విన‌య విధేయ రామ..ఇప్పుడే ఎందుకు?

 

 

మాతృస్వామ్య వ్య‌వ‌స్థ నుంచి నేటి పితృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌ర‌కూ ఆడ‌, మ‌గ మ‌ధ్య విభిన్న కార‌ణాల రీత్యా సంఘ‌ర్ష‌ణ జ‌రుగుతూనే ఉంది. ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు, అణిచివేత‌పై తిరుగుబాట్లు, ఆచారాల సంకెళ్ల‌ను తెంపుకునే ఆరాటాలు, స్వీయ గుర్తింపు కోసం పాకులాట‌లు ఒక‌వైపు.. స్వ‌యంప్ర‌తిప‌త్తి విచ్చ‌ల‌విడిత‌నం అనే క‌ట్టుబాట్లు, బాధ్య‌త‌ల చ‌ట్రంలో ఇరికించే ప్ర‌య‌త్నాలు, సొంత ఆస్తిలా భావించే ఆలోచ‌న‌లు మ‌రోవైపు. అయినా ఎన్ని విభేధాలున్నా ప‌ర‌స్ప‌ర ఆక‌ర్ష‌ణ‌, ప్రాకృతిక ఆదేశాలు, సృష్టి ధ‌ర్మం ఆడ‌, మ‌గ‌ను ఎప్పుడూ క‌లిపే ఉంచుతాయి. శారీర‌క ధ‌ర్మాల విష‌యంలో వ్య‌త్యాసాలు, శ‌క్తి సామ‌ర్ధ్యాల విష‌యంలో హెచ్చుత‌గ్గుల నేప‌థ్యంలో బాధ్య‌త‌ల‌ను, బంధాల‌ను విభ‌జించుకుని కొన్ని నియ‌మాలు ఆధారంగా ప‌ర‌స్ప‌ర జీవ‌నం సాగిస్తున్నారు. అయితే గ‌డిచిన కొన్నాళ్లుగా మ‌హిళ‌లు ఆ నియ‌మాల‌ను, ఆంక్ష‌ల‌ను, అణిచివేత‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఏ విష‌యంలోనూ తాము పురుషుల‌కు తీసిపోమ‌ని చెపుతూ లింగ స‌మాన‌త్వం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పురుషులు చేసేవి అకృత్యాలు, అన్యాయాలు అంటూ గ‌ళం విప్పుతున్నారు. అయితే చేసే పోరాటంలో నిబ‌ద్ధ‌త కొర‌వ‌డ‌టం, స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, ద్వేషం త‌ప్ప ద్యేయం లేక‌పోవ‌డం ఇప్పుడు మ‌హిళా పోరాటాల‌కు విలువ లేకుండా చేస్తున్నాయి.

 

 

‘మీటూ’ అటు తిరిగి ఇటు తిరిగి ఎటో వెళ్లిపోయింది !

 

తాజాగా మ‌న దేశంలో మీటూ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సింది. ప్ర‌స్తుతం ఉన్న‌త స్థానాల్లో ఉన్న చాలా మంది మ‌హిళ‌లు ఒక‌ప్పుడు తామ లైంగిక వేధింపులను గురి అయ్యామంటూ గ‌ళ‌మెత్తారు. ముఖ్యంగా న‌టీమణులు, జ‌ర్న‌లిస్ట్ లు తాము లైంగిక దాడికి గుర‌య్యామ‌ని వివ‌రించారు. అప్ప‌ట్లో కెరీర్ ముఖ్యం కాబ‌ట్టి నోరు విప్ప‌లేక‌పోయామ‌ని, ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చింది కాబ‌ట్టి బ‌హిరంగం చేస్తున్నామ‌ని చెప్పారు. కానీ ఈ ఉద్య‌మంలో నిజాయితీ కంటే స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, క‌క్ష్య పూరిత చ‌ర్య‌లు అధికం కావ‌డంతో మీటూ ఉద్య‌మం ఎంత వేగంగా ఎగిసిందో అంతే వేగంగా చ‌ల్ల‌బ‌డిపోయింది. చాలా మంది మ‌హిళ‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌కు సాటి మ‌హిళ‌లే మ‌ద్ధ‌తు ఇవ్వ‌ని ప‌రిస్థితులు ఉన్నాయి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక పురుషునితో మంచిగా ఉండి, ఇష్ట‌పూర్వ‌కంగా అన్ని విష‌యాల్లో వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు అవ‌న్నీ బ‌ల‌వంతంగా చేసిన‌వ‌ని చెప్ప‌డం స‌త్యదూరంగా ఉండ‌టం మీటూ ఉద్య‌మాన్ని చుల‌క‌న చేసింది. ఆరోప‌ణ‌లు చేసిన వెంట‌నే ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయ‌లేదు అన్న ప్ర‌శ్న త‌క్షణం ఎదుర‌వుతోంది. అప్పుడు నిస్స‌హాయిరాలిని, ప‌రిస్థితులుకు కొత్త‌, అంత ధైర్యం లేదు అన్న స‌మాధానాల్లో కొన్ని నిజాలే అయిన‌ప్ప‌టికీ గ‌డిచిన‌ కాలంతో పాటు ఆ నిజాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది.

 

 

మ‌న పురాణాల్లోనూ ‘మీటూ’ ఉంది!

