యునెస్కో రిపోర్ట్…మన విద్య దుస్థితి మరోసారి వెల్లడైంది!!

 

ప్ర‌పంచంలో వేగ‌వంతమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. ప్ర‌పంచంలో 35 ఏళ్ల లోపు యువ‌కులు ఎక్కువ‌గా ఉన్న న‌వ యువ దేశం..అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో అగ్ర‌దేశాల‌కు పోటీ.. ఇండియా గూర్చి చెప్పేట‌ప్పుడు విన‌సొంపుగా ఉన్న ఈ స్టేట్ మెంట్లు నాణెనికి ఒక వైపు మాత్ర‌మే. రెండో వైపు మాత్రం ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా విద్యా రంగంలో మ‌న దేశం వెనక‌బాటుత‌నం మ‌రోసారి సుస్ప‌ష్ట‌మైంది. తాజాగా యునెస్కో విడుద‌ల చేసిన ఓ నివేదిక, ప్ర‌పంచం మొత్తం మీద‌ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల్లో 35 శాతం మంది ఇండియాలోనే ఉన్నార‌ని వెల్ల‌డించింది. ఇండియా మొత్తం జ‌నాభాలో 26 కోట్ల మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిరక్ష్య‌రాస్యులేన‌ని వెల్లడించింది. ప్ర‌పంచం వేగంగా దూసుకుపోతున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ ఇప్ప‌టికీ సంపూర్ణ అక్ష‌రాస్యత‌ను సాధించ‌డంలో విఫలం కావ‌డం అంటే అభివృద్ధికి దూర‌మ‌వుతున్న‌ట్టే. అయినా మొద్దు నిద్ర పోతున్న పాల‌కులు విద్యా రంగంపై శీత‌క‌న్ను వేస్తూనే ఉన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి సాధించ‌కుండా దేశాభివృద్ధి సాధ్యం కాద‌న్న ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌ర్చిపోయి నేల విడిచి సాము చేస్తున్న ప్ర‌భుత్వం వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ఎప్పుడు అవ‌గ‌తం చేసుకుంటుందోన‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌. మ‌రోవైపు తెలంగాణాలో కూడా ఇప్ప‌టికీ 34 శాతం మంది ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం రాద‌ని యునెస్కో నివేదిక చెపుతోంది.

 

 

అస‌లు యునెస్కో నివేదిక‌లో ఏముంది?

 

తాజాగా యునెస్కో వారి గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ మాన‌ట‌రింగ్ నివేదిక విడుద‌లైంది. ఆ నివేదిక‌లో వెల్ల‌డైన విష‌యాలు ఇండియా విద్యా రంగ దుస్థితిని మ‌రోసారి క‌ళ్ల‌కు క‌ట్టాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇండియాలో దాదాపు 26 కోట్ల మంది చ‌ద‌వ‌డం, రాయ‌డం రాని నిర‌క్ష‌రాస్యులేన‌ని ఆ రిపోర్ట్ లో తేలింది. గ‌తంతో పోల్చుకుంటే అక్ష‌రాస్యుల సంఖ్య కాస్త పెరిగిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ నిర‌క్ష్య‌రాస్యులు సంఖ్య భారీగా ఉండ‌టం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. దేశంలోని మొత్తం జ‌నాభాలో 73 శాతం మంది మాత్ర‌మే అక్ష‌రాస్యుల‌ని యునెస్కో నివేదిక వెల్ల‌డించింది. ఇక తెలంగాణా విష‌యానికొస్తే ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. తెలంగాణా మొత్తం జ‌నాభాలో అక్ష‌రాస్యుల సంఖ్య 65 శాతం మాత్ర‌మేన‌ని తేలింది. అంటే దాదాపు 35 శాతం మంది తెలంగాణా ప్ర‌జ‌ల‌కు క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం కూడా రాదు. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డం, పేద‌రికం కార‌ణంగా చాలా మంది పిల్ల‌లు ప్రాథ‌మిక స్థాయిలోనే చ‌దువుకు ఫుల్ స్టాప్ పెడుతున్నార‌ని యునెస్కో నివేదిక‌లో వెల్ల‌డైంది. మ‌రోవైపు అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ప్ర‌పంచంలో చాలా దేశాలు త‌మ జీడీపీ లో అధిక శాతం నిధులను విద్యా రంగానికి కేటాయిస్తున్నాయి. కానీ మ‌న దేశంలో మొత్తం జీడీపీలో విద్యారంగానికి కేటాయిస్తున్న మొత్తం 3.8 శాతం మాత్ర‌మే. ప్ర‌పంచంలో స‌గ‌టున ప్ర‌తీ దేశం త‌మ జీడీపీ 5 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలి. క‌నీసం ఆ బెంచ్ మార్క్ స‌గ‌టును కూడా ఇండియా అందుకోలేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర ప‌రిణామం.

