ఈ పార్ట్‌టైం కోర్సుతో కెరీర్‌కు ఫుల్‌టైం జోష్!!

 

చాలా మందికి చదువు పూర్తి కాగానే ఉద్యోగం వస్తుంది. కెరీర్ లో తొందరగా స్థిరపడాలన్న కోరికతో తక్కువ జీతమైనా ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అయితే ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇక ఉన్నత విద్య అనేది తీరని కోరికగా మిగిలిపోతుంది. ఆఫీస్ లో టార్గెట్ లు హడావుడి, బాధ్యతలు వీటితోనే సమయం గడిచిపోతుంది. అయితే మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే అర్హతలను మరింత పెంచుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని బలమైన కోరిక ఉండాలే కానీ దాన్ని సాధ్యం చేసుకునేందుకు ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్నవారికి ఉన్నత చదువులు చదివి తమ కెరీర్ లో వెలిగిపోయేందుకు పార్ట్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీయే వీలు కల్పిస్తోంది.

 

 

వీలున్నప్పుడే చదువుకోవచ్చు!

 

పార్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎంబీయే లో ప్రయోజనకరమైన విషయం ఏంటంటే మనకు నచ్చిన, కుదిరిన టైం లో క్లాస్ లకు హాజరయ్యే వీలు. అంత సమయం ఉంటే ఉద్యోగం చేసుకుంటూనే ఉదయం, సాయింత్రం క్లాస్ లకు వెళ్లొచ్చు. లేదంటే వీకెండ్ లో హాజరు కావచ్చు. కొన్ని బిజినెస్ స్కూల్స్ ఆన్‌లైన్ భోధనా విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే కోర్సు కాల వ్యవధి ఏడాది నుంచి మూడేళ్ల వరకూ ఉండొచ్చు. తరగతి భోధనను వీలైనంత తగ్గించి మిగిలిన పద్ధతుల్లో సబ్జెక్ట్ ను భోధించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

 

 

ప్లానింగ్ ఉన్నవాళ్లకు చాలా సులువు!

 

వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకునే నేర్పు ఉన్నవాళ్లకు ఎగ్జిక్యూటివ్ ఎంబీయే ఒక అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తున్న నగరంలోనే మీరు అనుకున్న కోర్సును చదవొచ్చు. ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే క్లాస్‌ లకు వెళ్లి తర్వాత ఇంటికొచ్చి అసైన్‌మెంట్లు, రెగ్యులర్ ప్రిపరేషన్ ను కొనసాగించవచ్చు. అయితే ఇది అనుకున్నంత సులువైతే కాదు. ఎందుకంటే చాలా మందికి ఆఫీస్ పనివేళలు ఎప్పుడు పూర్తవుతాయన్నదానిపై స్పష్టత ఉండదు. కొన్ని సార్లు పని ఎక్కువ ఉంటే మరింత సమయంలో ఆఫీస్ లోనే ఉండాల్సి రావచ్చు. అలాగే ఆఫీస్ పని అయిపోయాక కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు ఉంటాయి. వీటన్నింటిని సమన్వయం చేసుకుని ప్రతీరోజూ సాయింత్రం క్లాస్ కు వెళ్లడం అంటే కాస్త కష్టమే. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కనీసం వీకెండ్ లో అయినా సరైన ప్రణాళిక వేసుకుంటే మంచి టాప్ డిగ్రీని సాధించొచ్చు.

 

 

ప్రాక్టికల్ నాలెడ్జ్ అపారం!

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే తో ఒక మంచి ప్రయోజనం ఉంది. ప్రతీ రోజూ లేదా ప్రతీ వారం తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను తన ఉద్యోగంలో అమలు చేసే అవకాశం లభించడం. ఇది రెగ్యులర్ విద్యార్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. ఇలా తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను వృత్తిగత జీవితంలో ఎప్పటికప్పుడు అప్లయ్ చేయడం వలన ఉద్యోగి పనితీరు మెరుగుపడుతుంది. ఒక వేళ తన పనిలో ఏమైనా సందేహాలు వస్తే వెంటనే తర్వాత క్లాస్ రూమ్ లో ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ఎంబీయే తో పోల్చుకుంటే పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే ఫీజులు చాలా తక్కువ. పేరొందిన కాలేజీల్లో ఫీజ్ రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. దీంతో కొన్ని బిజినెస్ స్కూళ్లు స్కాలర్ షిప్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి.