 

లైంగిక అవ‌స‌రాలు స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ స‌మాన‌మే అయిన‌ప్ప‌టికీ పురుషుడు బ‌ల‌వంతుడు కాబ‌ట్టి కొన్నిసార్లు స్త్రీ ఇష్టానికి వ్య‌తిరేకంగా అత్యాచారం చేసే వీలుంది. దీని వ‌ల‌న స‌హ‌జంగానే మ‌హిళ‌ల‌పై కాస్త సానుభూతి, చ‌ట్ట‌ప‌రంగా అనుకూల‌త‌లు ఉంటాయి. ఎందుకంటే బ‌ల‌హీనుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం మ‌న నాగ‌రిక జీవనంలో పెట్టుకున్న మొద‌టి నియ‌మం. అయితే ప‌ర‌స్ప‌ర ఇష్టపూర్వ‌కంగా కొన‌సాగించే సంబంధాల‌ను అవి బెడిసికొట్టాక‌ బ‌ల‌వంత‌పు చ‌ర్య‌గా స్వార్ధ‌పూరితంగా ఆరోపించ‌డమే ఇప్పుడు స‌మ‌స్య‌. మ‌న పురాణాల్లో చూసుకుంటే నిష్ఠ‌గా త‌ప‌స్సు చేసే రుషి పుంగ‌వుల ద‌గ్గ‌ర‌కు ఇంద్రుడు రంభ‌, ఊర్వ‌శి, మేన‌క వంటి అంద‌గ‌త్తెల‌ను పంప‌డం త‌ర్వాత వాళ్ల‌తో ఆరోప‌ణ‌లు చేయించ‌డం, వాళ్ల విశ్వ‌స‌నీయ‌త‌ను, వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీయడం ఇలాంటివి జ‌రిగేవి. అయితే ఇద్ద‌రు స్త్రీ , పురుషులు మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగిన ఒక విష‌యాన్ని కేవ‌లం ఒకే వ్య‌క్తి త‌ప్పుగా చిత్రీక‌రించి కేవ‌లం పురుషుల ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీయడం అప్ప‌టి నుంచే జ‌రుగుతోంది. ఒకవైపు స్త్రీ పురుష స‌మాన‌త్వం కోసం మాట్లాడుతూ ఏం చేసినా కేవ‌లం ఒక్క వ్య‌క్తిదే త‌ప్పు అన్న‌ట్టు చిత్రీక‌రించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌ప్పుడు స‌మాన‌త్వం ఎలా సాధ్య‌మ‌వుతుంది? నిజంగా త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు లేదా అత్యాచారం జ‌రిగిన‌ప్పుడు క‌చ్చితంగా శిక్ష ప‌డాల్సిందే. కానీ అవ‌స‌రాల కోసం స‌ఖ్యంగా ఉండి ఇద్ద‌రి మ‌ధ్య విభేధాలు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అది అన్యాయం అంటూ గొంతు చించుకోవ‌డం ఎటువంటి లింగ స‌మాన‌త్వ‌మో, ఎటువంటి నిబ‌ద్ధ‌త ఉన్న పోరాట‌మో కొంద‌రు స్త్రీలు ఆలోచిస్తే బాగుంటుంది. మ‌రోవైపు మీటూ ఉద్య‌మం ద్వారా లాభ‌ప‌డిన మ‌హిళ‌ల సంగతి ఏమో కానీ న‌ష్ట‌పోయిన, పోతున్న మ‌హిళ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా క‌న‌నిస్తున్నారు. ఈ ఉద్య‌మం నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు, వారికి ఉన్న‌త స్థానం క‌ల్పించేందుకు బ‌డా కంపెనీలు సైతం భ‌య‌ప‌డుతున్నాయి. ఎందుకు వ‌చ్చిన చిక్కు అనుకుంటున్నాయి. బ‌య‌ట‌కి అటువంటిదేమీ లేదని చెపుతున్నప్ప‌టికీ వాస్త‌వ ప‌రిస్థితి మాత్రం ఇలానే ఉంద‌ని చాలా మంది మ‌హిళ‌లు వాపోతున్నారు. మ‌రోవైపు మీటూతో వేధింపులు ఆగాయోమో కానీ సాధింపులు మాత్రం పెరిగాయి. చేసిన ప‌నినే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌డం, ప‌నిచేస్తున్నా ఇంకా ప‌ని అప్ప‌గించ‌డం వంటి వేధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు పెరిగారు. దీంతో కెరీర్ ను ఎలా కొన‌సాగించాలా అని చాలా మంది మ‌హిళ‌లు మ‌ధ‌న ప‌డుతున్నారు.

 

 

అడ్డుగోడ‌లు క‌ట్టేస్తూ, ద్వేషిస్తూ స‌మాన‌త్వం ఎలా సాధిస్తారు?