 

 

తెలంగాణాలో ప‌రిస్థితి ద‌య‌నీయం!

 

యునెస్కో రిపోర్ట్ లో తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి వెల్ల‌డైన గ‌ణాంకాలు ఆందోళ‌న‌కరంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ చాలా మంది విద్య‌కు దూరంగా ఉన్నారు. తెలంగాణా మొత్తం జ‌నాభాలో దాదాపు 25 శాతం మంది నిర‌క్ష్య‌రాస్యులుగానే ఉంట‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. ముందు నుంచీ ఉన్న నిర‌క్ష్య‌రాస్యుల‌కు తోడు కొత్త‌గా బ‌డిలో చేరుతున్న మ‌ధ్య‌లోనే మానేయ‌డం నిర‌క్ష్య‌రాస్యుల‌ను పెంచుతోంది. ఇండియాలో దాదాపు కోటీ ఇరవై లక్షల మంది పిల్లలు అసలు స్కూల్ కే రావడం లేదని లెక్కలు చెపుతున్నాయి. ఈ సంఖ్య తెలంగాణాలో కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ డ్రాపవుట్లను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సుముఖంగా లేరు. దీంతో వాళ్లను ఒప్పించి పిల్లలను బడికి తీసుకురావడం అనేది అధికార్లకు సవాలుగా మారింది. అలాగే చదువురాని నడి వయస్కులకు ఇప్పుడు చదవడం,రాయడం నేర్పించడం కూడా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను అందుకోవాలంటే ప్రతీ ఒక్కరు చదవడం,రాయడం పై కనీస అవగాహన తెచ్చుకోవాలి. మరి ఇంత మంది నిరక్ష్యరాస్యులు ఉన్న నేపథ్యంలో ఆ లక్ష్యాలను ఎలా చేరుకుంటారన్నది పెద్ద ప్రశ్న.

 

ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత!

 

చైనా లాంటి దేశాల‌తో ఆర్థిక వృద్ధిలో పోటీప‌డ‌తామ‌ని చెపుతున్న ఇండియా , కీల‌కమైన విద్యా రంగంపై మాత్రం శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు. ఇప్ప‌టికే భారీ సంఖ్య‌లో యువ‌కులు ఉన్నా వారికి సరైన నైపుణ్యాలు లేక అభివృద్ధి వెనుక‌బడుతున్నా మ‌న విధానక‌ర్త‌లు మాత్రం క‌ళ్లు తెర‌వ‌డం లేదు. ఒక‌వైపు చ‌దువుకున్న వాళ్లు ప‌నిచేసేందుకు అన‌ర్హులుగా తేలుతుంటే మ‌రోవైపు అస‌లు ఆ కొద్ది పాటి అక్ష‌రజ్ఞానం కూడా లేని వాళ్లు కోట్ల‌లో తేలుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు రేసులో ఉన్న వర్ధమాన దేశాలతో పోటీ ఎలా సాధ్యం? ఒక వైపు నిరక్షరాస్యత, మరోవైపు నైపుణ్యాల లేమి ఈ రెండు జాడ్యాలను వదిలించుకోకుంటే పోటీ పడటం మాట అటుంచి కనీసం రేసులో కూడా నిలవలేని పరిస్థితి వస్తుందని ప్రభుత్వాలు గ్రహించలేకపోవడం విడ్డూరంగా ఉంది. పైకి మాత్రం ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, పనిచేసే యువకులు మా దగ్గరే ఉన్నారు అని చంకలు గుద్దుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఆత్మవంచన తప్పించి మరేమీ కాదు. సమస్యకు మూలాలు గుర్తించి పరిష్కారాన్ని వెతకడం మాని సాధించిన కొద్దిపాటి ప్రగతినే గొప్పగా చెప్పుకుంటే ఇండియా ఎప్పటికీ అగ్రదేశం కానేరదు.

 

 

తక్షణ చర్యలు చేపట్టకుంటే పరిస్థితి దిగజారుతుంది!

 

125 కోట్ల జనాభాలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు ఇంకా చదవడం రాయడం రాదు అంటే మన దేశం ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. యుద్ధప్రాతిపదికన నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రయత్నం చేయకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి సాధ్యం కాదు. రానున్న 20 ఏళ్లలో చైనా ను దాటి అగ్రరాజ్యంగా ఎగుదుతామని గప్పాలు కొడుతున్న నేతలు ముందుగా అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ఒక దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో పూర్తి స్థాయి అభివృద్ధి సాధించాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని మర్చిపోయి ప్రజలకు విద్యను అందించకుండా, విద్యార్ధులకు నైపుణ్యాలను అందించకుండా మీనమేషాలు లెక్కిస్తే ఎప్పటికే ఇండియా వర్ధమాన దేశంగానే మిగిలిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)

 

ఆ స‌మ‌స్య గ్రామీణ ప్రాంత‌ విద్యార్ధుల‌కు పెను శాపం!

