలనైనా కొత్తగా ప్రజంట్ చేయగలగాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం బాగున్నప్పటికీ సవాలుతో కూడుకున్న కొత్త జాబ్ ను ఆస్వాదించాలనుకుంటున్నట్టు చెప్పండి. ఇంకో ముఖ్య విష‍యం ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఒక సంభాషణ రూపంలో జరగాలి. కానీ మీపాటికి మీరు మాట్లాడుకుంటూ , ఒక్కరే కంఠతా పెట్టినట్టు చెప్పుకుంటూ పోతే మీకు ఉద్యోగం రాదు.

 

( ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

 

 

 

 

ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వీటిని సరిచూసుకోండి!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఉద్యోగం సంపాదించడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. నైపుణ్యతకు, నాయకత్వ లక్షణాలకు పెద్ద పీట వేస్తున్న కంపెనీలు నాణ్యమైన అభ్యర్ధులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు అభ్యర్ధుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఇంటర్వ్యూకు వెళ్లినా ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఆందోళన చాలా మందికి ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి ధైర్యంగా తన నైపుణ్యాలను ప్రదర్శించే వారే ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇంటర్వ్యూను విజేతలు కావాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలపై పూర్తిగా పట్టు సాధించాలని హెచ్ఆర్ నిపుణులు చెపుతున్నారు. లేటేస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా వీటిని పదును పెట్టుకుంటే కచ్చితంగా జాబ్ సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

 

సంపూర్ణ అవగాహన చాలా అవసరం!

 

 

ఒక కంపెనీకి ఇంటర్వ్యూకు వెళుతున్నప్పుడు అభ్యర్ధులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఏదైతే కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ కంపెనీపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆ కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, వాళ్ల లక్ష్యాలు ఇలా అన్ని విషయాలపై ఒక నాలెడ్జ్ ను సంపాదించాలి. ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ గూర్చి మీకు ఏం తెలుసున్నదే అక్కడ కీలకంగా మారుతుంది. ముఖ‌్యంగా ఈ కంపెనీలో నిర్దేశించిన విధులకు తాను ఏ విధంగా న్యాయం చేయగలను అన్న విషయాన్ని అభ్యర్ధి సావధానంగా చెప్పాల్సి ఉంటుంది. దీని వలన కంపెనీ తన నుంచి ఏ ఆశిస్తుందో అన్న విషయంపై పూర్తి సాధికారత వస్తుంది. ఇలా ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ పూర్తి సమాచారం , అవగాహన మీ దగ్గర ఉన్నప్పుడు మీరు జాబ్ విష‍యంలో ఎంత సీరియస్ గా ఉన్నారన్న విష‍యం ఇంటర్వ్యూ చేసేవాళ్లకి అర్ధమవుతుంది.

 

 

కంపెనీకి అనుగుణంగా సీవీ!

 

చాలా మంది అభ్యర్ధులు ఒక సీవీ ని రెడీ చేసుకు పెట్టుకుని దాన్నే ప్రతీ ఇంటర్వ్యూకు తీసుకెళ్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం ఇంటర్వ్యూకు వెళుతున్న కంపెనీ, అక్కడి పొజిషన్ ఆధారంగా సీవీని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. చూడగానే సీవీ ఆకట్టుకునేలా ఉండాలి. సంక్షిప్తంగా సింపుల్ ఇంగ్లీష్ లో సీవీ ఉండాలి. అనవసర ఆడంబరాలు, డాంబికాలు లేకుండా సీవీని చాలా శ్రద్ధగా తయారు చేసుకోవాలి. అప్పటివరకూ సాధించిన అచీవ్‌మెంట్స్ ను చిన్న చిన్న వాక్యాలతో రాసుకుంటే చూసిన వారిని ఈజీగా అర్ధమవుతుంది. అలాగే వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలను బుల్లెట్ పాయింట్స్ తో రాసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగా సీవీలో అబద్ధాలకు, అతిశయోక్తులకు చోటు లేకుండా చూసుకోవాలి.

 

కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవాలి!