 

 

మంచి కాలేజీని ఎంపిక చేసుకోవడమే కీలకం

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయేను ఎప్పుడూ పేరొందిన సంస్థల్లోనే చేయడం ఉత్తమం. ఎందుకంటే అక్కడ ఫుల్‌టైం కోర్సులకు, పార్ట్ ‌టైం కోర్సులకు ఒక రకమైన సిలబస్ ఉంటుంది. విద్యార్ధుల వెసులుబాటు కోసం కాస్త రీడిజైన్ చేసినా సిలబస్ మాత్రం రెగ్యులర్ అభ్యర్ధులకు ఉన్న విధంగానే ఉంటుంది. అన్నింటికంటే ప్రయోజనం ఏంటంటే ఫుల్ టైం విద్యార్ధులకు భోధించే ఫ్యాకల్టీయే పార్ట్ టైం విద్యార్ధులకు కూడా భోధిస్తారు. అందువల్ల నేర్చుకునే విషయంలో మంచి నాణ్యత ఉంటుంది. రెగ్యులర్ కోర్సుతో పోల్చుకుంటే అసైన్‌మెంట్స్ , ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండవు కనుక పార్ట్‌టైం కోర్సు విద్యార్ధులకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.

 

 

నెట్‌వర్క్ పెంచుకునేందుకు సరైన వేదిక! 

 

పార్ట్‌టైం ఎగ్జిక్యూటివ్ ఎంబీయే వలన ఉన్నత డిగ్రీ, కెరీర్ లో ఎదుగుదలతో పాటు అన్నింటికన్నా ముఖ్యంగా నెట్‌వర్క్ విసృతమవుతుంది. మంచి కాలేజీని ఎంచుకున్నప్పుడు క్లాస్ రూమ్ లో అత్యుత్తమ ఫ్యాకల్టీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశ్లేషకులు గెస్ట్‌ లెక్చర్స్ లో భాగంగా పాఠాలు భోధిస్తారు. వాళ్లతో పరిచయాలు పెంచుకుంటే మీ కెరీర్ కు ఎంతగానే ఉపయోగపడుతుంది. అలాగే మీ లాగే ఎంతో మంది సహ విద్యార్ధులతో, ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి. కెరీర్ అభ్యున్నతికి పరిచయాలు , నెట్‌వర్కింగ్ అనేది చాలా ముఖ్యం. భవిష్యత్ లో కెరీర్ ఛేంజ్ లోనూ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలోనూ పరిచయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు) 

 

వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పక చదవండి!!

 

ప్రస్తుతం స్టార్టప్ ల ట్రెండ్ నడుస్తోంది. 9 టూ 5 ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగిగానే జీవితాన్ని ముగించేందుకు నవ యువతరం సిద్ధంగా లేదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కాస్త కొత్తగా లైఫ్ ను డిజైన్ చేసుకునేందుకు చాలా మంది యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక స్టార్టప్ ను ప్రారంభించడం అంత సులువైన విష‍యం కాదు. ప్రతీనెలా స్థిరంగా వచ్చే జీతాన్ని వదులుకుని ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటూ మానసిక సంఘర్షణను భరిస్తూ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడానికి ధైర్యం కావాలి. ఒక వందమందికి స్టార్టప్ ఆలోచన ఉంటే కష్టాలను భరించేందుకు రెడీ అయి బరిలోకి దిగే వారు కేవలం అయిదు మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్లను కుటుంబం, ఆర్థిక అవసరాలు, సమాజం అన్నీ వెనక్కి లాగేస్తాయి. మంచి ఉద్యోగాన్ని వదిలి ఎంట్రెప్రెన్యూర్ గా మారాలనుకుంటున్న వారు కొన్ని సూచనలను తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దామా.

 

లైఫ్ అంటేనే రిస్క్ ..