ప్ర‌జ‌ల‌కు క‌నీస వ‌స‌తులు, మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ప్ర‌భుత్వాల విధి. అయితే ప్ర‌భుత్వాలు త‌మ బాధ్య‌త‌ల నుంచి పారిపోవ‌డంతో ఇప్పుడు కీల‌క‌మైన విద్య, వైద్యం లోకి కార్పోరేట్ శ‌క్తులు ప్ర‌వేశించి వాటిని త‌మ చెప్పుచేత‌ల్లోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా విద్య అనేది ఇప్పుడు లాభ‌సాటి వ్యాపారంగా మారిపోయింది. ఈ దుర్మార్గ‌పు మార్పుకు ప్ర‌భుత్వాలు కూడా ప‌రోక్షంగా సాయం చేయ‌డంతో కార్పోరేట్ విద్యా సంస్థ‌లు భారీ ఫీజుల‌ను వ‌సూలు చేస్తూ పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వారిని విద్య‌కు దూరం చేస్తున్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో పేద‌వారికి స‌ర్కారీ స్కూళ్లే దిక్కు. అయితే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కనీస సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పించ‌లేక ప్ర‌భుత్వం చేతులెత్తేస్తోంది. దీంతో పేద పిల్ల‌లు చిన్న‌తనంలోనే చ‌దువుకు అటు త‌ర్వాత అంద‌మైన భ‌విష్య‌త్ కు దూర‌మ‌వుతున్నారు.

చేతులు క‌డుక్కునేందుకు నీళ్లు లేవు!

 

పాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల‌కు తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించ‌డం ప్ర‌భుత్వం యొక్క క‌నీస‌మైన బాధ్య‌త‌. అయితే చాలా పాఠ‌శాల‌ల్లో తాగునీరు సంగ‌తి దేవుడెరుగు..క‌నీసం చేతులు క‌డుక్కునేందుకు కూడా నీళ్లు లేవు. దీంతో పిల్ల‌లు అప‌రిశుభ్ర‌మైన చేతుల‌తోనే మ‌ధ్య‌హ్న భోజ‌నాన్ని చేస్తూ చాలా సంద‌ర్భాల్లో తీవ్ర అస్వ‌స్థ‌కు గుర‌వుతున్నారు. పాఠ్యపుస్త‌కాల వెనుక‌వైపు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా స‌బ్బుతో క‌డుక్కోవాలి అని ఊద‌ర‌గొడుతున్న ప్ర‌భుత్వం ఆ విధంగా చేతులు క‌డుక్కునేందుకు త‌గిన స‌దుపాయాలు క‌ల్పించ‌క‌పోవ‌డం నిజంగా దుర్మార్గం. భోజ‌నం చేసే ముందుకు స‌బ్బుతో చేతులు క‌డుక్కునేందుకు అవ‌కాశం లేక గ్రామీణ ప్రాంత విద్యార్ధులు జ్వ‌రాలు, డ‌యేరియా బారిన ప‌డుతున్నారు.

బాత్ రూమ్ లు లేక బ‌డి మానేస్తున్న ఆడ‌పిల్లలు!

 

చాలా స‌ర్కారీ స్కూళ్ల‌లో పిల్లలు మ‌రుగుదొడ్ల‌కు వెళ్లేందుకు కూడా అవ‌కాశం లేదు. మ‌గ‌పిల్ల‌లు ఆరు బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తున్నారు. కానీ ఆడ‌పిల్ల‌లు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. మ‌రుగుదొడ్లు అలా అని ఆరు బ‌య‌ట‌కు వెళ్లలేక అమ్మాయిలు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. దీంతో చాలా మంది ఆడ‌పిల్ల‌లు అర్ధంత‌రంగా బ‌డి మానేస్తున్నారు. అయినా స‌రే ప్ర‌భుత్వాల‌కు చీమ కుట్టిన‌ట్టు లేదు. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 52 శాతం పాఠ‌శాల‌ల్లో పిల్లలు చేతులు కడుక్కునేందుకు, బాత్ రూమ్ కు వెళ్లేందుకు కూడా స‌దుపాయాలు లేవ‌ని తాజా స‌ర్వేలో తేలింది. బాత్ రూమ్ లు ఉన్న పాఠ‌శాల‌ల్లో కూడా ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. స్కూల్లో 500 మంది 600 మంది పిల్ల‌ల‌కు కేవ‌లం ఒక్క బాత్ రూమ్ క‌ట్టి అధికార్లు చేతులు దులుపుకున్నారు. దీంతో మూత్ర‌శాల‌కు వెళ్లేందుకు పిల్లలు ఊపిరి బిగ‌బ‌ట్టి త‌మ వంతు ఎప్పుడు వ‌స్తుందా అని లైన్ లో నిల‌బ‌డాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

హాజ‌రు శాతం పెంచాలంటే ఏం చేయాలి?

