అత్యుత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించే ఐటాప్ 2018 అవార్డుల కార్యక్రమం అక్టోబర్ 2 న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. నగరంలో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ట్రైడెంట్ హోటల్ లో అంగరంగ వైభవంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించింది.
20 కి పైగా విభాగాల్లో అకడమిక్, నాన్ అకడమిక్ ఉపాధ్యాయులను ఐటాప్ 2018 అవార్డుల కార్యక్రమంలో సత్కరించారు. ఇందులో ఒకరికి మహా మహోపాధ్యాయ అవార్డు, 5 గురుకి జీవిత కాల సాఫల్య పురస్కారం, 100 మందికి ఐటాప్ అవార్డులు అందుకున్నారు. అలాగే మరో 70 మంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటాప్ 2018 అవార్డు కోసం దాదాపు 700 మంది అకడమిక్ , నాన్ అకడమిక్ ఉపాధ్యాయులు, కోచ్ లు, ప్రొఫెసర్లు, డీన్ లు, ప్రిన్సిపాల్ లు నామినేషన్లు వేసారు. అత్యంత కఠినతరమైన ఎంపిక ప్రక్రియ అనంతరం జ్యూరీ సభ్యులు అవార్డు గ్రహీతలను ప్రకటించారు. నామినేషన్ వేసిన ప్రతీ ఒక్కరూ కార్యక్రమంలో పాల్గనే వీలుండటంతో దాదాపు 1000 మంది వరకూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుని మెట్రో సిటీల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, డీన్లుగా పనిచేస్తున్న వారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ కొణిజేటి రోశయ్య గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణా శాసన మండలి ఛైర్మన్, స్వామి గౌడ్ గారు, తెలంగాణా బీసీ కమీషన్ ఛైర్మన్ శ్రీ బీ.సీ. రాములు గారు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణా వాటర్ రీసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్. శ్రీ వీరమళ్ల ప్రకాశ్ రావు గారు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ శ్రీ. ఎస్.వీ. సత్యనారాయణ గారు, పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిన్న స్థాయి , గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులను చిన్న చిన్న వేదికలపై సత్కరించడం అన్నదే మనం ఇప్పటివరకూ చూసాం. కానీ ట్యూటర్స్ ప్రైడ్ వారి సహకారంతో ఐటాప్ 2018 లో ఉపాధ్యాయులను హైదరాబాద్ లో ఖరీదైన ట్రైడెంట్ హోటల్ లో వారికి ఒక ఆనంద అనుభూతిని పంచుతూ అందించడం నిజంగా అభినందనీయం.