 

ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వ బ‌స్సుల్లో చూస్తే స్త్రీల సీట్ల‌కు పురుషుల సీట్ల‌కు మ‌ధ్య ఒక అడ్డు గోడ లాంటి ప్ర‌త్యేక ఏర్పాటును చేసారు. అలాగే చాలా స్కూళ్ల‌లో, కాలేజీల్లో స్త్రీ, పురుషుల‌కు వేరు వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్త్రీ, పురుష స‌మాన‌త్వం సాధిస్తాం అని చెపుతున్న ప్ర‌భుత్వాలు ఇలా చిన్నత‌నం నుంచే వాళ్ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ గీస్తూ మాన‌సికంగా దూరం పెంచుతున్నారు. అబ్బాయిలు అంటే మంచి వాళ్లు కాదు అన్న అభిప్రాయం ఏర్ప‌రుచుకున్న ఆడ‌పిల్ల‌లు రేపు వాళ్ల‌తో స‌ఖ్యంగా ఎలా ఉండ‌గ‌ల‌రు. ఒక మ‌గ‌పిల్ల‌వాడికి ఆడ‌పిల్ల‌ను గౌర‌వించ‌డం, జాగ్ర‌త్త‌గా కాపాడుకోవ‌డం నేర్పించ‌డం ఎంత ముఖ్య‌మో..అలాగే ఒక ఆడ‌పిల్ల‌కు కూడా మ‌గ‌పిల్ల‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పించాలి. ఎందుకంటే ఆమె జీవితంలో ప్రతీ మ‌లుపులోనూ మ‌గ‌వాడు ఉంటాడు. తండ్రి, అన్న‌య్య‌, త‌మ్ముడు, స్నేహితుడు, భ‌ర్త ఇలా ఆమె జీవితాంతం మ‌గ‌వాళ్ల‌తోనే బ‌త‌కాలి. అటువంట‌ప్పుడు మ‌గ‌వాళ్ల‌ను ద్వేషించే ప‌రిస్థితులు క‌ల్పిస్తే ఎంతసేపు గొడ‌వ పెట్టుకునే మ‌నస్త‌త్వంలోనే కూరుకుపోతారు. ఇక‌ సామ‌ర‌స్యంగా ఉండి జీవితాన్నిఎలా ఆనంద‌మ‌యం చేసుకుంటారు? ఎవ‌రో ఒక‌రు త‌ప్పు చేసార‌ని మొత్తం అంద‌ర్నీ అనుమానంగా చూడ‌టం, అగౌర‌వంగా ఉండ‌టం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? మ‌ంచికి చెడుకి ఎప్పుడూ లింగ‌భేధం ఉండ‌దు. మ‌గ‌వాళ్ల‌లో చెడ్డ‌వాళ్లు ఉన్న‌ట్టే ఆడ‌వాళ్ల‌లోనూ చెడ్డ‌వాళ్లు ఉంటారు. అంద‌ర్నీ ఒకే గాటిన క‌ట్ట‌డమే స‌మ‌స్య‌కు మూల కార‌ణం.

 

 

విన‌య విధేయ రాముళ్లు ఎక్కువయ్యారు!

 

మీటూ ఉద్య‌మం ఎప్పుడూ ప్రారంభ‌మైందో అప్పుడే మ‌గ‌వాళ్ల‌లో భ‌యం ప్రారంభ‌మైంది. ఏ క్ష‌ణాన ఏ ఆరోప‌ణను ఎదుర్కోవాల్సి వ‌స్తుందోన‌ని చాలా మంది భ‌య‌ప‌డ్డారు. ఆడ‌వాళ్ల‌తో ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారు మ‌న‌కెందుకు వ‌చ్చిన గొడ‌వ అనుకుంటూ దూరంగా జ‌రిగి విన‌య విధేయ రామ త‌ర‌హాగా మారిపోయారు. గ‌తంలో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సంబంధాల‌ను కొనసాగించిన వారు, ఇప్పుడు స‌మాజంలో మంచి స్థానంలో ఉన్న‌వారు ఆందోళ‌న చెందారు. ఒక మ‌హిళ‌కు నిజంగా అన్యాయం చేసినవారు శిక్ష అనుభ‌వించాల్సిందే. ఇందులో రెండో మాట‌కు తావు లేదు. కానీ ఒక అంగీకారంతో ఒక సంబంధాన్ని కొన‌సాగించిన‌ప్పుడు అందులో ఏమోష‌న్స్ ఉండ‌వు. ఎందుకంటే ఒప్పందం అంటే వ్యాపారం , వ్యాపారంలో లాభ‌న‌ష్టాలే ఉంటాయి కానీ ఎమోష‌న్స్ ఉండ‌వు. అది ఆడ అయినా మ‌గ అయినా ప్ర‌తీ ఒక్క‌రికి త‌మ హ‌ద్దులు తెలియాల్సిందే. ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉన్న‌ప్పుడు ఎటువంటి స‌మ‌స్య‌లు రావు. ఒక‌రి హ‌ద్దుల గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టుకుని ఎవ‌రూ మీ కోట‌లోకి రాలేరు. అలా వ‌చ్చారంటే అది మీరు ఇచ్చిన అనుమతి మాత్ర‌మే. నైతిక విలువ‌లు నేర్చుకుని ప్ర‌తీ మ‌నిషినీ గౌర‌విస్తూ ఎవ‌రి హ‌ద్దులో వాళ్లు ఉంటే ఎవ‌రికీ ఎటువంటి స‌మ‌స్య‌లూ రావు. ఇలా గొంతుచించుకునే మీటూ ఉద్య‌మాలు కూడా అవ‌స‌రం లేదు.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్న‌వారు)

 

ఈ దేశానికి ఏమైంది???

 

ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ…

ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి?

ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.

కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా.

ధూమపానం చేయకండి. చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం.