 

ఒక‌ప్పుడు త‌మ పిల్ల‌ల‌ను బ‌డికి పంపేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది త‌ల్లిదండ్రులు నిరాక‌రించేవారు.ఇప్పుడు అటువంటి ప‌రిస్థితి చాలా వ‌ర‌కు తొలిగిపోయింది. అయినా స‌రే గ్రామీణ ప్రాంతాల్లో హాజ‌రు శాతం పెర‌గ‌డం లేదు. ఎందుకు? పిల్ల‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు, వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం అనారోగ్యం బారిన ప‌డి , బ‌డి మ‌ధ్య‌లో మానేస్తున్నారు. ఇక స్కూళ్ల‌లో బాత్ రూమ్ లు లేక ఆడ‌పిల్ల‌లు స్కూళ్ల‌కు రావ‌డం మానుకుంటున్నారు. హాజ‌రు శాతం పెంచుతాం. మంచి ఫలితాలు సాధిస్తాం అని ఊద‌ర‌గొడుతున్న ప్ర‌భుత్వాలు ఈ విష‌యంపై మాత్రం దృష్టి పెట్ట‌డం లేదు. చేతులు క‌డుక్కునేందు స‌బ్బు, నీరు లేక పిల్లలు అనారోగ్యం పాల‌వుతున్నార‌ని స‌ర్వేలో తేల‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని క‌ళ్ల‌కు క‌డుతోంది. ఇంత కంటే దుర్మార్గ‌మైన విష‌యం ఏమైనా ఉంటుందా? ప‌్ర‌భుత్వాలు ఆర్భాట‌పు ప్ర‌చారాలు, ఓట్ల కార్య‌క్ర‌మాలు ప‌క్క‌న పెట్టి స్కూళ్ల‌లో క‌నీస స‌దుపాయాలు పెంచేందుకు త‌క్ష‌ణం చ‌ర్య‌లు చేపట్టాలి. పిల్ల‌ల డ్రాప‌వుట్ల‌ను త‌గ్గించి భావి భారత పౌరుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి. అది ప్ర‌భుత్వాల క‌నీస బాధ్య‌త‌..ప్ర‌జ‌ల ముఖ్య‌మైన హ‌క్కు.

ప్ర‌తీ విద్యార్ధి ఈ 4 జాగ్ర‌త్తలు త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిందే!

మార్కులు, ర్యాంకుల ప్రాతిప‌దిక‌న న‌డుస్తున్న ప్ర‌స్తుత మ‌న‌ విద్యా వ్య‌వ‌స్థ విద్యార్ధుల‌పై మాన‌సిక ఒత్తిడిని పెంచుతోంది. పాఠ‌శాల‌, కళాశాల‌ల్లో రోజంతా భ‌రిస్తున్న ఒత్తిడికి తోడు ఇంట్లో త‌ల్లిదండ్రులు కూడా నిరంతరం చ‌దువుకోస‌మే చ‌ర్చించ‌డంతో విద్యార్ధికి ఉల్లాసమే క‌ర‌వ‌వుతోంది. దీంతో మాన‌సిక‌  ఉద్వేగాల‌ను, ఆలోచ‌న‌ల‌ను ఎలా నియంత్రించుకోవాలో తెలియ‌క చాలామంది విద్యార్ధులు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా అసూయ‌, ద్వేషం, ఆత్మ‌విశ్వాస లోపించ‌డం వంటి మాన‌సిక అవ‌రోధాల‌ను విద్యార్ధులు అదుపు చేసుకోలేక‌పోతున్నారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌హ‌కారం తీసుకుని ఈ తాత్కాలిక అడ్డంకుల‌ను అధిగ‌మిస్తే విద్యార్దులు విజ‌య‌వంత‌మైన వ్యక్తులుగా ఎదుగుతారు. బాగా చ‌దివితేనే అంద‌రూ స్నేహం చేస్తారు! మార్కులు త‌క్కువ వ‌స్తే ఎవ‌రూ ప‌ట్టించుకోరు! ఇలాంటి భ‌యాలు విద్యార్ధిలో మాన‌సిక ఒత్తిడిని పెరిగేలా చేస్తాయి. అలా కాకుండా సంతోషంగా ఉండ‌టమే ముఖ్యం. నేను క‌ష్ట‌ప‌డి చ‌దివితే అన్నీ నా ద‌గ్గ‌ర‌కే వ‌స్తాయ‌న్న రీతిలో ఆలోచిస్తే ఒత్తిడిని అధిగ‌మించ‌వ‌చ్చు. మంచి ప్రేరణతో, స్ఫూర్తిదాయ‌క విద్యార్ధిగా కెరీర్ లో ఉన్న‌త స్థానానికి చేరుకోవాలంటే విద్యార్ధులు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఆత్మ‌విశ్వాసం..కొండంత బ‌లం!