 

మానవ జీవితం అంటేనే రిస్క్. మనం ఈ భూమి మీదకు రావడమే ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్న టాస్క్. రిస్క్ చేయకుంటే లైఫ్ లో ముందుకు వెళ్లడం అసలు సాధ్యం కాదు. రిస్క్ చేసే దమ్ము లేని వారికి పెద్ద కలలనే కనే హక్కు లేదు. మీ లక్ష్యాలను, మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసుకోండి. మీ జీవితాన్ని వేరే వాళ్ల చేతుల్లో ఎప్పుడూ పెట్టకండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీ వర్తమానమే మీ భవిష్యత్ ను నిర్ణయించింది. ఇప్పుడు ఆలోచిస్తూ భయపడుతూ సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్ లో అలా భయపడుతూనే జీవితాన్ని ముగిస్తారు. కాబట్టి ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకోండి.

 

 

అనవసర బాధ్యతలను వదిలించుకోవడమే మొదటి మెట్టు!

 

ఒక స్టార్టప్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా మీపై ఉన్న బాధ్యతలను క్రమంగా తొలిగించుకోండి. కార్ కొనుక్కోవడం, ఇళ్లు కొనుక్కోవడం, క్రెడిట్ కార్డు లు తీసుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటి బాధ్యతలను నెత్తిన పెట్టుకోకండి. అవి మిమ్మల్ని గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుకుంటాయి. మీ స్టార్టప్ విజయవంతమై ఇవన్నీ మీ చెంతకే వచ్చి చేరుతాయి. వ్యాపారంలో మీకు ఉపయోగపడే వాటినే తీసుకోండి. కానీ అవసరం లేని వస్తువులకు ఈఎంఐలు కట్టేందుకు మీ జీవితాన్ని తాకట్టు పెట్టుకోకండి.

 

జీవన నైపుణ్యాలు నేర్చుకోండి!

 

ఉద్యోగాన్ని వదిలేయడం అనేది జీవితాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే స్టార్టప్ కోసం ఉద్యోగాన్ని వదిలేసే ముందుగా ఆరు నెలలకు సరిగా డబ్బును దాచిపెట్టుకోండి. అలాగే స్టార్టప్ ను కొనసాగిస్తూనే వేరే ఆదాయ వనరుల కోసం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే రోజువారీ ఖర్చులకు తగిన ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దీ మొత్తాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో తెలియడమే స్కిల్ ఆఫ్ సర్వైవల్. ఒక వేళ మీకు డబ్బులు సరిపోకపోతే పార్ట్‌టైమ్ గా ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ పనులు ఉంటే చేయాలి.

 

 

ఏదైనా సాధించేందుకు ఇదే సరైన సమయం!

 

ఒక పనిని ప్రారంభించే ముందు మనలో చాలా మందికి లక్షల సంఖ్యలో సందేహాలు వస్తాయి. ఇది అసలు వర్కవుట్ అవుతుందా? ఒక వేళ విఫలం అయిపోతే.? నేను చేస్తున్న పని సరైనదేనా? ఇవన్నీ అందరికీ వచ్చే సందేహాలే. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా ఆలోచించడం కూడా సబబే. కానీ అతిగా ఆలోచిస్తూ మనకు మనం సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ నిర్ణయం తీసుకోలేం. మనం ఒక మంచి ఎప్పుడు అనుకుంటే అప్పుడే సరైన సమయం. ప్రాథమిక ఆలోచన చేసాక నిర్ణయం తీసుకున్నాక ఇక ధైర్యంగా బరిలోకి దిగాలి. నెగెటివ్ థింకింగ్ అస్సలు పనికిరాదు. చేయాలనుకున్నది నిబద్ధతతో. పట్టుదలతో, శ్రద్ధగా చేయాలి. ఫలితం తప్పుకుండా వస్తుంది.

 

మీ బలాలే కాదు మీ బలహీనతలూ తెలిసుండాలి!