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

 

మనం సినిమాకు వెళ్లినప్పుడు ఈ యాడ్ ను ఎన్నోసార్లు చూసి ఉంటాం. నిజానికి ధూమపానం వలన ఈ దేశానికి ఏమైందో, ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తీర్పులు దేశ భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేసి నిజంగానే ఈ దేశానికి ఏమైంది? అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్న మన సంస్కృతిని, వారసత్వాన్ని నిట్టనిలువునా పాతరేసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాలు ఇంకా కళ్లు తెరవక ముందే అత్యద్భుతమైన నాగరికతతో విరాజిల్లిన భారతదేశంలో ఇప్పుడు పాశ్చాత్య నాగరికతలను, వాళ్ల అసంబద్ధ పోకడలను అనుసరించాలన్న వెర్రి ఆలోచనలు ప్రబలుతున్నాయి. పైపై మెరుగులకు ఎప్పుడూ ఆకర్షించబడే ప్రజలను సరైన దారిలో పెట్టాల్సిన కోర్టులు, ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛ పేరుతో అనాగరిక చర్యలకు వంత పాడుతూ దాన్నే నిజమైన ప్రజాస్వామ్యమంటూ భారతదేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవైపు స్వయంప్రకటిత మేధావులు, మరోవైపు స్వేచ్ఛ , సమానత్వం పేరుతో భాధ్యతలను గాలికొదిలి కేవలం హక్కులు కోసం మాత్రమే మాట్లాడే ప్రబుద్దులు విచ్చలవిడిగా వీధుల్లో పడి ఘనమైన భారతీయ మూలాలను మూలకు నెట్టేస్తున్నారు.

 

 

ఈ మహిళలకు ఏమైంది? ఒకవైపు విచ్చలవిడితనం, మరోవైపు స్వేచ్ఛా దుర్వినియోగం..!!

 

ప్రపంచంలో భారతీయ మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా ఒక కుటుంబాన్ని నిలబెడుతూ , తన బాధ్యతలను నెరవేరుస్తూ స్త్రీ అనే మాటకు పరిపూర్ణత చేకూరుస్తుంది. అనాది నుంచి పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు తగినంత స్వేచ్ఛ దొరకలేదు అన్న మాట వాస్తవమే. వారిని కేవలం ఒక వస్తువుగా చూడటం బాధ కలిగించే విషయమే. ఈ ఆధునిక సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇది కచ్చితంగా ఆనందపడాల్సిన విష‍యం. కానీ సరిగ్గా ఇక్కడే ఒక పెను సమస్య మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థనే నామరూపాలు లేకుండా కబలించేందుకు సిద్ధమైంది. ఎంత సమానమైనా ఆడ, మగ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని తేడాలు ఉంటాయి. అలాగే మన సంస్కృతి ఆడకు, మగకు కొన్ని బాధ్యతలను, పరిమితులను నిర్దేశించింది. ఆ సన్నని గీతను ఇటు ఆడవాళ్లు అటు మగవాళ్లు చెరిపేస్తూ మొత్తం మన వివాహ వ్యవస్థకే చేటు తెస్తున్నారు. ఆడవాళ్లు ఆకర్షణీయంగా ఉంటారు. అది ప్రకృతి నిర్దేశించిన నియమం. అందుకే మన సంస్కృతి వస్త్రధారణ విషయంలో కొన్ని పరిమితులను చేసింది. అయితే ఇప్పుడు సమానత్వం పేరుతో మగవాళ్లు ధరించే బట్టలు వేసుకుంటూ, వాళ్లలానే మేం కూడా సిగరెట్లు, మందు తాగుతాం అనే మహిళామణులు పెరిగిపోయారు. వేరే దేశాల్లో అలానే చేస్తున్నారు కదా అంటూ దీనికి సమర్ధింపులు కూడా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో మీరు ఆడవాళ్లు అన్న విషయం మర్చిపోయి, విచ్చలవిడిగా ఏమైనా స్వేచ్ఛగా చేయొచ్చు అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నారు. కానీ అలా చేసే వ్యక్తులు గౌరవం పొందే అర్హతను కోల్పోతారు. ఆడవాళ్లను గౌరవించడం రాదా? అని ఎవర్నీ ప్రశ్నించే హక్కును వాళ్లు కోల్పోతారు. ఎందుకంటే వాళ్ల గౌరవాన్ని వారే రోడ్డు మీదకు తెచ్చుకున్నప్పుడు ఇక ఆడ, మగ తేగా ఉండదు. స్వేచ్ఛ పేరుతో వారు కోరుకున్నది కూడా అదే కదా? ఆడ, మగ తేడా వద్దని అన్నప్పుడు ఇక ఆడవాళ్ల గౌరవించండి? అని అరవడంలో అర్ధం లేదు.

 

 

ఎవ్కరూ నోరు మెదపరేంటి? వివాహేతర సంబంధం నేరం కాదట..!