 

పునాది ప‌టిష్టంగా లేకుంటే భ‌వ‌నం ఎలా కుప్ప‌కూలుతుందో ఆత్మ‌విశ్వాసం లేకుంటే మ‌నిషి కూడా అలా కుప్ప‌కూలాల్సిందే. ఆత్మ‌విశ్వాసం విద్యార్ధుల‌కు మ‌రింత ముఖ్యం. నేను అది చేయ‌గ‌ల‌ను, నాకు ఆ సామ‌ర్ధ్యం ఉంది. అని బ‌లంగా న‌మ్మితే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేరు. అదే విధంగా విద్యార్ధి ఒత్తిడికి గురి కాకుండా సంతోషం ఉండ‌టంలో కూడా ఆత్మ‌విశ్వాసానిదే కీల‌క పాత్ర‌. త‌ర‌గ‌తిలో స‌హ విద్యార్ధులతో పాటు బ‌య‌టవారిని కూడా స్నేహితులుగా మ‌లుచుకోవాలి. ఎందుకంటే సామాజిక సంబంధాలు బ‌లంగా ఉన్న‌ప్పుడు ఆనందం ఎన్న‌డూ దూరం కాదు. అయితే స్నేహాలు ఎప్పుడూ విద్యార్ధి చ‌దువుకు భంగం క‌లిగించ‌కూడ‌దు. విద్యార్ధిలో ఆత్మ‌విశ్వాసం మెండుగా ఉన్న‌ప్పుడు త‌న బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌పై అత‌నికి ఒక స్ప‌ష్టత ఉంటుంది. ఒక విష‌యంపై త‌న‌పై ఎవ‌రైనా విమ‌ర్శలు చేసినా, ప్ర‌తికూల వ్యాఖ్యానాలు చేసినా ఆత్మ‌విశ్వాసం ఉన్న విద్యార్ధి దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోడు. ఇలా ఉండ‌టం వ‌ల‌న మాన‌సిక ఒత్తిడి, నిరాశ‌ విద్యార్ధి ద‌రి చేర‌కుండా ఉంటాయి. మానసిక ఒత్తిడి లేన‌ప్పుడు విద్యార్ధి త‌ర‌గ‌తి గ‌దిలో ఉత్సాహంగా, ఆనందంగా ఉండ‌గ‌లుగుతాడు.

స‌వాళ్లకు బెద‌ర‌కండి!

 

ఈ ర్యాంకుల విధానంలో పోటీ అనేది స‌ర్వ‌సాధార‌ణం. ఈ విష‌యాన్ని విద్యార్ధులు ఎల్ల‌వేళ‌లా గుర్తుంచుకోవాలి. ఒక్క‌సారి ఏదో ర్యాంకులు, మార్కులు త‌గ్గితే ఫ‌ర్వాలేదు కానీ వ‌రుస‌గా ర్యాంకు త‌గ్గుతూ వ‌స్తే మాత్రం విద్యార్ధి వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డాలి. మిగిలిన వారితో పోటీప‌డి మంచి ర్యాంకు సాధించేందుకు ప్ర‌య‌త్నించాలి. ఆ పోటీ ఆత్మ‌విశ్వాసంతో కూడిన‌దై ఉండాలి అదే స‌మ‌యంలో ఆత్మ‌న్యూన‌తను దరికి రానీయ‌కుండా చూసుకొండి. నేను ఫ‌లానా ప్ర‌య‌త్నంలో విఫ‌లం చెందుతాను!నేను పరీక్ష‌ల్లో ఫెయిల్ అవుతాను.. అన్న భ‌యాల‌ను పార‌ద్రోలండి. భ‌యమే అన్ని అన‌ర్ధాల‌కు మూలం. క‌ష్ట‌ప‌డి మీ సామ‌ర్ధ్యం మేర‌కు ప్ర‌య‌త్నించండి అంతేకానీ ఫ‌లితం కోసం తీవ్రంగా ఆలోచించి ఆందోళ‌న చెంద‌కండి. ఎందుకంటే ఆందోళ‌న చెంద‌డం మీ సామ‌ర్ధ్యాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. విద్యార్ధులు త‌మ‌కు ఎదురైన స‌వాళ్ల‌ను స‌రికొత్త అవ‌కాశాలుగా మార్చుకునే నేర్పును విద్యార్ధులు సంపాదించుకోవాలి. అప్పుడే విఫ‌ల‌మ‌వుతామెమో అన్న ఆందోళ‌నకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మీ బ‌లాల‌ను ప్ర‌ద‌ర్శించండి!