 

స్టార్టప్ మొదలు పెట్టే ముందు ప్రతీ ఒక్కరూ ఈ విషయంపై బాగా ఆలోచన చేయాలి. అసలు నేనేంటి? నేను జీవితంలో ఎక్కడ ఉన్నాను? నా బలాలు ఏంటి? నా బలహీనతలు ఏంటి? ఒక రోజులో ఏ విషయంలో నేను బాగా పనిచేయగలుగుతున్నాను? ఏ విష‍యంలో ఇబ్బంది పడుతున్నాను? ఫలానా పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అన్న ప్రశ్నలను తనను తానే వేసుకుని విశ్లేషించుకోవాలి. బలహీనతలను అధిగమించేందుకు తగిన ప్రయత్నాలు చేయాలి. ఈ క్రమంలో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. వాటిని వదిలేయాలి. ఏ క్షణంలో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపే ఇంధనం.

 

 

కుటుంబాన్ని ప్రేమించండి

 

స్టార్టప్ ప్రారంభించేటప్పుడు ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇది కుటుంబాల్లో కలతలకు కారణమవుతుంది. ఇటువంటి సమయాల్లో నిబ్బరంగా ఉండాలి. మానసికంగా కుటుంబానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. మీపై మీ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ నిర్ణయం కుటుంబ సభ్యలకు నచ్చకపోయినా వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నం లోని చిత్తశుద్ధి అర్ధమైతే వారే తగిన ప్రోత్సాహం ఇస్తారు. కుటుంబంతో ఎప్పుడూ గ్యాప్ ను సృష్టించుకోకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ‌్యం.

 

ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకోవడం మానుకోండి!!

 

స్టార్టప్ ప్రారంభించాలనుకునే ముఖ‌్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇతరులను ఇంప్రెస్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. అది మీపై అనవసర ఒత్తిడిని పెంచుతుంది. అలా కాకుండా మీ పని గురించి , మీ సంస్థ గురించి చెప్పుకోండి. అది మీకు ఉపయోగపడుతుంది. అవతలి వారిని ఇంప్రెస్ చేయాలనుకోవడం మనలోని క్రియేటివీటీని చంపేస్తుంది. స్నేహితులు, పేరెంట్స్ ఎవరైనా కానీయండి ఎవర్నీ ఇంప్రెస్ చేయకండి. మీ కోసం, మీ పని కోసం వారికి వివరించండి చాలు. చేసే పనిని భయం లేకుండా , గుండె ధైర్యంతో చేయండి చాలు సరిపోతుంది.

 

 

ధైర్యంతో పాటు వినయమూ ముఖ్యమే!

 

మీరు ప్రారంభించిన సంస్థపై మీరు చేస్తున్న పనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. మీ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఎవరినైనా కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎవరి ముందూ ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీరు చేస్తున్న పనితో మీరు త్వరలోనే విజయవంతమైన వ్యాపారవేత్త కాబోతున్నారు. ఆ నమ్మకాన్ని మీ కళ్లలో కనిపించేలా చూసుకోండి. ధైర్యంగా ఉంటూనే అదే సమయంలో ఎదుటి వాళ్లతో వినయపూర్వకంగా మసులుకోండి. మీలో కనిపించే వినయం, ధైర్యం అన్న విషయాలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆల్ ది బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

 

‘ఎక్స్‌ట్రా’ లు చేస్తున్నారా? అయితే మీకు జాబ్ వచ్చినట్టే..!!

 

ప్రస్తుతం హెచ్ఆర్ నిపుణులు చెప్పే మాట ఒకటే. జాబ్ మార్కెట్లో ట్రెండ్ మారిపోయింది. కంపెనీల ఆలోచనా తీరులో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ను ఉద్యోగంలోకి తీసుకోవడంలో కంపెనీలు గతంలోలా వ్యవహరించడం లేదు. విభిన్న విషయాలను, అంశాలను బేరీజు వేసుకుని దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రజంట్ ఇంటర్వ్యూలలో కేవలం అకడమిక్ రికార్డును మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మార్కులు కాస్త తక్కువ ఉన్నా అభ్యర్ధిలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కావాల్సింది ఆల్‌రౌండర్లు. పనిచేస్తూనే అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ మెసిలే సిసలైన నాయకులు కావాలి. కాబట్టి ఇప్పుడు బాగా మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న ఆలోచనను విద్యార్ధులు తొలిగించుకోవాలి. చదువుతో పాటు ఆటల్లో, ఈవెంట్ మేనేజ్‌మెంట్ లలో చురుగ్గా ఉండాలి.