 

తాజాగా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. సెక్షన్ 497 అనే చట్టం మహిళల పట్ల వివక్షాపూరితంగా ఉందని దాన్ని కొట్టి వేసింది. తాజా తీర్పు ప్రకారం సంక్షిప్తంగా, క్షుప్తంగా చెప్పాలంటే వివాహమైన ఒక మహిళ వేరే వ్యక్తితో, అలాగే వివాహమైన ఒక మగవాడు వేరే మహిళతో నిస్సిగ్గుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించవచ్చు. స్త్రీ హక్కులకు భంగం కలుగకూడదని, భార్య అంటే భర్త సొత్తు కాదని భావించిన శ్రీమాన్ సుప్రీంకోర్టు జడ్జిగారు ఈ చారిత్రక తీర్పును చెప్పారు. దీని వలన కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని కానీ విచ్చలవిడితనం పెరిగిపోతుందని కానీ సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని కానీ సుప్రీంకోర్టు ఆలోచించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం కోసం మాత్రమే తీర్పును వెలువరించారు. దీని ద్వారా కలిగే పర్యవసానాలు, నష్టాలు గురించి వీసమెత్తు కూడా ఆలోచించలేదు. జీవితాల‌ను ప్ర‌భావితం చేసే ఇలాంటి ముఖ్యమైన తీర్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన  మీడియా సంస్థలు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఏదో ఒక పార్టీకి ఊడిగం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాయి. సెక్షన్ 497 పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ ఎంతగా పతనం అవుతాయో ఒక్క క్షణం ఆలోచించండి. ఇది సమానత్వం పేరిట స్త్రీ, పురుషుల మధ్య అగాధాన్ని సృష్టించేదిగా ఉంది కానీ మరేదీ కాదు. దీని వలన వివాహ వ్యవస్థ పతనం కావడం తథ్యం. కానీ దీనిపై ఇంతవరకూ అర్ధవంతమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు. ఒకవైపు ట్రిపుల్ తలాక్ తప్పు అని చెపుతున్న సుప్రీంకోర్టే మరోవైపు వివాహేతర సంబంధం తప్పు కాదని చెపుతోంది. ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసం అర్ధం కాక సామాన్య ప్రజలు ఆందోళన చెందుతుంటే , తప్పుడు మార్గంలో విచ్చలవిడిగా తిరిగే వాళ్లు ఆనందపడుతున్నారు.

 

 

ఈ తీర్పుల అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!

 

ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను నిశితంగా గమనిస్తే… అసలు ఈ దేశానికి ఏమైంది? అని అనిపించకమానదు. అభివృద్ధి చెందిన దేశాలే అనుమతించేందుకు భయపడుతున్న స్వలింగ సంపర్కాన్ని మన దేశంలో అనుమతించారు. ప్రకృతికి విరుద్ధంగా జరిపే ఆ విచ్చలవిడి చర్యను అనుమతించడం వలన జరిగే పర్యవసానాలు, నేరాలను కోర్టు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం స్వలింగ సంపర్కులకు స్వేచ్ఛ కల్పించారు. అలాగే శబరిమలలో అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కూడా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సాధారణంగా రుతు క్రమం సమయంలో హిందూ ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించరు. దీనిపై ఎవరికి వారు స్వీయ నియంత్రణ విధించుకుంటారు. కాబట్టి అన్ని హిందూ ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తారు. కానీ శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మాత్రం యుక్త వయస్సులో ఉన్న మహిళలకు ప్రవేశం లేదు. అది అక్కడ నమ్మకాలకు, ఆచారాలకు సంబంధించిన విషయం. కానీ సుప్రీంకోర్టు  మహిళలకు ప్రవేశం కల్పించాలని తీర్పునిచ్చింది. మహిళల రుతు క్రమం అందులో ఉన్న ఇబ్బందులు, ఆలయం, మూల విరాట్టు విశిష్టత ఇత్యాది విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచో ఈ ఆచారం అక్కడ ఉంది. ఇప్పుడు సమానత్వం పేరిట కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం విశిష్ఠత, ఆచారాన్ని మంటకలిసినా ఫర్వాలేదంటూ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడం బాధాక‌ర‌మ‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు…కానీ ఎంత మూల్యానికి..?

 