 

 

ఎన్ని స‌బ్జెక్ట్ లు ఉన్న‌ప్ప‌టికీ మీకు ప్ర‌త్యేకించి ఒక స‌బ్జెక్ట్ పై మంచి ప‌ట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పై  శ్రద్ధ పెట్టి దాంట్లో మరింతగా రాణించేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వలన మీరు మిగతా వాళ్ల కంటే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. అన్ని సబ్జెక్ట్ ల్లోనూ మంచి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే బాగా పట్టు ఉన్న సబ్జెక్ట్ ను మెరుగు పెట్టుకోవడం వలన ఆ సబ్జెక్ట్ పై మంచి నైపుణ్యత వస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. దీంతో పాటు భవిష్యత్ లో మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకునేందుకు, ఒక వృత్తిని ఎంచుకునే క్రమంలో మీకున్న నైపుణ్యత మీకు కెరీర్ కు సహాయపడుతుంది. కాబట్టి మీ బలాన్ని ప్రదర్శించడం ఎంత ముఖ్యమో, ఆ బలాన్ని పెంచుకునేందుకు తగిన కసరత్తు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని విద్యార్ధులు బాగా గుర్తుంచుకోవాలి.

 

టీచర్ నుంచి దూరం జరగొద్దు

 

విద్యార్ధిని ఎటువంటి సంక్షోభం నుంచి అయినా బయటపడేయగలిగే శక్తి ఒక్క టీచర్ కే ఉంది. కాబట్టి విద్యార్ధులు ఎప్పుడూ టీచర్ కు దూరంగా జరగొద్దు. సబ్జెక్ట్ కు సంబంధించి టీచర్ తో ఏ విషయాన్నైనా స్వేచ్ఛగా పంచుకోగలిగే చనువు విద్యార్ధికి ఉండాలి. విద్యార్ధులు తమ బలహీనతలను గుర్తించినప్పుడు, సబ్జెక్ట్ అర్ధం కాని సందర్భం ఎదురైనప్పుడు టీచర్ తో ఆ విషయాన్ని తక్షణం చెప్పాలి. అలా చెప్పకుంటే మీకే నష్టం. సబ్జెక్ట్ మీకున్న సందేహాలను టీచర్ కు వివరిస్తేనే అతను మిమ్మల్ని ఆ స్థితి నుంచి బయట పడేయగలుగుతాడు. సందేహాలు తీర్చడమే కాకుండా మీకు మరింత స్పూర్తి నిచ్చేలా తీర్చిదిద్దడంలో టీచర్ ను మించిన ప్రత్యామ్నయం లేదు. కాబట్టి ఎప్పుడూ ఉపాధ్యాయుడికి దూరంగా జరగొద్దు. మనం చెప్పుకున్న ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు విభిన్న విషయాల నుంచి ప్రేరణ పొంది మంచి విద్యార్ధులుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

 

నిన్ను నువ్వు తెలుసుకోవ‌డ‌మే విజ‌యం!