 

అసలు ఇంటర్వ్యూ అంటే ఏమిటి? ఒక అభ్యర్ధిలోని సత్తాను, సామర్ధ్యాన్ని గుర్తించే ప్రక్రియ. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఒక వ్యూహం ప్రకారం బెరుకు లేకుండా సమగ్రంగా సమాధానాలు చెప్పాలి. అలా చెప్పాలి అంటే అభ్యర్ధులు కమ్యూనికేషన్ వ్యూహం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వాళ్లు ఏమి అడుగుతున్నారు. అన్న దాన్ని చూసుకుని ప్రశ్నకు తగ్గ సమాధానాన్ని చాలా క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే చెపుతున్న సమాధానాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంశాలపై పట్టు ఉన్న వారికి జాబ్ రావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.

 

 

సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్ పరిశీలన!

 

ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కూడా సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్ధుల ప్రొఫైల్ ను చూసే ఉద్యోగాన్ని ఇచ్చే కంపెనీలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రొఫైల్ ను ప్రొఫెషనల్ గా తయారు చేసుకోవడంపై అభ్యర్ధులు దృష్టిపెట్టాలి. ఎటువంటి వివాదాలు, లోపాలు లేకుండా సోషల్ మీడియా ప్రొఫైల్, వ్యక్తిగత పేజ్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. తనకు సంబంధించిన రంగంపై చేస్తున్న పోస్ట్ లు, అభిప్రాయాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి మంచి కంపెనీలో మంచి జాబ్ కావాలంటే సోషల్ మీడియా ప్రొఫైల్ పై కూడా దృష్టి పెట్టాలి.

 

ఇంప్రెషన్, ఫాలోఅప్ కూడా కీలకం!

 

ఇంటర్వ్యూలో గెలుపు సాధించామా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇంటర్వ్యూ చేసేవాళ్లకు అభ్యర్ధులు మంచి ఇంప్రెషన్ ను కలిగించాలి. చెప్పిన సమయానికి ఇంటర్వ్యూకు రావడం, మంచి డ్రెస్సింగ్, కాన్ఫిడెన్స్, ఐ కాంటాక్ట్, చెప్పే విషయంలో క్లారిటీ, గతంలో సాధించిన అచీవ్‌మెంట్స్ పై ఆచితూచి మాట్లాడటం వంటివి అభ్యర్ధులపై మంచి ఇంప్రెషన్ ను కలిగిస్తాయి. ఇంటర్వ్యూలో చేసే వాళ్లకు మంచి ఇంప్రెషన్ కలిగించారంటే ఉద్యోగం వచ్చినట్టే. కంపెనీ మీ నుంచి ఏం ఆశిస్తుందో సూచన ప్రాయంగా తెలియజేస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని తుది ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. అలాగే ఫాలోఅప్ ను మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ కంపెనీలో అవకాశం ఉందా అని అడగటం ద్వారా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటే కంపెనీకి అదనపు లాభం చేకూరుతుందని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పగలగాలి.

 

(ఈ ఆర్టికల్  ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

‘ఎక్స్‌ట్రా’ లు చేస్తున్నారా? అయితే మీకు జాబ్ వచ్చినట్టే..!!

 

ప్రస్తుతం హెచ్ఆర్ నిపుణులు చెప్పే మాట ఒకటే. జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. కంపెనీల ఆలోచనా తీరులో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ను ఉద్యోగంలోకి తీసుకోవడంలో కంపెనీలు గతంలోలా వ్యవహరించడం లేదు. విభిన్న విషయాలను, అంశాలను బేరీజు వేసుకుని దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రజంట్ ఇంటర్వ్యూలలో కేవలం అకడమిక్ రికార్డును మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మార్కులు కాస్త తక్కువ ఉన్నా అభ్యర్ధిలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కావాల్సింది ఆల్‌రౌండర్లు. పనిచేస్తూనే అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ మెసిలే సిసలైన నాయకులు కావాలి. కాబట్టి ఇప్పుడు బాగా మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న ఆలోచనను విద్యార్ధులు తొలిగించుకోవాలి. చదువుతో పాటు ఆటల్లో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లలో చురుగ్గా ఉండాలి.

 

 

కంపెనీలు ఎందుకు ఈ ఎక్స్‌ట్రా లను కోరుకుంటున్నాయి?

 

మన దేశంలో చదువు అంటే కేవలం మార్కులే కానీ విదేశాల్లో అయితే చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వాస్తవానికి అవే విద్యార్ధి దశలో చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక విద్యార్ధిలోని నిజమైన నాయకుడ్ని, సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఆవిష్కరించేవి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ మాత్రమే. అందుకే కంపెనీలు ఈ లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సంస్థలో విధులు నిర్వర్తించే క్రమంలో ఏమైనా సమస్యలు ఎదురైతే అభ్యర్ధులు చాలా వేగంగా స్పందిస్తారని కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే రెజ్యుమెలో కాలేజీలో ఈవెంట్లు నిర్వహణ, ఇతర అదనపు అర్హతలు వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. కంపెనీల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై శ్రద్ధ పెట్టాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నో..!

 

ప్రస్తుతం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై కళాశాలల్లో కాస్త అవగాహన పెరిగింది. ఇప్పుడు కావాల్సిందల్లా విద్యార్ధులు తగిన చొరవ తీసుకోవడమే. కళాశాలల్లో ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం, అదే విధంగా కల్చరల్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా ఇన్‌స్టిట్యూట్ లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను నడిపించే ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకోవడం వంటి వాటి వలన టీమ్ ను ఎలా నడపాలో, గడువు లోగా పనులు ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్ లో కల్చరల్ సొసైటీ కాన్సెప్ట్ నడుస్తోంది. అకడమిక్స్ లో విద్యార్ధులు పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలైన సీఐఐ, నాస్కామ్, ఫిక్కీ, అసోచామ్ లలో స్టూడెంట్ మెంబర్‌షిప్ తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా సంస్థలు నిర్వహించే సెమినార్లలో పాల్గొనడం ద్వారా నిపుణులను, ఉన్నత వ్యక్తులను కలుసుకుని వారి నుంచి సలహాలు పొందడంతో పాటు స్పూర్తిని కూడా పొందే వీలుంటుంది. అలాగే వాలంటీర్ సర్వీస్ లు కూడా చేస్తే సమాజంలో ఏం జరుగుతోంది. ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్న దానిపై అవగాహన పెరుగుతుంది. వీటన్నింటిని రెజ్యుమెలో పొందుపర్చుకుంటే అవే ఇప్పుడు ప్రధాన అర్హతలుగా మారుతున్నాయి.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఎన్నో లాభాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై చాలా మంది తల్లిదండ్రులకు కూడా సదభిప్రాయం లేదు. వీటి వలన పిల్లల చదువు పాడవుతుందని చాలా మంది పేరెంట్స్ భావిస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం పూర్తి తప్పు. వీటిల్లో పార్టిసిపేట్ చేయడం వలన విభిన్న వ్యక్తులతో కలివిడిగా మాట్లాడటం అలవడి బెరుకు అన్నది పోతుంది. అలాగే నలుగురితో మాట్లాడటం వలన సమస్యను పరిష్కరించే విధానం, మనుష్యులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓవరాల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి దిట్టలుగా నిలబడగలుగుతారు. అదే విధంగా ఒక కార్యక్రమంలో ఎంతో మందిని సమన్వయం చేయాల్సి రావడంతో మంచి లీడర్‌షిప్ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెద్ద పెద్ద సెమినార్స్ లో షెడ్యూల్స్ ను ఖరారు చేయడం, ప్రతినిధులకు తెలియజేయడం వంటి వాటి వలన సమన్వయ సామర్ధ్యం పెరుగుతుంది. ఇవన్నీ రెజ్యుమెలో ఉంటే కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకోకుండా ఉండలేవు.

 

 

విద్యార్ధులకు ఎన్నో ఉపయోగాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వలన విద్యార్ధులకు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాలేజీలో వీటిల్లో చురుగా పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే నేర్పు, భవిష్యత్ పై సానుకూల దృక్ఫధం, సమాజం పట్ల అవగాహన పెరుగుతాయి. ఇక రెజ్యుమెలో ఈ వివరాలను పొందుపర్చడం వలన రిక్రూటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉన్న అభ్యర్ధుల్లో నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, టీమ్ మేనేజ్‌మెంట్, నిరంతరం నేర్చుకునే లక్షణాలు ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు. అందుకే మార్కులు ఎక్కువ వచ్చిన అభ్యర్ధుల కంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా చేస్తున్న అభ్యర్ధులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి విద్యార్ధులు తమ భవిష్యత్ ప్రణాళికలను తగిన విధంగా మార్చుకోవాలి. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. అప్పుడే మీ డ్రీమ్ జాబ్ మీ తలుపు తడుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)