గడిచిన పదేళ్లుగా సామాజిక విప్లవం ఊపందుకుంది. సామాజిక మాధ్యమాలు, మీడియా, టెక్నాలజీ మనుష్యుల జీవితాలను సమూలంగా మార్చివేసాయి. బాధ్యతలు, హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ ల మధ్య ఒక గట్టి సంఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యంగా స్వేచ్ఛను, సమానత్వాన్ని మహిళలు కోరుకుంటున్నారు. ఇది కచ్చితంగా అభినందించాల్సిన విషయమే. కానీ ఇక్కడే ఒక సరిదిద్దుకోలేని తప్పు జరుగుతోంది. స్వేచ్ఛ , సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేస్తున్న మహిళలు బాధ్యతలు, విలువలను గాలికి వదిలేస్తున్నారు. దీంతో సమాజంలో, కుటుంబంలో, మొత్తం భారతీయ కుటుంబ వ్యవస్థలోనే పెద్ద అగాధం ఏర్పడుతోంది. స్త్రీ వాదం పేరుతో మేం మగవాళ్లతో సమానం అంటూ ఒక అసంబద్ధ వాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. ఎన్ని చెప్పుకున్నా స్త్రీ వేరు..పురుషుడు వేరు. వీరిద్ధరు శరీర ధర్మాలు వేరు. కొన్ని విషయాల్లో ఒకరు చేసే పనులు ఇంకొకరు చేయలేరు. ఇద్దరూ సమానమే అందులో సందేహం లేదు. పరస్పరం గౌరవించుకోవడం అన్నది ముఖ్యం. అది చేయకుండా కేవలం ద్వేషం పెంచుకోవడం మగవాళ్లు బట్టలు వేసుకుంటాం. వాళ్లలా చెడు అలవాట్లు నేర్చుకుంటాం అంటే స్త్రీ గౌరవం కోల్పోతుంది. వీటన్నింటికి ప్రధాన కారణం సోషల్ మీడియా. ఒక నియంత్రణ, బాధ్యత లేకుండా విచ్చలవిడి అభిప్రాయాలు వెలిబుచ్చడం, కుటుంబ పరువును గాలికొదిలి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పెరిగిపోయింది. తాజాగా జరిగిన ప్రణయ్, అమృతల ఉదంతంలో అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్ ను దారుణంగా చంపించడం ఈ కోణంలోంచే చూడాల్సి వస్తుంది. ఒక మనిషిని హత్య చేయడాన్ని ఎవరూ సమర్థించకపోయినా వయస్సుకు వచ్చిన కూతురు భాద్యత మరిచి ప్రవర్తించడం,సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టడం, అలాగే సామాజిక ఒత్తిడి మారుతీరావును ఈ దారుణానికి ఉసికోల్పాయి. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినా అందరూ, ముఖ్యంగా మహిళలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గుప్పెట మూసి ఉన్నంత వరకే దానికి విలువ. దాన్ని తెరిచి చూపిస్తే విలువ ఉండదు. పురాతన కాలం నుంచి మన సంస్కృతిలో మహహిళలకు ఒక గౌరవం ఉంది. సమానత్వం పేరుతో దాన్ని వలువులతో పాటు విలువలను విప్పి చూపిస్తే వాళ్లకు గౌరవం ఉండదు. వాళ్లపై దాడులు పెరుగుతాయి. అత్యాచారాలు పెరుగుతాయి. సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఆడదాన్ని ఎలా అయినా చూడాలన్న పరిపక్వత మన సమాజంలో ఇంకా రాలేదు. అది గమనించుకోవాలి. మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. విచ్చలవిడిగా తిరిగే అమ్మాయి, అబ్బాయి…ఆంటీ, అంకుల్…తప్పుడు సంబంధాలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. చెడు తిరుగుళ్లకు తప్పదు భారీ మూల్యం. అది మన దేశ భవిష్యత్ నే దెబ్బతీసి ఈ దేశానికి ఏమైంది? అన్న స్థితికి తీసుకురావద్దు. ఇది అందరి బాధ్యత.

 

( ఈ ఆర్టిక‌ల్ ను మీకు స్పాన్స‌ర్ చేస్తున్నవారు)

 

 

 

ఆడ‌వాళ్లూ..మీరు ఎవరితో బ‌తుకుతారు?

 

స్త్రీ వాదం..ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుతున్న సామాజిక ప‌రిస్థితుల‌కు ఒక నిలువెత్తు నిద‌ర్శ‌నం. ఏదైనా ఒక సంద‌ర్భంలో ఒక వ‌ర్గానికి లేదా ఒక స‌మూహానికి జ‌రుగుతున్న అన్యాయాల‌కు, అణిచివేత‌కు వ్య‌తిరేకంగా వాదం పుడుతుంది. త‌మ హ‌క్కులు, సౌక‌ర్యాల కోసం ఆ వ‌ర్గం పోరాటం చేస్తుంది. ప్ర‌పంచం చ‌రిత్ర‌ను మ‌నం తిర‌గేస్తే ఈ విష‌యం మ‌న‌కు చాలా సులువుగా అర్ధమ‌వుతుంది. అయితే స్త్రీవాదంలో మాత్రం ఎన్నో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. లింగ స‌మాన‌త్వం కోసం పోరాడ‌టాన్ని స్త్రీవాదం అన‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు కానీ కేవ‌లం పురుషుల‌ను ద్వేషించ‌డాన్నే కొందరు స్త్రీవాదం అనుకోవ‌డంతోనే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. స్త్రీ, పురుషుల సంగ‌మం లేనిదే ఈ ప్ర‌పంచం లేదు..మ‌నుష్య మ‌నుగ‌డ లేదు..అస‌లు సృష్టికి అర్ధ‌మే లేదు. అయినా కొంద‌రు మ‌హిళ‌లు మొండిగా వ్య‌వ‌హ‌రిస్తూ వాస్త‌వాన్ని, సృష్టి ధ‌ర్మాన్ని, కుటుంబ సంబంధాల‌ను విస్మ‌రిస్తూ పురుష ద్వేష‌మే స్త్రీవాదం అనుకుంటూ అంద‌రి జీవితాల‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇంత‌టి వివాదాస్ప‌ద‌మైన‌, సున్నిత‌మైన విష‌యాన్ని ‘కెరీర్ టైమ్స్’ లో ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిందంటే మ‌నిషికి కెరీర్ నిర్మాణం ఎంత ముఖ్య‌మో కుటుంబ నిర్మాణం కూడా అంతే ముఖ్యం.

 

 

మూర్ఖ‌త్వం స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తుంది!

 

అప్పటి వ‌ర‌కూ ఉన్న ఒక వ్య‌వ‌స్థ లేదా ఒక విధానం మెల్ల‌గా మార్పు చెందుతూ సరికొత్త‌గా పరిణామం చెందుతున్న‌ప్పుడు ఒక సంధికాలం ఏర్ప‌డుతుంది. మార్పు అనేది ఎప్పుడూ కాస్త‌ క‌ఠినంగానే ఉంటుంది. అది ఒక్కోసారి వికృత ఫ‌లితాల‌ను కూడా అందిస్తుంది. అలాగే సంధికాలంలో జ‌రిగే మార్పులు కూడా ఒక్కోసారి మొత్తం వ్య‌వ‌స్థ‌నే కుప్ప‌కూల్చే విధంగా ఉంటాయి. ప‌రిణతి చెందని మ‌న‌స్త‌త్వాలు, మొండి ప‌ట్టుద‌ల‌కు పోయే మూర్ఖ‌త్వాలు స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేస్తాయి. ఇప్పుడు స్త్రీ, పురుష సంబంధాల్లో నెల‌కొన్న మార్పులు మొత్తం కుటుంబ వ్య‌వ‌స్థ ఉనికికే ప్ర‌మాద‌కరంగా మారుతున్నాయి. లేనిపోని అన‌వ‌స‌ర ప‌ట్టుద‌ల‌ల‌కు పోయి మొత్తం జీవితాల‌నే నాశ‌నం చేసుకుంటున్న ఒక ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో ఇప్పుడు భారతీయ కుటుంబ వ్య‌వ‌స్థ ఉంది. ముఖ్యంగా క‌ట్టుబాటు అనేదాన్ని అణిచివేత‌గా భ్ర‌మ‌ప‌డుతూ కొంద‌రు మ‌హిళ‌లు చేజేతులా జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. ఈ భూమిపై క‌లిసి బ‌త‌కాల్సిన మ‌గ‌వాళ్ల‌పై ప‌గ‌ను, ప్ర‌తీకారాన్ని పెంచుకుంటూ త‌మ జీవితాల‌ను తామే ఇబ్బందుల్లో ప‌డేసుకుంటున్నారు.

 

 

పితృస్వామ్య వ్య‌వ‌స్థ చ‌ర‌మాంకంలో ఉందా?

 

మానవ చ‌రిత్ర‌లో కొత్త‌గా నాగ‌రిక‌త‌లు వెల్లివిరిసిన కాలంలో మాతృస్వామ్య వ్య‌వ‌స్థ మ‌నుగ‌డ‌లో ఉండేది. అంటే మ‌హిళే కుటుంబాన్ని ముందుండి న‌డిపించేది. పోష‌ణ‌, పెంప‌కం, కుటుంబ నిర్ణ‌యాలు వంటివి మ‌హిళ‌లే తీసుకునేవారు. అయితే క్ర‌మంగా పురుషులు ఆ స్థానాన్ని ఆక్ర‌మించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న స‌మాజంలో పితృస్వామ్య వ్య‌వ‌స్థే కొన‌సాగుతోంది.కానీ ఇప్పుడు మ‌ళ్లీ మాతృస్వామ్య వ్య‌వ‌స్థ రావాలంటూ కొంద‌రు మ‌హిళ‌లు వాదిస్తున్నారు. బాధ్య‌త‌లు, బాంధ‌వ్యాల‌ను కాపాడిన‌ప్పుడే అది పితృస్వామ్య వ్య‌వ‌స్థ అయినా మాతృస్వామ్య వ్య‌వ‌స్థ అయినా మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతుంది. హ‌క్కులు మాత్ర‌మే మాట్లాడుతూ బాధ్య‌త‌ల‌ను గాలికొదిలేసినప్పుడు మాతృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌చ్చి ఏం లాభం? మాతృస్వామ్య వ్య‌వ‌స్థ వ‌చ్చినా కేవ‌లం ఆడ‌వాళ్లే మ‌నుగ‌డ సాగించ‌లేరు.క‌దా ? పురుషుల‌తో మ‌మేక‌మై జీవ‌నం సాగించాల్సిందే. లైంగిక‌త ఆధారంగా ఒక మ‌నిషిని ద్వేషిస్తున్న‌ప్పుడు ఒక వ్య‌వ‌స్థ‌ను ఎలా నిర్మించ‌గ‌ల‌రు? ఈ చిన్న విష‌యాన్నిమ‌ర్చిపోయి పురుష ద్వేషం పెంచుకుంటే ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. కుటుంబాలు, స‌మాజం కుప్ప‌కూలిపోవ‌డం త‌ప్ప.

 

 

ఆడ‌వాళ్లు జీవించాల్సింది మ‌గ‌వాళ్ల‌తోనే!

 

మ‌న స‌మాజంలో ఆడ‌వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా స్కూళ్లు ఉన్నాయి. ప్ర‌త్యేకంగా కాలేజీలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఎందుకు మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసారు? మ‌హిళ‌ల భ‌ద్ర‌త ముఖ్యం కాబ‌ట్టి అలా ప్ర‌త్యేకంగా వాళ్ల ర‌క్షణ కోసం, వాళ్ల స్వాతంత్రం కోసం ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు. మ‌హిళ‌లు త‌మ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన స్కూళ్ల‌లో, కాలేజీల్లో చదువుకున్నా బ‌య‌ట ప్ర‌పంచంలోకి వ‌చ్చాక మ‌గ‌వాళ్ల‌తో మ‌మేక‌మై జీవించాల్సి ఉంటుంది. అలా కాకుండా మేం చాలా ప్ర‌త్యేకం అనుకున్న‌ప్పుడు స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. స‌మాజంలో మంచీ చెడు రెండూ ఉంటాయి. కొంద‌రు చేసిన త‌ప్పుల‌కు అంద‌ర్నీ బాధ్యుల‌ను చేస్తూ ఒక వ‌ర్గం మీద పూర్తిగా ద్వేషాన్ని పెంచుకుంటే వ్య‌క్తిగ‌తంగా న‌ష్టం త‌ప్ప‌దు. స‌ర్దుబాటు అనేదే లేకుండా కాపురాల్లో ఆధిప‌త్యం కోసం వెంప‌ర్లాడుతూ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న నాశ‌నం చేస్తున్న మ‌హిళ‌లు ఎంద‌రో. స్త్రీ వాదుల‌కు ఈ స్టేట్ మెంట్ కోపం తెప్పించినా వాస్త‌వాన్ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పురుషుల‌పై ప‌గ తీర్చుకునేందుకు సాటి మ‌హిళ‌ల‌పై కూడా త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్న వైనం అంద‌రికీ తెలిసిందే.