ఎప్పుడూ నెమ్మ‌దిగా, సైలెంట్ గా ఉండే ఒక వ్య‌క్తి అక‌స్మాత్తుగా కోపంతో ఊగిపోవ‌డాన్ని మీరు చాలా సంద‌ర్భాల్లో చూసి ఉంటారు. అంత సావ‌ధానంగా మ‌సులుకునే వ్య‌క్తి ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌గానే మ‌నం సాధారణంగా ఒక మాట అంటుంటాం. ‘వీడి లోని అస‌లు మ‌నిషి నిద్ర లేచాడు. ఇప్పుడు మ‌నం చూస్తున్నది నిజంగా వీడినేనా?’  అవ‌త‌లి వాళ్ల కోపం మితిమీరిపోయిన‌ప్పుడు ఇదీ వీడి అస‌లైన స్వ‌భావం అంటూ విమ‌ర్శలు కూడా గుప్పిస్తాం. మ‌నం చూస్తున్న దృష్టి కోణం నుంచి మ‌నం ప్ర‌తీ ఒక్క‌రిపై ఒక్కో ర‌క‌మైన అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో మ‌న‌కు సంబంధించి, మ‌న ప్ర‌వ‌ర్త‌నకు సంబందించి ఒక స్వీయ గుర్తింపును కూడా ఏర్ప‌రుచుకుంటాం. మెల్ల‌గా అన్ని విష‌యాల్లో మ‌న‌మే చాలా గొప్ప‌వాళ్లం. మ‌నం చేసిన‌వ‌న్నీ ఒప్పులే. మ‌నం త‌ప్పు చేయ‌డానికి చాలా ఫ‌లానా విష‌యం కార‌ణం అంటూ మ‌న‌ల్ని మ‌నం స‌మ‌ర్ధించుకుంటూ ఉంటాం. అదే స‌మ‌యంలో ఇత‌రులు త‌ప్పుల‌ను, లోపాల‌ను ఎత్తిచూపుతూ వాళ్ల‌ను త‌క్కువ చేయ‌డానికి, నింద‌లు మోప‌డానికి అల‌వాటు ప‌డ‌తాం. ఎంత‌సేపు ఇత‌రుల‌ను నిందించ‌డంలో మునిగిపోయి మ‌న‌లోని లోపాల‌ను, పొర‌పాట్ల‌ను గుర్తించ‌డం పూర్తిగా మానుకుంటాం. స‌రిగ్గా ఇక్క‌డే వ్య‌క్తిత్వ నిర్మాణం, వికాసం దెబ్బ‌తింటాయి. మ‌నిషి సంబంధాల ప‌రంగా, విలువ‌ల ప‌రంగా ప‌త‌నం కావ‌డం మొద‌ల‌వుతుంది.

అంద‌రూ మీలా ఎందుకు ఉంటారు?

 

ఈ ప్ర‌పంచంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌క‌మైన వైఖ‌రిని, వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు.  పుట్టి పెరిగిన సామాజిక ప‌రిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, విలువ‌లు, నేప‌థ్యం ఆధారంగా ఒక మ‌నిషి వ్య‌క్తిత్వం నిర్మించ‌బ‌డుతుంది.  ఒక మనిషి ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌క్తిత్వం మ‌రో మ‌నిషిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పోలి ఉండ‌దు. ఒకే ఇంట్లో పెరిగిన‌ప్ప‌టికీ వారి వారి అనుభ‌వాలు, ఆలోచ‌న‌లు బ‌ట్టి కుటుంబ సభ్యులే విభిన్నమైన ఆలోచ‌నల‌ను, వ్యక్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఆలోచ‌న‌ల్లో సారూప్య‌తులు ఉంటాయి కానీ అచ్చుగుద్దిన‌ట్టు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న‌లు ఉండ‌టం అసాధ్యం అనే చెప్పాలి. కాబ‌ట్టి అంద‌రూ మీలా ఆలోచించాలి..మీలా ఉండాలి..అన్న ఒంటెత్తు పోక‌డ‌ల‌ను వ‌దిలేయండి. మీకు ఏ విధంగా అయితే ఒక ప్ర‌త్యేకమైన వ్య‌క్తిత్వం ఉందో అలానే మిగిలిన వారికి కూడా ఒక ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం ఉంటుంద‌ని గుర్తించండి. ఎంత‌సేపూ అవ‌త‌లి వ్య‌క్తుల‌ను మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్ర‌య‌త్నించ‌డం  అన్న‌ది మీ స‌మ‌యాన్ని వృధా చేస్తుంది త‌ప్ప మ‌రేమీ లేదు. ఒక‌రికి ఒక‌రు గౌర‌వంఇచ్చుకుని అపార్ధాలకు, అహాల‌కు తావులేకుండా స‌ర్దుకుపోవ‌డం అన్న‌ది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణం చేయ‌గ‌ల‌రు. అది స్నేహితులైనా, భార్యాభ‌ర్త‌లైనా, కుటుంబ స‌భ్యులైనా.

 

‘నేను’ అనే దాన్ని మీ మ‌న‌స్సులోంచి తీసేయండి! 

 