 

 

కంపెనీలు ఎందుకు ఈ ఎక్స్‌ట్రా లను కోరుకుంటున్నాయి?

 

మన దేశంలో చదువు అంటే కేవలం మార్కులే కానీ విదేశాల్లో అయితే చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వాస్తవానికి అవే విద్యార్ధి దశలో చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఒక విద్యార్ధిలోని నిజమైన నాయకుడ్ని, సమస్యలను పరిష్కరించే వ్యక్తిని ఆవిష్కరించేవి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ మాత్రమే. అందుకే కంపెనీలు ఈ లక్షణాలు ఉన్న అభ్యర్ధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే సంస్థలో విధులు నిర్వర్తించే క్రమంలో ఏమైనా సమస్యలు ఎదురైతే అభ్యర్ధులు చాలా వేగంగా స్పందిస్తారని కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే రెజ్యుమెలో కాలేజీలో ఈవెంట్లు నిర్వహణ, ఇతర అదనపు అర్హతలు వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. కంపెనీల ఆలోచనా విధానంలో వచ్చిన ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యార్ధులు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై శ్రద్ధ పెట్టాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నో..!

 

ప్రస్తుతం ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై కళాశాలల్లో కాస్త అవగాహన పెరిగింది. ఇప్పుడు కావాల్సిందల్లా విద్యార్ధులు తగిన చొరవ తీసుకోవడమే. కళాశాలల్లో ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం, అదే విధంగా కల్చరల్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేయడం, అదే విధంగా ఇన్‌స్టిట్యూట్ లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాలను నడిపించే ఆర్గనైజింగ్ బాధ్యతలు తీసుకోవడం వంటి వాటి వలన టీమ్ ను ఎలా నడపాలో, గడువు లోగా పనులు ఎలా నిర్వహించాలో తెలుస్తుంది. ప్రస్తుతం చాలా ఇన్‌స్టిట్యూట్ లో కల్చరల్ సొసైటీ కాన్సెప్ట్ నడుస్తోంది. అకడమిక్స్ లో విద్యార్ధులు పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు ఉపయోగించుకోవాలి. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలైన సీఐఐ, నాస్కామ్, ఫిక్కీ, అసోచామ్ లలో స్టూడెంట్ మెంబర్‌షిప్ తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా సంస్థలు నిర్వహించే సెమినార్లలో పాల్గొనడం ద్వారా నిపుణులను, ఉన్నత వ్యక్తులను కలుసుకుని వారి నుంచి సలహాలు పొందడంతో పాటు స్పూర్తిని కూడా పొందే వీలుంటుంది. అలాగే వాలంటీర్ సర్వీస్ లు కూడా చేస్తే సమాజంలో ఏం జరుగుతోంది. ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్న దానిపై అవగాహన పెరుగుతుంది. వీటన్నింటిని రెజ్యుమెలో పొందుపర్చుకుంటే అవే ఇప్పుడు ప్రధాన అర్హతలుగా మారుతున్నాయి.

 

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఎన్నో లాభాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివీటీస్ పై చాలా మంది తల్లిదండ్రులకు కూడా సదభిప్రాయం లేదు. వీటి వలన పిల్లల చదువు పాడవుతుందని చాలా మంది పేరెంట్స్ భావిస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం పూర్తి తప్పు. వీటిల్లో పార్టిసిపేట్ చేయడం వలన విభిన్న వ్యక్తులతో కలివిడిగా మాట్లాడటం అలవడి బెరుకు అన్నది పోతుంది. అలాగే నలుగురితో మాట్లాడటం వలన సమస్యను పరిష్కరించే విధానం, మనుష్యులతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఓవరాల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి దిట్టలుగా నిలబడగలుగుతారు. అదే విధంగా ఒక కార్యక్రమంలో ఎంతో మందిని సమన్వయం చేయాల్సి రావడంతో మంచి లీడర్‌షిప్ లక్షణాలు కూడా పెరుగుతాయి. పెద్ద పెద్ద సెమినార్స్ లో షెడ్యూల్స్ ను ఖరారు చేయడం, ప్రతినిధులకు తెలియజేయడం వంటి వాటి వలన సమన్వయ సామర్ధ్యం పెరుగుతుంది. ఇవన్నీ రెజ్యుమెలో ఉంటే కంపెనీలు ఉద్యోగంలోకి తీసుకోకుండా ఉండలేవు.

 

 

విద్యార్ధులకు ఎన్నో ఉపయోగాలు!

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వలన విద్యార్ధులకు వ్యక్తిగతంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాలేజీలో వీటిల్లో చురుగా పాల్గొనడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడిని ఎదుర్కొనే నేర్పు, భవిష్యత్ పై సానుకూల దృక్ఫధం, సమాజం పట్ల అవగాహన పెరుగుతాయి. ఇక రెజ్యుమెలో ఈ వివరాలను పొందుపర్చడం వలన రిక్రూటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉన్న అభ్యర్ధుల్లో నాయకత్వ లక్షణాలు, సమయస్ఫూర్తి, టీమ్ మేనేజ్‌మెంట్, నిరంతరం నేర్చుకునే లక్షణాలు ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు. అందుకే మార్కులు ఎక్కువ వచ్చిన అభ్యర్ధుల కంటే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా చేస్తున్న అభ్యర్ధులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి విద్యార్ధులు తమ భవిష్యత్ ప్రణాళికలను తగిన విధంగా మార్చుకోవాలి. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలి. అప్పుడే మీ డ్రీమ్ జాబ్ మీ తలుపు తడుతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు) 

 

సెల‌వు తీసుకో..పండ‌గ చేసుకో..కంపెనీల కొత్త మంత్రం!!

 

మారుతున్న ప‌రిస్థితుల ఆధారంగా మానవ వన‌రుల విభాగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. సామ‌ర్ధ్యం ఉన్న ఉద్యోగుల‌ను కాపాడుకునేందుకు కంపెనీలు కొత్త త‌ర‌హా విధానాలను పాటిస్తున్నాయి. జీతం, ప్రోత్సాహ‌కాల విష‌యంలోనే కాదు ఉద్యోగులు క‌ంపెనీ ఉన్న‌తికి ఉప‌యోగ‌ప‌డే వ్య‌క్తులైతే చాలు వాళ్ల‌ను వదులుకునేందుకు చాలా కంపెనీలు సుముఖంగా లేవు. ఉద్యోగుల మ‌న‌సెరిగి వాళ్ల‌కు సుదీర్ఘ సెలవులు ఇచ్చేందుకు కంపెనీలు త‌మ హెచ్ఆర్ పాల‌సీల్లో మార్పులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా సంవ‌త్స‌రాలు పాటు ప‌నిచేసి మానసికంగా అలిసిపోయి కొన్ని నెల‌ల పాటు విరామం తీసుకుందామ‌నుకుంటున్న వారికి ఈ విధానం చాలా వెసులుబాటుగా ఉంటోంది. సుధీర్ఘ సెల‌వుతో మాన‌సికంగా రీఛార్జ్ అవుదామని భావిస్తున్న వారిని కంపెనీలు అమ‌లు చేస్తున్న ఈ నూత‌న విధానం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. కొత్త ఆలోచ‌న‌ల‌కు, స్టార్ట‌ప్ ల‌కు బీజాలు వేసుకునేందుకు, కుటుంబంతో విహార యాత్ర‌లు చేద్దామ‌నుకుంటున్న వారికి ఇదో సువ‌ర్ణావ‌కాశంగా మారుతోంది. అలాగే కొన్నాళ్లు త‌మ మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని చేయాల‌ని భావిస్తున్న వారికి కూడా ఈ విధానం కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.

 

 

హెచ్ఆర్ పాల‌సీల్లో కీలక మార్పులు!

 

ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా చాలా కంపెనీలు మాన‌వ వ‌నరుల పైనే అధికంగా ఖ‌ర్చు చేస్తున్నాయి. ఒక ఉద్యోగి శిక్ష‌ణ‌, అభివృద్ధిపై కంపెనీలు చేసిన ఖ‌ర్చు తిరిగి వ‌చ్చేందుకు కొంత కాలం ప‌డుతుంది. అయితే కొంద‌రు ఉద్యోగులు మాత్రం కంపెనీకి సుధీర్ఘ‌కాలం సేవ‌లు అందిస్తూ సంస్థ ఉన్న‌తికి దోహ‌దం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి వారినే కాపాడుకునేందుకు హెచ్ఆర్ నిపుణులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇలా బాగా ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఒక కొత్త అవ‌కాశాన్ని ఇస్తున్నారు. సొంతంగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను రెడీ చేసుకునేందుకు, అలాగే కొత్త ప్ర‌దేశాలు చూసేందుకు,లేక త‌న వ్య‌క్తిగ‌త అభిరుచుల‌ను నెర‌వేర్చుకునేందుకు ఏ ఉద్యోగి అయినా సుధీర్ఘ‌కాలం సెల‌వు కావాల‌ని అడిగితే అనుమ‌తి ఇచ్చేందుకు చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అటువంటి ఉద్యోగులు ఇప్ప‌టికే త‌మ కంపెనీకి విశేష‌మైన సేవ‌లు అందించారు క‌నుక మ‌ళ్లీ తిరిగి వ‌చ్చినా అటువంటి వాళ్ల వ‌ల‌న త‌మ‌కు చాలా ప్ర‌యోజ‌నం ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి.

 

 

 

సుధీర్ఘ సెల‌వుల విధివిధానాలేంటి?

 

ఉద్యోగుల‌కు సుధీర్ఘ సెల‌వులు ఇచ్చేందుకు కంపెనీలు కొన్ని విధివిధానాల‌ను అనుస‌రిస్తున్నాయి. ముఖ్యంగా బాగా ప‌నిచేస్తూ కంపెనీకి సుధీర్ఘ కాలం సేవ‌లు అందించిన వారితో పాటు త‌క్కువ కాలం ప‌నిచేసిన‌ప్ప‌టికీ ప్ర‌భావ‌వంత‌మైన ప‌నితీరు క‌న‌బ‌ర్చిన వారికి ఈ ఆఫ‌ర్ ను ఇస్తున్నాయి. ముఖ్యంగా వారి వ‌ల‌న కంపెనీకి ఎన‌లేని ప్ర‌యోజ‌నం క‌లిగింద‌ని, భ‌విష్య‌త్ లో కూడా క‌లుగుతుంద‌ని భావిస్తే అటువంటి ఉద్యోగికి ఈ సుధీర్ఘ సెల‌వు అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌యోజ‌నంలో కొన్ని కంపెనీలు ఆ సెల‌వు కాలానికి జీతం ఇవ్వకుండా ఆరోగ్య బీమా, మ‌రికొన్ని ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను కొన‌సాగిస్తుంటే కొన్ని కంపెనీలు ఆర్థిక ప్ర‌యోజ‌నాలతో కాస్త జీతం కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్ర‌స్తుతం తీవ్రమైన ఒత్తిడి వాతావ‌ర‌ణంలో ప‌నిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు కొన్నాళ్ల పాటు విరామం తీసుకుని ఎటువంటి టెన్ష‌న్ లేకుండా మ‌న‌సుకు న‌చ్చిన ప‌నిచేయాల‌ని భావిస్తున్నారు. అలాగే మ‌రికొంత మందికి సొంతంగా ఒక స్టార్ట‌ప్ పెట్టాల‌న్న ఆలోచ‌న ఉన్నా న‌ష్టం వ‌స్తే ఏంటి ప‌రిస్థితి అన్న భ‌యాలు వెంటాడుతూ ఉంటాయి. వీరు సుధీర్ఘ సెల‌వు అవ‌కాశాన్ని వినియోగించుకుని త‌మ స్టార్ట‌ప్ ప్ర‌య‌త్నం చేసి అది బెడిసికొట్టినా త‌న ఉద్యోగం త‌న‌కోసం సిద్ధంగా ఉంటుంది. మొత్తానికి ఈ సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నం ఉద్యోగుల‌కు మంచి వెసులుబాటు.

 

 

ప్ర‌తికూల‌త‌లూ ఉన్నాయి!

 

కంపెనీలు ఉద్యోగులకు క‌ల్పిస్తున్న ఈ సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నంపై కొందరు సానుకూలంగా ఉన్నా కొంద‌రు హెచ్ఆర్ నిపుణులు మాత్రం దీనిపై పెద‌వి విరుస్తున్నారు. ఈ విధానం సంస్థ‌లో ఊహించ‌లేని, అస్థిర ప‌రిస్థితికి కార‌ణ‌మ‌వుతుందని వారు వివ‌రిస్తున్నారు. ఇందులో మొద‌టి ప్ర‌తికూల‌త‌న‌కు తీసుకుంటే ఒక ఉద్యోగి సంస్థ నుంచి సుధీర్ఘ సెల‌వులో వెళ్లిపోతే అత‌ని స్థానాన్ని అప్ప‌టిక‌ప్పుడు భ‌ర్తీ చేయ‌డం చాలా క‌ష్టం. అది సంస్థ ప‌నితీరును దెబ్బ‌తీస్తుంది. ఇక రెండోది అవ‌త‌లి వైపు ప్ర‌భుత్వ సంస్థ‌ల వంటి కీల‌క క్ల‌యింట్ ఉన్న‌ప్పుడు ఒక ఉద్యోగి వ‌దిలి వెళ్లిన స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డం కంపెనీల‌కు స‌వాలు. ఎందుకంటే ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా కంపెనీ కున్న మొత్తం ప్ర‌తిష్ఠ మంట‌గ‌లిసిపోతుంది. అలాగే కొంద‌రు ఉద్యోగులు సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజనాన్ని త‌ప్పుడు మార్గంలో దుర్వినియోగం చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. సుధీర్ఘ సెల‌వు ప్ర‌యోజ‌నాన్ని వినియోగించుకుంటూ అదే స‌మ‌యంలో వేరే కంపెనీలో అదే ప్లాట్ ఫామ్ పై ప‌నిచేసే ఉద్యోగులు కూడా ఉండొచ్చు. దీని వ‌ల‌న కంపెనీలు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

 

 

ఈ ప‌ద్ధ‌తి ఇంకా ఊపందుకోలేదు!

 

సోసైటీ ఆఫ్ హ్యూమ‌న్ రిసోర్స్ మేనేజ్ మెంట్ వారి నివేదిక‌ల ప్ర‌కారం సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధ‌తి ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు. అమెరికా, బ్రిట‌న్ ల‌లో కేవ‌లం 17 శాతం కంపెనీలు మాత్ర‌మే ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నాయి. అమ‌లులో ఉన్న అడ్డంకులు, న‌ష్టాలు కంపెనీల‌ను ఈ దిశ‌గా ఆలోచించనివ్వ‌డం లేదు. మ‌న దేశంలో కూడా ఈ సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధ‌తిని కొన్ని కంపెనీలు మాత్ర‌మే అమ‌లు చేస్తున్నాయి. కానీ ఈ ప‌ద్ధ‌తి పూర్తి స్థాయిలో అమ‌ల్లోకి వ‌స్తే అది హెచ్ఆర్ విభాగంలో అదో కీల‌క మ‌లుపు అవుతుంది. ఉద్యోగులు సంక్షేమానికి పెద్ద పీట వేసేందుకు, క‌ష్టాన్ని గుర్తించేందుకు తగిన వేదిక ఏర్పాట‌వుతుంది. అయితే దీనికి ప్రారంభంలో ఉన్న బాలారిష్టాల‌ను దాటాల్సి ఉంది. ఏది ఏమైనా హెచ్ఆర్ లో సుధీర్ఘ సెల‌వు ప‌ద్ధతి ఒక విప్ల‌వాత్మ‌క మార్పు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)