 

 

స్త్రీలు ఆభ‌ర‌ణాలు ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

 

ఇంత సీరియ‌స్ విష‌యాన్ని చ‌ర్చిస్తూ మ‌ధ్య‌లో ఆభ‌ర‌ణాల ప్ర‌స్తావ‌న ఎందుకు? అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే. కానీ స్త్రీ పురుష సంబంధాల్లో ఇది కూడా కీల‌క‌మైన విష‌యం కాబ‌ట్టి చెప్పాల్సి వ‌స్తోంది. మాన‌సిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఎవ‌రికైతే ఆత్మ‌విశ్వాసం త‌క్కువ‌గా ఉంటుందో వాళ్లు ఆభ‌ర‌ణాలు ధరిస్తూ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తార‌ట‌. ఒళ్లంతా ఆభ‌ర‌ణాలు ధ‌రించే మ‌హిళ‌ల‌కు ఆత్మ‌విశ్వాసం త‌క్కువ‌న్న విష‌యాన్ని ఇక ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌రం లేదు. మంచి ఉన్న‌త స్థానాల‌కు చేరుకున్న , ప‌రిణ‌తి సాధించిన మ‌హిళ‌ల‌ను చూస్తే చాలా సాధార‌ణంగా క‌నిపిస్తారు. ఆత్మ‌విశ్వాసం అనే ఆభ‌ర‌ణం ఉండ‌గా ఇక పైపై మెరుగులు ఎందుకు? బ‌ంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నంత మాత్రాన ఎవ‌రూ గొప్ప‌వాళ్లు కాలేరు. సాటి మ‌నిషిని గౌర‌విస్తూ, లింగ భేధాన్ని చూప‌కుండా కేవ‌లం వ్య‌క్తిత్వాన్ని మాత్ర‌మే చూసే వాళ్లు మాత్రమే ప‌రిణ‌తి చెందిన మ‌హిళ అనిపించుకుంటారు. ఒక వ‌ర్గాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఒక ఆద‌ర్శ‌వంత‌మైన ముసుగు వేసుకుని ఒక ల‌క్ష్యం లేకుండా క‌క్ష‌సాధింపుతో ప‌నిచేసే వాళ్ల వ‌ల‌న స‌మాజానికి ప్ర‌మాదం పొంచి ఉంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు క‌లిసి ఉన్న‌ప్పుడే ప్ర‌పంచం మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతుంది. కేవలం మూర్ఖ‌పు ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తే ఎప్ప‌టికీ ఆద‌ర్శ‌వంత‌మైన వ్యక్తులుగా, కుటుంబాన్ని తీర్చిదిద్దే వ్య‌క్తులుగా త‌యారు కాలేరు.

 

 

అన్నింటిక‌న్నా ‘బంధం’ ముఖ్యం!

 

ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా సంబంధం అనేది చాలా ముఖ్యం. అటు ఆడ అయినా ఇటు మ‌గ అయినా సంబంధాన్ని గౌర‌వించిన‌ప్పుడే వాళ్లు నిజ‌మైన ప‌రిణితి చెందిన వ్య‌క్తులుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు. ఒక బంధంలోకి వెళ్లిన‌ప్పుడు కొన్ని విష‌యాల‌ను వ‌దిలేయాల్సి ఉంటుంది. ఆడ‌పిల్ల‌లు పాతిక సంవ‌త్సరాల పాటు త‌మ తల్లిదండ్రుల‌తో క‌లిసి పెరుగుతారు. ఆ త‌ర్వాత అక‌స్మాత్తుగా ఒక కొత్త ఇంటికి ఒక కొత్త వాతావ‌ర‌ణంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా త‌మ‌ను తాము మార్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. నాకు నచ్చిన‌ట్టు నేను ఉంటాను అంటే అవ‌త‌లి వ్య‌క్తులు కూడా నాకు న‌చ్చిన విధంగా నేనూ ఉంటా అంటారు. రిలేష‌న్ అంటే ఒక బాధ్య‌త దాన్ని ఇద్ద‌రు వ్య‌క్తులు నెర‌వేర్చాల్సి ఉంటుంది. మ‌గ‌వాళ్ల‌లో లోపాలు ఉన్నాయ‌ని, పొర‌పాట్లు ఉన్నాయ‌ని వాళ్లు లేకుండా జీవ‌నాన్ని సాగించ‌డం ఆడ‌వాళ్ల‌కు సాధ్య‌మా? కాదు. మ‌రి అనివార్య‌మైన విష‌యంలో ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందో దాన్ని మాత్ర‌మే వ్య‌తిరేకించాలి కానీ మొత్తం వ్య‌వ‌స్థ‌నే వ్య‌తిరేకిస్తామంటే దాన్ని అప‌రిప‌క్వ‌త అంటారు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)