మీరు గొప్ప ఉపాధ్యాయుల‌ను, నాయ‌కుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే వాళ్లు ఎప్పుడు ‘నేను’ అనే మాట‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌రు. ‘నేను’ అనే మాట మీలో అహంభావాన్ని క‌లిగిస్తుంది. అహంభావం మ‌నిషిని నైతికంగా దెబ్బ‌తీసి ప‌త‌నం దిశ‌గా న‌డిపిస్తుంది. ‘నేను’ అన్న‌దాన్ని మ‌న ఆలోచ‌న‌ల్లోంచి పూర్తిగా తొలిగించ‌డం కాస్త‌ క‌ష్ట‌మైన ప‌నే. అయినా ప్ర‌య‌త్నం చేయాలి. చ‌దువుకునే చోట‌, ప‌నిచేసే చోట, ప‌నిచేయించే చోట ఎక్క‌డైనా కానీయండి ‘నేను’ అనే మాట‌ను వాడ‌టంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. నిజంగా మీరు ఒక్క‌రే బాగా క‌ష్ట‌ప‌డినప్ప‌టికీ మ‌నం క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పండి. నేను అనే మాట అపార్ధాల‌కు, అపోహ‌ల‌కు దారి తీస్తుంది. సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకోవాల‌న్నా, వ్యక్తుల‌కు గౌర‌వించాల‌న్నా ‘నేను’ అన్న ప‌దాన్ని మీ డిక్ష‌న‌రీ నుంచి పూర్తిగా తొలిగించి ఆ స్థానంలో ‘మేము’ అన్న ప‌దాన్ని చేర్చండి.

మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దుకోండి! 

 

ప్ర‌తీ మ‌నిషిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. సంపూర్ణ‌మైన మ‌నిషి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అయితే త‌న‌లోని లోపాల‌ను గుర్తించ‌డం, వాటిని స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. ‘నాకు అన్నీ తెలుసు…నేను చేసిన ప‌నికి తిరుగుండ‌దు.’ అని అనుకోవ‌డం పొర‌పాటు. ఆత్మ‌విశ్వాసానికి, అతి విశ్వాసానికి వెంట్రుక‌వాసి తేడా మాత్ర‌మే ఉంటుంది. ఆత్మ‌విశ్వాసం క‌చ్చితంగా ఉండాల్సిందే అయితే అది అతి విశ్వాసంగా మార‌కుండా చూసుకోవాలి. సంబంధాల విష‌యంలోనూ, ప్ర‌వ‌ర్త‌న విష‌యంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. నిజాయితీగా స‌మీక్ష చేసుకున్న‌ప్పుడు మ‌న‌లోని లోపాలు, చేసిన పొర‌పాట్లు క‌చ్చితంగా మీ దృష్టికి వ‌స్తాయి. త‌ప్పులు చేయ‌డం స‌హ‌జం కాబ‌ట్టి దాన్ని అక్క‌డే వ‌దిలేసి అటువంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకొండి. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ సంబంధాలు, గౌర‌వం ఇచ్చుపుచ్చుకోవ‌డంలో త‌ప్ప‌నిస‌రిగా స్వీయ స‌మీక్ష చేసుకోవాలి. మీదే త‌ప్పు ఉంద‌ని తేలితే లేదా ఎటువంటి భేజ‌షాల‌కు పోకుండా త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ప్ర‌య‌త్నం చేయండి. అవ‌స‌ర‌మైతే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు కూడా వెనుకాడ‌కండి. క్ష‌మాప‌ణ చెప్ప‌డం అంటే మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకున్న‌ట్టు కాదు మీరు సంబంధాల‌కు అధిక విలువ ఇస్తున్న‌ట్టు.

 

మీ అభిప్రాయాల‌తో ప్ర‌పంచానికి ప‌నిలేదు! 

 

మీరు కొంద‌రు వ్య‌క్తుల‌పై లేదా కొన్ని వ్య‌వస్థ‌ల‌పై ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను  క‌లిగి ఉండ‌టం మంచిదే. కానీ అది మీ ఎదుగుద‌ల‌ను దెబ్బ‌తీయ‌కుండా చూసుకోండి. ఎందుకంటే అభిప్రాయం క‌లిగి ఉండ‌టం వేరు అదే అభిప్రాయాన్ని మిగిలిన వారు కూడా క‌లిగి ఉండాల‌ని అనుకోవ‌డం వేరు. ప్ర‌తీ వ్యక్తికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటాడ‌ని గుర్తించ‌డ‌మే నిజ‌మైన విజ‌యం. అంద‌ర్నీ గౌర‌వించిన‌ప్పుడే మీకు గౌర‌వం ల‌భిస్తుంది. మీకు ఉన్న ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. మీదైన వ్య‌వ‌స్థ‌లో అది సాధ్య‌మేమో కానీ విభిన్న మ‌న‌స్త‌త్వాల మ‌నుష్య‌లు ఉన్న ప్ర‌పంచంలో అది అస్స‌లు సాధ్యం కాదు. ఎందుకంటే మీ అభిప్రాయాల‌తో ఏకీభ‌వించ‌ని వాళ్లు కూడా ఇక్క‌డ మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌రు. కాబ‌ట్టి అంద‌రి అభిప్రాయాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను గౌర‌విస్తూ ముందుకు సాగితేనే విజ‌యం మీ ద‌రికి చేరుతుంది. లేకుంటే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ త‌ప్ప ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు.